22, మే 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది మూడవ భాగం....!!

వారం వారం నిరాఘాటంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో తెలుగు భాష, ఛందస్సు, తెలుగు సాహితీ యుగాలు, తెలుగు కవులు, తెలుగు సాహితీ ప్రక్రియల గురించి కాస్త కాస్త తెలుసుకుంటూ ఉన్నాము కదా... క్రిందటి వారం శతక సాహిత్యం గురించి తెలుసుకున్నాము ... ఈ వారం నవలా సాహిత్యం గురించి కొంత వివరణ చూద్దాం...
నవలా సాహిత్యం తెలుగు సాహిత్యంలో ప్రముఖ ప్రక్రియ. ఇది ఆధునిక కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్నది... ఊహల భావావేశానికి సుదీర్ఘ కధనా కల్పనే ఈ నవలా ప్రక్రియ...

ప్రారంభ కాలం

19వ శతాబ్ది అంత్యం నుంచి తెలుగు నవలల ప్రారంభం అయింది. వీరేశలింగం కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. చిన్నయసూరి పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూరి వీరేశలింగం పూర్తిచేసి ప్రచురించారు. ఆ సమయంలో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పనిచేస్తున్న సమర్ధి రంగయ్యచెట్టి వీరేశలింగం ప్రతిభను మెచ్చుకుంటూ అభినందన లేఖ వ్రాస్తూ తెలుగులో స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచనకు మీరు పూనుకోలేరా? అని మెచ్చుంటూనే ప్రోత్సహించే సూచనలు చేశారు. శ్రీరంగరాజ చరిత్రము ఆలోచనకు అదే మొదలు కావచ్చునని సాహిత్య విమర్శకులు భావించారు. 1892లో న్యాయవాది సుబ్బారావు సంపాదకత్వంలో వెలువడిన "చింతామణి" పత్రిక నవలను బాగా ప్రోత్సహించింది. నవలల పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది మరియు నవలా రచనకు కావలసిన సూత్రాలను నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభకాలంలో వెలువడిన నవలలు ఎక్కువగా సంఘ సంస్కరణల ప్రాముఖ్యత కనిపిస్తుంది.

చనవల

  • నవాన్ విశేషాన్ లాతి గృహ్ణతీతి నవలా' అనగా నవీణమైన విశేషాలు తెలుపునది నవల అని కాశీభట్టబ్రహ్మయ్యశాస్త్రీ చెప్పెను.
  • నవలకు నవలా' అని పేరు పెట్టినది కాశీభట్టబ్రహ్మయ్యశాస్త్రీ.
  • చనవల :నవల అనగా స్త్రీ అని అర్థం.
  • englishలో ఉన్న novel అనే పదం ఆధారంగా నవల వచ్చింది.
  • ఇంగ్లీషులో పదాలు హలంతపదాలు.హల్లు అంతంగా ఉన్నది novel అనే పదం.
  • తెలుగు పదాలు అజంతపదాలు.అచ్చుతో అంతంగా ఉన్నది నవల అనే పదం.
  • కల్పనలతో కూడినది,సుదీర్ఘ ఊహనిర్మిత కథ నవల.
  • కథ మానవజీవిత పార్శ్వాన్ని చెపుతుంది.
  • నవల మానవ జీవితాన్ని సమగ్రంగా చెపుతుంది.
  • నవలలో కథ,కవత్వం,నాటకం ఈ మూడు ఉంటాయి.
  • నాటకం=సంభాషణ.
  • నవలను సమగ్రమైన ప్రక్రియా, సమాహార ప్రక్రియా(complete) అని అంటారు.
  • మధ్యతరగతి ఇతిహాసం అని మరొక పేరు మవలకు కలదు.
  • pocket theatre అని నవలకు ఇంకోపేరు కలదు.

నవల-లక్షణాలు

  1. వచనం కలిగినది.
  2. కథ కలిగినది.
  3. సుదీర్ఘత కలిగినది.
  4. కల్పనలు కలుగినది.

20వ శతాబ్దం

మొదటి భాగం

20వ శతాబ్దం తొలిరోజుల్లో వచ్చిన మార్పులు నవలా రచనను ప్రభావితం చేశాయి. జాతీయ భావాలు, ఆంగ్ల విద్యావ్యాప్తి, సంస్కరణోద్యమాలు, పత్రికా వ్యాప్తి, పుస్తక ప్రచురణలు, సంస్థల స్థాపన మొదలైనవన్నీ నవలా వికాసానికి తోడ్పడ్డాయి. కృష్ణాపత్రిక, దేశమాత, సరస్వతి, హిందూ సుందరి, మనోరమ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలు సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేశాయి. విజ్ఞాన చంద్రికా మండలి, ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల, సరస్వతీ గ్రంథ మండలి, వేగుచుక్క గ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు ఎన్నో విలువైన పుస్తకాలను ప్రచురించాయి.
మొదటగా చారిత్రక, అపరాధ పరిశోధన నవలా అనువాదాలు ఎక్కువగా జరిగాయి. దీనిని "అనువాద యుగం" అని పేర్కొనవచ్చును. బెంగాలీ భాషనుండి అనువాదితమైన నవలల్లో ఆనందమఠం (ఓ.వై.దొరస్వామయ్య), ప్రఫుల్లముఖి (కనకవల్లి భాస్కరరావు), రాధారాణి (చాగంటి శేషయ్య) వంటివి ప్రసిద్ధిపొందాయి. మలయాళం నుండి అనువాదితమైన నవల "కళావతి" (దొడ్ల వెంకటరామరెడ్డి) వచ్చింది. అప్పుడే "ఐవాన్ హో" (కేతవరపు వేంకటశాస్త్రి) వంటి ఆంగ్ల చారిత్రక నవలలు వెలువడ్డాయి.
ఈ శతాబ్దిలో తర్వాత కాలంలో స్వతంత్ర చారిత్రక నవలలు వెలువడ్డాయి. ధరణి ప్రెగ్గడ వేంకట శివరావు రచించిన "కాంచనమాల" (1908), వేంకట పార్వతీశ కవుల "వసుమతీ వసంతము" (1911), ఎ.పి. నరసింహం పంతులు వ్రాసిన "వసంతసేన" (1912), సత్యవోలు అప్పారావు వ్రాసిన "పున్నాబాయి" (1913) వంటివి ప్రసిద్ధిపొందాయి.
1900-1920 మధ్యకాలంలో సాంఘిక సమస్యలు ఇతివృత్తాలుగా వెలువడిన నవలలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. పాశ్వాత్య ప్రభావంతో హేతువాద దృష్టి పెరిగి సమాజ సంక్లిష్టతను నవలలు చిత్రించాయి. వితంతు వివాహాలు, హరిజనాభ్యుదయం వంటి సంస్కార ప్రతిపాదకాలైన వస్తువులు కనిపిస్తాయి. నేదునూరి గణేశ్వరరావు రచించిన "సుగుణతి పరిణయము" (1903), హద్దునూరి గోపాలరావు "సుందరి" (1912), కొత్తపల్లి సూర్యారావు "కులపాలిక" (1913) వంటివి ఈ రకమైనవి. తల్లాప్రగడ సూర్యనారాయణ రచించిన "హేలావతి" (1913) ఈ కాలంలో వెలువడిన మొదటి హరిజనాభ్యుదయ నవల.
రాబోయే నవలలకు మార్గదర్శకత్వం వహించిన రచనలుగా మాతృమందిరం, గణపతి, మాలపల్లి నవలలను చెప్పుకోవచ్చును. చిలకమర్తి వారి "గణపతి" (1919) ఆ కాలంలోని బ్రాహ్మణ కుటుంబాల్లో వచ్చిన కల్లోలాలకు అద్దంపట్టిన హస్యపూరిత నవల. హరిజన సమస్యను చిత్రిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల "మాలపల్లి" లో వ్యావహారిక భాష వాడడం విశేషం.
బారిష్టరు పార్వతీశం నవల
1920-47 మధ్య తెలుగు నవల కొత్త పోకడలు పోయింది. నవ్య సాహిత్యోద్యమం, వ్యావహారిక భాషావాదం, కాల్పనిక ఉద్యమం మొదలై నవలను ప్రభావితం చేశాయి. భాషా విప్లవం తీసుకురావాలన్న గాఢమైన తపన ఈ రచయితలలో కనిపిస్తుంది. గుడిపాటి వెంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు ఈ కోవలోకి చెందుతారు. స్త్రీ స్వేచ్ఛ, స్వేచ్ఛా ప్రణయాలను చలం ప్రతిపాదిస్తే, సమాజం పటిష్టం కావాలంటే నీతి నియమాలు, కట్టుబాట్లు దృఢతరం కావాలని విశ్వనాథ భావించారు.
ఇదేకాలంలో మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు వికాసానికి తోడ్పడిన గొప్ప రచయితలు. మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం (1925) ఉత్తమ హాస్య నవల, మునిమాణిక్యం "కాంతం" అనే హాస్య ధోరణిగల తెలుగు ఇల్లాలిని సృష్టించిన ధన్యుడు. తెలుగుతనం పట్ల గాఢమైన అభినివేశంతో రచనలు చేసినవారు శ్రీపాద శాస్త్రి ఆత్మబలి, రక్షాబంధనము అనే ప్రసిద్ధ నవలలు రచించారు.

రెండవ భాగం

1947 తర్వాత కాలంలో తెలుగు నవల రాశిలోనూ, వైవిధ్యంలోను ప్రజాదరణలోను ఇది "నవలాయుగం" అనేంత ప్రాచుర్యం పొందినది. భారత స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవలలను చారిత్రికాలు, సాంఘికాలు అని స్థూలంగా విభజించవచ్చును. సాంఘిక నవలల్లో ఎంతో వైవిధ్యం, భిన్న దృక్పధాలు, ధోరణులు కనిపిస్తాయి. ఈ కాలంలో నవల మధ్య తరగతి జీవితాన్ని అన్ని కోణాల్లో చూపించడానికి ప్రయత్నించింది.
కొడవటిగంటి కుటుంబరావు మధ్య తరగతి జీవితాలలోని వైరుధ్యాలను విశ్లేషాత్మకంగా చిత్రిస్తూ ఆలోచింపజేసే నవలలు రాశారు. "చదువు", "అనుభవం" మొదలైన నవలల్లో సమాజంలోని అస్తవ్యస్తత పాత్రల స్వభావాల్లో కనిపిస్తుంది. "చివరకు మిగిలేది" నవలా రచయిత బుచ్చిబాబు ది ప్రధానంగా సౌందర్య దృష్టి, అయినా సంఘమనే చట్రంలో ఇమడలేని వ్యక్తి జీవిత చిత్రణ దీనిలో కనిపిస్తుంది. చైతన్య స్రవంతి మార్గంలో మనో విశ్లేషణాత్మకంగా రచించిన గోపీచంద్ నవల "అసమర్ధుని జీవితయాత్ర" రాచకొండ విశ్వనాథశాస్త్రి గారి "అల్పజీవి" లో కూడా ఇదే రీతి కనిపిస్తుంది. నవీన్ "అంపశయ్య"లో విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల జీవితాన్ని రచించారు. ఈ వ్యవస్థలో వర్గతత్వాన్ని చిత్రించిన బీనాదేవి "పుణ్యభూమి కళ్ళుతెరు" చాలా ప్రసిద్ధికెక్కింది.
పూర్వం నవలా రచయిత్రులు తక్కువగా ఉన్నా, ఇప్పుడు విస్తృత సంఖ్యలో స్త్రీలు రచనలు చేస్తున్నారు. వారిలో ఎక్కువమంది వాస్తవికతకు సుదూరమైన పగటి కలలను చిత్రిస్తున్నారు. జనాకర్షణ కల ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి.
పురుష ప్రపంచంలో స్త్రీల బానిస బ్రతుకును చిత్రిస్తూ వారు తమ వ్యక్తిత్వం కొరకు పోరాడాలని ప్రబోధించే రచయిత్రి రంగనాయకమ్మ. ఆమె రచించిన "బలిపీఠం" లో సాంఘిక చైతన్యం కొరవడిన వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే వచ్చే కష్టనష్టాలు చిత్రించారు. సామాజిక సమస్యలను వస్తువుగా తీసుకొని వాసిరెడ్డి సీతాదేవి రచించిన మట్టి మనిషి, అడవి మల్లి, ఇల్లిందల సరస్వతీదేవి రచించిన భవతి భిక్షాందేహి, దరిచేరిన ప్రాణులు ఇలాంటి ప్రయోజనంతో రాసిన నవలలు. స్త్రీ సెక్స్ జీవితానికి సంఘం విధించిన కట్టుబాట్లను ఎదిరిస్తూ రాసిన రచయిత్రి లత.

నవలా రచయితలు

  1. దాశరధి
  2. గుడిపాటి వెంకట చలం
  3. బుచ్చిబాబు
  4. ముప్పాళ రంగనాయకమ్మ
  5. మొక్కపాటి నరసింహశాస్త్రి
  6. అడవి బాపిరాజు
  7. విశ్వనాథ సత్యనారాయణ
  8. ఉన్నవ లక్ష్మీనారాయణ
  9. పి. లలిత కుమారి (ఓల్గా)
  10. కొడవటిగంటి కుటుంబరావు
  11. తెన్నేటి హేమలత (లత)
  12. యండమూరి వీరేంద్రనాథ్
  13. యద్దనపూడి సులోచనారాణి
  14. మధుబాబు
  15. మల్లాది వెంకటకృష్ణమూర్తి
  16. సూర్యదేవర రామమోహనరావు
  17. యర్రంశెట్టి శాయి
  18. కొమ్మూరి వేణుగోపాలరావు
  19. చల్లా సుబ్రహ్మణ్యం
  20. కవనశర్మ
  21. అర్నాద్ (హరనాధరెడ్డి)
  22. రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాధశాస్త్రి)
  23. వడ్డెర చండీదాసు
  24. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
  25. చివుకుల పురుషోత్తం
ఇలా చెప్పుకుంటూ పోతుంటే నవలా సాహిత్యం గురించి ఎన్నో ఎన్నెన్నో సాహిత్యపు వింతలు మనకు నవలా సాహిత్యంలో కనిపిస్తాయి... ఈ వారం ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో సాహితీ ప్రక్రియతో కలుద్దాం...
సేకరణ : వికీపీడియా నుండి... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner