24, ఏప్రిల్ 2015, శుక్రవారం

నేనై చేరాలని....!!

ఎనలేని సంపద ఉన్నా
ఎదను తాకిన గాయాలను
మాన్పలేని జ్ఞాపకాలలో
అనుక్షణం నలుగుతున్నా...

మదిని కలచిన మౌనాలను
అదిలించిన కాలాన్ని చూస్తూ
ఎందరున్నా ఎవరూ లేని
ఏకాంతంతో స్నేహం చేస్తున్నా....

సడి లేని మనసును తట్టి లేపుతూ
ముసిరిన చీకటిలో వెదుకుతున్న
వెలుగుల కాన్వాసుపై గీసిన
సజీవ చిత్రాన్ని నేనై చేరాలని....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది తొమ్మిదవ భాగం....!!

వారం వారం మనం చెప్పుకుంటున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో ఈ వారం పద కవితా సాహిత్యంలోనూ,  రామయ్యను భక్తితో మురిపించి మెప్పించి తన పేరును రామదాసుగా మలచుకున్న భద్రాచల రామదాసైన కంచర్ల గోపన్న గురించిన వివరాలు చూద్దాం....
మేము చదువుకునే రోజుల్లో పదిలో అనుకుంటా మాకు రామదాసు గురించి ఉండేది... అప్పట్లో నాకు కథలంటే ఉన్న ఇష్టంతో మొత్తం చదివి బాగా గుర్తు ఉంచేసుకున్నా ... రామదాసు చెరసాలలో ఉన్నప్పుడు నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ .... అన్న కీర్తన, సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము, ఏ తీరుగ నను దయ జూసేదవో, పలుకే బంగారమాయెనా .... ఇలా కొన్ని అతి మధురంగా అనిపించేవి... పరీక్షలో కూడా మొత్తం అన్ని సందర్భానుసారం కీర్తనలు రాసేసి తెలుగులో మొదటి స్థానం కైవశం చేసేసుకున్నానండి.... రామదాసు గురించి రాయడం మొదలు పెట్టగానే నాకు అప్పటి మా పాఠం గుర్తుకు వచ్చింది... ఇక రామదాసు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం...


భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)

ఉద్యోగమునకై మేనమామల సహాయం

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామము ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

ఆలయ నిర్మాణం

పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి విరాళములు సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తునుండి కొంతసొమ్ము మందిరనిర్మాణ కార్యమునకు వినియోగించెను. (ఈ విషయములో అనేకమైన కథలున్నాయి.)

గోపన్నకు జైలు శిక్ష

కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి, మరలా - "ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.

రామ లక్ష్మణుల తిరిగి చెల్లింపు

అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసికొన్న నవాబుగారు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది.

వాగ్గేయకారులలో ఆధ్యుడు

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు.

భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు.

శ్లో. శ్రీ రామచంద్ర శ్రితపారిజాత
సమస్త కళ్యాణ గుణాభిరామ
సీతా ముఖాంభోరుహ చంచరీకో
నిరంతరం మంగళ మాతనోతు.

రామదాసు కీర్తనలు

వరాళి  రాగం ఆది తాళం లో రామదాసు రచించిన ఈ కీర్తన తెలియని వారు ఉండరంటే అది అతిశయోక్తి కానే కాదు ... పామరులకు పండితులకు అందరికి తెలిసిన ఈ కీర్తన మీ అందరి కోసం పద కవితా సాహిత్యానికి పట్టుగొమ్మలైన ఆణి ముత్యాల సరాల్లో ఇది ఒకటి 

ప: అంతా రామమయం బీ జగమంతా రామమయం || అంతా ||

చ1: అంతరంగమున ఆత్మారాము డ
నంత రూపమున వింతలు సలుపగ || అంతా ||

చ2: సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా ||

చ3: అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా ||

చ4: నదులు వనంబులు నానా మృగములు
విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా ||

చ5: అష్ట దిక్కులును ఆదిశేషుడును
అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా ||

చ6: ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారక నామము || అంతా ||

మనసు లభించిన కొన్ని రామదాసు కీర్తనలు .....
  1. అంతా రామమయం బీ జగమంతా రామమయం
  2. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి
  3. అడుగు దాటి కదల నియ్యను
  4. అమ్మ నను బ్రోవవే రఘురాముని
  5. అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము
  6. అయ్యయ్యో నే నేరనైతి ఆదినారాయణుని తెలియనైతి
  7. ఆదరణలేని
  8. ఆనబెట్టితినని
  9. ఆనందమానందమాయెను
  10. ఇక్ష్వాకుకులతిలక
  11. ఇతడేనా యీ
  12. ఇతరము లెరుగనయా
  13. ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా
  14. ఇన్ని కల్గి మీరూరకున్న
  15. ఉన్నాడో లేడో
  16. ఎంతపని చేసితివి
  17. ఎంతో మహానుభావుడవు
  18. ఎందుకు కృపరాదు
  19. ఎక్కడి కర్మము
  20. ఎటుబోతివో
  21. ఎన్నగాను
  22. ఎన్నెన్ని జన్మము
  23. ఎవరు దూషించిన
  24. ఏ తీరుగ నను
  25. ఏమయ్య రామ
  26. ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ
  27. ఏటికి దయరాదు
  28. ఏడనున్నాడో
  29. ఏల దయ రాదో రామయ్య
  30. ఏలాగు తాళుదునే
  31. ఓ రఘునందన
  32. ఓ రఘువీరా యని నే పిలిచిన
  33. ఓ రామ నీ నామ
  34. కట కట
  35. కమలనయన
  36. కరుణ జూడవే
  37. కరుణించు దైవ లలామ
  38. కలయె గోపాలం
  39. కలియుగ వైకుంఠము
  40. కోదండరాములు
  41. కంటి మా రాములను కనుగొంటి నేను
  42. కోదండరామ కోదండరామ
  43. గరుడగమన
  44. గోవింద సుందర మోహన దీన మందార
  45. చరణములే నమ్మితి
  46. జానకీ రమణ కళ్యాణ సజ్జన
  47. తక్కువేమి మనకు
  48. తగునయ్యా దశరధరామ
  49. తరలిపాదాము
  50. తారక మంత్రము
  51. దక్షిణాశాస్యం
  52. దరిశనమాయెను శ్రీరాములవారి
  53. దశరధరామ గోవిందా
  54. దినమే సుదినము సీతారామ స్మరణే పావనము
  55. దీనదయాళో దీనదయాళో
  56. దైవమని
  57. నందబాలం భజరే
  58. నను బ్రోవమని
  59. నమ్మినవారిని
  60. నరహరి నమ్మక
  61. నా తప్పులన్ని క్షమియించుమీ
  62. నామొరాలకింప
  63. నారాయణ నారాయణ
  64. నారాయణ యనరాదా
  65. నిను పోనిచ్చెదనా సీతారామ
  66. నిన్ను నమ్మియున్నవాడను
  67. నీసంకల్పం
  68. పలుకే బంగారమాయెనా
  69. పాలయమాం జయ రామ
  70. పాలయమాం రుక్మిణీ నాయక
  71. పావన రామ
  72. పాహిమాం శ్రీరామ
  73. పాహిరామ
  74. బిడియమేల నిక
  75. బూచివాని
  76. భజరే మానస రామం
  77. భజరే శ్రీరామం హే
  78. భళి వైరాగ్యంబెంతో
  79. భారములన్నిటికి
  80. భావయే పవమాన
  81. మరువకను నీ దివ్యనామ
  82. మానసమా నీవు మరువకుమీ పెన్ని
  83. మారుతే నమోస్తుతే
  84. రక్షించు దీనుని రామ రామ నీ
  85. రక్షించు దీనుని
  86. రక్షించే దొర నీవని
  87. రక్షింపు మిదియేమో
  88. రామ నీ దయ రాదుగా
  89. రామ రామ నీవేగతి
  90. రామ రామ భద్రాచల
  91. రామ రామ యని
  92. రామ రామ రామ
  93. రామ రామ రామ శ్రీరఘు
  94. రామ రామ శ్రీరామ రామ
  95. రామ రామ సీతా
  96. రామకృష్ణ గోవింద
  97. రామచంద్రా నన్ను
  98. రామచంద్రాయ
  99. రామచంద్రులు నాపై
  100. రామజోగి మందు
  101. రామనామము బల్కవే
  102. రామనామమే జీవనము
  103. రామపరాకు
  104. రామభద్ర రారా
  105. రామసుధాంబుధీ
  106. రామహో రఘురామహో
  107. రామహో సీతారామహో
  108. రామా నామనవిని చేకొనుమా
  109. రామా నీచేతేమిగాదుగా
  110. రామా దైవశిఖామణి
  111. రామా దయజూడవే
  112. రామా నను బ్రోవగరాదా
  113. రామా రా రా సీతారామ
  114. రాముని వారము మాకేమి విచారము
  115. రామునివారమైనాము
  116. రావయ్యా అభయము
  117. రావయ్యా భద్రాచల
  118. వందనము
  119. వందే రఘురామా శుభనామ శుభనామ
  120. శరణాగతరక్షణ
  121. శ్రీరామనామమే
  122. శ్రీరాముల దివ్యనామస్మరణ్
  123. సకలేంద్రియములారా
  124. సీతారామస్వామి
  125. హరిహరి రామ
ఇవి మనకు లభించిన కొన్ని రామదాసు కీర్తనలు
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

23, ఏప్రిల్ 2015, గురువారం

ఓ వెన్నెల్లో ఆడపిల్లే....!!

నేస్తం,
          నువ్వు నేను ఇలా బోలెడు కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటామా... మరి మన నేస్తాలు అందరు ఇలా ఉండలేరెందుకు...? అప్పటికి ఇప్పటికి స్నేహంలో తేడానా లేక మన మనసుల్లో తేడానా... మనం పలకరిస్తే ఏదో మొహమాటానికి కొందరు మాట్లాడుతుంటారు కాని మనసులో ఉందో లేదో తెలియని ఆ స్నేహం మాటల్లో కనిపించడం లేదు.. జరిగి పోయిన కాలాన్ని ఎలానూ వెనక్కి తేలేము అలానే బాల్యాన్ని కూడా... మన వెంట తెచ్చుకోగలిగేది ఒక్క జ్ఞాపకాలను మాత్రమే... చాలా మంది వాటికి కూడా దూరంగా ఉంటున్నారు ఎందుకనో... డాలర్ల మోజులో అన్ని మర్చిపోవచ్చు... కాని జీవితాన్ని, దానిలో తీయనైన జ్ఞాపకాలను మర్చిపోతే ఎలా...
          అంతుచిక్కని కొన్ని అనుభూతులకు అర్ధాలను వెదికే క్రమంలో మనల్ని మనం కోల్పోయే సన్నివేశాలు ఎదురైనప్పుడు మౌనం మాట్లాడుతుంది మనసుతో.. ఆ మది భావాలనే మన ఈ అక్షరాలు పంచుకుంటాయి కదూ... అందుకేనేమో ఈ అక్షరాలకు అంత కులుకు... అన్ని తమ సొంతమే అని ఎంత అహంకారమో.. అయినా అందంగా ఒదిగి పోతాయి భావాల వీచికల్లో... మిన్నల్లో దాగిన మనసును వెన్నెల్లో చూపిస్తాయి... వెన్నెల వర్షానికి మబ్బులను గొడుగుగా పట్టేస్తాయి... కనుల భావాలను కలల్లో ఒలికిస్తాయి... చీకటి స్వప్నాలను వేకువ పొద్దుల్లో నిజం చేయాలని తాపత్రయ పడతాయి.. అక్షరానికి అద్దిన కన్నీటిలో జీవిత వాస్తవాలను వెలికి తీస్తాయి.. అన్ని వెరసి మనవైన మనకోసం దాచుకున్న కొన్ని జ్ఞాపకాలను సుతిమెత్తగా మనకు మాత్రమే అందిస్తాయి.. ఇలా ఎన్నో స్పందనలను మనం దూరం చేసుకుంటూ యాంత్రికంగా, నిరాసక్తంగా బతికేయడం అవసరం అంటావా... మనసు గొంతు నులిమేసి దాని మాటను బయటికి రానీయకుండా చేసి సమాధి చేయడం నాకు నచ్చడం లేదు... అక్షరాల్లో భావాలు స్వేచ్ఛా విహంగాలైనప్పుడు ఆ అక్షరాల అద్దంలో కనిపించే అందమైన ప్రతిబింబమే మానసం... ఎల్లలు లేని దాని పరిధి హాయిగా విహరిస్తూ తిలక్ అమృతం కురిసిన రాత్రిలా....మనసు కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ  ఓ వెన్నెల్లో ఆడపిల్లే....!!
ఏదో చెప్పాలనుకుంటూ ఏదేదో చెప్పేసాను మరి ఉండనా నేస్తం...

నీ నెచ్చెలి .

22, ఏప్రిల్ 2015, బుధవారం

ఏక్ తారలు....!!

1. వెన్నెల వసంతంలో విరిసింది_చెలి చెక్కిలి కెంపుల మెరుపు
2. చెలి మోవిలో కెంపుల జలతారు సిగ్గులు_వెన్నెలకు వన్నెలద్దుతూ
3. వెన్నెల వన్నెలు చిన్నబోయాయి_వసంతానికి కెంపుల వర్ణమెక్కడిదా అని 

21, ఏప్రిల్ 2015, మంగళవారం

ఓ మౌనం పగిలింది.....!!


ఓ చిన్న శబ్దం
శతాబ్ధాలను మరిపించేంతగా
జన్మ జన్మల వాంఛలు పేర్చుకున్న
ఊహల సౌధాలు కళ్ళముందుగా
తారాడుతున్న స్వప్నాల నీడల్లో
మాయమౌతున్న నిజమైన అబద్దం
వినిపించిన స్వరం ఇంకా గుర్తుంది...

ఓ గుప్పెడు గుండె చప్పుడు
గుర్తు చేస్తూనే ఉంది ఆ సవ్వడిని ఇప్పటికీ
మోసపోయిన జీవితానికి సాక్ష్యంగా
అల్లుకున్న బంధం విడివడక
సాగుతున్న పయనానికి ఎటూ తేలని
గమ్యం ఎక్కడో తెలియని వెదుకులాటలో
హృదయాంతరాళాన్ని తట్టిలేపుతూ
మదిని కదిలిస్తూనే ఉండి పోయింది...

ఓ మౌనం పగిలింది
నిశబ్దాన్ని బద్దలు చేస్తూ
విగతజీవిగా మిగిలిన మనసును కదిలిస్తూ
గాయాల గేయాలను పాడుకొమ్మంటున్న
గుండె గాత్రాన్ని అరువుగా ఇమ్మంటూ
శకలాల శిధిలాలను పునాదులుగా పేర్చుతూ
శతాబ్దాల చరిత్రను తిరిగి రాస్తూ
అక్షరాలతో ఆటలాడుతూ చైతన్యానికి చేతనగా చేరి
సరి కొత్త విజయానికి చిరునామాగా నిలిచింది... !!

20, ఏప్రిల్ 2015, సోమవారం

కడవరకు ఉండిపో ఇలానే....!!

మనసుకెంత ఆరాటమో
లోలోపలి పొరల్లో వెల్లువెత్తే
మధనాన్ని ఆపాలని....

తనువు కెంత తపనో
దూరమైన బాంధవ్యాన్ని కలిపేస్తూ
తన దరిని చేరాలని...

వలపుకెంత కోరికో
వలచిన వన్నెల వెన్నెలలు
తన మోవిలో చూడాలని...

తీరానికెంత తొందరో
అలల తాకిడి తనను తాకే 
కలయికలో మమేకం కావాలని... 

వేల జన్మాల ఎదురుతెన్నుల్లో
వరమై అరుదెంచిన ప్రియ నేస్తమా
కడవరకు ఉండిపో ఇలానే....!!

19, ఏప్రిల్ 2015, ఆదివారం

మనిద్దరికే సొంతమైనదని.....!!

అటు ఇటు పరుగులెత్తుతోంది
మనసుని కుదురుగా ఉండనీయని
తొందరేదో తట్టి లేపుతూ...

పలకరించిన అక్షరాన్ని అడిగితే
పక్కున నవ్వింది నీకు తెలియదా అన్నట్టు
భావాలను పరుస్తూ...

మౌనమైన మాటని ఊసులేమని అడిగితే
మోవిపై మెరిపించింది ఓ ముసి ముసి నవ్వు
నిన్ను తలపిస్తూ....

కలలను కదిలించి అదిలించా
కలవరపాటుగా తొలిగిపోతున్నాయి
నిన్ను స్వప్నాల్లో దాచేస్తూ...

ఎదలోని సవ్వడులు ఎందుకో 
ఉలికిపాటుగా వెలుపలికి తొంగి చూస్తున్నాయి
నీ అలికిడి తెలిసిందేమో మరి...

అప్పుడనుకున్నా నా చెంత చేరింది
నీతో కలసిన మన అందమైన జ్ఞాపకమని
మనిద్దరికే సొంతమైనదని.....!!

18, ఏప్రిల్ 2015, శనివారం

కాలంతో పాటుగా....!!

అర్ధ శతాబ్దానికి హారతులిచ్చేసినా
మారని బతుకుల అయోమయంలో
కాలం చేస్తున్న గాయాల హోరులో
అమ్మాయిలో అమ్మను చూడలేని
కలియుగపు కీచకుల నిరంకుశ
వికటాట్టహాసం వినిపిస్తూనే ఉంది ఓ పక్కన
మోసపోయిన నమ్మకం అంగడి బొమ్మగా మార్చేసినా 
అందాల భామలుగా కిరీటాలు పెట్టినా
వలువలద్దిన విలువలు నట్టేట మునిగినా
అవసరాలకు మనసును చంపేస్తున్నా
చిరునవ్వు చాటుగా జలతారు పరదాల
మాటున  బడభాగ్నిని దాచేస్తున్న అతివ
ఆటబొమ్మగా అంగడి సరుకుగా మారుతూ 
అంతరిక్షాన్ని అలఓకగా చుట్టి వచ్చినా
సాటిలేని మేధకు మేటి చిరునామాగా నిలిచినా
అమ్మతనానికి కొంగ్రొత్త అర్ధం చెప్పినా
ఆగని భ్రూణ హత్యల ఉదంతాలు
లెక్కకు రాని నిర్భయలెందరో ఈనాడు
వస్తుంది మరో శతాబ్దం...
మారని జీవితాల కథలను వెంటేసుకుని
వెళుతుంది కాలంతో పాటుగా....!!

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఎనిమిదవ భాగం....!!

ఇంతకు  ముందు వారం మన సాహితీ ముచ్చట్లలో పదకవితా పితామహులు అన్నమయ్య, ప్రముఖ కర్నాటక వాగ్గేయకారులు క్షేత్రయ్యల గురించి చెప్పుకున్నాం.. ఈ వారం త్యాగరాజు గారి గురించిన వివరాలు చూద్దాం..

త్యాగరాజు (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

బాల్యం, విద్యాభ్యాసం

త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం లో కాకర్ల అను గ్రామం నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలం లో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యం లో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరిని గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.

జీవిత విశేషాలు

త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. అయ్యగారు ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యముగా జీవనం చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి.అయ్యగారు మంచి శారీరము కలిగియుండిరి. అయ్యగారు వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

సంగీత ప్రతిభ

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి,"స్వరార్నవ"మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని "స్వరరాగ సుధారసము" అను కృతిలో ఈ గ్రంథమును గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు" , "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.

త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు

  1. త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
  2. ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.
  3. త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము

త్యాగరాజ ఆరాధనోత్సవాలు

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు  (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.

సమాధి

త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిధిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.

రచనలు

రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణ వం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్ధ 'శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి.శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

కీర్తనలు

త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం','నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి.
త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్ళునపుడు, ఆయా క్షేత్రము మీదను, క్షేత్రములోని దేవుని మీదను కృతులు రచించెను. అవి యేవనిన:

కొవ్వూరు పంచరత్నములు

(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు)
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 నమ్మివచ్చిన కల్యాణి రూపకము
2 కోరిసేవింప ఖరహరప్రియ ఆదితాళము
3 శంభోమహదేవ పంతువరాళి రూపకతాళము
4 ఈ వసుధ శహాన ఆదితాళము
5 సుందరేశ్వరుని కల్యాణి ఆదితాళము

తిరువత్తియూరు పంచరత్నములు

(తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు)
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 సుందరి నన్ను బేగడ రూపకము
2 సుందరీ నీ దివ్య కళ్యాణి ఆదితాళము
3 దారిని తెలుసుకొంటి శుద్ధ సావేరి ఆది
4 సుందరి నిన్ను వర్ణింప ఆరభి చాపు
5 కన్నతల్లి నిన్ను సావేరి ఆదితాళము

పంచ రత్నములు

పంచరత్న కృతులు
  • పంచరత్నములు : త్యాగయ్య గారిచే రచింపబడిన ఘన రాగ కృతులు.
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 జగదానంద నాట ఆది
2 దుడుకుగల గౌళ ఆది
3 సాధించినే ఆరభి ఆది
4 ఎందరో శ్రీ ఆది
5 కనకనరుచిరా వరాళి ఆది

  

 పద కవితా సాహిత్యంలో ప్రసిద్ది పొందిన మన తెలుగు వాగ్గేయకారుల గురించి తెలుసుకుంటుంటే ఎంత గొప్ప భాష మన తెలుగు భాష అనిపించక మానదు.. సంగీత సాహిత్యాలలో చెప్పుకోదగ్గ ప్రతిభావంతులు మన తెలుగువారు  అవడం మనకు చాలా గర్వకారణం ... వచ్చే వారం ఆ భద్రాద్రి రాముని కోసం తన సర్వస్వాన్ని అర్పించిన రామదాసు గురించి తెలుసుకుందాం .... ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

16, ఏప్రిల్ 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. ఆలనా పాలనా చూసిన అమ్మకు_అనాధ శరణాలయాన్ని గుడిగా చేశా
2. లంచానికి లాలసత్వం ఎక్కువనుకుంటా_అందరిని ఇట్టే ఆకర్షించేస్తోంది
3. అమ్మతనం అల్లరైంది_ఆధునికత ఆటవిక కోరల్లో

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఎందరివో జీవిత చరిత్రలు...!!

నేస్తం...
            ఏమిటో కొన్ని జీవితాలు ఎప్పటికి మారవేమో... మనసు గతి ఇంతే...  మనిషి బ్రతుకింతే..  మనసున్న మనిషికీ సుఖము లేదంతే... అని సరిపెట్టేసుకుంటూ బతికేయాలేమో ఈ సమాజంలో...
ఏ రోజుకారోజు హమ్మయ్య ఇవ్వాల్టికి ఏ గొడవా లేకుండా గడిచింది అనుకుంటూ బతికేస్తున్న ఓ మధ్య తరగతి జీవితాన్ని... ఇంట్లో ఏ బాధ్యతలు పట్టించుకోని ప్రపంచానికి అతి మంచివాడైన ఇంటి యజమాని.. కష్టం వస్తే వెంటనే గొడవ పెట్టేసుకుని నేనీ బాధ్యతలు మోయలేనంటూ తప్పుకు తిరిగే అతి మంచివాడు.. అందరి అవసరాలు కనుక్కుంటూ... అయినవారిని కానివారిగా మార్చుకుంటూ... ప్రపంచంలో నీతులన్నీ "వినే వారుంటే చెప్పే వారికి లోకువన్నట్టు" వల్లే వేస్తూ తను మాత్రం వాటికి దూరంగా ఉండే పక్కా అవకాశవాది. ఏది ఎలా ఉన్నా ఇంటి అవసరాలు, బాధ్యతలు, బంధాలు కష్టమైనా ఇష్టంగా భరించేది ఇల్లాలే మరి ఈ సగటు జీవితాల్లో...
మగాడు / మొగుడు వాడి ఇష్టానికి వాడు ఎక్కడికి తిరిగినా, సంసారాన్ని పట్టించుకొనక పోయినా వాడిలా పిల్లలని వదిలేయలేనిది తల్లి ఒక్కటే... శరీరం సహకరించక పోయినా, మనసు చస్తూ బతుకుతున్నా బతుకు పోరాటాన్ని సాగిస్తున్న ఎన్నో మధ్య తరగతి జీవితాలు మన కళ్ళముందే కనిపిస్తున్నా కనీసం మాట సాయం కూడా చేయలేని వాస్తవ జీవితాలు మనవి..
అందలాలు ఎక్కాలనుకోలేదు.... అసాధారణంగా జీవించాలని ఆశ పడనూ లేదు... అతి సామాన్యంగా బతకాలన్న చిన్న కోరిక... కాని అదే ఈనాడు అందని ఆకాశమైంది...ఓ జీవితానికి...అణిగి మణిగి బతుకునీడుస్తున్న ఆడదానికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎప్పటి నుంచో కోరిక.... మొన్న ఒకరోజు హైదరాబాద్ నుంచి బస్ లో వస్తుంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది... ఏంటో కాస్త దిగులుగా అనిపించింది ఆ అమ్మాయి.. వాళ్ళ అన్నయ్య అనుకుంటా బస్ ఎక్కించడానికి వచ్చాడు.. నా సీటులో కూర్చుంటే అది నాది పక్కన కూర్చో అని చెప్పాను... చదువుకోలేదు అనుకుంటా ఇక్కడే కూర్చోమన్నాడు అంటే ... చెప్పాను అది నాది...  పక్కన కూర్చో అని.. నా పక్కనే కూర్చుంది... ఎందుకో కిందికి వెళ్లి మళ్లి  వచ్చింది.. ఆలోపల తన డబ్బులు 50 రూపాయలు నా పక్కనే పడ్డాయి నేను కూడా చూడలేదు ఎవరో నాకు చెప్తే చూసి తీసాను.. తను రాగానే నీవేనా అని ఇచ్చేశాను... తరువాత నాకే ఎందుకో పలకరించాలనిపించి మాట కలిపాను... అలా డబ్బులు పారేసుకుంటే ఎలా అని... వాళ్ళ ఆయన చెప్పా పెట్టకుండా వెళిపోయాడంట... అప్పటికి చాలా సార్లు అలా చేసాడంట.. కొన్ని రోజులు పోయాక ఈమె వెళ్ళి తీసుకువస్తే వస్తాడంట... మళ్ళి నాలుగు రోజులు పోయాక మామూలేనంట... నాలుగు ఇళ్ళలో పని చేసుకు బతికే జీవితం ఆమెది.. అయిన వాళ్ళు ఉన్నా మొగుడు ఇలా చేసినప్పుడు కూడా ధైర్యంగా ఉంటుంది... ఇలాంటి వాడు ఎందుకు వదిలేయరాదా అన్నా... ఇదే ఆఖరుసారి ఇక పొతే తీసుకురాను అంది... మరి ఎక్కడ ఉంటాడో తెలుసా అంటే తెలియదంది.. ఎలా అంటే ఫోను నెంబరు ఇచ్చాడు, బస్ స్టాండ్ కి వస్తాను అన్నాడు అంది... మరి ఎక్కడ ఉంటారు అంటే తెలియదంది... వాళ్ళ వాళ్ళు వద్దని చెప్పినా వీడి కోసం ఆమె రావడం వెనుక ఉన్న బంధానికి విలువ ఆ మొగుడు అన్న వాడికి కూడా అర్ధం అయితే ఎంత బావుండు అనిపించింది... అలా ఏదో తన గోడు చాలా సేపు చెప్తూనే ఉంది... ఈ లోపల బస్ కండక్టర్ తనకి టికెట్ ఇచ్చాడు నాలుగు వందలు తీసుకున్నాడు అంది.. తీరా టికెట్ చూస్తే 308 రూపాయలు ఉంది.. వెనుక రాశారు 90 అని. అడుగు అంటే తరువాత ఇస్తాను అన్నాడు అంది.. అందరికి చిల్లర ఇచ్చేసాడు కాని ఈ అమ్మాయికి ఇవ్వలేదు... మాట్లాడుతూనే నిద్ర పోయింది.. 3 గంటలకి విజయవాడ వచ్చాక నేనే నిద్ర లేపి డబ్బులు అడుగు అని చెప్పా.. మరి అడిగిందో ఆ నిద్ర మత్తులో అలానే వెళ్లిందో తెలియదు...
ఈ జీవిత వాస్తవాలు ఒక్క ఆమెవే కాదు రోజు  చస్తూ బతుకుతున్న ఎందరివో జీవిత చరిత్రలు...!!
కొన్ని వాస్తవాలు వినడానికి చేదుగా అనిపించినా వినకా తప్పడం లేదు...  చూడక తప్పడం లేదు ... భరించడం కూడా తప్పడం లేదు మరి.... సమాజం మారాలో.. సమాజంలో మనం మారాలో తెలియని అయోమయం నేస్తం...!!
నాకనిపించిన సమస్యతో నిన్ను అయోమయంలో పడవేసి ఇప్పటికి ఉంటాను మరి....
నీ నెచ్చెలి.

14, ఏప్రిల్ 2015, మంగళవారం

జ్ఞాపకాల జ్ఞాపికలు.....!!!

ఏప్రియల్ 12న హైదరాబాద్ లో సాహితీ సేవ నిర్వహించిన కవితావసంతంలో అందుకున్న తీయని జ్ఞాపకాల అనుభూతుల్లో కొన్ని .... మనఃపూర్వక ధన్యవాదాలు సాహితీ సేవకు, ఆత్మీయ మిత్రులకు...

అపుడప్పుడు...!!

ఎటెల్లి పోనాదో
యాడ తానున్నాదో
మదినే మాయ సేసింది
కదిలే కాలంలో దాగింది
వదలలేని వాస్తవం తానైయ్యింది
సడలని చిత్తమే తనదయ్యింది
పొద్దంతా పోరాడింది రాతిరితో
చుట్టమై సూడ తానొస్తాదని
సూపుల్తొ సుట్టేసి పోతాదని
మరుపన్నది మరిపించి
మనసునే దోచేసి మాటనే దాటేసి
మత్తులో ముంచేసి పరదాలు కప్పేసి
ఎన్నెలని పంపేసి సీకటికి పక్కేసి
దిగులు చుట్టాన్ని తోడిచ్చి
సుక్కలాంటి జ్ఞాపకంగా
గతపు మబ్బుల్లో మిగిలిపోయి
మిల మిలా మిణుక్కుమంటోంది
అపుడప్పుడు...!!

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఏడవ భాగం....!!

వారం వారం మనం చెప్పుకుంటున్న తెలుగు సాహితీ ముచ్చట్లలో పద కవితా సాహిత్యంలో ప్రముఖులైన
అన్నమయ్య గురించి క్రిందటి వారం తెలుసుకున్నాము... అదే కోవలోనున్న క్షేత్రయ్య, త్యాగరాజు, రామదాసుల గురించిన వివరణలు ఈ వారం చూద్దాం.. పద కవితా పితామహుడు అన్నమయ్య తరువాత చెప్పుకోదగిన పద కవులలో క్షేత్రయ్యది ప్రముఖ స్థానం... క్షేత్రయ్య గురించి చెప్పాలంటే ముందుగా కర్నాటక సంగీతాన్ని చెప్పాలి....

కర్ణాటక సంగీతము (ఆంగ్లం : Carnatic music (సంస్కృతం: Karnāṭaka saṃgītaṃ) భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శైలి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశం లో కానవస్తే ఈ సంగీతం భారత ఉపఖండంలో ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో కానవస్తుంది. హిందుస్థానీ సంగీతం పర్షియన్ మరియు ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
భారతీయ సంప్రదాయంలోని అన్ని కళలలాగే కర్నాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల మరియు పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, యజుర్వేదంలో చెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. యాజ్ఞవల్క్య స్మృతి లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
(వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ2ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి).
నేటి కర్ణాటక సంగీతానికి స్వరరాగతాళములే ఆధారములని ,ప్రాచీన గ్రంథాలైన శిలప్పాధికారం మరియు భరతుని నాట్యశాస్త్రంలో వివరించబడింది. 

కర్ణాటక సంగీతంలో అనేకమంది పేరెన్నిక గన్న విద్వాంసులున్నారు. పురందర దాసు (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు. సమకాలికుల్లో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. వీరి కంటే ముందు అరుణాచల కవి, అన్నమాచార్య, నారాయణ తీర్థులు, విజయదాసు, రామదాసు, సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి, మొదలైన వారు ఇందులో ప్రముఖులు. ఇంకా స్వాతి తిరునాళ్, గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, పట్నం సుబ్రమణి అయ్యర్, మైసూరు వాసుదేవాచారి, ముత్తయ్య భాగవతార్, కోటీశ్వర అయ్యర్, సుబ్రహ్మణ్య భారతీయార్, పాపనాశం శివన్ మొదలైన వారు కూడా ప్రసిద్ధిగాంచారు. వీరి కీర్తనలు ప్రస్తుతం అనేకమంది కళాకారులు వేదికలపై గానం చేస్తుంటారు. ఇది క్లుప్తంగా వివరణ కర్నాటక సంగీతం గురించి....
కర్నాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది.

జీవిత విశేషాలు

క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.

మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.

మరొక కథ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.

దేశాటనం, సన్మానాలు, గుర్తింపు


క్షేత్రయ్య చిత్రపటం
ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది.
ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?). అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.
పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించాడు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నాడు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నాడు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.
చిదంబంరం గోవిందస్వామిని "తిల్ల గోవిందస్వామి" అని క్షేత్రయ్య ప్రస్తుతించాడు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి.

1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్తానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశాడు.

తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చాడు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించ ఈ క్షేత్రయ్య పదం ద్వారా మనకు తెలుస్తుంది.

దేవగాంధారి రాగం - ఆది తాళం
పల్లవి:
వేడుకతో నడచుకొన్న - విటరాయడే
అనుపల్లవి:
ఏడుమూడు తరములుగా - ఇందు నెలకొన్న కాణాచట!
కూడుకొని మువ్వ గోపాలుడే నా విభుడు ||వేడుక||
చరణాలు:
మధుర తిరుమలేంద్రుడు - మంచి బహుమానమొసగి
యెదుట కూర్చుండమని - ఎన్నికలిమ్మనెనే
యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?
చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె? ||వేడుక||

అలుకమీరి తంజావూరి అచ్యుత విజయరాఘవుడు
వెలయ మనుజుల వెంబడి - వేగమె పొడగాంచి
చలువ చప్పరమున నుండగ - చక్కగ వేయి పదముల
పలుకరించుకోగానే బహుమానమిచ్చేనావేళ ||వేడుక||

బలవంతుడయిన గోలకొండ - పాదుషా బహుమానమిచ్చి
తులసిమూర్తితో వాదు తలచే నావేళ
వెలయు మువ్వ గోపాలుడు - వెయ్యిన్నూరు పదములు
నలువది దినములలో - నన్ను గలసి వినిపించెనే ||వేడుక||

క్షేత్రయ్య పద విశిష్టత

మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు.
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దం లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా కు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.

క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది.
  • భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం.
  • క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది.
  • ఈతని పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో షుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడాడు.
  • క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ.దృశ్య యోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడాడు.మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశాడు.
  • ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంధి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనాడు.

క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశాడు
  • తెలుగులో గేయములను ఆరు విధాలుగా విభజింపవచ్చును - కృతులు, కీర్తనలు, తత్వములు, పదములు, జావళీలు, పాటలు. వీటిలో పదములు, జావళీలు అభినయానుకూలములు. అందునా పదములు రాగతాళవిలంబముతో కూడియుండును.
  • క్షేత్రయ్య వట్టి పదకర్తయే కాదు. అలంకారశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించి క్రొత్త పుంతలు త్రొక్కినాడు.
  • పదములలో గొప్ప సంగీత కళాపాటవమును ప్రవేశపెట్టినవారిలో అగ్రగణ్యుడు క్షేత్రయ్య... అదివరకెవ్వరు రాగమునకిట్టి అందచందములు కూర్చలేదు. తరువాతి వాగ్గేయకారులకును, సంగీతకారులకును క్షేత్రయ్య మార్గదర్శియైనాడు.
  • కాలప్రభావముననుసరించి అతడు తన పదములలో శృంగారమునకే అధిక ప్రాధాన్యతనిచ్చినాడు.
  • మనమెట్టి నాయికానాయకుల గురించి తెలుసుకోవాలన్నా గాని క్షేత్రయ్య పదాలలో చక్కని ఉదాహరణం లభిస్తుంది.
  • భావ ప్రకటనమున క్షేత్రయ్య మిక్కిలి ప్రౌఢుడు. అతని పదములన్నియును వినివారి హృదయములకత్తుకొనే భావములకు ఉనికిపట్టు.
  • ఆనాటి పలుకుబడులెన్నో అతని పదాలలో గోచరిస్తాయి. అతడు మారు మూల పదములు, జాతీయములు ఎక్కువగా వాడాడు. శబ్దరత్నాకరంలో అతని పదాలను విరివిగా ఉదాహరించారు.
  • క్షేత్రయ్య పదములు అభినయానుకూల్యమైనవి.
ఉదాహరణలు ఆనంద భైరవి రాగం - ఆదితాళం
పల్లవి:
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?



ఇంతసేపు మోహమేమిరా ? ఇందరికంటే - నింతి చక్కనిదేమిరా ?
సుంతసేపు దాని - జూడకుండలేవు
అంతరంగము దెలుప - వదియేల మువ్వగోపాలా ! ||ఇంత||

నీకెదురుగ వచ్చునా ? నెనరూరగా - నిండు కౌగిట జేర్చునా ?
ఆకుమడుపు లిచ్చునా ? తన చెలిమి
కైన వాడని మెచ్చునా ? తమి హెచ్చునా ?

ఏకచిత్తమున మీరిద్దరు - నింపు సొంపుగ నున్న ముచ్చట
నాకు వినవిన వేడుకయ్యిరా ! యిపుడానతీరా ! ||ఇంత||

మోవి పానకమిచ్చునా ? కొసరి కొసరి - ముద్దులాడనిచ్చునా ?
తావి పువ్వుల దెచ్చునా ? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా ? మనసిచ్చునా ?
దేవరే మొగడు గావలెనని - భావజుని పూజ లొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా ? సిగ్గేలరా ? ||ఇంత||

సంతోషముగ నాడునా ? తంబుర మీట - సంచు పాట పాడునా ?
వింత రతుల గూడునా ? ఆ సమయమున
విడవకుమని వేడునా ? కొనియాడునా ?
సంతతము న న్నేలుకొని యా - కాంతపై వలచినపుడె యిక
కొంత యున్నదో మువ్వగోపాల ? గోరడ మేలా ? ||ఇంత||
అందమైన పదాల కూర్పులో నిష్ణాతులైన క్షేత్రయ్య పద కీర్తనలు కొన్ని పైన ఉదాహరణలలో చూసాము.... ఈనాటికి ప్రజలకు చిరపరిచితంగా సంగీత సాహిత్యాలకు ఓ చిరునామాగా మిగిలిపోయిన ఈ వాగ్గేయకారుడు మన తెలుగువాడని చెప్పుకోవడం మనకు ఎంతో ఆనందకరమైన విషయం... ఇప్పటికే వ్యాసం చాలా పెద్దది అవడం వలన మిగిలిన వాగ్గేయకారుల గురించి వచ్చే వారం తెలుసుకుందాం...

ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

9, ఏప్రిల్ 2015, గురువారం

మిణుగురులు...!!

మెదిలే చైతన్యం మదిలో
కదిలే కాలం చేతిలో వాస్తవం
నిండిన మానవత్వం సమతకు తోడుగా
అడ్డు రాని అంగ వైకల్యాలు
చేతన చేతిలో ఆచేతనానికి స్వస్తి పలుకుతూ
వెలుగుల భవితకు సాగుతూ
విధాత చేసిన గాయానికి
విధి వంచితులు కాకుండా
మమతానురాగాలకు మైలు రాళ్ళుగా
మిణుకుమనే కలలకు మరో రూపంగా
నవ శకానికి నాంది గీతాలు పలికే
స్పూర్తి ప్రధాతలు మీరే మీరే...!!

8, ఏప్రిల్ 2015, బుధవారం

ఏక్ తారలు....!!

1.ఉలికిపాటే ఊహల్లోనూ_నీ సాన్నిహిత్యం దూరమౌతుంటే
2.అలసిన మనసే_జతగా నీ చెలిమి కోసం
3.గ్రహణం వీడిందిగా_పూర్ణోదయాన్ని స్వాగతించు మరి 

6, ఏప్రిల్ 2015, సోమవారం

నేనింతే...!!

ఏవిటోనండి ఈ మధ్య కబుర్లు కాకరకాయలు అన్ని నా నేస్తానికే చెప్పేస్తున్నా అని చాలామంది కంప్లయింట్లు... సరే ఓ పాలి మీ అందరికి కూడా కాకరకాయలు వదిలేసి కబుర్లు చెప్పేద్దామని ఇలా వచ్చేసానన్నమాట... కాని చేదు లేకుండా ఏం బావుంటాయి కబుర్లు అని మళ్ళి మొదటికే వస్తున్నా... మొన్న బాంక్ కి వెళ్ళానా అక్కడో పెద్ద క్యూ ఉంది .. ఏం చేస్తాం అక్కడ కూడా 30% రిజర్వేషన్ అంటే కొట్టేస్తారేమో అని నేను లైన్ లో నిలుచున్నా... నా తరువాత ఇద్దరు కాలేజ్ పిల్లలు అనుకుంటా వచ్చారు.. ముందు బానే లైన్లో నిలుచున్నారు.. అంతలోనే ఏం గుర్తు వచ్చిందో  ఏమో లైన్ నుంచి తప్పుకుని ముందుకి వెళ్ళి నిలుచున్నారు... ఓ ఇద్దరు అయ్యాక వీళ్ళు అటు నుంచి తమ పని చేసుకోబోతుంటే నేను ఊరుకోలేక నవ్వుతూనే ఏమ్మా మీరు చదువుకోలేదా అన్నా.... ఓ క్షణం వాళ్ళకి ఏం ఆర్షం కాలేదు .. తల ఊపి వెనక్కి వచ్చి లైన్ లో నిలుచున్నారు... అక్కడ ఉన్న మిగతావాళ్ళు ముసి ముసిగా నవ్వుకున్నారు... ఆ పిల్లలని చిన్నతనం చేయాలని నేను అనలేదు... కనీసం అక్కడ లైన్లో అందరు ఎందుకు ఉన్నారో అర్ధం చేసుకుంటారని చెప్పాను... పిల్లలు పెద్దలు అని లేదు ఎవరైనా ఒక పద్దతి ఉన్నప్పుడు దాన్ని అందరు పాటిస్తే అంతా సవ్యంగా జరిగి పోతుంది... ఏం చేద్దాం చూస్తూ ఊరుకోలేని మనస్తత్వం నాది... అందుకే అంటారు చాలా మంది నీకెందుకు నీ పని నువ్వు చూసుకుని పోరాదు అని... కాని అలా చూస్తూ ఊరుకోలేకే కదా ఇలా అందరితో తిట్లు తింటూ ఉంటాను... మరి ఇలా ఉండటం తప్పో ఒప్పో నాకు తెలియదండి... నేనింతే...!!

5, ఏప్రిల్ 2015, ఆదివారం

తెర తీయగరాదా...!!

తెలి మంచు తెరల
తలుపులు తీయని
మనసు సంద్రాన్ని
తాకిన అలజడిలో
జ్ఞాపకాల వింజామరలు
విసిరిన గురుతుల
గతపు సౌరభాలు
విరిసిన మౌన ఉషస్సులై 
ఎదను కదిలించిన
పద లాస్యాలు పలికే
భావనల వెల్లువగా మారి
కులుకులొలికే కలానికి
కుందనపు బొమ్మలైన
అక్షర కన్నియ అందాలు
అరవిరిసిన ఆశు కవనాల
మేలిముసుగు మెరుగుల
తరగల తెర తీయగరాదా   
చూడ వచ్చిన చూపరులకు......!!

స్నేహం...!!


నేస్తం...
             నువ్వు పరిచయం కానప్పుడు నిజమైన స్నేహం అంటే తెలియదు... రాను రాను నీతో అనుబంధంతో స్నేహానికి చిరునామా తెలిసింది.. ఎన్నో ఏళ్లుగా పంచుకుంటున్న అనుభూతుల అనుభవాలు, జ్ఞాపకాల పారిజాతాల పరిమళాలు ఎప్పటికి మనసును వీ(వా)డి పోనీయని మధుర బాంధవ్యాలే... మన మధ్యన జరుగుతున్న అక్షరాల పంపకంలో అందకుండా అటూ ఇటూ పారిపోయే పదాలు కూడా నీ చెలిమికి దాసోహమంటూ పాదాక్రాంతమౌతున్నాయి... మన స్నేహానికి తారతమ్యాలు తెలియలేదు... భావాలు పంచుకోవడానికి వారధిగా చేసుకున్న చెలిమికి జాతి రీతులు అసలే లేవు.. అందుకేనేమో ఇన్నాళ్ళు గడిచినా ఇంకా సరి కొత్తగానే ఉంది మన మధ్యన... నేనుండి నువ్వు లేక పోయినా....
             ఎవరో ఆడిగారు మీ స్నేహం ఎప్పటిదని.. ఏం చెప్పను..? గత జన్మ బంధమని చెప్పాలనుకున్నా అలా చెప్తే ఒక్క జన్మకే పరిమితమై పోతుందని ... ఎన్ని జన్మలదో నాకు తెలియనిదీ బాంధవ్యమని చెప్పాను.. సరిగానే చెప్పాను కదూ... ఆటల నేస్తానివి, కథల సాహచర్యానివి,  నా కోపాన్ని భరించిన నా ఆత్మీయ నేస్తానివి, చదువులో పోటీగా ఉండే నేస్తమై, నా భావనలను వాటితో పాటుగా...  నన్ను నన్నుగా అభిమానించిన నా ప్రాణ స్నేహానివి నువ్వు... నీ తప్పొప్పులను నాతో పంచుకుని స్నేహానికి ఎన్నటికి చెరగని భాష్యాన్ని చెప్పి అన్నింట్లో నాకన్నా నువ్వే ముందు అని నిరూపిస్తూ ఆఖరికి మరణంలో సైతం నువ్వే ముందని నిరూపించిన ప్రియ నేస్తం...
స్నేహమంటే ఏం చెప్పను... మన బంధమని చెప్పడం తప్ప...
 నీ నెచ్చెలి

4, ఏప్రిల్ 2015, శనివారం

ఇలా ఉండి పోయా.....!!

కాలం చేసిన గాయం
కలం సిరాలో ఒలుకుతోంది
మనసును తొలిచే మధనానికి
సాక్ష్యంగా అక్షరాల ఆవిష్కరణలో
భావాల పద విన్యాసం బహు ముచ్చటగా
ఒదిగి ఉన్నా...
బడలిక తీరని బంధం వ్యధగా మిగిలిపోతూ
శిలగా మారిన చేతనావస్థకు పరాకాష్ట
అస్పష్ట రూపాల్లో అటు ఇటు చుట్టేస్తూ
సంచలనం సృష్టిస్తుంటే...
తట్టుకోలేక తారాడుతూ పరుగులెత్తే
మౌనాల మాటల తాకిడి వెల్లువలా తాకి
ఉప్పొంగుతుంటే...
ఏమి తెలియని అమాయకత్వం
అద్దిన సుకుమారాన్ని తుంచేసి
ఏకాంతానికి ఏకాకిగా మిగిల్చి
నిరాశల ఆశలకు ఊపిరి పోస్తూ
ఎండమావుల స్నేహంలో
ఎడబాటైన బాంధవ్యాన్ని
ఎడద మాటునే దాచేసి
ఎగసిపడే కన్నీటికి అర్ధాలు వెదుకుతూ
ఇలా ఉండి పోయా ఎటూ పోలేక....!!

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏక్ తారలు.....!!

31/3/15

1.  జీవిత సంద్రంలో మునిగిపోతూ_ఆశ చావని జీవితం ఇదేనేమో
2. అవకాశాన్ని చివరి క్షణం వరకు అందుకోవాలని_ఆరాటంగా ఎదురుచూస్తూ
3.  చివరి క్షణాలను లెక్కిస్తూ_మరో జన్మకు పయనాన్ని ఖరారు చేస్తూ
4. ప్రాణం మీద తీపి కాబోలు_ఎన్ని జన్మలైనా విసుగు లేకుండా
5. మేధావైనా_దైవం ముందు దిగదుడుపే
6. శూన్యాన్ని దాచేసినా_లెక్కల్లో పక్కన చేరితే విలువ బోలెడు

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఆరవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో ఈ వారం పద కవితా సాహిత్యంలో అగ్రగణ్యులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల గురించి కొన్ని వివరణలు చూద్దాం

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.

అన్నమయ్య పూర్వీకుల చరిత్ర

"అన్నమాచార్య చరితము" ఆధారంగా

అన్నమయ్య
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో అన్నమయ్య విగ్రహం
అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.

నందవరీకుల గాధ

నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్ధంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్దవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత. క్రీ.శ. 10వ శతాబ్ధంలో నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం. తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచినది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.

అన్నమయ్య వంశీకులు

భారద్వజ గోత్రులైన అన్నమయ్య పూర్వుల ప్రస్తావన నాలుగు తరాలకు సంబంధించిన వివరాలను చిన్నన్న అన్నమాచార్య ద్విపద వల్లను, అష్టమహిషి కల్యాణం వల్లను గ్రహించవచ్హును.
భరద్వాజ ఋషి -> నారాయణయ్య -> విఠలయ్య -> నారాయణయ్య -> విఠలుడు -> నారాయణుడు -> నారాయణసూరి -> అన్నమాచార్య

అన్నమయ్య తాతయ్య - నారాయణయ్య

కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చెసాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లొ నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు. ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది.
నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉన్నది. అన్నమయ్య మనవడు చినతిరుమలయ్య ఊటుకూరి చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడ రచించాడు. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచెశరు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. కోలగగ్గెర అంటే కాళ్ళుచేర్చికట్టి కూలద్రోయడం.
నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రిమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.

అన్నమయ్య తండ్రి - నారాయణసూరి

అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్దికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’ గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట.

అన్నమయ్య తండ్రి - తిరుమల పయనం

భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.

అన్నమయ్య జననం

ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య.
లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు.
"అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి.
శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్గ్యుల విశ్వాసం.

అన్నమయ్య బాల్యం

"హరి నందకాంశజుం డగుట డెందమున
పరమ సుగ్యాన సంపద పొదలంగ........."
అన్నమయ్య బొసి నవ్వులు వొలకబోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతికి మొక్కుమని చెబితేనే మొక్కేవాడు. వేంకటపతిమీద జోలపాడనిదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించి పోయేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్ధాలు వివరిస్తూవుంటే తానూ ఊ కొట్టేవాడు.ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వేంకటపతి మీది ధ్యానంతో ప్రొద్దులు గడిపేవాడు.
అన్నమయ్యకు అయిదు సంవత్సరాలు నిండాయి. నారాయణసూరి ఆర్యుల సమ్మతి ప్రకారం ఉపనయనం చెయించాడు. అన్నమయ్యకు -
అహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్య లన్నియును
నమితంబు లగుచు జిహ్వరంగసీమ
తము దామె సొచ్చి నర్తనమాడ దొడగె
అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే ! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పస్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంతాగ్రహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడెవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పిన్చవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా" అని పిలిచేవాడు.
బుజ్జిబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు సిరినవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెఋవు కట్టలమీద చేరి చెట్టుమీద పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర ఫడుతూంటే అక్కడ చేరుకొని వాళ్లను అల్లరి పెట్టేవాడు. రాగం పాడీ, తాళం వేసీ చూపేవాడు. "మీకెం తెలీదు పోమ్మ"ని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో బాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో సంబరిపడిపోయే వాళ్లు.
నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్ధం లేనివి కావు ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనె ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగ అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "అప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకొవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు? "అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్." ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగ చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.
అన్నమయ్యకు అడవికి వెళ్ళదం అలవాటు లేదు. ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే వుంది. తీగలు సవరించి పాడబోయాడు. పక్కనే కొడవలి వుంది. దాన్ని చూస్తూనే వచ్చిన పని గుర్తుకు వచ్చింది. లెచి చుట్టూ పరికించాడు. ఒక చోట పచ్చిక బాగా బలిసి వుంది.
’పాపవల్లరుల శ్రీపతినామహేతి
నే పార దఋగు యోగీంద్రు చందమున ’
అంటూ కొడవలితో పచ్చికను కోస్తున్నాడు. పచ్చిక కోస్తున్నా మనసంతా శ్రీ హరి మీదనే వున్నది. అందుకే మరికొంత పచ్చికను కొయబోతున్న అన్నమయ్య ఒక్కసారి "అమ్మా !!" అని కేక పెట్టాడు, చిటికిన వేలు తెగి రక్తం బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి. బాధతో మూలిగాడు.ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కమారు తనబంధువుల్ని తల్లిదండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. వేదనలో విరక్తి,భక్తి జన్మించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లు ఈ సంఘ్హటన అన్నమయ్య జీవితంలో భక్తిరసావేశానికి నాంది పలికింది. "అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు పనిలేదనుకున్నాడు.
"అయ్యోపోయ బ్రాయముగాలము
మయ్యంచు మనసున నే మొహమతినెత్తి||

తగు బంధూలా తనకు దల్లులును దండ్రులును
వగలబెట్టుచు దిరుగువారేకాక
మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ
దగిలించలేక చింతాపరుడనైతి ||
అని చింతించి......
"తల్లియుదండ్రియు దైవంబు గురువు
నెల్ల సంపదలునై యెల్ల చందముల
ననుబ్రోచు శెశాద్రినాధుని,గొలిచి
మనియెద........."
అని నిర్ణయించుకొంటాడు.

తిరుమల పయనం

అదే సమయాన తిరుమల వెళ్ళే యాత్రికుల గుంపును చూశాడు. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలొ వున్న కొడవలిని విసిరేసాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు. ఆ యాత్రికులు ఎవరోకారు, సనకాదులనే భక్తబ్రుందం. వాళ్ల వేశం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు. అబ్రకము, ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు. నొసట పట్టెనామాలు, శంఖ చక్రాల ముద్రికలు, కాళ్లకు కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెల మ్రోగిస్తూ భక్తి పారవశ్యంతో పాడుతూ చిందులేస్తూ మధ్యలో "గోవిందా! గోవింద!"........
"వేడ్కుందామా వేంకటగిరి వేంకటేశ్వరుని||
ఆమటి మ్రొక్కులవాడే ఆదిదేవుడే వాడు
తోమని పళ్యలవాడే దురితదూరుడే ||
......."
అంటూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పయనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య.
తిరుపతి పొలిమేరలోకల గ్రామసక్తి తాళ్ళపాక గంగమ్మను సేవించాడు. తిరుపతి లో ఇంకా తాతాయగుంట గంగమ్మ, అంకాళమ్మ, వేశాలమ్మ, కాళెమ్మ, నేరెళ్ళమ్మ, కావమ్మ, మారలయ్య అనే గ్రామశక్తులు కొలువై వున్నారు. పూర్వం తిరుపతికి వచ్చే భక్తబ్రుందం మొదట తాళ్ళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్సించే ఆచారం వుండేది. నేటికి తిరుపతిలో మేనెలలో గ్రామసఖ్తి గంగమ్మజాతర వైభవోపేతంగా జరుగుతుంది.
గంగమ్మని దర్సించిన అనంతరం అన్నమయ్య -
"అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
లందు వెలుగొంది ప్రభమీరగాను "
అని ౧౦౮ తిరుపతులను కీర్తిస్తూ అచ్చటి చక్రవర్తి పీఠాలు, దేశాంత్రుల మఠాలు, తపస్వుల గ్రుహాలు, విశ్రాంతదేశాలను సందర్శిస్తాడు. తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అళిపురిసింగరి, తలయేరుగుండు, పెద్దయెక్కుడు, కపురంపు కాలువలను సందర్శిస్తాడు.
ఇక్కడ అళిపురిసింగరి, తలయేరుగుండు, కురువమండపం, పెద్దయెక్కుడు, కపురంపు కాలువ, మోకాళ్ళముడుపులను గూర్చి వివరించడం సమంజసం.
అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

తిరుమల దర్శనం

ఒకనాడు(8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు.
తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

అన్నమయ్య చిత్రపటం
తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

అళిపురిసింగరి(అలిపిరి)

కొండ ఎక్కుటలో తొలిమెట్టుగల ప్రాంతం అళిపురి. అడిపడి, అలిపిరి అని కూడ పిలుస్తారు. అలిపిరి చేరాడు, అక్కడ వెలసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం.

సంసారం, సంకీర్తనం

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.
అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

రాజాశ్రయం

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.

అంత్య కాలం

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.
ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.
95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.
ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

అన్నమయ్య కీర్తనలు, రచనలు

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు. అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)
సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిద్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

ఉదాహరణలు

"అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము"

"అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల "

"కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు"

"క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం"

"జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద "

"చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా"

ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె
అదనెరిగి రాడాయెనమ్మా నా విభుడు

కవి కుటుంబం

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంథము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెండ్లి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.

దొరికిన పెన్నిధి


తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి
1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.

ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు


2004 లో అన్నమయ్య స్మృత్యర్ధం విడుదల చేసిన తపాలా బిళ్ళ
అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని మరియు శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడినది. అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన మరియు ప్రచురణ, రికార్డింగ్‌ అనే మూడు భాగాలున్నాయి. యువకళాకారులను తయారు చేసే దిశగా సంగీత విభాగం పని చేస్తుంది. పరిశోధన మరియు ప్రచురణ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రికార్డింగు విభాగం ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, భాగవత ప్రాజెక్టు, వేద రికార్డింగు ప్రాజెక్టు.
అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్భంగా తాళ్ళపాక లో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని(చూడుడు ఆంధ్రజ్యోతి తేది 23-05-08), ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు.అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించ డానికి , వారి వంశస్థులను వినియోగించ వచ్చును.

విశేషాలు

  • అన్నమాచార్యులువారు రచించిన కీర్తనలు చాలావరకూ అదృశ్యం కాగా మనకు మిగిలిన కీర్తనలు 15 వేలు.
  • బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ 600 సంవత్సరాలు క్రితమే మనషులంతా సమానమేనంటూ అన్నమయ్య సంకీర్తనలు రచించారు.
  • అన్నమయ్య రచించిన కీర్తనలలో ఎక్కువగా శృంగార కీర్తనలే ఉన్నాయి. బాహ్య అర్థమొకటి, అంతరార్థమొకటి.
  • ఆయన రచనల్లో కడప, రాయలసీమ యాస ఎక్కువగా ఉంటుంది. నిఘంటువు తయారు కావాలి

కొందరు గాయకులు

అన్నమయ్య పాటల ద్వారా ప్రసిద్ధులైన కొందరు గాయకులు
  • బాలకృష్ణ ప్రసాద్
  • శోభారాజు
  • పారుపల్లి రంగనాథ్
  • కొండవీటి జ్యోతిర్మయి 
  • ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి

పద కవితా సాహిత్యంలో అన్నమయ్యతో పాటు ప్రసిద్దులైన కవులు క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్యలు. వీరి గురించిన వివరణలు వచ్చే వారం చూద్దాం....
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner