29, మే 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది నాలుగవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రిందటి వారం నవలా సాహిత్య ప్రక్రియ గురించి కాస్త తెలుసుకున్నాం... ఈ వారం అవధానాల గురించిన వివరణ చూద్దాం...
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.

అవధానం స్వరూపం

కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానం లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు. అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
  • సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి.
  • సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
సంగీత నవావధానం ..ఈప్రక్రియను ప్రారంభించిన వారు మీగడ రామలింగస్వామి. ఎనమిది మంది పృఛ్ఛకులకు ,ఇరవై పద్యాలను పన్నెండు రాగాలను ఇస్తారు. వాటిలో నుండి పద్యాలు తాము కోరుకున్న రాగాలలో గానం చేయమని అడగవచ్చు. ఉదాహరణకు పాండవోద్యోగమ లో బహుళ ప్రచారం లో ఉన్న పద్యం 'జెండాపై కపిరాజు ' ఇంతవరకు పాడిన నట గాయకులందరూ దీన్ని మోహన రాగం లోనే పాడగా మనం విన్నాము. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్న శివరంజని లేక ముల్తాన్ రాగాలలో పాడమని పృఛ్ఛకులు అడిగితే అవధాని ఆ రాగం లో పద్యభావం చెడకుండా పాడాలి. పృచ్చకులు దాదాపుగా పద్యాలను రాగయుక్తంగా పాడగలవారై ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పద్యాన్ని పరస్పర విరుద్ధమైన ఛాయలున్న రాగాలలో వినగలుగుతాం.

అష్టావధానము

ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు
  1. కావ్య పాఠము
  2. కవిత్వము
  3. శాస్త్రార్థము
  4. ఆకాశపురాణము
  5. లోకాభిరామాయణము
  6. వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి
  7. చదరంగము
  8. పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివరలో "ధారణ" తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా అన్ని పద్యాలను అవధాని చివరలో చెప్పవలసి ఉంటుంది.
అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి. వాటిని - వాటి వివరణను గమనించండీ.
1.నిషిద్ధాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పవలసినదిగా అవధాని గారిని కోరతాడు. అవధానిగారు ఆ విషయం మీడ ఒక చందస్సులో ఒక పద్యం మెదలెడతాడు ఒక పదంతో. అప్పుడు వృచ్ఛకుడు అవధాని చెప్పిన పదాన్ని బట్టి తరువాత ఏ అక్షరం రాగలదో ముందుగుగానే వూహించి ఆ అక్షరం మీద సిషేదం విధిస్తాడు. అనగా ఆ అక్షరం ఉపయోగించ కూడదని. అవధాని గారు ఆ అక్షరాన్ని వదలి వేరే అక్షరం తో పద్యాన్ని కొనసాగిస్తాడు. ఈ విధంగా ఆ పద్యం పూర్తయ్యే లోపు అనేక సార్లు నిషిద్దాక్షరాన్ని ప్రయోగిస్తాడు వృచ్ఛకుడు. అవదాని గారు పద్యభావం చేడకుండా నిషిద్దాక్షరిని వాడకుండా.... పద్యాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమంటే ఒకేసారి పూర్తి చేయడం కాదు. అవధానం పూర్తయ్యేలోపు పూరించాలి. అవధాని గారు ఆ పద్యంలో రెండు మూడు పదాలు చెప్పగానే మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. ఇంత వరకు చెప్పిన పద్య భాగాన్ని అలాగే మనసులో ముద్రించుకొని ఇచ్చిన మరో అంశానికి వెళతారు అవదాని. ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలోను మరియు తెలుగులో మాత్రమే వునటు తెలుస్తుంది. ఇది తెలుగు భాషకు మహా భూషణము
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని గారు ఇలా చెప్పారు.
డమరుకమును మ్రోగించుచు నమరించెను మానవులకు ' అఆ ' మాలన్ కమనీయముగా వ్రాయగ నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
2. న్యస్తాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ పద్యంలోని నాలుగు పాదాలలో ఫలాన స్తానంలో పలాన అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు. అవధాని గారు వృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు. ఆ పద్యాన్ని ఒక్కసారే చెప్పడానికి వీలు లేదు. పద్య పూరణ కొంత అవగానే మరొక వృచ్చకుడు మరో సమస్యనిస్తాడు. అవధాని గారు అప్పటి వరకు చెప్పిన పద్య భాగాన్ని గుర్తుంచుకొని మరో సమస్య మీదికి మనసును కేంద్రీక రించాలి.
3.దత్తపది
ఇది న్యస్తాక్షరి లాంటిదే. కాక పోతే అక్కడ ఒక పాదానికి ఒక అక్షరాన్నిస్తారు. ఇందులో ఒక్క పాదానికి ఒక్కొక్క పదాన్నిస్తారు. ఆ పదాలు కూడ ఒక దానికి ఒకటి పొంతన లేకుండా వుంటాయి. ఉదాహరణ గా చెప్పాలంటే. వంకాయ, అమెరికా, రాముడు, గాందీతా. ఒక్కొక్క పాదంలో ఒక పదాన్ని వుంచి ఫలాన చందస్సులో, ఫలాన విషయంపై ఒక పద్యం చెప్పమని వృచ్ఛకుడు ప్రశ్నను సందిస్తాడు. అవదానిగారు ఆయా పదాలను పయోగించి అర్థవంతమైన పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి నాలుగు పదాలు చెప్పగానే మరొక వృచ్ఛకుడు మరో సమస్యతో అడ్డగిస్తాడు. అవదాని గారు అంతవరకు చెప్పిన పద్య భాగాని అలాగె గుర్తు పెట్టుకుని మరో సమస్యలోకి దిగాలి.
4.సమస్యా పూరణం.
వృచ్ఛకుడు లోక విరుద్ధంగా వున్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్య పాదాన్ని ఇస్తాడు. అవదాని గారు తనకిచ్చిన పద్య పాదంలోని లోక విరుద్ధమైన భావాన్ని విరిచి లోకామోదమైన భావంతో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకు: కప్పను చూడంగ పాము గజగజ లాడెన్. ఈ పద్య పాదంలోని అర్థం లోక విరుద్ధము. అదే అర్థంతో పద్యాన్ని ఎవరైనా చెప్పగలరు. అందులోని అర్థాన్ని సజావుగా మార్చి పద్యం చెప్పాలి. అవధాని గారు ఈ సమస్యను స్వీకరించి మొదటి పద్య పాదంలో కొంత భాగము చెప్పగానే ...... అతని ధారణకు ఆంతరాయాన్ని కలిగిస్తూ మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు.
5. వర్ణన
వృచ్ఛకుడు ఏదో ఒక చందస్సులో, ఏదో ఒక విషయాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమంటాడు. అవధానిగారు ఆ నిర్థిష్టమైన చందస్సులో ఆ విషయమై వర్ణనాత్మకమైన పద్యం చెప్పాలి.
6. ఆశువు
వృచ్ఛకుడు ఒక విషయాన్నిచ్చి అడిగిందే తడవుగా , ఆలోచించుకోకుండా వెంటనే ఆసువుగా చందోభద్దమైన పద్యాన్ని ఆ విషయాన్ని గురించి చెప్పాలి అవధాని గారు.
7.పురాణ పఠనం:
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబందం, కావ్యం ఇలాంటి గ్రంధాలలో ఒక ప్రథాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ..... ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు.... పురాణ పక్కీలో చెప్పాలి... అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా....... మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని 'కొంత సేపు ఆగు ' అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
8.అప్రస్తుత ప్రసంగం:
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్త్గాడు. ఉదాహరణకు...... అవధానిగారూ..... నిన్న ఇదే సమయానికి మీరెక్కడున్నారు..... ఏమి చేస్తున్నారు చెప్పండి అంటాడు. దానికి సమాధానంగా అవధానిగారు మామూలుగా అడిగిన దానికి సమాధానము చెప్పడము కాదు... ఆ కొంటె ప్రశ్నకి సమాధానం మరింత కొంటెగా సభాసధులందరూ ఆహా అని మెచ్చుకునే టట్లు సమాధానం చెప్పాలి.
వివరాలు
1.ఇప్పటి వరకు ఒక ఆవృతం మాత్రమే పూర్తయింది. ఏ ఒక్కరికీ పూర్తి సమాధానం ఇవ్వకనే మరో వృచ్ఛకుడు అడ్డు తగిలాడు. ఈ సారి రెండో ఆవృతంలో (రెండో రౌండు) తిరిగి మొదటి వృచ్ఛకుడు నాప్రశ్నకు సమాదానమేది అని ప్రశ్నిస్తాడు. అతనడిగిన ప్రశ్నేమిటో ఎంతవరకు సమాదాన మిచ్చాడో గుర్తు పెట్టుకొని ఆ పద్యంలో రెండో పాదం చెప్పాలి. మొదటి వృచ్చకునికొ సమాధానం పూర్తి కాక ముందే రెండో వృచ్చకుడు నాసంగతేమిటని అడుగుతాడు. అతనికి ఇంతకు ముందు ఎంతవరకు సమాధానము చేప్పారో గుర్తు పెట్టుకొని మిగతా సమాదాన భాగాన్ని పూరిచి చెప్పాలి. ఇంతలో మూడో వృచ్చకుడు.... ఇల ఒకరి తర్వాత మరొకరు తాము ఇదివరకు సంధించిన ప్రశ్నలు చెప్పకుండా తమకు రావలసిన సమాధానలను గురించే అడుగుతారు. అవధానిగారు ....... మీకు ఎంత వరకు సమాదానము చెప్పాను? అని అడగ కుండా ఆ విషయాన్ని మనసులోనే వూహించుకుని తరువాతి పద్య పాదాన్ని పూరించి సమాధానము చెప్పాలి. ఆ విధంగా నాలుగో రౌండులో మాత్రమే ప్రతి వృచ్ఛకునికి పూర్తి సమాదానము వస్తుంది. అవధానులెవరైనా వృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చంధోబద్దమైన పద్యాలతో సమాధానము చెప్పడమే కాదు ఆ సమాధానాలు అత్యంత రసవత్తరంగా, మనోజ్ఞంగా. సాధారణ ప్రేక్షకుల సైతం ఆకట్టు కునే విధంగా వుటాయి. అందులోనే అవధాని గారి గొప్పతనం, ప్రజ్ఞా వుంటాయి.
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక్ ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్య క్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్య క్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో.......
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం , గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడ పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అది ని భందన.

శతావధానము

వంద మంది పృచ్ఛకులను ఎదుర్కొని చేసే అవధానాన్ని శతావధానం అంటారు. సాధారణంగా శతావధానంలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అంశాలు ఉంటాయి.

సహస్రావధానము

ద్వి సహస్రావధానము

త్రి సహస్రావధానము

నాట్యావధానము

గణితావధానము

ఘంటావధానము

నేత్రావధానము, అంగుష్టావధానము, అక్షరముష్టికావధానం

ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృచ్ఛకులు మొదటి అవధానికి ఒక కాగితంపై విషయం వ్రాసి ఇస్తారు. అతడు దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికి ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు.
కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం. ఇంకా పుష్పావధానం, ఖడ్గావధానం, గమనావధానం... లాంటివి 13దాకా ఉన్నాయి. వీటిని సాంకేతిక అవధానాలు అంటారు.
ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలసి చేయలేరు.

అష్టావధానం లోని ప్రక్రియలు

పుష్ప గణనము

పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.

ఆశువు

ఆశువు లేదా ఆశుకవిత్వం. ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం దాకా దేని మీదనైనా ఆశువు గా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.

నిషిద్ధాక్షరి

నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, మేడసాని మోహన్ ను ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. ఆయన ఈ విధంగా చెప్పాడు.
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్

నిర్దిష్టాక్షరి

నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసి స్థానాల్లో గానీ, సరి స్థానాల్లో గాని ఇష్టానుసారం అక్షరాలను వ్రాసి ఇస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.

ఘంటా గణనం

ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.

అప్రస్తుత ప్రసంగం

అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "ళ్లెం నిండా శుభ్రంగా డ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
శతావధాన సహస్రావధానాలలో సాధారణంగా ఉండే అంశాలలో కొన్ని....1. సమస్యాపూరణం 2.దత్త పది 3.వర్ణన 4.ఆశువు 5.నిషిద్ధాక్షరి 6.నిర్దిష్టాక్షరి 7.వ్యస్తాక్షరి 8.న్యస్తాక్షరి 9.చందోభాషణం 10.పురాణ పఠనం 11.శాస్త్రార్థము 12.ఏకసంథా గ్రహ్ణం 13.వివ్ర్గాక్షరి 14.అనువాదం 15.చిత్రాక్షరి 16.అక్షర విన్యాసం 17.స్వీయ కవితా గానం 18.వార గణనం 19.పంచాంగ గణనం 20.పుష్ప గణనం 21.ఘంటా గణనం 22.అప్రస్తుత ప్రసంగం 23.కావ్యానుకరణం 24.సంగీతం 25.మీ ప్రశ్నకు నా పాట మొదలగునవి.

కొందరు అవధానులు

ఆధునిక కాలంలో

  • డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వేయి మంది పృచ్ఛకులతో అవధానం చేసి మహా సహస్రావధాని అనీ, ముందు చెప్పిన వేలాది పద్యాలు క్రమంలో మళ్ళీ చెప్పి ధారణా బ్రహ్మ రాక్షసుడు అనీ బిరుదులు పొందాడు.
  • దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సి ని మాత్రం పాలకొల్లు లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962 లో హన్మకొండ లో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు. వీరు రెండు వందలకు పైగా అష్టావధానాలు చేసిన ప్రముఖులు.
  • డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నాడు.
  • కడిమెళ్ల వరప్రసాద్. పలు అష్టావధానాలు, శతావధానాలే కాక అవధాన ప్రక్రియలో శిష్యుడు కోట లక్ష్మీనరసింహంతో కలిసి జంట సహస్రావధానం కూడా నిర్వహించారు. అవధానులుగా రాణిస్తున్న కోట లక్ష్మీనరసింహం, వద్దిపత్తి పద్మాకర్ లకు అవధాన ప్రక్రియ నేర్పి తీర్చిదిద్ది "గురు సహస్రావధాని"గా పేరొందారు.
  • అష్టకల నరసింహరామ శర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
  • డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.
  • రాంభట్ల పార్వతీశ్వర శర్మ బాల కవి, 20 ఏళ్ళ వయసులో 12 అష్టావధానాలు చేశాడు. "శ్రీ రాంభట్ల వేంకటీయము" అనే లఘు పద్యకావ్యం వ్రాసాడు. చదివింది బియస్సీ మైక్రో బయాలజీ... చదువుతూ ఉన్నది ఎమ్మే తెలుగు, ఆంధ్ర విశ్వకళా పరిషత్.
  • నరాల రామారెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వీరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. అష్ఠావధాని. అనేక అవధానాలు చేశారు. చమత్కారం వీరి ప్రత్యేకత. అమెరికాలో అవధానాలు చేసి మన్ననలు పొందారు.
==పంచసహస్రావధానులు== 
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , మేడసాని మోహన్
==ద్విసహస్రావధానులు ==
మాడుగుల నాగఫణి శర్మ.
==సహస్రావధానులు== 
మేడసాని మోహన్ , మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి ప్రభాకర్ , గరికపాటి నరసింహారావు.
== పంచశతావధానులు== 
మాడుగుల నాగఫణి శర్మ.
==ద్విశతావధానులు ==
రాళ్ళబండి కవితా ప్రసాద్ , కడిమిళ్ళ వరప్రసాద్ , గరికపాటి నరసింహారావు , మాడుగుల నాగఫణి శర్మ.
== --శతావధానులు 
==
చెఱువు సత్యనారాయణ శాస్త్రి ,సి.వి.సుబ్బన్న , నరాల రామారెడ్డి , గండ్లూరి దత్తాత్రేయ శర్మ ,బూరాడి గున్నేశ్వర శాస్త్రి , మేడసాని మోహన్ , గరికపాటి నరసింహారావు , రాళ్ళబండి కవితా ప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి పద్మాకర్ , పల్నాటి సోదర కవులు, చల్లా పిచ్చయ్య శాస్త్రి , అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, దోర్భల ప్రభాకర శర్మ]] , దోకూరి కోట్ల బాల బ్రహ్మచారి , జాను దుర్గా మల్లికార్జున రావు ,కొండపి మురళీ కృష్ణ , గౌరీభట్ల వెంకటరామ శర్మ ,శ్రీ రామ నరసింహమూర్తి కవులు , కడిమిళ్ళ వరప్రసాద్, సురభి శంకర శర్మ. కోట వెంకట లక్ష్మీనరసింహం , మాడుగుల వెంకట సూర్య ప్రసాదరాయ కవి , పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ , జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , భూతపురి సుబ్రహ్మణ్య శర్మ , భూతపురి బాల సుబ్బారాయుడు , పోచిన పెద్ది సుబ్రహ్మణ్యం , పాణ్యం నరసరామయ్య , రొంపిచర్ల శ్రీనివాసా చార్యులు...
== అష్టావధానులు== 
ప్రసాదరాయ కులపతి ,దివాకర్ల వెంకటావధాని , ధూళిపాళ మహదేవమణి , గౌరీభట్ల రఘురామ శర్మ ,బేతవోలు రామబ్రహ్మం , దూపాటి సంపత్కుమారాచార్య , [[కోవెల సుప్రసన్నా చార్య [[, విఠాల చంద్రమౌళి శాస్త్రి , చిఱ్ఱావూరి శ్రీరామ శర్మ , ఆర్.అనంత పద్మనాభరావు , మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ ,తిగుళ్ళ శ్రీహరి శర్మ , మాడుగుల అనిల్ కుమార్ , సురభి వెంకట హనుమంతు రావు , గణపతి అశోక్ శర్మ , ఇందారపు కిషన్ రావు , మేడూరు ఉమామహేశ్వరం , గాడేపల్లి కుక్కుటేశ్వర్ రావు , మరింగంటి కులశేఖరా చార్యులు , కర్రా గోపాలం , కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద రావు , కట్టమూరు చంద్రశేఖర్ , లోకా జగన్నాధ శాస్త్రి , అయాచితం నటేశ్వర శర్మ , చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ , అష్టకాల నరసింహరామ శర్మ , వెల్లాల నరసింహ శర్మ ,కేసాప్రగడ సత్యనారాయణ , గురువేపల్లి నరసింహం ,రాళ్ళబండి నాగభూషణ శర్మ ,కురుబ నాగప్ప , పూసపాటి నాగేశ్వర రావు , అందె వెంకటరాజం , రాంభట్ల పార్వతీశ్వర శర్మ , కావూరి పూర్ణచంద్రరావు , ముటుకుల పద్మనాభ రావు , ఆశావాది ప్రకాశరావు , పేరాల భరత శర్మ , పరవస్తు ధనుంజయ , నారాయణం బాల సుబ్రహ్మణ్య శర్మ , మేడవరం మల్లికార్జున శర్మ ,సమ్మెట మాధవ రావు , అవధానం రంగనాధ వాచస్పతి , వేదాటి రఘుపతి , ఆరుట్ల రంగాచార్య ,బులుసు వెంకట రామమూర్తి ,గడియారం శేషఫణి శర్మ , ఆమళ్ళదిన్నె వెంకట రమణ ప్రసాద్,పాలపర్తి వేణుగోపాల్ ,దిట్టకవి శ్రీనివాసాచార్యులు , దోనిపర్తి రమణయ్య , శంకరగంటి రమాకాంత్ , ముద్దు రాజయ్య , తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ, గౌరీభట్ల రామకృష్ణ శర్మ , కోట రాజశేఖర్ , చిలుకూరి రామభద్ర శాస్త్రి , పరిమి రామ నరసింహం , బెజుగామ రామమూర్తి , పణితపు రామమూర్తి , జోస్యుల సదానంద శాస్త్రి , మద్దూరి రమమూర్తి , చిలుకమర్రి రామానుజాచార్యులు , గౌరిపెద్ది రామసుబ్బ శర్మ , పణతుల రామేశ్వర శర్మ , పాణ్యం లక్ష్మీనరసింహ శర్మ , చక్రాల లక్ష్మీకాంత రాజారావు ,శిరిశినహళ్ శ్రీమన్నారాయణాచార్యులు , పుల్లాపంతుల వెంకట రామశర్మ , దేవులపల్లి విశ్వనాధం , వంకరాజు కాల్వ వీరభద్రాచార్యులు , పణిదపు వీరబ్రహ్మం , భద్రం వేణు గోపాలా చార్యులు ,రావూరి వెంకటేశ్వర్లు , గుమ్మా శంకర రావు , ప్యారక శేషాచార్యులు ,మామిళ్ళపల్లి సాంబశివ శర్మ , నేమాని రామజోగి సన్యాసి రావు , కొప్పరపు సీతారామ వరప్రసాద రావు , శనగల సుందరరామయ్య , అవధానం సుధాకర శర్మ , పైడి హరనాధ రావు , పమిడికాల్వ చెంచు సుబ్బయ్య , తావి కృష్ణ శర్మ ,వడిగేపల్లి నరసింహులు , మేడికుర్తి పుల్లయ్య , కె.ప్రభాకర్ , పుల్లపంతుల రాధాకృష్ణ మూర్తి , బి.శ్రీనివాసాచార్యులు , అక్కపెద్ది రామసూర్యనారాయణ , సురభి శంక శర్మ , ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , ఎస్.ఎ.టి.కె. తాతాచార్య , ఫణితపు శ్రియ:పతి , సి.విజయకుమార్ , గోవర్ధనం నరసింహా చారి , ఎం.కె.ప్రభావతి , తంగిరాల ఉదయ చంద్రిక , పుల్లాభట్ల శాంతి స్వరూప , కొంపెల్ల కామేశ్వరి,బులుసు అపర్ణ , ఆకెళ్ళ దుర్గ నాగసత్య బాలభాను మున్నగువారు.

తెలుగులో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియ గురించి కొంత వివరణ తెలుసుకున్నాము... ఇంతటితో ఈ వారం ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో సాహితీ ప్రక్రియతో మళ్ళి కలుద్దాం...

సేకరణ : వికీపీడియా సహకారంతో ... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

1 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sasi చెప్పారు...

వీరే కాకుండా ఇంకా కొందరి జాబితా నా వద్ద ఉంది నేడు అవధానాలు చేస్తున్నారు అందులో నేను ఒక అవధాని గా గర్వ పడుతున్నాను. మీకు వీలైతే 9652478734 number కు call చేయండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner