30, డిసెంబర్ 2015, బుధవారం

మరో అడుగు ముందుకు వేద్దాం... !!

నేస్తం...
          ఆ మధ్యెప్పుడో నాకు ప్రతిఘటనలోని పాట  గుర్తు వచ్చింది.. ఈ దుర్యోదన దుశ్శాసన ....కలియుగానికి ఆరవ వేదం కూడా చాలదేమో అనిపిస్తోంది.. ఈ వాట్స్ప్ లు ముఖ పుస్తకాలు వచ్చాక మనతో మనం గడిపే సమయం కూడా తగ్గిపోయినట్లుగా ఉంది.. సమయం, సందర్భం లేకుండా ఫ్రెండ్ అని ఆడ్ చేస్తే చాలు టాగ్ లు , గుడ్ మాణింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ... మధ్యలో ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా... పని ఏమి ఉండదో మరి ఏమో ...వయసుతో అస్సలు పనే ఉండదు .. ఇదో గోల అనుకుంటే ఈ యాప్ లతో ఒక గోల ... సరదాగా తీసుకోండి సరదా యాప్లని ... మనం అనే ఒక చిన్న మాట ఎదుటి వారిని ఎంతగా బాధ పెడుతుందో మాట అనే ముందు ఆలోచించండి.. ఈ ప్రపంచంలో అందరు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నవారే.. మనకు  మనదే పెద్ద కష్టం కావచ్చు .. ఎప్పుడయినా మనకు మన బాధ్యతలు, ఈ జీవితంలో మనతో ముడి వేసుకున్న బంధాలు ముఖ్యం... వాటి తరువాతే ఏ ఇతర అనుబంధాలు అయినా.. సాధ్యమైనంత వరకు అందరిలో మంచినే చూద్దాం... ఈ సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వదలి వేయడానికి ప్రయత్నిస్తూ మరో అడుగు ముందుకు వేద్దాం...!!

శుభాభినందనలు.... !

నా ఆత్మీయురాలు కాట్రగడ్డ భారతి గారు "వెన్నెల పుష్పాలు" కవితా సంపుటి ఆవిష్కరణ ... అదే రోజు సావిత్రి బాయి ఫూలే విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకుంటున్న శుభ సందర్భంగా ఇవే మా మనః పూర్వక శుభాభినందనలు....
మరెన్నో కవితా సంకలనాలు వెలువరిస్తూ .. వారి సమాజ సేవకు తగిన అవార్డులు..  రివార్డులు ... అందుకోవాలని కోరుకుంటూ.... రాబోయే సంవత్సరం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ...
ఆత్మీయ నేస్తం
మంజు

28, డిసెంబర్ 2015, సోమవారం

వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..?

ఒకప్పుడు చదువుకోవడానికి వీసాలను ఇవ్వడం కష్టతరం చేసిన అమెరికా ఇప్పుడు వారి ఆర్ధిక వనరులను పెంచుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా అది మన భారత దేశంలో ఉన్నంత అమెరికా పై మోజును ఎలా సొమ్ము చేసుకుంటోందో.. ఇక్కడ వీసాలు ఇచ్చేటప్పుడు వారికి తెలియదా అవి మంచి యూనివర్సిటిలు అవునో కాదో ... వీసా ఇచ్చినట్టు ఇచ్చి అన్ని రకాలుగా డబ్బులు చేసుకుని వెనక్కు పంపడంలో అంతరార్ధం ఏమిటి..? తానా స్వేర్ లు పెద్దలు చాలా మంది చాలా సలహాలు సూచనలు ఇస్తున్నారు ... అవి అన్ని వీళ్ళ కన్నీళ్ళు తుడవవు అని వారికి తెలుసు .. ఇంతకూ ముందు కూడా ఒకప్పుడు F1 వీసాలు ఇవ్వకుండా నిబంధనలు కష్టతరం చేసారు అది ఒకరకం .. అక్కడకు వెళ్ళిన తరువాత వెనక్కు పంపడంలోఅమెరికా అంతరార్ధం ఏమిటి.. మన తెలుగు వాళ్లకు ఎంత చెప్పినా దూరపు కొండలు నునుపు ... నేను అక్కడ చూసిన చాలా చదువుల తరువాత వారు ఇప్పటికి కనీసం మంచి ఉద్యోగాలు చేయక వేరేగా స్థిరపడిపోయారు... నేను H 1 వీసా తో వెళ్ళాను .. నేను చాలా ఇబ్బందులు పడ్డాను మంచి కంపెని అని నమ్మి .. ఇక్కడ ఆ నిజాలు చెప్పేసాను అనుకోండి నామీద యుద్ధం ప్రకటిస్తారు అందరు...
ఇంకో నాలుగు నెలలు పొతే H 1 లాటరీ మోజు మొదలౌతుంది .. అది కూడా ఇదే స్థితి ... డాక్యుమెంట్స్ లేకుండా వీసాలు ఎలా ఇచ్చేస్తారు ... ట్రావెల్స్, అమెరికా కలిసి చేస్తున్న వ్యాపారం ఇది .. మనకు అమెరికా మోజు తీరనంత కాలం వీళ్ళు మనతో ఇలానే ఆడుకుంటారు ... ప్రభుత్వం లేఖలు, తానా కబుర్లు ఇవి అన్ని ఎందుకు ఉపయోగపడవు ... అమెరికాకు ఈ ఆటలు అలవాటే ఏదో ఒక వీసాతో ఇలా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు ... నిజం చెప్పొద్దు మనకు గొప్పలు చెప్పుకునే అలవాటు అందరికన్నా ఎక్కువే కదా అందుకే ఈ తిప్పలు ... ఇంట గెలవడం ఎలాగు రాదు రచ్చ అభాసు పాలౌతున్నాం మనకున్న డాలర్ల పిచ్చిలో పడి ... గాస్ స్టేషన్లో గంటకు పది డాలర్లు సంపాదించి అదే జీవితం అనుకుంటూ ఇక్కడేమో మా అబ్బాయి అమెరికాలో పెద్ద ఉద్యోగం అంటూ చెప్పుకు తిరిగే తల్లిదండ్రులకు ఈ సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుంటూ .... M.S కాదు మీలో సత్తా ఉంటే ఇక్కడ రాంక్ సంపాదించండి ... అమెరికా  వలసలు కొన్ని రోజులు ఆపండి ... !!

26, డిసెంబర్ 2015, శనివారం

ఎందరో స్త్రీమూర్తులు....!!

అణువుకు ఆకృతినిచ్చి
సృష్టిలోని మాధుర్యాన్ని పంచే
తల్లి ప్రేమకు దాసుడైనాడు
ఆ పరమాత్ముడే మానవజన్మను ధరించి
వంటింటి కుందేలన్నారు ఆనాడు
సప్త సముద్రాలను సుళువుగా దాటుతున్నారీనాడు
గగనాన తారకలౌతున్నారెందరో
చరిత్రలో చిరస్థాయిగా మిగులుతున్నారు
ఆత్మవిశ్వాసానికి చిరునామాలుగా నిలుస్తున్నారు
ఇంటా బయటా నిత్య జీవన రణరంగంలో
అలుపెరుగని శ్రామికులుగా చెరగని చిరునవ్వుతో
మొక్కవోని ఆత్మ స్థైర్యంతో నిలబడుతూ కూడా
అహం మృగం చేతిలో అణగద్రొక్కబడుతూ
విజయాన్ని అందుకునే యత్నంలో
సహనాన్ని , ఔదార్యాన్ని మరువక 
కాలంతో పోటీపడే ఆ స్త్రీమూర్తుల
ఓరిమికి మీ "అమ్మ" నేర్పిన "సంస్కారం"
మీలో ఉంటే చేతులెత్తి నమస్కరించండి...!!

20, డిసెంబర్ 2015, ఆదివారం

అసలు సమస్య....!!

కార్పోరేట్ స్కూల్ /కాలేజ్ అన్న పదం వస్తే చాలు వెంటనే తల్లిదండ్రులని అనడం పరిపాటి అయిపొయింది అసలు సమస్యను వదిలేసి.. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అధోగతి పాలు కావాలనో లేదా తమ కళ్ళ ముందే చనిపోవాలనో కోరుకోరు.. పిల్లల అవసరాలు తీర్చడం కోసమే వారు జీవితాన్ని పణంగా పెడుతున్నారు... నేను వారంలో 4 రోజులు వెళ్లి వస్తూనే ఉంటాను అక్కడ ఎంతోమందిని చూస్తూ ఉంటాను ... తల్లిదండ్రులు పిల్లలను  మార్కుల కోసం,  రాంకుల కోసం ఇబ్బందులు పెట్టరు .. ఈ పిల్లలే కనీసం ఇంట్లో ఉన్నప్పుడు ఓ నిమిషం అమ్మానాన్నలతో మాట్లాడే తీరిక ఉండదు కాని ఇప్పుడు మాత్రం ఫోను కనిపిస్తే వదలరు .... ఇక చనిపోయిన హృతిక్ విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు మీడియాకు వైస్ ప్రిన్స్ పాల్ వేధింపు కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తే అది మీడియా వాళ్ళు ఎందుకు రానివ్వలేదు ... పిల్లలు చదవలేదు అన్నది కారణం కాదు వాళ్ళు గుడివాడ గౌతమ్ స్కూల్ పిల్లలు .. వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుతారు ... మా పిల్లల సంగతి మాకు బాగా తెలుసు ... ఎలాంటి వాళ్ళు అన్నది .. ఈ రోజుకి కూడా కే కే ఆర్ గారు మా వాడు కనిపిస్తే పలకరిస్తారు అంటే అర్ధం చేసుకోండి అలా అని మాడు మొదటి సెక్షన్స్ లో ఉండడు .. ఈ హృతిక్ కూడా అలాంటి వాడే .. వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పలేని విధంగా చేసాడు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది ఆ వైస్ ప్రిన్స్ పాల్ హోమో ఏమో అని ... నిజానిజాలు తేల్చాల్సిన వాళ్ళు దండిగా డబ్బులు తిని న్యాయాన్ని దాచేశారు... ఇది నాలుగో సంఘటన ఈ నారాయణ కాలేజ్ లలో .. ఇలానే వదిలేస్తే మరెన్నో ... నాదొక్కటే విన్నపం అందరికి ... సమస్య మూలం కార్పోరేట్ వ్యవస్థ ... దాన్ని వేళ్ళతో నాశనం చేయండి ... దీనికి అందరు సహకరించండి .. పిన్నలకు పెద్దలకు ఇదే నా విన్నపం .. మరో హృతిక్ బాలి కాకుండా పాడుకుందాం ...  సమస్య చెప్పాను ... పరిష్కారం చెప్పాను ... దీనిలో న్యాయం  ఉందో లేదో మీరే చెప్పండి ... !!

అక్షర అనుబంధం ఇదేనేమో...!!

ఆకృతి లేని మదికి
భావాల మాటల తాకిడితో
అక్షరాల చెలిమి

చలనం లేని రాయికి
వస్తు వాస్తవ వైవిధ్య వర్ణాలతో
ఉలి శిల్పి సహచర్యం

పాషాణమైన మనసుకి
మెత్తని మమతలద్దిన ఒత్తైన ఊహల
రేఖల రూపాలు ఎన్నెన్నో

కవితా కన్నియకి
అలంకారమై భాసిల్లిన శిల్పకళ
తెలియని అక్షర అనుబంధం ఇదేనేమో...!!

14, డిసెంబర్ 2015, సోమవారం

వాస్తవ దర్శనాలు....!!

నేస్తం ....

     ఎలా ఉన్నావు ...?  పలకరింపులు చాలా దూరం జరిగాయి కదూ మన మద్యలో ... ఏంటో ఈ మద్య అందరూ వాస్తవాలు ఒప్పుకుంటుంటే నేను జరుగుతున్న నిజాలను చూస్తూ ఉండిపోతూ ఓ ప్రేక్షకురాలినయ్యా .. సరే ఇక నీకు ఆ వాస్తవ దర్శనాలు చూపించాలి... ఓ ... చెప్పాలి కదా ... ఆ మధ్యేమో ఓ పెద్దాయన పెద్ద మనసుతో తన అవార్డుని వెనక్కు ఇచ్చి తన దొడ్డ మనసుని చాటుకున్నారు.. ఓ మహా నటుడేమో తన నటనతో ఇంకా ఇక్కడే ఇలానే సహనంతో జీవించేస్తా అసహనంతో సహవాసం చేస్తూ తన సహనాన్ని దేశభక్తిని చాటుకుంటూ అంటూ.... ఇప్పుడేమో ఓ పెద్దావిడకి కొత్తగా తన కుటుంబ మూలాలు గుర్తుకు వచ్చాయి కాబోలు అమ్మగారికి ఇన్నాళ్ళుగా ఒక్కసారి వినిపించని అత్తగారి నామజపం ఇప్పుడు నోటివెంట వచ్చిందేవిటి చెప్మా... పక్కనే సముద్రం ఉంటే నిలువ నీడ లేక తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ఎంతో ముందుకు పోయాం ఈ సాంకేతిక యుగంలో అని గుడ్డి భ్రమలో బతుకుతున్న మనకు మరోసారి మానవ తప్పును ఎత్తి చూపి మనల్ని పరిహసిస్తోన్న ప్రకృతి...
పార్టీల ఫిరాయింపులు, ఫోన్ టాపింగులు, కుటిలత్వాలు, కుతంత్రాలు ... పైకేమో ఒకరికొకరు చిరునవ్వుల ఆహ్వానాలు ... మద్యలో ఎవరిని మోసం చేయడానికి..? కార్పోరేట్ స్కూల్స్ వాటికి ధీటుగా ఇప్పుడు కార్పోరేట్  ధవాఖానాలు... ఇసుక దందాలు ,  కొత్తగా కాల్ మని అంటూ హొరెత్తిస్తున్న న్యూస్ మీడియా .. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అంతం ఎక్కడంటావు .... అంతే కదా అదే నాకు తెలియక ఇక ఇప్పటికి ఇక్కడితో ఆపేస్తూ మరోసారి మళ్ళి పలకరించనా...

మా గల్ఫ్ డాట్ కామ్ లో .....!!

http://www.maagulf.com/view/3465/telugusahityam/

మా గల్ఫ్ డాట్ కామ్ లో నా వ్యాసం అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో అన్న ఊహ అనుకోండి వాస్తవం అని అనుకోండి ఎలా అనిపించిందో ... చెప్పండి
ధన్యవాదాలు 
 

8, డిసెంబర్ 2015, మంగళవారం

మా గల్ఫ్ డాట్ కామ్ వారి ఆన్ లైన్ లో చోటు చేసుకున్న నా అక్షరాలు...!!


మా గల్ఫ్ డాట్ కామ్ వారి ఆన్ లైన్ లో చోటు చేసుకున్న నా అక్షరాలు

7, డిసెంబర్ 2015, సోమవారం

కువైట్ ఎన్నారైస్ లో...!!

http://kuwaitnris.com/?p=150048

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ గారు కువైట్ ఎన్నారైస్ ఆన్లైన్ పత్రికకు నా పుస్తకం " అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు" గురించి రాసిన మాటలు పై లింక్ లో మీరు చూడండి... మనఃపూర్వక ధన్యవాదాలు ప్రతాప్ గారు ..

4, డిసెంబర్ 2015, శుక్రవారం

అక్షయ తూణీరం లా...!!

మంజు యనమదల గారికి ,
నమస్తే . మీ పుస్తకంపై నా అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నాను . 
అక్షయ తూణీరం లా మీ అక్షర సముదాయం 
అంతర్లీనంగా మనసు ప్రకంపనాన్ని 
బహిర్గతం చేసిన ఉత్తమ గేయకావ్యం 
సున్నితమైన మనస్సు ప్రతి అవరోదానికీ పడే బాధ 
ప్రతి కవితలో తొంగి చూస్తుంది 
ఆలంబననూ అనురాగాన్నీ కోరే 
స్వచ్చమైన స్ఫటికపు మది 
ప్రతిపదంలో ప్రతిఫలిస్తోంది 
మనసుపొరల్లో నిక్షిప్తమైన 
గాయాలే గేయాలుగా మారినై 
చీకటినుండి వెలుతురుకు 
ప్రయాణించే మనసుకద 
కనిపిస్తోంది అంతర్లీనంగా  మీ కవితల్లో 
మనోభావాల అలజడితో 
స్పందించే హృదయవేదన 
ధ్వనిస్తోంది రసావిష్కరణ తో . 
--------------------------------
సోదరుడు -భవభూతి శర్మ

3, డిసెంబర్ 2015, గురువారం

ఏక్ తారలు....!!

1. వెన్నెల వేసారింది_చీకటి పరదాలో నీ వెలుగులకై వెదకలేక
2.  వెన్నెలను విరజిమ్ముతున్నా_వేకువ  పొద్దులో నీ కోసమై
3. వెన్నెల తుణీరాల అలజడి మదికెరికైంది_నీ ప్రేమలో తడిచి
4.  జ్ఞాపకమై అలరించింది_గతాన్ని మరువనివ్వని గాయం
5. పగటి  కలైనా_ప్రాతఃకాలపు తలపుల్లో నిన్నువరిస్తూ
6. నీ గెలుపు వీక్షించాలని నిరీక్షిస్తున్నా_ఓటమిని వద్దని వారిస్తూ
7. అమాస అలికిడే లేదు_పున్నమి వాకిట్లో నీ తలపులు నావైతే
8. మలి సంధ్య మాయమైంది_వేకువ కిరణాల్లో నిన్ను చూపిస్తూ
9. మౌనమైన మనసు భావనలు_దాయలేని కన్నీటి సాక్ష్యాలుగా
10. పండు వెన్నెలే ప్రతి క్షణమూ_పక్కుమని నీ నవ్వులు వినిపిస్తుంటే
11. బాధ్యతలను వీడలేని బంధాలు_ మది బరువైన క్షణాల్లో
12. మది అరల్లో నిక్షిప్తాలు_జ్ఞాపకాల నిధులు
13. విరహం కనుమరుగైంది_వెన్నెల వాకిట్లో నిన్ను చూసి
14. నాకు ఇష్టం_నీ మౌనం నాతొ మాట్లాడటం
15. తగవులకు తావే లేదు_మౌనం మనసుతో మాటాడేటప్పుడు
16. నాకు అపురూపం_నేను నీ మౌనమైనప్పుడు
17. పిలుపులకు పండగే_పెదవులు నా పేరే పిలుస్తున్నప్పుడు
18. మౌనమూ మాటలు కలిపింది_నిన్ను కలిసిన సంతసంలో
19. నెయ్యానికి అలంకారాలు_ఆప్యాయతల విందులు
20. మనసు పడిన ప్రేమ_మధుర జ్ఞాపకంగా
21. స్వాతి చినుకునై చూస్తున్నా_మేలిముత్యంగా నీలో ఒదగాలని

2, డిసెంబర్ 2015, బుధవారం

డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సమీక్ష అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు పై...

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ's photo.ఆప్యాయత తో పంపిన శ్రీమతి మంజు గారి కవిత్వం పుస్తకం (అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదు )చదివాను . కొత్త ఒరవడి కవిత్వం ... అన్ని కవితలు చాల బాగున్నాయి .. మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను ... ధన్యవాదములు
అక్షరాల సాక్షిగా ... గెలిచారు
------------------------------
నిజమే ! ఆమె కవిత్వం లో గెలిచారు ... మనసు పై గెలిచారు ... అక్షరాల సాక్షిగా మంజు గారి కవిత్వం గెలిచింది . కవిత్వం మనసు లోతుల్ని తట్టి చూపిస్తుంది . మనసు లోతులను తవ్వి చూపిస్తుంది ... తట్టి లేపుతోంది .. అదే మంజు గారి || అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు || కవిత్వం . నా అనే భావన మెదడు తెరపై చిత్రం లా కనిపించేట్టు ప్రతి కవితా ఊహా జనితంగా ఉన్న్నాయి . కొన్ని కవితల్లో ప్రతి ఒక్కరు
(స్వా )గత చిత్రాలను నెమరు వేసుకోక తప్పదు
"అలసిన గుప్పెడు గుండె ఆరాటం
ఆగిన మెదడు పోరాటం "
వంటి మంచి లయాత్మక వాక్యాలు పాఠకుడి ని ఆలోచింప చేస్తాయి . మెదడులో నిత్యం జరిగే ఆలోచనలు, ఆకర్షణలు , ఘర్షణలు , ఆవేశాలు ఒకదానికొకటి పెనవేసుకున్న సంఘటనలను చెప్పడం జరిగింది . అందుకే కాబోలు "గెలుపోటముల రెక్కలు ఎక్కడో ?" అని ప్రశ్నిస్తారు . మనసు - మనిషి .. ఈ రెండింటి మధ్య మానసిక సంఘర్షణలను బేరీజు వేసి కవిత్వం చెప్పడం లో మంజు యనమదల గారు ప్రసంశ నీయులు .
ఈ అక్షరాల ..... కవితలో
"సగం ఎండిన వేపచెట్టు నీడలో సేద తీరుతూ
గతించిన జీవితం రాల్చిన కన్నీటి చె మ్మలో వేదించే మదికి
వేకువ పిలుపులో తొలి పొద్దు సంతకాలు ... జ్ఞాపకాలు "
నిజంగా మంచి రసాత్మక వాక్యాలు అందించగలిగారు . అద్బుతంగా కవిత్వాన్ని మలిచారు .
"మూసుకున్న ఆ రెప్పల మాటున
ఒలుకుతున్న భావాల ఒరవడి
జారుతున్న కన్నీటికి సాక్ష్యం (అంతర్ముఖం )
కళ్ళల్లో సజీవ సాక్ష్యాలన్నీ రెప్పల మాటునే దాచుకున్న బాధలతో ఒక వేదన చెప్పగలగడం ఒక మానసిక విశ్లేషణకు అడ్డం పడుతోంది .
"అక్ష రం ఏడుస్తోంది ...
మనసు భావాలకు రూపాన్ని చెక్కే శిల్పి
చేతిలో ఉలి తానైనందుకు' .. అక్కడక్కడ కవితల్లో నిరాశ , నిస్పృహలు కనిపించిన అవి మనసు పడే ఆవేదనగా చెప్పవచ్చు
"ఏకాంతం లో నాకు నేనుగా ... ఇష్టంగా !"
నిజమే శిధిల జ్ఞాపకాలు చిద్రమైతే ఒంటరితనం కూడా ఇష్టం గా మార్చుకోక తప్పదు . ఇలా ఎన్నో కవితలు మనసు తలుపు తెరిచి చూపిస్తాయి .
మంజు గారు మంచి మనసున్న మనసు కవి "" అక్షరాల సాక్షిగా
నేను ఓడిపోలేదు "కవిత్వం ఒక సైకాలజీ ఎనాలసిస్ కూడా !. అందుకే ఆమె అక్షరాలకు ఓటమే లేదు. నిత్యం కవిత్వం లో మంజు గారిదే గెలుపు .
అభినందనలు
- డాక్టర్ కత్తిమండ ప్రతాప్ 

మనఃపూర్వక కృతజ్ఞతలు ప్రతాప్ గారు .. ఒక మెచ్చుకోలు కరువైన ఈ రోజుల్లో మీ అభిమానానికి మాటలు రావడం లేదు .. నేను చాల అదృష్టవంతురాలిని .. మీ వంటి పెద్దల రాతల్లో నా కవిత్వం కనిపించినందుకు .. _//\\_

1, డిసెంబర్ 2015, మంగళవారం

దాటేయాలని ప్రయత్నిస్తున్నా...!!

అంపకాల పంపకాలు
నిన్నో మొన్నో అయినట్లున్నా
పారాణి అడుగుల ఆనవాళ్ళు 
అక్కడక్కడా ఎండి కనబడుతున్నా
పచ్చని తాటాకు పందిరి
కాస్త వడబడి రంగు తగ్గినట్టున్నా 
పెళ్ళికి వచ్చిన చుట్టపక్కాలు
ఎక్కడివాళ్ళక్కడ సర్దుకుంటున్నా
గుండె గదిని ఖాళి చేయని
నీ జ్ఞాపకాల గుభాలింపులన్ని తరుముతూనే ఉన్నా
వాస్తవాలను వాయిదా వేయలేని
మనసుపై గీసిన అసంపూర్ణ చిత్రంగా మిగిలున్నా
మదిపై  రాసిన మరణ శాసనాన్ని
వదలలేని గతాన్ని దాటేయాలని ప్రయత్నిస్తునే ఉన్నా...!!

30, నవంబర్ 2015, సోమవారం

మణి మాలికలు....!!

1. రాతిరి తెరలు కమ్మాయి
   నీ జ్ఞాపకాల రహస్యాలకు.... 
2. రహస్యం కనుమరుగైంది
  నువ్వు నాలో చేరిన క్షణం
3. రహస్యం రాయబారానికొచ్చింది
   నువ్వు చేసిన అలికిడికి అదిరిపడి

24, నవంబర్ 2015, మంగళవారం

నిలువెత్తు సాక్ష్యం...!!

నేస్తం...
            పలకరించి చాలా రోజులయినా నువ్వు నా పక్కనే ఉన్నావన్న అనుభూతి... " అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదనడానికి " నిలువెత్తు సాక్ష్యం నువ్వే కదా... సభ దిగ్విజయంగా జరగడానికి అనుబంధాలు, అభిమానాలు ఒకదానికి ఒకటి పోటి పడ్డాయి... పెట్టని ఆభరణమైన ఆత్మీయత ఎక్కడ చూసినా కనువిందు చేసింది... నా అక్షరాలకు సార్ధకత చేకూరినట్లు అనిపించినా ఏదో చిన్న వెలితి నన్ను వెన్నాడుతోంది... నిజాయితీ లేని స్నేహం చేస్తూ... అవసరానికి నటిస్తూ డాలర్లలో/డబ్బులో జీవితాన్ని చూసుకుంటూ సమయమే లేదంటూ కాలాన్ని కావలి కాస్తున్నామనే భ్రమలో క్షణాలకు బంధీలై చెలిమిలో మమతకు చరమ గీతం పాడుతున్నామన్న సంగతిని మరచి పోతున్నారు... అమ్మను, అమ్మ భాషను ఎద్దేవా చేసే వారికి స్నేహం ఒక లెక్కా అంటావా ... అది నిజమే మరి.. నాది అత్యాశ కదూ...
      ఈ మద్య కాలంలో కాస్త మత్తులో పడివున్న అక్షరాలను వెలికి తెద్దామంటే ఒకరంటారు కవిత్వమంటే మీరనుకునే మది పడే ఓ బాధా వీచిక కాదు.. ఆకలేసినా ఆనందం అక్షరాల్లో కనిపించాలి అంటారు.. కాలే కడుపుకి ఆకలి కేకలే కవిత్వంగా అంకురిస్తాయి కాని కలువల అందాలు, చందమామ చక్కదనాలు, ఆకాశంలో ఊహల హార్మ్యాలు అవతరించవు కదా... మనసు మమేకకమైన భావనలో నుండి జీవమున్న కవిత జనిస్తుందన్నది నా అభిప్రాయం మాత్రమే... ఎందుకంటే సిద్దాంతాలు, పరిణితులు, పరిపక్వత వంటి పెద్ద మాటల కవిత్వాలు నాకు తెలియదు... ఏదో నాకొచ్చిన నాలుగు పదాలతో నాలుగు వచనాల కవితలే అనుకోండి రాద్దామనుకుంటే ఇన్ని లక్షణాలు చెప్తున్నారు కనీసం ఒక్కటీ తెలియదాయే మరి నే కవిత అనుకున్న రూపంలో రాయాలా వద్దా అని ఎటు తేలని సందిగ్ధం... అవార్డులు రివార్డులు ఆశించేంత అత్యాశ లేదు... నాలుగు వచనాలు రాసుకోనిస్తే వాటికో నాలుగు లైకులు వస్తే చాలు... రాకపోయినా పర్లేదు...
  మరో విషయం నాకు నా మాతృ భాషే సరిగా రాదు అలాంటప్పుడు పరాయి భాషలలో ప్రావీణ్యం ఎలా సంపాదించగలను..? అందుకే అమ్మ భాషలోనే ప్రయత్నాలు చేస్తున్నా... తప్పయినా ఒప్పయినా సరిదిద్దుకోవచ్చని... మమకారం అనేది మనం పెంచుకుంటే రాదు స్వతహాగా కొందరికి దేవుడు ఇచ్చిన వరం.. అది భాష మీదైనా... బంధాలపైనైనా... కొందరు ఆంగ్లంలో బాగా రాస్తారు... మరి కొందరు తెలుగు ఇలా ఎవరికి నచ్చిన భాషలో వారు భావాన్ని వ్యక్తీకరిస్తారు... దానిలో తప్పేం లేదు ఎవరి భాష వారిది కానీ ఎక్కడా ఒకరినొకరు కించ పరచుకోరు... మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే కవిత్వాన్ని అది వచన కవిత్వాన్ని మరీ చిన్నచూపు చూడటం... ఒక పుస్తకం వేయాలంటే దాని ఆవిష్కరణకి కనీసం ఆ ఆవిష్కరణకు రావడానికి దానిలో నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా వ్యాపార పరంగా లాభాన్ని ఆలోచించే కొందరు మేధావుల చేతుల్లో రాను రాను భాష, భాషను నమ్ముకున్న సాహిత్యం ఏమవనుందో అని ఒకింత భయంగా ఉంది... !!

20, నవంబర్ 2015, శుక్రవారం

ఏక్ తారలు...!!

1.కాలపు గిచ్చుళ్ళు_నువ్వు వదలిన జ్ఞాపకాలుగా నాతోనే మిగిలి పోతూ
2.వెన్నెలకెంత వేడో_నువ్వు వదలి వెళ్ళినా ఇంకా నాతోనే ఉండి పోతూ
3.ఒయారం వలసొచ్చినట్లుంది_ నీ రాక తెలిసినందుకేమో

14, నవంబర్ 2015, శనివారం

కృతజ్ఞతా వందనాలు _/\_.....!!

తెలుగంటే చిన్న చూపు అదీకాక వచన కవిత్వమంటే కూటికి గుడ్డకు రానిదని చాలా మందికి ఉన్న అభిప్రాయం.. అవసరానికి ఆంగ్లం తప్పనిసరి అయిన ఈరోజుల్లో అమ్మ భాషలోని కమ్మదనాన్ని అమ్మదనాన్ని ఎంతమంది ఆస్వాదించ గలుగుతున్నారు..? వచ్చిరాని ఆంగ్లాన్ని అవసరానికి మించి వాడేస్తే మనకేదో బోలెడు చదువు వచ్చు అనుకుంటారని అనుకోవడం పొరబాటు.. భాష అనేది భావాలను ఇతరులతో పంచుకునే వారధిగా కావాలి.. హంసలదీవిలో ఉన్నా అమెరికాలో ఉన్నా మన భావాలను ఇతరులకు అర్ధం అయ్యేటట్లు చెప్పలేక పొతే ఆ భాష ఎంత గొప్పదయినా పనికిరానిదే అవుతుంది...అమ్మ భాషలోని మాధుర్యం, మమకారం పరాయి భాషలో పట్టుకుందా మన్నా దొరకదు...  
నన్ను చాలా మంది చిన్న చూపు చూశారు అలా అని నేను అమ్మ భాషనూ వదలలేదు.. అమ్మను వదులుకోలేదు... మాటలు రావన్నారని మాటలు మరచిపోలేదు .. నా ముందే వెకిలిగా నవ్వారు పట్టించుకోలేదు... ఎప్పటికయినా గెలవాలన్న తపన ఉండేది.. నా కోసం నేను రాసుకున్న నా అక్షరాలు నాకు అందించిన ఓదార్పు కానివ్వండి, ధైర్యం అనుకోండి .. దానికి ఏ పేరు పెట్టినా 500 పై చిలుకు ఉన్న కవితల్లో 135 కవితలను "అక్షరాల సాక్షిగా... నేను ఓడిపోలేదు " అన్న వచన కవితా పుస్తకంగా ఆవిష్కరిస్తే.. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆత్మీయుల అభిమానం ముందు కనీ వినీ ఎరుగని రీతిలో అక్షరానికి ఓటమే లేదని నిరూపించారు... ప్రత్యక్షంగా.. పరోక్షంగా అభినందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతా వందనాలు _/\_ ....!!

ఏక్ తారలు ....!!

1. మౌనం అడ్డు పడుతోంది_మనసు మాటకు చిరునవ్వును తోడు వద్దంటూ
2. పువ్వుల పరిమళాలు వ్యాపిస్తున్నాయి_నీ పలుకుల తీయదనంలో తడిసి
3. జ్ఞాపకాలుగా మిగులుతూ_గత వైభవ చిహ్నాలుగా
4. నీ స్నేహానికి నయగారాలు పోతున్నాయి_నా నవ్వుల

13, నవంబర్ 2015, శుక్రవారం

ఈ నాలుగు కెరటాల చైతన్యం అభినందనీయం...!!

తీరం దాటిన నాలుగు కెరటాలు.... అంటు సరి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు నలుగురు కవులు...    కవిత్వం అంటే తెలియకుండా రాసే నేను ఈ నాలుగు కెరటాలు నిజాన్ని తెలిపే అబద్దాన్ని అక్షరబద్ధం చేసిన తీరుని హర్షించలేకుండా ఉండలేక పోతున్నాను.. ముందుగా ఈ నలుగురికి మనఃపూర్వక అభినందనలు...
ఇక సముద్ర లోతుల్లోనికి తొంగి చూస్తే... ముందుగా ఆ తీరం లో... ఈ తీరానికి ఆ తీరానికి దూరాన్ని కొలిచే సాధనంగా ప్రేమను చూపించడంతో పాటు రెండు మనసుల మద్యన వారధి కట్టడానికి అడ్డంకులను అధిగమించేవి జ్ఞాపకాలని అందంగా చెప్పారు అనిల్...
ఓ ఆయిల్ కవిత్వంలో ...  మెకానిక్ కోటు వెనుక దాగిన కవి రాసిన ఆయిల్ మరకల నుంచి పగిలిన ఆత్మల్లో జారుతున్న భావప్రాప్తి పొందలేని  భావనలోని భావానికి  ఉద్వేగానికి తోడిచ్చి సిరాతో చెలిమి చేస్తూ దాగుతూ వీగిన తీర్మానంలో చెప్పడం నరేష్ కుమార్ గారి ఘనత...
ఫ్లోరైడు ఫలితాలు కవితలో... జీవితంలో నేతల నజరానాకు నేలతలిచ్చిన ఫ్లోరైడు నీళ్ళు తాగి బతుకు బలి అయినప్పుడు, కదలలేక ఆత్మీయుల చీదరింపులను తట్టుకుంటు దగ్గరకు రాని మృత్యువును రమ్మని బతిమాలుతు తెలంగాణా యాసలో వర్ణలేఖ రాసిన ఈ కవిత చదువుతుంటే ఆ జీవితాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..
చైతన్య రాసిన సత్యాన్వేషి కవిత మరో మనిషిని మేల్కొల్పుతుంది... ఆ మనిషి ఏం చేయాలో దిశా నిర్దేశం చేస్తుంది....
ఊరి చివర కవితలో... ఒక అంగట్లో అతివ మల్లెపూలను అన్నం మెతుకులుగా మార్చుతూ శరీరాన్ని రోగాలమయం చేసుకుంటూ కూడా కోపాల తాపాలను భరిస్తూ తనది కాని జీవితాన్ని ఎలా పరిచిచిందో అర్ధం అవుతుంది...
మానవధర్మం లో జీవితాన్ని నిర్వచించిన తీరు బావుంది...
నేను దేముడూలో... చచ్చిపడిన జ్ఞాపకాలు, ఆలోచనల శవాలు మనసు పొలిమేరల్లో లెక్కపెట్టడం... బాల్యాన్ని యవ్వనాన్ని, ప్రేమను, వాదాన్ని, వాగ్యుద్దాన్ని చర్చించుకోవడం బావుంది...
ముంగురులు... దాగని జ్ఞాపకాలను ముంగురుల నుంచి జారనీయకుండా దాయడం బావుంది...
కవి మనిషే.. కాని కవి సమయమే తిరగబడ్డ కాలమై పోతుంది .... కవిత జననం ఎలా ఉంటుందో తనదైన శైలిలో చెప్పారు నరేష్..
అతను ఊరెళ్ళాడు కవితలో... పుట్టుకతో వచ్చిన బొట్టు పూలు తీసేస్తూ భర్త చనిపోతే భార్యను విధవను చేయడాన్ని అద్భుతంగా చెప్తూ సమాజాన్ని ప్రశ్నించారు...
మట్టి పొయ్యి, ఛాయ్ తో అనుబంధాన్ని ఎంత బాగా చెప్పారో .... పెళ్ళితో నిజమైన ప్రేమను పొందిన ఆనందాన్ని ఐ హేట్ యు లో చెప్పారు... సమాజంలో పాతేయబడిన మానవత్వాన్ని వాడెప్పుడు అంతే లో చూపించారు..
అ - అమ్మ చదువుతుంటే ఎందుకో తెలియని ఒక ఆర్తి, వేదన రెండు అనిపించాయి.. ఈ కవిత విశ్లేషించే అంత పరిజ్ఞానం నాకు లేదనిపించింది...
డబల్ రొట్టె అందరి జ్ఞాపకాలు గుర్తుకు తెస్తుంది యాస వేరుగా ఉన్నా ... నేను శకుంతల బడుగు జీవితాలను చూపించింది.. వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడు - జాగ్రత్త  హెచ్చరికగా చెప్పడం బావుంది.. తుపాకి రాముడు తెలంగాణా యాసలో బావుంది.. స్తబ్ధతలో విషాదం నిర్లిప్తత బాగా చెప్పారు.. పాడుపడ్డ బావిలో కామందుల దురాగతాలకు బలైన జీవితాలకు సాక్ష్యంగా మూసేసిన బావి... నీరింకిన బావిలో ఆశలన్నీ వలలోపడిన చేపలతో పోల్చడం.... సశేషాలులో మనసు దాపులకొచ్చే మరి కొంత మందిని ప్రేమతో ఆహ్వానించడానికి .. ఓడిపోతున్నా లో కలుక్కుమనే గుండె గూడుని అదిమి పట్టి జ్ఞాపకాల భారాన్ని అక్షరాల్లోకి అనువదించలేక పోవడాన్ని ఒప్పుకుంటూ .. అద్దం నిజాన్ని చూపించే ఏకైక సాధనం... నన్ను నేను పారేసుకున్నా అంటూ అంతులేని ప్రశ్నలు వేసినా ... నీ కోసం లెక్కలన్నీ పూర్తయ్యాయా అన్నా... నాలుగు సిరా చుక్కలు ఓటమి చూడక హతోస్మి అంటూ ఇంకెన్నాళ్ళు ఎందుకు కనుక్కోలేదో అని వారిరువురు గోస పెట్టినా మనం మళ్ళి పుడదాం మా కిటికిలోఒక  చంద్రుడికి వీడ్కోలు పలుకుతూ శ్రీ శ్రీ అంతటి మహా కవి చూపిన దారిలో హిరోలా మరో ప్రపంచం పైపు అడుగులు వేస్తూ నువ్వింకా మారలేదు అనే ఒకే నాణానికి బొమ్మలా ఒక తిరోగమనంలో కాకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తూ ఒక కళాకారుడుగా కాకుండా మై హిరో అనిపిస్తూ తొలి చూపులోనే ఎందుకంటే నేను కవిని అని గుర్తు చేస్తూ చివరిగా ఓ సారి ఏకాంతంతో సహవాసం చేస్తూ 100%ఇండియన్ అని గుర్తు చేస్తూ వానొస్తే నేను జానీవాకరు ష్ నిశబ్దం మాతోనేం రందిరా మీకు ఎందుకు రాములా ఈ అవసరం అంటూ అన్నా ఓ బహుమతి లో ఆశయాల బాధని పరిచయం చేసిన ఈ నాలుగు కెరటాల చైతన్యం అభినందనీయం...!!

9, నవంబర్ 2015, సోమవారం

మీ చిరునామా .....

నా  కవితా సంపుటి " అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదు" కావాల్సిన వారు దయచేసి ఈ పోస్ట్ లో స్పందనలో మీ చిరునామా ఇవ్వగలరు .. వీలుని బట్టి పుస్తకం పంపిస్తాను...

మధుర జ్ఞాపకం....!!

నా పుస్తకావిష్కరణ సందర్భంగా ఆంద్ర జ్యోతి లో వెలువడిన ఎప్పటికి మరచిపోలేని మధుర జ్ఞాపకం...  

మణి మాలికలు....!!

1. నిన్ను కోల్పోయాకే...
   నేను లేని సంగతి తెలిసింది....!!
2. నిన్ను కోల్పోయాకే...
   జీవించిన క్షణాల లెక్కలు గుర్తొచ్చాయి...!! ( మొదటిసారి నాకు గెలుపు రుచి తెలిసింది  పూరణంలో )

3. నిన్ను కోల్పోయాకే...
   మౌనపు సాంగత్యంలో నీ మాటలు వినడం అలవాటయ్యింది...!!

ఏక్ తారలు.....!!

1. వలపు ఒయాసిస్సుకు తోడైన శిశిరం_గ్రీష్మాన్ని నిశబ్దంగా ఉండమంటే ఎలా
2. నిశబ్దం నీలా ఉంటే_శీతలం శిశిరాన్ని వెనక్కెళ్ళమందిట
3. నీ ప్రేమ నిశబ్ద జలపాతమైతే_నా ప్రేమ ఒయాసిస్సులా ఊపిరి పోస్తుంది

7, నవంబర్ 2015, శనివారం

కవితా సంపుటి ఆవిష్కరణ...!!

ఆత్మీయంగా అలరించిన ఆత్మీయుల అభిమాన ధనానికి దాసోహమైన "అక్షరాల సాక్షిగా .... నేను ఓడిపోలేదు"
కవితా సంపుటి ఆవిష్కరణ నిజంగానే ఆత్మీయుల అభిమానం ముందు గర్వంగా వెలుగు చూసింది. ఇందరి అభిమానానికి నోచుకున్న నా అక్షరాలు ఓడిపోలేదు అని సవినయంగా మనవి చేస్తూ... తెలియక ఏమైనా చిన్న చిన్న పొరపాటులు చేసి ఉంటే పెద్ద మనసుతో మన్నించమని కోరుకుంటూ అక్షరాలకు సాక్ష్యాలుగా మేమున్నామని చెప్పిన మీ అభిమానానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను....

6, నవంబర్ 2015, శుక్రవారం

తెల్లకాగితాన్ని...!!

దాగుండి పోతున్నాయి
దోసిలి పట్టని అక్షరాలు
మది చాటుగా నిలువలేక
చేతన మరచిన ఆచేతనలో
వివశత్వాన్ని పరచుకుంటున్న
భావాలకు బంధీలైన భావుకతను
వెన్నెల్లో దాటేస్తున్న వేకువ పొద్దును
పట్టుకోవాలని పడే తాపత్రయాన్ని
చూస్తున్న సిరా ఒలకని తెల్లకాగితాన్ని...!!

4, నవంబర్ 2015, బుధవారం

మీరే చెప్పండి..!!

ఏమిటోనండి ఈ కార్పోరేట్ అన్న పదం వింటుంటేనే చీదరగా అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో... మొన్నీమధ్య
కార్పోరేట్ స్కూల్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో నాలుగు మాటలు చెప్పాను... ఎంత చెప్పొద్దు అనుకున్నా వెధవ మనసు ఉండబట్టి చావడం లేదు.. కార్పోరేట్ దవాఖానాల గురించి కాస్త నాలుగు మాటలు మాట్లాడాలి... ఇప్పుడు వచ్చిన ఇన్షూరెన్స్ కంపెనీల వలన నాలుగు రోజులు హాస్పటల్ లో ఉంటే పద్నాలుగు రోజులకు బిల్లులు పెట్టి ఘరానాగా దోచేస్తున్నారు.. ఒక హాస్పటల్ అని లేదు అన్ని కార్పోరేట్ హాస్పటల్స్ ఇలానే ఉన్నాయి... మనకేమో ముందు 40000 అని చెప్పి సంతకాలు అక్కడా ఇక్కడా పెట్టించేసుకుని 140000 బిల్లు తో 5 రోజులు అవసరం లేక పోయినా హాస్పటల్ లో ఉంచేసి అది వస్తే కాని పంపము అని మరో 3 రోజులు ఉంచుకుని ఆ డబ్బులు కూడా మనమీదే నవ్వుతు వేసేసి కట్టమంటుంటే ఏం చేయాలి ఈ ఘరానా మోసగాళ్ళను... చదువుతో వ్యాపారం ఒకరు... చదువు కొని ఆ కొన్న డబ్బులు రావడానికి ఈ తెలివి ఉపయోగిస్తుంటే ఇలాంటి సమాజాన్ని భరిస్తున్న మనదా తప్పు లేక ఆ తప్పుల్లో మనకు భాగముందని సరిపెట్టుకుని నలుగురితో నారాయణా అంటూ బతికేద్దామా మీరే చెప్పండి..!!
( ఇది ఓ సంఘటన మాత్రమే... ఇలాంటివి రోజు కోకొల్లల్లు )

3, నవంబర్ 2015, మంగళవారం

మణి మాలికలు...!!

1. ముసుగులో దాగిన ముగ్ధత్వం
కలల కళ్ళలో స్వాభిమానం.....!!
2. దాయాలన్నా దాగని అందం
  ముసుగు చాటుగా దోబూచులు...!!
3. మూర్ఖత్వపు ముసుగులో
    మోసబోయిన ముదిత...!!

29, అక్టోబర్ 2015, గురువారం

ఆహ్వానం....!!




హితులకు... సన్నిహితులకు ... అందరికి ఇదే నా ఆహ్వానం...

27, అక్టోబర్ 2015, మంగళవారం

వెక్కిరిస్తున్న చేవ్రాలు....!!

కోల్పోయిన జీవితపు ఆశలన్నీ
మూకుమ్మడిగా దాడి చేస్తూ
ఊపిరి సలపనివ్వని అయోమయంలో
పడవేసి ప్రశ్నల శరాలు సంధిస్తూ
నన్ను నా ఎదురుగా నిల్చోబెడుతున్నాయి
నాలో నిద్రాణమైన మరో మనిషి సమాధానం కోసం
సశేషాలుగా మిగిలిన అవశేషాల ఆంతర్యాన్ని
వినలేని నిశ్చలత్వాన్ని అంది పుచ్చుకున్న
మూసిన మది తలుపుల ఆవల దాగిన
వసుదైక తత్వాన్ని నిదురలేపే యంత్రాలు ఎక్కడని
వెదికే యత్నంలో కాలిపోయిన కోర్కెల దాహానికి
ఆనవాలుగా నిలచిన మసి బారిన అద్దంలో
వెక్కిరిస్తున్న చేవ్రాలు కనిపించింది నవ్వుతూ...!!

15, అక్టోబర్ 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. రాజీ పడిపోయింది రాజ్యాంగం_అధికారం చేతుల్లో నలిగి
2. వాసంతం పక్కనే ఉంటే_నువ్వు నాతోనే ఉన్నావని సంబరపడుతున్నా
3. నీ జ్ఞాపకాలలో బందీనై_జీవితమే తెలియలేదు 
4. నిదురెక్కడ నాకు_కలలోనూ నువ్వేనాయే
5. ఊటబావి మన జ్ఞాపకాల గతం_నీకు తెలియంది కాదుగా
6. సముద్రాల 'సు'దూరాన్ని_కలిపెను మూడుముళ్ల బంధం

6, అక్టోబర్ 2015, మంగళవారం

ఏక్ తారలు...!!

1. అక్షరాల ఆహార్యం అలాంటిది_అలుకలు కినుకులు అన్ని బలాదూరే
2. అన్ని మరచి అక్షరాలూ_నీతోనే ఉండి పోయాయి అందుకేనేమో
3. అక్షర చెలిమికి విలువ కట్టగలమా_వేల జన్మలు ఎత్తినా
4. పల్లవై పరిమళ రాగం ఆలపిస్తోంది_అక్షర చెలిమికి దాసోహమై
5. అన్నం పరబ్రహ్మ స్వరూపం_వాణీ నిలయం ఏక్ తారా సమూహం
6. ఓటమిలో విజయం_ఒక్క అక్షరానికే సాధ్యం
7. ఆద్యంతమూ మిగిలిపోయేది_అక్షర జన్మమే
8. నీ మనసు తీయదనంతో_బతుకు పయనంలో మనిద్దరమై

5, అక్టోబర్ 2015, సోమవారం

మాటల మడుగు గురించి నా మాటలు....!!

మెర్సీ ఈ మాటల మడుగు పుస్తకాన్ని ఇస్తూ అభిప్రాయాన్ని రాయండి అన్నప్పుడు ఆ ఏముందిలే పుస్తకం చదివితే రాయలేనా అనుకున్నా.. నా అభిప్రాయం తప్పని చదువుతుంటే తెలిసింది..నిజంగా చెప్పాలంటే నాకు అభిప్రాయం రాసే అర్హత ఉందో లేదో తెలియదు కాని ఓ నాలుగు మాటలు మాత్రం రాయాలని అనిపించింది...
కొట్టివేత చదువుతుంటే నిజంగానే కొట్టివేతల నుంచి మళ్లి కొత్తగా పుట్టుకు రావడం నిజం అనిపిస్తూ... మాటల మడుగులో మాటలు నోటి నిండా ఒకప్పుడున్నా ఆచేతానావస్థలో ఘనీభవించిన ఎన్నో జీవితాల్లోని మాటలను చూసాను.. నన్ను నేను చూసుకున్నాను.. ప్రశ్నల గది ప్రతి ఒక్కరికి అవసరం అని చదివిన ప్రతి ఒక్కరికి అనిపించక మానదు.. చీకటి దీపాన్ని చాలా కొత్తగా అనంతాకాశం ఏకాంతరాగం ఆలపించే వేళ చీకటిలో రంగుల దృశ్యాన్ని చూపడం మెర్సికే సాధ్యమైంది.... హృదయపు మెతుకులో చిదేమేసిన ఆలి అంతరంగాన్ని బహు చక్కగా చెప్పారు.. మాట్లాడనిమ్మని భాషకు నదికి అనుసంధానం చేస్తూ , మనుష్యుల మధ్య జరుగుతున్న పైచాచికత్వాల పరాకాష్టను చూపించారు... కవులు కాగితం, మనవి వీటిలో మనసు అక్షరాలుగా  కవి  కాగితంపై మిగిలిపోవడం అంటూ , మాటలు మనకు మనవి చేస్తున్న విశ్రాంతి గురించి ఎంత గొప్పగా చెప్పారో... సగం కొట్టేసిన చెట్టు నుంచి వచ్చిన మొలక ఆడా.. మగా అని విత్తనపు వీర్యంలో అడగడం అర్ధవంతంగా ఉంది.. కాడంబరిలో కలను హృద్యంగా వర్ణించారు... రాతిరి పగలు గురించి తలాష్ లో అమర్త్యకేకలో అంతరించి పోతున్న ప్రకృతి గురించి... ఖాళీలు మంచివే అంటూ చక్కని భావాలను ప్రసవించడానికి ఖాళీని ఆహ్వానించడం... అమరసత్యంలో ఎందఱో కోల్పోయిన బాల్యాన్ని... వెన్నెల స్నేహితాలో తీయని చెలిమిని.. వీడ్కోలు ఎంతగా బాధిస్తుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు... చిప్కోలో చెట్టు మనసుని.. తన్హాదిల్ లో ఇద్దరి మద్య దూరాన్నిఅక్షరాల వెన్నెల తాళ్ళతో ముడేసారు.. కొత్త ఆకాశంలో కవి మదిలో మెదిలే భావాన్ని.. తనతోనే నేను చదువుతున్నప్పుడు మనం కూడా ఆ  భావాల్లో తాదాత్మ్యం చెందిపోతాం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు... నాకు బాగా నచ్చిన కవిత ఇది.. మిగిలిపోయిన దారం మనం వదలి వేస్తున్న బంధాలకు సాక్ష్యంగా మిగిలి పోతుంది.. దోసిలిలో నదిని ఎంత బాగా చూపించారండి.. నవ్వులు, మాటలు,మైలురాళ్ళు, మనిషి మాయాజాలం, ముగిసే పరిచయం, అవసరం,జీవితానికి కూడికలే కాకుండా అప్పుడప్పుడు తీసివేతలతో పని ఉంటుందని, గాజు మనసు, మనం చూడలేని ఎన్నో ఎద లోతుల్ని, ఉలిక్కి పడుతున్న ఊరి తలుపుల్ని,మరణం కనిపిస్తే కబురెట్టమని, సముద్రాన్ని అంబరాన్ని కలపడంలో చాలా లోతైన భావాలు... కొన్ని సామాజిక సంఘటనలకు స్పందనలు, పాదముద్రల్లొ కొందరి కథలు, స్వగతాలు, ఓటమి  గెలుపుల మధ్య, కాలాన్ని ఎలా కాల్చేస్తున్నాం అని, చెప్పకూడదు అంటూనే చెప్పిన మాటలు కొన్ని... లాలిపాడుతూ జోకొట్టిన చివరి కవిత... అన్ని వెరసి మెర్సీ మనసును అందులోని భావాక్షరాలను చూపించాయి...తప్పక  చదవాల్సిన ఓ మంచి కవితా సంపుటి "మాటల మడుగు" అనడంలో ఏ మాత్రం సందేహం లేదు...
ఇంత చక్కని మాటల మడుగును గుర్తుంచుకుని నాకందించిన మెర్సికి కృతజ్ఞతలు...

3, అక్టోబర్ 2015, శనివారం

"తల్లి లాంటి శిక్షణ - తండ్రి లాంటి రక్షణ" ...!!

ఏవిటో ఈ కార్పోరేట్ చదువులు ... నలుగురితో పాటు నడవక తప్పదని మనమూ తప్పక పిల్లల జీవితాలను కట్టడి
చేయాల్సి వస్తోంది.. "తల్లి లాంటి శిక్షణ  - తండ్రి లాంటి రక్షణ" అని పేరుకి మాత్రమే కాప్షన్లు పెట్టి వేలకు వేలు డబ్బులు దండుకోవడమే తప్ప కనీసం తిండి కూడా సరిగా పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది...కనీసం మజ్జిగో పెరుగో తిని సరిపెట్టుకుందామన్నా తినలేనంత పులుపు.. పగలు రాత్రి పప్పుతో తినాలి.. పోనీ బట్టలు సరిగ్గా ఉతికిస్తారా అంటే అది లేదు ఇలా ముంచి అలా తెచ్చేస్తారు... ఏదో చదువు బాగుంటుంది అని మనం చూస్తుంటే దానితో వ్యాపారం చేస్తూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు... పేరుకి మాత్రం రామన్ భవన్ కాని నీతి నియమాలు వారి ఇష్టం.. పత్రికల్లో టి విలలో ప్రకటనలు, ఇంటర్వూలు ఇచ్చుకుంటే సరిపోదు... కాస్తయినా తీసుకుంటున్న డబ్బుకి న్యాయం చేయాలి... పది మందికి ఒక బాత్రూం, దానిలో లైట్ ఉండదు, పేరుకి రూంలో ఏ సి ఉంటుంది కాని దానికి చల్లదనం ఎలా ఉంటుందో తెలియదు... ఎప్పుడు ఏ వస్తువులు పోతాయో తెలియదు... దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియని వింత సామ్రాజ్యం అక్కడ.. చెప్పినా పట్టించుకునే నాధుడు ఎవరు ఉండరు... ఇలా చెప్పుకుంటూ పొతే చాట భారతమే అవుతుంది... మన కార్పోరేట్ చదువుల ని(వి)లయాల సంగతి...
 ఈనాడు చడువునే స్థితి నుంచి చదువు కొనే పరిస్థితికి దిగజారాం మనం... దీనికి కారణం ఎవరు..? మనమే పెంచి పోషిస్తున్న ఈ కార్పోరేట్ చదువులు.. కాదంటారా...!!

2, అక్టోబర్ 2015, శుక్రవారం

మణి మాలికలు...!!

1. మరుపునే మర్చిపోతే సరి
ఎప్పుడు గుర్తుగానే ఉండిపోతుంది
2. ప్రాణమే నీలో కలిసాక
జీవశ్చవాన్ని నేనుంటేనేం లేకుంటేనేం
3. కన్నీళ్ళు నిండిన కళ్ళకు
నీ రూపం కనపడదేమోనని
4. దిగులు దుప్పటి చుట్టేసింది
   నీ వియోగాన్ని పరిచయిస్తూ  
5. దిగులుగా సాగుతోంది కాలం  
నువ్వు దగ్గరగా లేని క్షణాలను భారంగా లెక్కిస్తూ
6. అలిగిన దిగులు తీరాన్ని తాకింది
 నువ్వు నాలో చేరావని తెలిసి  

ఏక్ తారలు...!!

1. తడిమే తలపులు నిరంతరం_మనసు మెచ్చిన మధుర జ్ఞాపకాలే
2. అమ్మడి ఓరచూపులుండగా_ఇక వేరే ముళ్ళు ఎందుకనుకున్నాడేమో విధాత
3. ఆనందానికి అతిశయం తోడైనందుకేమో_పుడమి పులకరింత
4. అది జన్మ రహస్యం_భరతావని పుట్టుకకు కారణజన్ముని కోసమే శాకుంతల
5. పలకరింపుల ప్రహసనాలు_పడి లేచే కడలి కెరటాలు
6. అంతరంగం అద్దమైంది_నీ చదరంగపు ఎత్తుల్లో పడి

1, అక్టోబర్ 2015, గురువారం

పునఃపరిచయానికి....!!

గతాన్ని దాచేసి వాస్తవాలను ఓదార్చే
నా అహం చిన్నబోతోందెందుకో 
నీ జ్ఞాపకాల్లో నేను లేనని కాబోలు
ఎప్పుడో పలకరించిన నవ్వులు
వెలాతెలా పొతున్నాయెందుకో
నువ్వు మరచిన క్షణాలు
నాకు గుర్తున్నందుకేమో
కాలంలో కనుమరుగైనా
గుప్పెడు గుండెలో దాగి
పిడికెడు ప్రేమగా మెదిలే
పలకరింతల పునఃపరిచయానికి
ఎదురుతెన్నుల గవాక్షమై
మది ఆరాట పడుతోంది
మాయని మమతలను
నీకు కొత్తగా పరిచయిద్దామని...!!

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఏక్ తారలు ...!!

1. ఏకాంతానికి సాయమైనందుకేమో_కాంత శోకానికి నెలవిచ్చింది 
2. ప్రేమ సంకెళ్ళలో బందీలే ఇరువురూ_గెలుపోటములు ఎవరివైనా
3. అనుమానం నాకన్నా ముందే పుట్టిందని తెలిసి_ఏ'కాంతం'తో పరిహాసాలా
4. జీవిత ఖైదీలుగా_ఈ జన్మకి ప్రేమ సంకెళ్లకు

28, సెప్టెంబర్ 2015, సోమవారం

మాకు ఏ న్యాయ స్థానాలు అవసరం లేదు....!!

మన జాతి రత్నం భగత్ సింగ్ పుట్టినరోజు ఈరోజు... ఎందఱో అమరుల త్యాగ ఫలితం నేడు మనం అనుభవిస్తున్న
స్వాతంత్ర్యం... ప్రజాస్వామ్యం అని, లౌకిక రాజ్యమని మనం మురిసి పోతున్న ఈ భరతావనిలో ఓటు హక్కుకు ఉన్న విలువ ఏమిటి..? మనం ఎన్నుకున్న నాయకులు వారి వారి స్వప్రయోజనాల కోసం గెలిచిన తరువాత పార్టీలు మారుతుంటే, పలాయనవాదులౌతుంటే ఓటు వేసిన పాపానికి తలను దించుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంటే దానికి పరిష్కారం ఎక్కడ..? పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యమా... తప్పును అడ్డుకునే హక్కు ఓటు వేసినవాడికి లేక పోవడం ఎంత దురదృష్టకరం... అత్యున్నత న్యాయ స్థానం కూడా కర్ర విరగకుండా పాము చావకుండా తన చాతుర్యాన్ని చూపిస్తుంటే ఓటు వేసినందుకు శిక్షగా కనీస న్యాయానికి నోచుకోని సామాన్య జనం సంగతి ఏమిటి..? ఒక పార్టీలో గెలిచి వేరొక పార్టీలోనికి వెళ్ళే కనీస నైతిక విలువలు పాటించని నాయకులు మనకు అవసరమా.. వీళ్ళనా మనం ఓట్లు వేసి గెలిపించేది... గెలుపుకు ముందు గుర్తు రాని పార్టీ గెలిచిన తరువాత గుర్తుకు వస్తుంది... కాని ఓటు వేసి గెలిపించిన సామాన్యుడు గుర్తు ఉండడు... కనీసం ఎందుకు అని అడిగే కనీస హక్కు కూడా లేనప్పుడు ఈ ఎన్నికలెందుకు... మాకి కంటితుడుపు ఒట్లేందుకు...? జనం ఓట్లతో గెలిచి మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తే మిమ్మల్ని  గెలిపించిన జనానికి ప్రతినిధిగా మీకు సభలో కూర్చునే హక్కు ఎక్కడిది..?
      పార్టీలు మారే ప్రతి ఒక్క నాయకుడు ఎన్నికలకు ముందే ఎందుకు పార్టీ మారరు..? గెలిచాక మీరు మారాలి అనుకుంటే ఎన్నికల ఖర్చు మొత్తం కట్టి మీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అప్పుడు మీరు కావాలనుకున్న పార్టీ లోనికి మారి మళ్ళి ఎన్నికలు పెట్టించుకుని అప్పుడు మీ గెలుపు చూసుకోండి... మాకు అభ్యంతరం ఉండదు ఇలా చేస్తే మీరు ఎన్ని సార్లు పార్టీలు మారినా... పేరు కోసం డబ్బు కోసం పార్టీలు పెట్టి మీకు కావాల్సినంతా దండుకుని పదవి కోసం పార్టీలను వేరే పార్టీలలో విలీనాలు చేయడం, నీతి వాక్యాలు వల్లించడం చూస్తుంటే చూసే వాళ్లకి వినే వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకైతే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది...
     ఆ ఏం ఉందిలే ఈ పిచ్చి జనం నాలుగు రోజులు పొతే అన్ని మర్చిపోతారు ... మళ్ళి ఎప్పుడో 5 ఏళ్ళకు ఎన్నికల్లో మనం ఏ పార్టీనో వీళ్ళకు గుర్తుంటుందా ఏంటి ... అప్పటికి మనకే గుర్తుండి చావదు మనం ఏ పార్టీనో... రోజుకో పార్టీ మారుస్తూనే ఉంటామాయే అప్పుడు నాలుగు డబ్బులు ఓ మందు సీసా పడేస్తే వాళ్ళే వేసేస్తారు ఓటు అనుకుంటే సరి పోదు... మీరు అనుకునే ఆ సామాన్యుడే సాయుధమైన ఓటుని ఆయుధంగా చేసి మీ నడతకు తగిన బుద్ది చెప్తాడు... మాకు ఏ న్యాయ స్థానాలు అవసరం లేదు ఒకసారి మోసపోతాం కాని ప్రతి సారి మోసపోము.. ఈ పార్టీల ఫిరాయింపులను మేమే అడ్డుకుంటాం... జాగ్రత్త ..!!

26, సెప్టెంబర్ 2015, శనివారం

నాదేం లేదు దీనిలో అధ్యక్షా...!!

    ఎవరో రావాలి.. ఏదో చేయాలి  అని ఎదురు చూస్తూ మన తప్పులకు ఎన్నో అన్నెం పున్నెం ఎరుగని అభాగ్య జీవులను బలి చేస్తూ దానికి రాజకీయ రంగులను పులుముతూ ఎవరో అన్నట్టు శవాలతో రాజకీయాలు చేసే స్థాయికి ఈరోజు మనం దిగజారి పోతున్నాం.. మనం అనుకుంటాం ఆఁ ఏం పోయింది మనం వేసేది ఒక్క కాగితమే కదా ఏం అవుతుందిలే అని.. కాని అలా పేరుకు పోయిన చెత్తే ప్రాణాలతో చెలగాటమాడుతుంది..
   సమస్య మనదైనప్పుడు పరిష్కారం మనమే చూసుకోవాలి... ఎప్పుడో ఆ కాలంలో యద్దనపూడి గారు చెప్పినట్టు ఈ దేశం మాకేమిచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వలేక పోయినా పర్లేదు మనమైన సమాజానికి మన వంతుగా ఏం చేస్తున్నాం అని ఓ క్షణం ఆలోచిస్తే... అసలు సమాజం వరకు ఎందుకండీ మన ఇంట్లో వరకు మనం చూసుకుంటే చాలదూ... ఏదో కాస్త సమాజాన్ని అప్పుడు చూడొచ్చు... చిన్న చిన్న సమస్యలను మనమే పెద్దవిగా చేసేస్తూ దానికి వేరేవరినో బాధ్యులను చేసి న్యాయం కావాలి అంటే ఏ దేవుడు న్యాయం చేస్తాడు.. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎవరికి వారు కనీసం కొన్ని నియమాలు ఆ దేశ పౌరులుగా ఉన్నందుకు పాటిస్తారు... మనం ఓటు వేయడానికి డబ్బు తీసుకుంటుంటే వాళ్ళు అదే ఓటు వేయడానికి డబ్బు కడతారు చూసారా చిన్న తేడా వాళ్లకి మనకి మధ్య...
    ఈ ప్రత్యేక హోదాలు, ధర్నాలు వీటి వల్ల మనకు కొత్తగా ఒరిగేదేం లేదు... వాటికి ఖర్చు పెట్టే డబ్బుతో కాస్త సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తే జనాలు పది కాలాలు గుర్తుంచుకుంటారు...మాట మాట్లాడితే సింగపూర్, జర్మనీలు తిరగకుండా ఆ డబ్బు కొద్దిగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తే మరోసారి గెలవడానికి పనికివస్తుంది...
ఇదండీ నేడు మన పరిస్థితి.. అందుకే నేను చెప్పొచ్చేదేటంటే " ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా... నిజం మరచి నిదురపోకుమా" అని మన పెద్దోళ్ళు చెప్పిన మాటే ఓ పాలి గుర్తుచేసాను అంతే... నాదేం లేదు దీనిలో అధ్యక్షా...!!

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

మణి మాలికలు...!!

1. విజేతనై నిలవాలనుంది
ఓటమిని ఎదిరించి
2. విజేతనై నిలవాలనుంది
వీడలేని మన చెలిమి సాక్ష్యంగా
3. విజేతనై నిలవాలనుంది
ఓడిన మదిని నీ జ్ఞాపకాల చెలిమితో ఓదార్చుతూ

19, సెప్టెంబర్ 2015, శనివారం

వాస్తవాధీన రేఖలు...!!

          జీవితమే ఒక పాఠశాల...ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి పాఠాలు... అందుకేనేమో ఆది అంత్య గురువు జీవితమే అవుతోంది... పరిచయాలు, అనుభూతులు, అనుబంధాలు, అభిమానాలు, ప్రేమలు, ఇష్టాలు, కోపాలు, ఆవేశాలు, రోషాలు, అహంకారాలు, ఆత్మాభిమానాలు.... ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో కలగలిపిన జ్ఞాపకాలు మనతో కడవరకు ...
           నిజాన్ని నిర్భయంగా చెప్పలేని జీవితాలు.. చెప్పినా ఒప్పుకోలేని వాస్తవాధీన రేఖలు... అబద్దంలో బతికేస్తూ అదే నిజమని భ్రమ పడుతూ సరి పెట్టుకుంటూ లేదా సరి పుచ్చుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తున్న సత్యాన్ని మరచిన సమాజ జీవులు.. జీవశ్చవాలు అనాలేమో..చేజార్చుకున్న క్షణాలు మరలి రావని తెలిసినా మళ్ళి మళ్ళి జారవిడుచుకుంటూనే కోల్పోయిన జ్ఞాపకాలను నిద్రపుచ్చే ప్రయత్నంలో సఫలీకృతులెందరు అన్నది కాలం తేల్చాల్సిన లెక్కలు...
            మన తప్పులను మర్చిపోయి ఎదుటివారి తప్పులను బూతద్దంలో చూసే సంస్కృతిని బాగా ఒంట పట్టించుకున్న అహం మనది.. మనకు లేని మంచి లక్షణాన్ని కాస్త కూడా ఎదుటివారిలో చూడలేని గొప్పదనం మనది...మనకి మనమే సత్య హరిశ్చంద్రులం అనుకుంటూ నిజం మనకి తెలిసినా దాన్ని నిద్ర పుచ్చుతుంటాం... అది లేచి గొంతు విప్పితే మన దగ్గర సమాధానం ఉండదు కనుక... 
            ఏవిటో నటించేస్తూ బతికేస్తున్నాం... మన కన్నా అందరు గొప్ప నటులే అనుకుంటూ...నిజాయితీగా బతికే నాలుగు క్షణాలు మరణానికి ముందేనేమో... లేదా నటించి నటించి అప్పుడు కూడా నటనలోనే జీవించేస్తామేమో... నటించలేమంటూ పారిపోయిన అక్షరాలను పట్టి తెచ్చి ఇక్కడ కూర్చోపెట్టడానికి నా తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి...!!

మణి మాలికలు....!!

1. గమ్యానికి గమ్యమే
అగమ్య గోచరమయిందట ఎలా చెప్మా...!!
2. గమనానికి గమ్యం అవసరమే
అమ్మ నుండి తప్పిపోయిన పాపాయికి ఆలంబనలా...!!
3. గగనానికి చేరువైన గమ్యం
గతి తప్పిన నా జీవన గమనానికి సాక్ష్యంగా..!!

ఏక్ తారలు...!!

1. చీకటికి చోటిచ్చిన సూర్యుడు_జాబిలి రాకకు వెన్నెల పరుస్తూ
2. నిరీక్షణలో తీక్షణ ఎక్కువై_తలపులకు పంచేస్తూ చల్లబడే విరహం
3. వసంతానికెప్పుడు విరహమే_చల్లదనంలో తాపాన్ని రగిలిస్తూ
4. వెన్నెలకు వన్నెలద్దుతూ_జాబిలితో రాయబారం
5. వన మయూరి విహారానికి_వసంత యామిని స్వాగతాలు

17, సెప్టెంబర్ 2015, గురువారం

ఏక్ తారలు...!!

1. వీడని బంధమే మనది_ముల్లోకాల సాక్షిగా
2. తారాచంద్రుల సమక్షంలో_కలయికకే కొత్త అర్ధాలు చెప్తూ
3. మృత్యువుదే ఓటమి_మరణంలో సైతం మనలను విడదీయ లేక
4. నీ నవ్వుల్లోని సిగ్గుల దొంతర్లను దొంగిలించింనందుకేమో_జాబిలికి ఆ వన్నెలు
5. అక్షరాల్లో ఒలికిన భావాలు ఒల్లకుంటాయా_చుట్టమై చేరి చుట్టుముట్టేయవూ
6. సూదంటురాయిలా చురుక్కుమంటున్నాయి_మౌనమైన నీ మది భావనలు
7. నీకు మనసిచ్చా_నైరాశ్యానికి సెలవింక
8. కాలంతో క్షణాల పోటి_సెలవుకు నెలవు లేకుండా నిరంతరం నీ ధ్యానంలో
9. ఆలోచనలు శూన్యానికి చుట్టమైపోయాయి_మనసు (సం)ఘర్షణకు తావులేకుండా
10. మనసూ మారకద్రవ్యమే_ప్రేమను కొలిచే సాధనంగా మారి
11.  అష్ట సఖులు మన చెలిమిలో_ఇష్ట సఖులై ఇష్టంగా

14, సెప్టెంబర్ 2015, సోమవారం

ఓ చిరునవ్వు....!!

ఎనకిటికేనాడో మనకన్నా సీనియరును...  మళ్లీ పరీక్ష పోయిందని పలకరించిన పాపానికి, ఏమి తెలియని ఆ అమాయకత్వానికి ప్రేమ అని పేరు పెట్టి చామంతులు విసిరిన ఆ క్షణాలు గుర్తు వస్తే ఓ చిరునవ్వు రాకుండా ఉంటుందా చెప్పండి -:)... తరువాత వాళ్ళకు క్లాసు తీసుకోవడం అన్నది వేరే సంగతి అనుకోండి...
జ్ఞాపకం గుర్తు వస్తే మోనాలిసా నవ్వులా ఉండాలి కాని గాయమై వేదించ కూడదు... నిరంకుశత్వానికి చిరునామాగా మిగిలే ఏ సంఘటనా ఓ చక్కని జ్ఞాపకం కాలేదు.. ఇష్టం, ప్రేమ రెండు వైపులా ఉండాలి.. అంతే కాని బలవంతంగా తీసుకునేది ప్రేమ కాదు... " ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా" అన్న త్యాగం ఉండాలండి ప్రేమలో ఉన్న ఇష్టానికి... అవునంటారా... కాదంటారా...!!

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఏక్ తారలు....!!

1. వెన్నెల వగలు పోతోంది_చిరునవ్వుల నయగారాలకు
2. వాలు చూపులకు వల విసిరింది_పదాల భావాలకు బందీగా మారి
3. ఏక్ తార ఒకటైనా_భావాల వర్షమే నిరంతరం
4. వలలు వేస్తున్నా_వలపై వచ్చి వాలతావని
5. వేణువుకు జన్మనివ్వడానికి_వెదురు పురిటి నెప్పుల రాగాలు
6. అక్షరాలకెంత ఆనందమో_భావాలలో ఒదుగుతున్నందుకు
7. సూదంటు రాయిలా నీ ఆకర్షణ_సుతిమెత్తగా తాకినందుకేమో
8. ఏకాంతానికి సెలవంది_ఏక్ తారగా నా మదిని దోచిన భావాల ఝురి
9. ఏక్ తార_ఎదను పరిచే అక్షర సితారగా
10. ఆ పలకరింపే_దూరానికి దగ్గరకు ఉన్న తేడా తెలుపుతూ

9, సెప్టెంబర్ 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. తారలెన్నయినా_ఏక్ తారలదే తారాపధం
2. ఏక్ తారలతో వైద్యం_నవ్వుల సందళ్ళు నట్టింట
3. వందనాలకు వంగని వైనం_ఆత్మీయతకు తలొగ్గుతూ
4. కవ్వింతలే తారలన్నీ_కలల వాకిళ్ళకు తలుపులు తెరుస్తూ 
5. ఏక్ తారలో గీతా సారాన్ని చూపాలనేమో_అష్టమిన అవతరించింది
6.వలపుల వల్లరులే_తారల సింగారాల నయగారాల్లో
7. అల్లరి పరవళ్ళ ఆటలు_ ఆనందాల సరి జోడిగా ఏక్ తారా సందడిలో
8. పదిలపరచుకున్నాను అనుబంధాన్ని_పది జన్మలకు తోడుగా
9. జ్ఞాపకాల తడి తడిమింది_స్నేహానికి చేరువగా చేయి అందిస్తూ
10. అమాయకత్వంలో ఆహ్లాదం_విడువలేని పసితనపు ఛాయలు
11. నయగారాల నెలవులు_నాలుగేళ్ల సంబరాల ఏక్ తారల అందాలు
12. స్వరాలు ఏడైనా_'సు'స్వరాల సంగమం ఏక్ తారల పుట్టిల్లు
13. ఏక్ తారగా పుట్టినా_ఎల్లలు లేని తారా పధాలు ఈ ఏక్ తారలు
14. వాణీ వీణా నాదాలు_ఆస్వాదించే మనసుల పద సితారలు
15. అక్షరాలే ఆభరణాలు_భావాలకు మెరుగులు అద్దుతూ
16. ఊహల వాస్తవమే_ఏక్ తారా అందాల ఆకృతి
17. పసిడి మొహం చాటేసింది_ఏక్ తారల మేని మెరుపుకు వెరచి
18. ఎందరెదిగినా_తల్లి వేరు ఒక్కటే ఏక్ తారగా

5, సెప్టెంబర్ 2015, శనివారం

ఈ జీవితం మొదలయింది....!!

ఖాళీ ఐపోయింది ఎక్కడో
మెదడు పొరల్లోనో, మనసు అరల్లోనో
మొదలైన శూన్యం ఆగలేనంటూ
భావాలను తాకినందుకేనేమో...
అక్షరాలు అస్త్ర సన్యాసం స్వీకరిస్తూ
జ్ఞాపకాలను దారి మళ్లిస్తూ
అనంతానికి చేరువగా చేరిన కలలు
చీకటికి చోటిచ్చి వెలుగుపూలను వెలివేసి
 కాలానికి సంకెళ్ళు వేస్తూ...
నిశబ్దానికి మాటలు నేర్పాలని
ఏకాంతానికి మనసును ఒప్పచెప్తూ
ఒంటరితనానికి రాజీనామా చేసే
ప్రయత్నానికి చెలిమి సవ్వడిని
పరిచయించే అడుగుల తడబాటును
నింపడానికి ఈ జీవితం మొదలయింది....!!

గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు...

జీవితంలో తొలి గురువు అమ్మతో మొదలై నడతను నేర్పిన నాన్న, చదువుతో పాటుగా లోకజ్ఞానాన్ని నేర్పిన ఎందఱో గురువులకు నా వందనాలు... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ ...
అందరికి గురుపూజాదినోత్సవ శుభాకాంక్షలు...

2, సెప్టెంబర్ 2015, బుధవారం

అందరు సత్య హరిశ్చంద్రులే....!!

నేస్తం,
            పలకరింతలు లేకుండా విషయానికి వస్తున్నా.... నాకెందుకో నేను నాకే నచ్చడం లేదు ఈమధ్యన... ఎక్కడో విన్నట్టు గుర్తు... " తనని తాను ఇష్టపడలేని వాడు ఎదుటివారిని కూడా ఇష్టపడలేడు " అని... నిజమేనేమో కదా ఈ మాట... మనం మాత్రం దాచుకోవాలి ... ఇతరులవి అన్ని మనకు తెలియాలి అనుకోవడం ఎంత వరకు సమంజసం..? అందరు మనలాంటి వాళ్ళే కదా... మరి ఎందుకు ఈ ముసుగు వేసుకోవడమో అర్ధం కావడం లేదు ... అందరికి సమస్యలు ఉంటాయి... అందరం చేసేది జీవిత యుద్దమే తప్పదు ఈ బతుకు పోరాటం... కనీసం మనతో మనం కూడా నిజాయితీగా ఉండలేనప్పుడు ఈ బ్రతుకుకే అర్ధం లేదు... వేసుకున్న ముసుగు ఎప్పుడో ఒకసారి జారిపోతుంది.. అప్పుడైనా వాస్తవాన్ని మనం చూడక తప్పదు...
ఆడ మగ మధ్య స్నేహం తప్పు కాదు.. పరిధులు దాటనంత వరకు ఏదైనా బావుంటుంది... ఈ విజాతి దృవాల ఆకర్షణలో పడటానికి, ఎవరి మీదో జాలి పడి, లేదా మాయ మాటల్లో పడి జీవితాలు అధోగతి పాలు  కాకుండా చూసుకుంటే అందరికి మంచిది... మన అన్న వాళ్ళ బాగోగులు పట్టించుకునే క్షణం తీరికైతే ఉండదు కాని పై పై ప్రేమల బాగోగులు మాత్రం ఎంత బాగా కనుక్కుంటామో....మనకి అందరు తెలియాలి కాని మన గురించి ఎవరికీ తెలియ కూడదు అని మన స్నేహాన్ని సైతం దాచేయాలంటే ... మనకున్న స్నేహితులని బట్టే మనం ఏంటో తెలుస్తుంది అని భయమేమో... సమస్య మనదైనప్పుడు  మనమే బాధ్యత తీసుకోవాలి కాని మరొకరి జీవితాన్ని సమస్య లోనికి నెట్టడం సరి కాదు.... నాలుగు కల్ల బొల్లి కబుర్లు చెప్పి నలుగురి జాలిని సంపాదించి బతికేద్దాం అంటే ఎలా కుదురుతుంది... " ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు " అన్నట్టు బయట పెట్టక మానరు.... లేదా బయట పడక మానదు.... అప్పటి వరకు అందరు సత్య హరిశ్చంద్రులే....అందరితో సరే కనీసం మీతో మీరు నటించకుండా ఉండటానికి ప్రయత్నించండి... ఇవి అన్ని చూస్తూ నేను అలా అయిపోతానేమో అన్న భయంతో నాకు నాకు నేను నచ్చడం లేదేమో నేస్తం....!!

ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తం...!!

విభజనల కష్టాల్లో, నిధుల లేమితో అల్లాడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆపన్న హస్తాన్ని అందిస్తున్న మిషన్ అమరావతిలో భాగంగా... శ్రీ పల్లె రఘునాధ్ రెడ్డిని, శ్రీ పరకాల ప్రభాకర్ గారిని కలిసిన ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు
ముఖ్య మంత్రి ఎన్ ఆర్ ఐ లకు ఇచ్చిన పిలుపుకు స్పందించి  2002 లో విజన్  2020 ఫర్ డెవెలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ సెక్టార్లో సూచనలు అందించి రవాణ శాఖ, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల ఉపయోగంతో పలు అభివృద్ధికి బాటలు వేసిన అప్పటి సూచనలకు...అనుసంధానంగా ఇప్పటి అమరావతి రాజధాని నిర్మాణానికి చేయూత, ఆర్ధిక వనరులను అందించడానికి ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకు వచ్చి గుప్త గారు మరిన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు, అభివృద్దికి విదేశాల నుంచి చాలా శ్రమలకు ఓర్చి పలుమార్లురాష్ట్ర నాయకులను, ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని కలవడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం.... అద్భుతమైన ప్రాజెక్ట్ మానేజ్మెంట్ నైపుణ్యంతో విదేశాల్లో పలు అవార్డులు అందుకున్న మన తెలుగు వారైన గుప్త గారి సేవలు వినియోగించుకుని ఆంధ్ర రాజధాని నిర్మాణమే కాకుండా ... రహదారుల నిర్మాణంలోను, సహజ వనరులను ఉపయోగించడంతో ఆర్ధిక ఒనరులు పెంచుకోవడానికి , రాష్ట్రాన్ని సాంకేతిక పరంగా ముందుకు తీసుకు  వెళ్ళడానికి వినియోగించుకోవడానికి మన నాయకులు సంసిద్దత తెలియపరచాలని కోరుకుందాం...!!

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

చదువుల కోసం అందించిన చేయూత...!!

గత ఎనిమిది ఏళ్ళుగా మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రష్ట్ చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం చదువుల కోసం అందించిన చేయూత.....

28, ఆగస్టు 2015, శుక్రవారం

అక్షరాల సాక్షిగా..... కవితా సంపుటి.....!!

అక్షరాల సాక్షిగా..... కవితా సంపుటి త్వరలో  మీ ముందుకు రాబోతోంది....
ఆదరించండి... ఆశీర్వదించండి

27, ఆగస్టు 2015, గురువారం

అనుబంధపు ఆనవాళ్ళై ....!!

రాలిపోయిన స్వప్నాల్లో
కాలిపోయిన జ్ఞాపకాలు
వద్దన్నా నిత్యం వెన్నాడుతూనే

మనసుని వీడని మమతల్లో
ముడేసుకుపోయిన బంధాలు
గతాన్ని వదలని వాస్తవాలకు బంధీలై

ఎటెళ్ళినా ఎదను తడిమే గురుతులతో
కొలువుదీరిన కన్నీటి చుక్కల పేరంటాండ్లు
చీకటి సీమంతానికి పిలువని పేరంటంలా

వెతల కతల వారధిగా
కలత కలల కాపురం చేస్తున్నాయి
నా అక్షరాల అనుబంధపు ఆనవాళ్ళై ....!!

26, ఆగస్టు 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. జ్ఞాపకాలు నడయాతూనే ఉన్నాయి_నీతో ఉన్న గతాన్ని మరువలేక
2. వెదురు గాయాలను ఓర్చుకున్నందుకే కదా_వేణువుగా మాధవుని చేరింది 
3. ఎండమావులని తెలియక ఆశ పడ్డా_గాయం చేసిన గతాన్ని మరచి
4. గాయాలను మరచిన గుండె_గంపెడాశతో భవితను రమ్మంది
5. గాయపడినా వేణువు గానం_శ్రావ్యంగా ఎద ఎండమావిని తడి చేసింది
6. గాంధర్వానికి గొంతెండి పోయింది_గతంలో ఎండమావులను తలపోస్తూ
7. వెలసిన రంగుల్లో బతుకు_ఎడారిలో ఎండమావై
8. రంగుల కలగానే మిగిలిపోయింది_మనసు గాయాలను మాన్పలేక
9. గతాన్ని మరచినా_గాయపు ఆనవాళ్ళు మిగిలే ఉన్నాయి
10. లేపనాలేన్ని పూసినా_గాయం జ్ఞాపకంగా ఉండి పోయింది కాలంతో పాటుగా

25, ఆగస్టు 2015, మంగళవారం

మరోసారి మూల్యం చెల్లించక తప్పదు...!!

తన వాళ్ళు అధికారంలో ఉండగా కనిపించని జనం సమస్యలు ఈ రోజు భలే కనిపిస్తున్నాయి కొందరు పెద్దలకు... ప్రకృతి వైపరీత్యాలకు, విష జ్వరాలకు కూడా ధర్నాలు చేస్తూ జనం కోసం తెగ దిగులు పడి పోతున్నారు... మరి కొందరేమో నేను పార్టీలకు అతీతం జనం కోసమే నా జీవితం అంటున్నారు... అబ్బా సామాన్య జనానిది ఎంత అదృష్టమో... ఇందరి అభిమాన సంద్రంలో ఊపిరి ఆడక కొట్టుకు పోతున్నారు... ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో.... పదవిలో బాబులేమో మా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలన్నా అంటూనే మీకు కావాల్సిన నిధులు ఇప్పిస్తాం అంటుంటే కనీసం మాట్లాడటానికి సమయం లేదని అంటున్నారు... ఇదండీ ఇప్పటి నాయకుల నైజం.. చూసారా మనం ఎంత గొప్ప నాయకుల సంరక్షణలో ఉన్నామో.....ఆనాడు నల్లమల అడవుల్లో అమాయకులను నక్సలైట్లు అని ముద్ర వేసి విషాహారం పెట్టి చంపించినప్పుడు జనం గుర్తుకే రాలేదు... ఈనాడు ఓదార్పు యాత్రలు, జనం కోసం నా జీవితం అంటూ ఒట్టి మాటలు.... ఎప్పుడో ఒకసారి నిద్రలో కలలా జనం గుర్తుకు వచ్చి నేను ఎవరి బానిసను కాదు రైతుల పక్షమే అని నాలుగు రోజులు ట్విట్టర్ లో ట్వీటులు.... దేశాల చుట్టూ కేంద్రం చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తూ కల్లబొల్లి కబుర్లు చెప్తూ జనం సొమ్ము వృధా చేస్తున్న వారు... ఇవండీ ఇప్పుడు జరుగుతున్న తంతులు... ఎవరికి వారికి మేము జనానికి గుర్తులో ఉండాలి అనే తప్ప జనం కోసం తపన కాదు....
సామాన్యుని నిత్యావసరాలు తీర్చలేని ఈ నాయకుల ఓదార్పులు, ధర్నాలు, పాద యాత్రలు, బొమ్మల్లో చూపించే రాజధాని ఇలాంటి సినిమాలు రేపు మళ్ళి ఎన్నికల్లో గెలవడానికి పనికిరావు ఏ ఒక్కరికి.... జనానికి కావాల్సింది వారి నిత్యావసరాలు... కనీసావసరాలు తీర్చగలిగే నాయకులు, పాలక పక్షం... నేను నా పదవి పదిలం అనుకుంటే అది పొరపాటే అవుతుంది.... దేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తే మరోసారి మూల్యం చెల్లించక తప్పదు...!!

ఏక్ తారలు...!!

1. విరహం సెలవంది_అందాలకు బంధీగా మారి
2. కలల హార్మ్యాలకు రాదారి_నిదురించే మది అంతరంగం
3. అంతరంగం అనురాగమయమే_వలపుల విరహం దరి చేరితే
4. నిన్ను చూసే కాబోలు_వార్ధక్యానికి యవ్వనం వచ్చింది
5. ప్రేమామృతం అందాలంటే_విరహపు గరళం తప్పదేమో
6. వెన్నెల ఆరబెట్టుకుంటోంది_విరహపు వర్షానికి తడిసి ముద్దైనందుకు

23, ఆగస్టు 2015, ఆదివారం

సంతోషం సన్యాసం తీసుకుంది....!!

ఎప్పుడు పలకరించే
దిగులు దుప్పటిని
కాదనలేని నిస్సహాయత
కలల కళ్ళను సైతం
శూన్యానికి పరిచయిస్తూ
మదిని కప్పుతున్న చీకటి
శూలాల్లా తాకుతున్న
శరాల ఘాతాలు
చీల్చుతున్న అంతరంగపు గోడలు
ఆవృతంలో ఆనందాన్ని
నమ్ముకున్న గుండెకు
తగులుతున్న గాయాల గతాలు
మేమూ నీతోనే ఉన్నామంటూ
అప్పుడప్పుడు చెప్పాపెట్టకుండా
వచ్చి చేరే వరద గోదారులు
వలస పోయిన నవ్వుల
సంతకాలు దొరకని జీవితానికి
శెలవంటూ సంతసం సన్యానానికి చేరింది....!!

22, ఆగస్టు 2015, శనివారం

ఏక్ తారలు....!!

1. తారలెదురు చూస్తున్నాయి_కమ్ముకున్న శున్యానెప్పుడు చిదేమేద్దామా అని
2. అనుబంధాలు అల్లాడుతున్నాయి_చరమాంకంలో చేయూత లేక
3. నిద్దరోతూనే ఉన్నా_కలలు కానరావడం లేదెందుకో మరి
4. గ్రీష్మం తాపంలోనే ఉండి పోయింది_తొలకరి వలపు తెలియక
5. నిశబ్దమూ మౌనమయ్యింది_మన మధ్య తాళ లేక
6. భావ రాగాలకు దాసోహమయ్యింది మది_గువ్వలా నీ గుండెలో ఒదిగి పోతూ
7. వెలుగుల తారలు వచ్చాయిగా_ఇక చీకట్లకు సెలవే మరి
8. అబద్దం అందమైనది_అద్దంలో నీ రూపాన్ని చూపిస్తూ
9. అద్భుతమైనది జీవితం_హాయిగా అనుభవిస్తే
10. ఒక్కొ చినుకే_వేల జీవాలకు ప్రాణాధారంగా
11.  మనసు సంతసించింది చాలదూ_తన ఊపిరిని అక్షరాల్లో చూస్తున్నందుకు
12. గాలితో చేరినా_నీ జ్ఞాపకాలు అనుక్షణం నాతోనే

21, ఆగస్టు 2015, శుక్రవారం

మణి మాలికలు....!!

1. మౌనమూ మాటలు నేర్చింది
నీ స్పర్శకు పరవశమౌతూ
2. మొదటగా ముద్దిడిన ఆ స్పర్శ
అమ్మతనానికి అందిన అద్భుత కానుక
3. మనసుకు తెలుసు నీ జ్ఞాపకాల్లో
మౌనానికి మాటల వెల్లువ ఎంతో

ఏక్ తారలు....!!

1.నీ ఎడబాటూ నాకు హాయే_జ్ఞాపకాలతో ప్రతి క్షణం నాకు దగ్గరగా ఉంటూ 
2.కట్టుబడి వుంటావుగా_మనసుతో మమేకమైన చెలిమికి
3.ఆషాఢ మేఘాలు తొలగాయి_శ్రావణానికి స్వాగతమిస్తూ
4. చెలిమి చేయూత_జగడానికి వీడ్కోలు చెప్తూ

18, ఆగస్టు 2015, మంగళవారం

ఏక్ తారలు....!!

1. అలజడికి అందకుండా పోయినందుకేమో_అలుక ఎక్కువైంది
2.  ఎన్ని మాటల ముత్యాలో_నీ చిరునవ్వులో రాలుతూ
3. అక్షర లక్షలెన్ని సమకూర్చాలో_నీ భావాల ఆకృతికి
4. ఒక్క చెలిమి చాలదూ_వేల జన్మల వసంతాల రాకను గుర్తు చేయడానికి
5. ఆరు ఋతువులు అలిగాయి_ ఏడో ఋతువు ఏకాంతం ఐనందుకు
6. నిర్భయ చట్టముందిగా_సొతంత్రానికి జెంకెందుకు
7. నిశిలో వచ్చింది కదా_నిదానంగా బయటకొస్తుందేమోనని వేచి చూస్తున్నా
8. అవును మరి_అ'హింస'లో హింస ఉంది కదా
9. అర్ధ రాత్రొచ్చింది కదా_పగలు తిరగనివ్వరని భయం కాబోలు
10. మూగబోయింది మువ్వన్నెల ఝండా_స్వేచ్చను బానిసగా చేస్తున్నందుకు
11. మనం పీల్చుతున్న ప్రాణ వాయువులో_త్యాగ ధనుల జీవాలెన్నో
12. అవినీతిని ఓటుతో కొన్నా_నోటుతో పెంచి పోషిస్తూనే ఉన్నాము
13. కన్నీళ్ళు కావవి_జ్ఞాపకాల చెమరింతలు ఏకాంతానికి

15, ఆగస్టు 2015, శనివారం

నువ్వే చెప్పు ఏం చేయాలో.....!!

నేస్తం,
          నీకు తెలుసా.... ఈ రోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజట.. అసలు మనకంటూ ఓ స్వాతంత్ర్యం ఉంటే  కదా మన దేశానికి వచ్చేది... ఆనాడు తెల్లవాడు దేశాన్ని పాలించాడని వాడిని మన దేశం నుంచి వెళ్ళిపొమ్మని మన దేశాన్ని మనకు ఇమ్మని అడిగిన ఎందఱో మహా ధనుల త్యాగ ఫలితం ఈనాటి మన భారత దేశం... కాని వచ్చిన స్వతంత్ర్యాన్ని మనం ఎలా నిర్వచించుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పుడు ...
          ఎలా చూసుకున్నా ఇప్పటికి మన మీద గెలుస్తున్నది తెల్లవాడే... మన సంప్రదాయపు పండగల కన్నా మన అందరికి గుర్తుండే పండుగ న్యూ ఇయర్... మనం ఇష్టపడే దుస్తులు జీన్స్... మాతృభాష కన్నా మనకు బాగా వచ్చిన భాష ఇంగ్లీష్...ఈ పదాలు తెలుగులో చెప్పినా అర్ధం కాని వారు ఎందఱో.. అందుకే మనం ఎంతగా పరాయితనంపై మక్కువ పెంచుకున్నామో చెప్పడానికే ఈ ఉదాహరణలు... విశిష్టమైన మన మత గ్రందాల కన్నా మనకు తెలిసిన ముఖ పుస్తకమే ఎక్కువ ఇష్టం...బానిసత్వం నుంచి విముక్తి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పటికీ పరాయి తత్వానికి బానిసలుగా చేసుకున్న తెల్లవాడే గెలిచాడు మన మీద...
         విదేశీ మోజులో పడి వలసలు పోతున్న ఎందఱో... స్వదేశీ మేధావులను అణగదొక్కి విదేశ యంత్రాంగానికి  పట్టం కడుతున్న రోజులు... మన దేశం గుర్తించలేని మన మేధావుల తెలివితేటల్ని ఉపయోగించుకుంటున్న విదేశాలు... ఇవి అన్ని చూస్తూ కూడా మన బానిసత్వపు సంకెళ్ళు తొలగిపోయాయని నమ్ముదామా... మనమూ అందరిలానే మనకు రాని స్వాతంత్ర్యానికి స్వాతంత్ర్య శుభాకాంక్షలు చెప్పుకుందామా నలుగురితో పాటు నారాయణా అంటూ... నువ్వే చెప్పు ఏం చేయాలో.....!!

14, ఆగస్టు 2015, శుక్రవారం

జ్ఞాపకాలు.....!!

వేదించే మదికి
నివేదించే నివేదనలు
జ్ఞాపకాలు
గడచిన కాలానికి
మిగిలే గురుతులు
జ్ఞాపకాలు
వాడని సుమాల
సుగంధపు పరిమళాలు 
జ్ఞాపకాలు
గతాన్ని గుర్తుచేస్తూ
వాస్తవంలో వర్తమానాలు
జ్ఞాపకాలు
కలతల 'కల'వరానికి
స్వాంతనిచ్చే 'స్వ'గతాలు
జ్ఞాపకాలు
వేకువ పిలుపులో
తొలిపొద్దు సంతకాలు
జ్ఞాపకాలు
అమృతాన్ని వర్షించే
అక్షరలక్షల కన్నియలు
జ్ఞాపకాలు
నవ్వుల సంతకాల
వెన్నెల తుణీరాలు
జ్ఞాపకాలు
చెలిమితో చేరిన
వెన్నెల్లో ఆడపిల్లలు
జ్ఞాపకాలు
తరగని నిధుల
పెన్నిధి భాండాగారాలు
జ్ఞాపకాలు
భావాలకు అందని
మనసు ముచ్చట్లు
జ్ఞాపకాలు
అటుఇటు వెరసి
జన్మజన్మల అనుబంధాలు
జ్ఞాపకాలు.....!!

అల్లరి శౌర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు...!!



12, ఆగస్టు 2015, బుధవారం

ఏక్ తారలు...!!

1. వెన్నెల కరువైందనేమో_మబ్బులు నిన్ను దాచుకున్నాయి
2. జాబిల్లి సిగ్గు పడుతోంది_ మబ్బుల్లో దాగిన నీ నవ్వులకు
3. నీటిలో ఎలా ప్రతిబింబిస్తోందో_మబ్బుల్లో చేరిన నీ నవ్వుల వెన్నెల
4. కలానికి కాషాయం కట్టినా_అక్షరాలకు సన్యాసం తెలియడం లేదు కదా
5. మౌన బాసలు తెలిసిన మదికి_లిపి లేని కంటి బాష ఎందుకు

11, ఆగస్టు 2015, మంగళవారం

రేపటికి శెలవన్నావు...!!

మారుతున్న రేపటి పొద్దులో
నిన్నటిని మరచి పోతున్నావు
నువ్వు విదిల్చిన నిన్నల్లోని
జ్ఞాపకాల్లో నన్ను ఉండమన్నావు
కాలానికి చిక్కని గాలంలో దాగిన
కలలకు అందని ఊహల్లో తోశావు
గతమే వాస్తవంగా నాకు మార్చేసి 
నీ వర్తమానంలో చోటు లేదన్నావు
గాయపడిన గుండెకు సాయంగా
ఒలుకుతున్న కన్నీటి కథకి తోడైనావు 
అక్షరాలకు అద్దకంగా అద్దుతున్న భావాలను
నీకు  చెప్పలేని మౌన కవనాలుగా చేశావు
నే కోల్పోయిన క్షణాలన్నింటిలో నీవే ఉంటూ 
ఏకాంతాన్ని జన్మలకు జతగా పరిచయించావు
కలతలకు నెలవుగా మారిన మదికి నేస్తమై
నిన్నటి నీతో ఉండి పొమ్మంటూ రేపటికి శెలవన్నావు...!! 

9, ఆగస్టు 2015, ఆదివారం

స్నేహం...!!

నేస్తం,
         మనకు అవసరం లేనివి పలకరింపుల క్షేమ సమాచారాలు... స్నేహం అంటే మనకు తెలియదు కాని మనల్ని మనంగా  అభిమానించడం మాత్రమే మనకు తెలుసు... స్నేహం అంటే ఇష్టమో ప్రేమో ఇప్పటికీ తెలియదు కానీ ఎప్పటికీ మనతోనే ఉండిపోతే బావుండు అని మాత్రం అనిపించేది స్నేహం.... కాలాలు మారినా యుగాలు గడచిపోయినా స్నేహంలోని తీయదనం ఇప్పటికి అలానే ఉండి పోయింది... అవసరానికి స్నేహం నటించేవారు దానిలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేరు.. నీ తప్పొప్పులతో నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు, స్వాగతించేవారు నీ ప్రియ  నేస్తాలు.... స్నేహంలో గంటల తరబడి మాటలు పంచుకోనవసరం లేదు... నెలల తరబడి కలిసి ఉండనక్కరలేదు...సప్త సముద్రాల ఆవల ఉన్నా ఎన్నేళ్ళు గడచినా మనస్సులో చిరస్థాయిగా మిగిలే స్నేహం ఎక్కడో నూటికి కోటికి ఒక్కటి... దీనికి బంధాలు బంధుత్వాలు అవసరం లేదు.. ఆత్మీయ పలకరింపు ఒకటి చాలు ... ఏళ్ళ తరబడి స్నేహ సౌరభం నిలబడి పోవడానికి.. కొందరికేమో చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా జీవితాంతం నిలిచిపోతాయి... మరికొందరేమో ఈ రోజువి రేపటికి మ ర్చిపోతారు... కొందరేమో జ్ఞాపకాలోనే బతికేస్తుంటే ఇంకొందరికేమో అసలు జ్ఞాపకాలే ఉండవు...ఏమిటో ఈ జీవితాలు...
 వెన్నెల్లో చందమామను పరిచయం చేసుకున్నట్టుగా... చీకట్లో అక్కడక్కడా కనిపించే నక్షత్రాలను
ఏరుకుంటునట్లుగా బాల్యాన్ని దాటేసి ప్రాయపు పరుగుతో పోటి పడినా విడదీయరాని అనుబంధం పెనవేసుకున్న స్నేహం చిన్ననాటి జ్ఞాపకాలది... అందుకేనేమో మన వయసు ఎంత పెరిగినా మళ్ళి బాల్యాన్ని తలచుకుంటూ ఉంటాము... కల్మషం ఎరుగని పసి వయసు స్నేహం ఎప్పటికి మధురమైనదే...
ఇంతకీ స్నేహంలో ఇష్టం ఉందంటావా... ప్రేమ ఉందంటావా.... -:)
నీ నేస్తం...

8, ఆగస్టు 2015, శనివారం

అనుకోని అతిధిలా...!!

అలుపెరుగని కాలానికి
అలసట తెలిసిందట

మరుపే తెలియని మదికి
జ్ఞాపకాల తాయిలమిచ్చిందట

వెన్నెలకు అందని వెలుగులకి
వేకువ పొద్దును చూపిందట

రాతిరి చుక్కల రాయబారానికి
కలల రాదారిని పరిచిందట

బాల్యానికి తెలియని బాసలకి
బంధాలను బహుమతిగా ఇచ్చిందట

అసంపూర్ణ జీవితానికి
అనుకోని అతిధిలా నీ స్నేహమోచ్చిందట.....!!

7, ఆగస్టు 2015, శుక్రవారం

మణి మాలికలు....!!

1. ఎడారైన ఎడదలో
  ఒయాసిస్సులా చేరింది నీ జ్ఞాపకం
2. ఏకాంతానికి ఎడారి తోడయ్యింది
ఎండమావిగా మారిన ఎదకు నీ తలపులను తోడిస్తూ
3. ఎడారి బ్రతుకుతో వేసారిన నాకు
ఎదను తాకింది ఎన్నెలంటి నీ చెలిమి చెలమ  
4. నిరీక్షణకు సైతం కాలమే తెలియలేదు
 నిన్ను చేరిన కన్నీరు పన్నీరుగా మారానని చెప్పేంతవరకు

5, ఆగస్టు 2015, బుధవారం

ఏక్ తారలు....!!

1. మనసెందుకో ఊరికే ఉండదు_ కవితాక్షరాలకు దాసోహమనకుండా
2. విరుల అందాలకు_విరహమే పాదాక్రాంతమయ్యింది
3. భరించే బంధానికి_బాసటగా నిలవాలని
4. ఏకాంతానికి తోడుగా_ఏక్ తారా సమూహం అక్షర నక్షత్రాలతో
5. వాస్తవమై నీ ఎదుటే_కలలతో కాపురమెందుకు
6. తెలిసి ఆ మాయలో పడటమే_మనసు పని
7. వాలిపోతున్నా_మలి సందెలో
8. నీ రాకను తెలుపుతూ_పరిమళపు విరులు
9. సూదంటు రాయిలా తాకింది_గత జన్మల మనసులు వెన్నాడుతున్నందుకేమో
10. నీతో ఉన్న నిన్నలే నాకు చాలు_నువ్వు లేని వాస్తవం నాది కాదు
11. నేడు వెగటుగా ఉంది_నువ్వు లేని వాస్తవాన్ని చూడాలంటే
12. రేపటి స్వప్నాలు ఎదురు చూస్తున్నాయి_నిన్నటి క్షణాలు నీకు తిరిగి ఇవ్వాలని
13. వేకువకి సంతసమే_రేపటి స్వప్నం సత్యమై ఎదుట నిలుస్తున్నందుకు
14. నా ఓటమి నీ గెలుపుగా మారిన క్షణం_అది కల కాని వాస్తవమే
15. శీతలానికి గ్రీష్మం తోడయ్యింది_వెన్నెలను వారిస్తూ
16. జ్ఞాపకాలు గతుక్కుమంటున్నాయి_గతాన్ని పారవేస్తున్నావని
17. కల'వర'మైనా కమనీయమే_విజయం  వాకిట్లో ఉంటే
18. ఘన స్వాగతానికి సమాయత్త మౌతున్నాయి జ్ఞాపకాలు_వాస్తవం వెంట పడుతూ
19. అంబరం ఆర్నవమయ్యింది_చిరునవ్వుల సంబరం తాకినందుకు

మౌన సాక్షిగా....!!

ఎన్నో ఏళ్ళుగా ఎడారి జీవితంలో
మానుతున్న గాయాలకు చేరుతున్న
చుట్టపు పరామర్శలను, వంకర నవ్వులను
దేహమంతా రక్త సిక్తమై ధారలు కట్టినా
దాచేస్తున్న వలువలు బేలగా చూస్తున్నా
అర కొరగా కనిపిస్తున్న వాస్తవాలకు
అండగా నట్టింట నిలబడిన న్యాయానికి
ఆసరా కాలేక పోతున్నందుకు
కనపడని మనసు పడుతున్న వేదనకు
కానరాని సాక్ష్యాలను చూపించలేక
ముక్కలైన మదిని అతుకులు వేయలేక
శిధిలమైన గుండెకు చికిత్స చేయలేక
మూగబోయిన గొంతుకు స్వరాలు పలికించలేక
ఆజన్మాంతమూ సజీవ సమాధిలో బంధీనై
రోజు చూస్తూనే ఉన్నా మౌన సాక్షిగా....!!

ఏక్ తారలు...!!

1. కన్నుల్లో కన్నీటి సుడిగుండాలే_మది సంద్రానికి చేయూతనిస్తూ
2. మనసంతా చిక్కని జ్ఞాపకాలే_చిలికినకొద్దీ వెన్నలాంటి గురుతులనిస్తూ
3. అద్దంలో అందం అలిగింది_అబద్దాన్ని నిజం చేసినందుకేమో
4. నీ కోమల కంఠం అలసి పోతుందని_నీ బదులుగా కూడా నేనే చెప్పేస్తున్నా
5. నిదురిస్తూనే ఉన్నా_రెప్ప తెరిస్తే నువ్వు గీసిన ఉషోదయం మాయమౌతుందని
6. తీర్చలేని వరమడుగుతాననేమో_దేవుడు కూడా కనుమాయం
7. ప్రబంధ పరిమళాక్షరాలే_అక్షర లక్షల ప్రేమ పాశాలతో
8. అన్ని ఉన్న ఆప్యాయత ఒదిగింది_పై పై మెరుగుల నటనా కౌసల్యాల ముందు
9. ఏకాంతానికి తోడుగా_జ్ఞాపకాలను గతాన్ని అడిగి పంపిందేమో
10. నిరీక్షణలో చెలి తలపే_మదిలో ఆనంద తరంగ తారంగం
11. మరెప్పుడూ చూడని సంతోషం_ఆ ఏడుపులో కలిసినందుకేమో 
12. వాదన విరహంలో పడి_సరసాన్ని విరసంగా మార్చేస్తోంది
13. సంతోషం చేరువై పోదూ_నిరీక్షణ నీరసించాక
14. ఒళ్ళంతా కళ్ళుగా మారిన క్షణాలు_వేల యుగాల నిరీక్షణకు సాక్ష్యంగా
15. చేరువగా చేరిన చెలి చెలిమి_అమరత్వాన్ని సవాలు చేస్తూ
16. వేల జన్మలుగా దూరమైనా_ఒక్క క్షణం చేరువలో యుగాల దగ్గరతనం
17. గమకాల స్వరాలే_చెలి సాన్నిహిత్యంలో క్షణాలను సైతం దోచేస్తూ
18. సరసం సరాగాలు ఆలపిస్తోంది_వేదన వరస మార్చి హర్షంగా మారిందని
19. దగ్గరతనానికి దూరం తెలియదు_చేరువగా చెంతకు చేరడం తప్ప
20. హిందోళం హితాక్షరాలు పలికింది_పల్లవించే ప్రణయ గానానికి పరవశించి
21. వలపు పంటలో పండిన తలపుల తీయదనాలు_మధుర గమనాల గమకాలే
22. వన మయూరమే వయ్యారాలు పోయింది_ప్రణయ ప్రబంధాల ప్రకృతి పరిష్వంగణంలో
23. కొలతల కొలమానాలు చిన్నబోయాయి_చెలి చేరువలో క్షణాలను చేరలేక
24. వలపు వాయులీనమైంది_మోవిపై వాలిన మురళి మోహన రాగంలో
25. చెలి సుందర వదనే_సెల ఏటి అద్దంలో చంద్రబింబంలా మెరిసిపోతూ
26. పిలుపు పిల్లన గ్రోవిలో సాగి_మోహంలో మైమరపించింది
27. పిలుపుల ప్రియ గానంలో_తలపుల తాధాత్మ్యం

4, ఆగస్టు 2015, మంగళవారం

ఇదేనా పల్లెల అభివృద్ధి, పురోగతి... !!

నేస్తం,
          నువ్వెలా ఉన్నావని అడగబోవడం లేదు కాని నా మనసేం ఆలోచిస్తోందో నీకు చెప్పాలని ఈ లేఖ....
అనగనగా ఓ చిన్నది పెద్దది కాని పాడి పంటలతో కళ కళలాడే పచ్చని పల్లె సీమ ఒకప్పుడు... చదువు గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఆ ఊరిలో నూటికి 95మంది విద్యావంతులు అదీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు... ఓ ఏభై ఏళ్ళ నాడే అమెరికా వెళ్ళిన వాళ్ళు కొందరు, వైద్య వృత్తి చేపట్టి ఇప్పటికి తమ ఊరికి సేవలు అందిస్తున్న మంచి మనసున్న వారు మరికొందరు... ఎక్కువమంది పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాద్యాయ వృత్తిలో స్థిరపడి చక్కని సేవలు అందిస్తున్నారు..ఏ చిన్న తప్పు జరిగినా ఊరి పెద్దలు రామాలయం వద్ద తపొప్పుల విచారణ చేసి తప్పుకి శిక్ష వేసేవారు ... ఏది జరిగినా ఊరి లోపలే ఉండేది.. వర్గాలు వేరుగా ఉన్నా అవసరానికి అందరు ఒకటిగా నిలబడేవారు... అప్పట్లో మా ఊరు అంటే చాలా గర్వంగా ఉండేది మా అందరికి ... ఇది మా  చిన్నప్పటి మా ఊరు .... ఇక మా తరం మా తరువాతి  తరం విషయానికి వచ్చే సరికి ఊరిలో సగం ఇళ్ళు ఖాళీ... పోనీ ఉన్న వారు బావున్నారా అంటే చదువుల కోసం వలసలు వెళ్ళిన వారు వెళ్ళగా మిగిలి ఉన్న వారిలో నైతిక విలువలు తగ్గిపోయాయి... హంగులు ఆర్భాటాలు, అహంకారాలు పెరిగి పోయాయి... ఎవరికి వారికి నా పెత్తనం ఉండాలంటే నాది ఉండాలి అన్న పట్టింపు... చదువు విలువ తెలియని నిశానీల చేతుల్లో పడి... తాగుడు, జూదం, పతనమైన జీవితపు విలువలు ఈ రోజు ఆ ఊరిలో నిత్య కల్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతున్నాయి... ఇంట్లో పెళ్ళాం మాట వదిలేయండి కనీసం పిల్లల పుట్టినరోజులు గుర్తు ఉండవు కాని ఊరిలో వెధవల పుట్టినరోజులకి పుట్టినరోజు కేకులు, బిరియాని పార్టీలు, ఒక్కోడేమో సంవత్సరానికి రెండు మూడు పుట్టినరోజులు చేసుకుంటూ... మూడు బిరియానీలు ఆరు మందు  సీసాలుగా ఉంది ఇప్పుడు... ఇదేనా పల్లెల అభివృద్ధి, పురోగతి... మా ఊరు ఒకప్పుడు చదువులకు పుట్టినిల్లు అని గర్వంగా చెప్పుకున్న మేము ఈ రోజు అదే ఊరు కూడు గుడ్డా ఇవ్వని పనికి మాలిన రాజకీయాలకు అడ్డాగా, ఎయిడ్స్ రోగులకు చిరునామాగా మారిందని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాము... చదువు విలువ తెలియని రోజుల్లోనే సరస్వతి కొలువున్న మా ఊరు ఈ రోజు ఇలా మారడానికి కారణం ఏమిటో...!!
ఓట్ల కోసం రైతు పేరు చెప్పుకుంటూ పల్లెల్లో పాద యాత్రలు చేయడం కాదు, ఏదో కంటి తుడుపు కోసం పల్లెలు దత్తత తీసుకుంటున్నాము అంటే సరి పోదు.. నెలవారీ కోటా సర్కారు ఇస్తోంది.. పెన్షన్లు ఇస్తోంది అని సరిపెట్టుకుంటే చాలదు.ంఉసలి ముతకా ఉంటారు వాళ్ళకి వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎలా వీలౌతుంది... అసలే ఇప్పుడు అంతా కంప్యూటరు మహిమ కదా ఆధునికీకరణ పేరుతో... తెలిసిన వారికి అందుబాటులో ఉంటే అందంగా ఉంటుంది.. తెలియని వారిని చేతి ముద్రలు పడలేదు, వేలి ముద్రలు పడలేదు అని రోజుల తరబడి మీ సర్కారీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటే అది సిగ్గు చేటు... రాజకీయ నాయకుల గెలుపు కోసం డబ్బు, మద్యం వాడకాల మూలంగానే చాలా పల్లెల్లో ఇదే పరిస్థితి... నాయకులు తీయగా మాట్లాడి గెలిచిన తరువాత వారి స్వలాభాన్నే చూసుకుంటున్నారు తప్ప జనం ఏమై పోయినా వారికి లెక్క లేదు.. మళ్ళి ఐదు ఏళ్ళకు మనకు కనిపిస్తారు నాగలి పట్టి నేను రైతు కుటుంబంలో నుంచి వఛ్చిన వాడినే అని... మనకు డబ్బు, మందు కావాలి వారికి ఓటు కావాలి ... చరిత్ర ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది ఏళ్ళు గడిచినా మారని బతుకులతో....!!
చూసావా నేస్తం రోజులు ఎలా మారిపోతున్నాయో... జీవితపు విలువలు ఎంతగా దిగజారుతున్నాయో...!!
నీ నేస్తం...

తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....!!

ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు, స్పూర్తిదాయకులు అయిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు దేశ విదేశాల్లో అందుకున్న ప్రశంసలు, అవార్డుల, రివార్డుల జాబితాలు పరిశీలిస్తే వారి ప్రతిభ గురించే చెప్పడానికి మాటలు చాలని పరిస్థితి...నిజంగా చెప్పాలంటే మన దేశంలో కన్నా విదేశాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఒక తెలుగు వాడిగా ఎవరికి దక్కని ప్రతిష్టాత్మక గుర్తింపు విదేశీయులు ఇచ్చారంటే వారి మేధకు కొలమానం ఏమిటో మనకు తెలుస్తుంది... ఎక్కడో మారుమూల భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి కష్టనష్టాలను భరించి చదువులో మెండుగా రాణించి ఉన్నత శిఖరాలను అందుకుని ఈనాడు ప్రపంచ మేధావులతో శబాష్ అనిపించుకున్న ఈ అతి పిన్న వయసు అపర మేధావి మనోగతంలో తన దేశం, తన రాష్ట్రం ప్రపంచంలో ప్ర ప్రధమ స్థానంలో ఉండాలన్న చిన్న కోరిక  పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలీయమై తను ఎన్నో పరిశోధనలు చేసిన ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో మెళకువలు తనవారికే ఉపయోగపడాలన్న బలీయమైన కోరికతో స్వదేశానికి తన సేవలను అందించడానికి ముందుకు వచ్చిన ఈ తెలుగు తేజం... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అన్న నడవడితో విదేశాల్లో సైతం తెలుగు వారికి అజాత శత్రువై తన అండ దండలు అందిస్తూ... అందరి అభివృద్ధితో పాటుగా తన దేశం, రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని ఆరాటపడుతూ... ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు చరిత్రలో చిరస్మరణీయులు... రాబోయే రోజుల్లో ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో
లిఖించదగ్గ చరిత్ర సృష్టిస్తారనడంలో ఏమాత్రము సందేహం లేదు... ఎన్నో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు విదేశీయుల చేతుల మీదుగా పొంది స్వదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పి భారతీయత విలువతో పాటు తెలుగు'వాడి' మేధోసంపత్తిని తేటతెల్లం చేసి పిన్న వయసులోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ తెలివితేటల భాండాగారం మన తెలుగు వారిదే అని.. తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....!!

మన వాడైన తెలుగు'వాడి' వేడి...!!

అనితర సాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రపంచ మేధావులతో శభాష్ అనిపించుకున్న మన తెలుగు'వాడి' సత్తా ప్రపంచం అంతా గుర్తించాక మనం గుర్తించడం కాస్త బాధాకరమే... లెక్కలేనన్ని సత్కారాలు, సన్మానాలు, మరెన్నో పురస్కారాలు అందుకున్న యువ మేధావి శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు ఎందరికో మార్గ నిర్దేశకులు... నిరంతరం జనించే కొత్త ఆలోచనలకు వైవిధ్యంగా రూప కల్పన చేస్తూ తన మాతృ భూమి ప్రపంచంలో అత్యున్నతంగా ఉండాలని కాక్షించే వివేకానందుని బోధనల ప్రభావితుడు... అత్యంత  ప్రతిభాశాలి.
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహా పురుషులౌతారు అన్న మాటలకు అక్షరాలా సరిపోతారు శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్తా గారు... అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో ఆటు పోట్లను తట్టుకుని సమస్యకు సమాధానం చెప్పగలిగిన ధీశాలిగా ఈ రోజు మన ముందుకు వచ్చారంటే ఆ మనః స్థైర్యం వెనుక ఎంత అలజడి ఉందో... అవమానాలు ఉన్నాయో... ఎన్ని నిద్ర లేని రాత్రులు ఉన్నాయో... ఎన్ని కోల్పోయిన జ్ఞాపకాలు వెన్నాడుతున్నాయో... అయినా మొక్కవోని ధైర్యం, నిరంతర శ్రమ, దానికి తగిన అకుంఠిత దీక్ష, కసి . పట్టుదల... ఇలా ఎన్నో ఆలోచనల రూపమే ఈ రోజు మన ముందు ఉన్న ఎం ఎన్ ఆర్ గుప్తా గారు.
పట్టువదలని కార్యదీక్ష ఆయన సొంతం... అదే గుప్తా గారు సాధించిన విజయాలకు మూలం... ఎంతో మంది యువత ఎంతసేపు నా వాళ్ళు  చేశారు లేదా ఈ దేశం నాకేం ఇచ్చింది అనే వాళ్ళే కాని వారి ఎదుగుదలకు సోపానాలుగా మారిన కుటుంబాన్ని కాని దేశాన్ని కాని గుర్తు పెట్టుకున్న వారు ఈ రోజుల్లో చాలా అరుదు. ఆ అరుదైన వ్యకిత్వం అది మన తెలుగువాడు కావడం నిజంగా తెలుగు జాతి చేసుకున్న అదృష్టం అని చెప్పడంలో ఎట్టి సందేహం లేదు.
భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి చదువులో అత్యున్నత స్థానాలను అందుకుని ట్రాన్స్పోర్టేషన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించి అప్పట్లో చంద్రబాబు గారికి విజన్ 2020 లో చక్కని సూచనలు అందించి మన పక్క రాష్ట్రమైన కర్నాటకకు సలహాలను అందించి తన సేవలను వినియోగించారు...
తన ప్రతిభకు మెరుగులు దిద్దుకోవడానికి విదేశాలు వెళ్ళి పరాయి వాడిని మెచ్చుకోలేని పర జాతీయులతో శభాష్ అనిపించుకున్న నేటి మేటి భారతీయుడు మన గుప్తా గారు. ఎంతో మంది యువతకు స్పూర్తి ఈనాడు. 
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు గారి పిలుపుకు స్పందించి స్వచ్చందంగా ముందుకు వచ్చి తను దేశ విదేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గడించిన అపార అనుభవాన్ని మాతృభూమికి అందించాలని ఆరాటపడుతూ సహజ ఒనరుల వినియోగం, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు... పర్యాటక రాబడుల గురించి వివరాలు అందించి... నేను సైతం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, నిర్వహణకు సిద్దం అని పెట్టుబడుల సేకరణకు నడుం బిగించారు... రేపటి రోజున అత్యున్నత ప్రమాణాలతో మన రహదారులు, ప్రభుత్వ నిర్మాణాలు గుప్తా గారి ముద్రతో పది కాలాలు నిలవాలని ప్రపంచానికే తలమానికం కావాలని... ఆకాంక్షిస్తూ... మన వాడైన తెలుగు'వాడి' తెలివిని మనం గుర్తిస్తూ గర్విద్దాం తెలుగు వారిగా...!!

మాతృభూమికి...!!


కాలాన్ని  తోడుగా తీసుకుని
బాంధవ్యాలను వదులుకుని, బంధాలను దాటుకుని
కన్నపేగును వదలి కాసుల కోసం పరుగులెట్టాను
మమకారాన్ని మరచి మాయలో పడిపోయాను
ఆశల విహంగాల రెక్కలతో కోర్కెల గాలాలకు చిక్కి
ఎక్కడో ఆవలి తీరాలకు తరలి పోయాను...
అలసిన నా మది తల్లడిల్లింది నిజాలను గ్రహించి
కానరాని ఆత్మీయత కోసం ఆర్రులు చాసాను కన్నీటి ధారలలో కన్నవాళ్ళ రూపాలు మసకబారాయి
రూకలకు బంధిలయినాయి రుధిరపు చుక్కలు
రక్తాశ్రువుల్లో రాలాయి రక్త సంబంధాలు
పలకరింపుల పల్లకీలు మౌనమైనాయి
వేదనల చుట్టాలు పక్కనే చేరాయి
వాస్తవాలు వద్దన్నా వెంట పడ్డాయి
అమ్మ ఒడిలో సేదదీరాలన్న ఆతురత అక్కునజేరి
పరుగు పరుగున పయనమయ్యాను మాతృభూమికి...!!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖల నమూనా....!!

అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న నూతన రాజధాని నిర్మాణానికి ప్రాజెక్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ ( పి పి పి ) సహకారంతో తయారు చేశామని భీమవరం వాస్తవ్యులు, ఒమన్ లో ప్రముఖ ప్రాజెక్ట్ నిర్వహణా నిపుణులు శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు భీమవరంలో సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఒమాన్ దేశ ఎన్ ఆర్ ఐ అయిన తను 50 మంది అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ ను తయారు చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి అందజేశామని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం సుమారుగా 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ప్రస్తుతం ఒమన్ నుంచి సౌది అరేబియాకు జరుగుతుతన్న హైవే నిర్మాణానికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మ్యాప్ మాత్రమే అందజేశారని తాము మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో బిల్డింగులు నిర్మించాలి అనే వాటిపై ప్రాజెక్ట్ ల ద్వారా ప్లాన్ తయారు చేసి సి ఎమ్ కు ఇచ్చామని తెలిపారు. భీమవరానికి చెందిన తను 12 ఏళ్లలో అతి ప్రతిష్టాత్మకమైన 20 అవార్డులు సాధించానని ముఖ్యంగా రైల్వే కాన్ఫరెన్స్ అవార్డు 2014 ను అందుకున్నానని చెప్పారు. రాజధాని ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

వర్ణాలు...!!

వర్ణాలు....!!
వేవేల వర్ణాల అందాలు
వర్ణించనలవి కాని భావాలు
కులాలకు అతీతమైన కలల కావ్యాలు
మతాలకు చిక్కని మనసున్న వర్ణాలు
భాషలకందని భావనా జలపాతాలు
వసుదైక కుటుంబానికి నిర్వచనాలు
రుధిరావేశాలకు చరమ గీతాలు
కాల్పనిక జీవితానికి సందేశాలు
మారుతున్న కాలానికి నిలువుటద్దాలు
 జాత్యహంకారానికి తలవంచని విజయ కేతనాలు
ప్రపంచ శాంతికై ప్రార్ధిస్తున్న సర్వ మత సమ్మేళనాలు
కలిసిన ఈ రంగులు వేరైన ఒకే రక్త వర్ణాలు...!!

1, ఆగస్టు 2015, శనివారం

సాహితీ సేవ వారి "తెలుగు సాహితీ ముచ్చట్లు "

సాహితీ సేవలో నా తెలుగు సాహితీ ముచ్చట్లను e పుస్తకంగా నా మొదటి e పుస్తకాన్ని రూపొందించాను ...
ఈ సాహితీ ప్రయాణంలో నాకు సహకరించిన, నన్ను ప్రోత్సహించిన అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు... ఈ శీర్షిక రాయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చిన కంచర్ల సుబ్బానాయుడు గారికి కృతజ్ఞతలు
https://issuu.com/manju13/docs/____________________________________048f4edc365cee/3?e=0

31, జులై 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పంతొమ్మిదవ భాగం....!!

వారం వారం మన సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో తెలుగు సాహిత్యపు కవి యుగాలలోని కొన్ని ముఖ్య  ఘట్టాలను  తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం తెలుగు వైభవానికి స్వర్ణ యుగమైన రాయల వారి యుగం గురించిన వివరాలు, ప్రబంధం గురించి సంక్షిప్తంగా చూద్దాం..మన అందరం విని ఉన్నాము.. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి వీధుల్లో అమ్మేవారని... రాయలవారి ఆస్థానమైన సభా మండపం  భువనవిజయమన్న పేరుతో అష్టదిగ్గజాలతో విలసిల్లేదని చతురోక్తుల తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో ... "మేక తోక పద్యం"... కాస్త లోతుగా చరిత్ర వివరణలోనికి వెళ్తే....

1500-1600 : రాయల యుగము దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.

పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడుచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా

తిరుమలవెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు

కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
నిర్మాణాలు

ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.
కుటుంబము

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.
కులము

శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
సమకాలీన సంస్కృతిలో

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ మరియు ఆదిత్య 369

ప్రబంధ యుగము

తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.

ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.

పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
లక్షణాలు

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.

    పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.
    కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
    దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
    సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.

    ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.

    రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.

    మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.

    నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.

    వేల్చేరు నారాయణరావు: పురాణమార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.

చరిత్ర రచనలో

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంద యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.
ఉదాహరణలు

    మనుచరిత్ర
    సంస్కృతమునందలి మాళ వికాగ్నిమిత్రము
    ఆముక్త మాల్యద
    నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
    ముకుందవిలాసము
    వీరభద్ర విజయము

ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner