18, జనవరి 2015, ఆదివారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పదునారవ భాగం....!!

వారం వారం మనం చెప్పుకుంటున్న తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం తిక్కన యుగం గురించిన వివరణ చూసి తరువాత మన అందరికి ఇష్టమైన ఆటవెలది గురించి చూద్దాము... కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజి మహాభారత తెలుగు అనువాదంలో తనదైన శైలిలో తెలుగు భాషకు తరగని వన్నెలద్దినారు.

1225 - 1320 : తిక్కన యుగము  

తెలుగు సాహిత్యంలో 1225 నుండి 1320 వరకు తిక్కన యుగము అంటారు. నన్నయతో ఆరంభమైన తెలుగు సాహితీ వైభవాన్ని శివకవులు ఇనుమడింపజేశారు. తరువాత కాకతీయుల పాలనలో ఆంధ్రదేశమంతా ఒక సామ్రాజ్యంగా ఏర్పడడంతో తెలుగు సాహిత్యం సుస్థిరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగలిగింది. కవిత్రయంలో రెండవవాడైన తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధానకవిగా గుర్తింపు పొందాడు.
ఈ యుగంలో పురాణ ఖండాలు, వచన కావ్యాలు, ప్రాకృత నాటకాలు ప్రబంధీకరింపబడడం మొదలయ్యింది. శతక కవిత్వం వర్ధిల్లింది. శైవ కవిత్వంలో ఉన్న పరమతదూషణ, స్వమత మౌఢ్యత తగ్గాయి. ఎక్కుగా ప్రబొధాత్మక రచనలు వెలువడినాయి.

రాజకీయ, సామాజిక వేపధ్యం

తీరాంధ్రంలో తెలుగు సాహిత్యానికి తొలి పలుకులు పలికిన వేంగి రాజ్యం క్రీ.శ. 624లో ప్రారంభమై, 1075లో అంతరించింది. తెలంగాణ ప్రాంతం అంతవరకు బాదామి చాళుక్యులకు, రాష్ట్రకూటులకు యుద్ధభూమిగా కల్లోలితమై ఉంది. తెలంగాణంలో ఆరంభమైన కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము. కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).

అంతకుముందు తీరాంధ్ర ప్రాంతాన్ని కొణిదెన చోళులు, నెల్లూరు చోడులు పాలించారు. కడప ప్రాంతాన్ని రేవాటి చోళులు, కోనసీమను హైహయ రాజులు, నిడదవోలును వేంగి చాళుక్య చోళులు, కొల్లేరు ప్రాంతాన్ని తెలుగు నాయకులు, విజయవాడను చాగివారు, ధరణికోటను కోటవారు, కొండవీడును కమ్మ నాయకులు, పల్నాటిని హైహయ వంశపు రాజులు పాలిస్తుండేవారు. ఈ చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు వైషమ్యాలు సర్వ సాధారణం. క్రీ. శ. 1176-1182 మధ్యకాలంలో కారెంపూడి వద్ద జరిగిన పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల తీరాంధ్ర రాజ్యాలన్నీ శక్తిహీనములయ్యాయి. సమాజం కకావికలయ్యింది. బలం కలిగిన పాలకులు లేకపోతే జరిగే కష్టం ప్రజలకు అవగతమయ్యింది. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులకు రాజులందరినీ ఓడించడం అంత కష్టం కాలేదు. ఆంధ్ర దేశాన్ని తమ పాలనలో ఐక్యం చేసే అవకాశం వారికి లభించింది.

కాకతీయులు శైవమతస్థులే కాని వీరశైవాన్ని అనుసరించలేదు. అనగా కాకతీయులు వైష్ణవులను బాధించలేదు. (అయితే వారికాలంలో జైనులపై జరిగిన అత్యాచారాలను వారు నిరోధించలేకపోయారని తెలుస్తుంది). అయితే సమాజంలో శైవులకు, వైష్ణవులకు మధ్య విభేదాలు పెచ్చరిల్లి ఉన్నాయి. పలనాటి యుద్ధానికి ఇది కూడా ఒక కారణం. తిక్కనకు ముందు కాలంలో శివకవులు సృజించిన వీరశైవ సాహిత్యం సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. శైవేతరులు బహుశా ఆ సాహిత్యాన్ని ఏవగించుకొని ఉండవచ్చును కూడాను కాని అందుకు ప్రతిసాహిత్యాన్ని సృజించినట్లు లేదు. ఈ నేపధ్యంలో "భిన్న మతముల యొక్కయు, భిన్న దైవతముల యొక్కయు అవధులను దాటి తాత్వికమైన పరమార్ధమును గ్రహించి, దానిని కాలానుగుణమైన గ్రంధసృష్టి ద్వారా ప్రజలకు బోధింపగల మహాకవి ఆవిర్భావము ఆవశ్యకమైయుండును. మృ వైషమ్యములను అణచివేయు శక్తి ఒక్క అద్వైతమునకే యుండును. ఆ పరమ ధర్మమును శాస్త్రముల ద్వారా బోధిస్తే జనబాహుళ్యానికి రుచింపకపోవచ్చును. ఇలాంటి పరిస్థితిలో ధర్మాన్ని బోధింపగలిగిన మహాకవి తిక్కన ధర్మాద్వైతములను బోధించి జాతిని ఉద్ధరింపగలిగిన మహాపురుషుడయ్యాడు. తెలుగులో ఏ కవికి రాని చారిత్రిక ప్రాముఖ్యత తిక్కనకు లభించింది."

ఈ యుగంలో భాష లక్షణాలు

శివకవుల కాలంలో ద్విపద రచనకు, దేశి కవితకు ప్రాముఖ్యత పెరిగింది. మతంతో సంబంధం లేకుండా సాహిత్యాన్ని సేవింపగలిగే పరిస్థితి కొరవడినందువలన శివకవులును, భవికవులును పరస్పరము గర్హించుకొనసాగారు. సంస్కృతాభిమానులకు, దేశి కవితాభిమానులకు వైషమ్యాలు పెరిగాయి. ఇలాంటి నేపధ్యంలోనే "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదు తిక్కన సాధించగలిగాడు.

ముఖ్య కవులు, రచనలు

ఈ యుగంలో మొట్టమొదట వెలువడిన గ్రంధం గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణము. ఈ కవి పాల్కురికి సోమనాధునికి ఇంచుమించు సమకాలికుడు. రంగనాధ రామాయణం చక్కని ద్విపద కావ్యం. ఆయన రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణంగా ఖ్యాతి పొందడమే కాక పూర్వపు సంప్రదాయ పాఠ్యప్రణాళికలో కవిత్రయ భారతం, పోతన భాగవతంతో పాటుగా కలిసివుండేది. బుద్ధారెడ్డి వ్రాస్తూ యుద్ధకాండ తర్వాత ఇతిహాసాన్ని వదిలిపెట్టడంతో మిగిలిన రచనను అతని దాయాది బుద్ధారెడ్డి కుమారులు కాచనాథుడు, విఠలనాథుడు పూర్తిచేశారు. గోనబుద్ధారెడ్డి అనంతరం యగకవి తిక్కన సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి, అ తరువాత మహాభారతం 15 పర్వాలను ఆంధ్రీకరించాడు. కొట్టరువు తిక్కన కార్యదక్షుడైన మంత్రి, ఖడ్గ నిపుణుడైన శూరుడు, కావ్య నిర్మాత అయిన కవి, ధర్మోపదేష్ట అయిన ఆచార్యుడు, తత్వజ్ఞాన సంపన్నుడైన ఆధ్యాత్మిక సాధకుడు. ఈ మహానుభావుడు ఆంధ్రజాతి పుణ్యవశమున అవతరించినాడని చెప్పవచ్చును అని పింగళి లక్ష్మీకాంతం వ్రాశాడు. తిక్కన 1205-1210 మధ్యకాలములో జన్మించి ఉండవచ్చును. 1288లో మరణించాడు.
తిక్కన సమకాలికుడైన కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకే అంకితమిచ్చాడు. కేతన వ్రాసిన ఆంధ్రభాషా భూషణం తెలుగులో మొట్టమొదటి లక్షణ గ్రంధం. గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచవిభుడు, విట్ఠలుడు అనే సోదరులు తమ తండ్రి రచనయైన రంగనాధరామాయణమునకు ఉత్తరకాండమును రచించి ఆ గ్రంధాన్ని పూర్తి చేశారు. మంచన అనే కవి కేయూరబాహుచరిత్రను రచించాడు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం రచించాడు. తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణాన్ని వ్రాశాడు. బద్దెన నీతిసార ముక్తావళి వ్రాశాడు. ఈ బద్దెనయే సుమతీ శతకం కూడా వ్రాసాడని అభిప్రాయం ఉంది కాని అది నిరూపితం కాలేదు. శివదేవయ్య, అప్పన మంత్రి, అధర్వణుడు ఈ కాలపు కవులే కావచ్చును.
13వ శతాబ్దిలో జరిగిన ఆంధ్రోద్యమ నఫలమే తిక్కన గారి భారతము. ఆనాడు వారు నాటిన విత్తనమే తరువాత వృక్షమైనది.

ఈ వారం ఆటవెలది గురించిన వివరణ...
ఆటవెలది
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక ఉప జాతి పద్యరీతి.

లక్షణములు

  • సూత్రము:
ఆ. ఇనగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు ఆటవెలది.
  • ఇందు నాలుగు పాదములుంటాయి.
  • 1, 3 పాదాలు మెదట 3 సూర్య గణాలు తరువాత 2 ఇంద్ర గణాలు కలిగి ఉంటాయి.
    2,4 పాదాలు 5 సూర్య గణాలు ఉంటాయి.
  • ప్రతి పాదములొ నాల్గవ గణం మొదటి అక్షరం యతి
  • ప్రాసయతి చెల్లును
  • ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లును.

ఆటవెలది పద్య లక్షణములు

  1. ఉపజాతి రకానికి చెందినది
  2. 10 నుండి 17 అక్షరములు ఉండును.
  3. 4 పాదములు ఉండును.
  4. ప్రాస నియమం లేదు
  5. ప్రాస యతి నియమం కలదు
  6. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  7. గణ లక్షణాలు :
    1. ఒకటవ పాదమునందు మూడు సూర్య , రెండు ఇంద్ర గణములుండును.
    2. రెండవ పాదమునందు ఐదు సూర్య గణములుండును.
    3. మూడవ పాదమునందు మూడు సూర్య , రెండు ఇంద్ర గణములుండును.
    4. నాలుగవ పాదమునందు ఐదు సూర్య గణములుండును.


ఉదాహరణలు
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ఉదా:

ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు,

చూడచూడ రుచుల జాడవేరు,

పురుషులందు పుణ్యపురుషులు వేరయా

విశ్వదాభిరామ వినుర వేమ.


అనువుగానిచోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువగాదు

కొండ అద్దమందు కొంచెమై యుండదా

విశ్వదాభిరామ వినురవేమ.

రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ
యోగగమ్ము బూర్ణు నున్న తాత్ము
బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.

నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

శ్యామలీయం చెప్పారు...

>ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
పై వాక్యాన్ని క్రిందివిధంగా సరిజేయండి.
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక ఉపజాతి పద్యరీతి.

ఆ తరువాత మీరు ఉపజాతి అని స్పష్టంగా చెప్పినా రెండుచోట్ల రెండువిధాలుగా కనిపించి కొందరు గందరగోళ పడవచ్చును కాబట్టి సరిజేయటం మంచిపని.

Zilebi చెప్పారు...


వామ్మో

వీటి ల్లో కూడా జాతులు ఉపజాతులా !!

జిలేబి

చెప్పాలంటే...... చెప్పారు...

సరి చేసాను అండి ....ధన్యవాదాలు శ్యామలియం గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner