28, జనవరి 2016, గురువారం

కవితాంతరంగం...!!

నా అక్షరాలకు అద్భుతమైన సాక్ష్యాలను అందమైన వివరణగా అందించిన రాజారాం గారికి, పుస్తక పరిచయాన్ని స్వాగతించిన కవిసంగమానికి నా మనఃపూర్వక వందనాలు ....


“ అక్షరాలను అనుబంధపు ఆనవాళ్ళుగా చేసుకున్న కవయిత్రి ‘ మంజు యనమదల’ “

( “అక్షరాల సాక్షిగా.. నేను ఓడిపోలేదు “ అని అంటున్న మంజు యనమదల కవితాంతరంగం ఈ వారం.)

- కవి సంగమ సభ్యుల కోసం –

ఓ కన్నీటి చుక్కను కారుస్తూ,అంతర్మథం చెందుతూ మౌన సమీరాలు లో విహరిస్తూ నేనూ ఓ ఇసుకరేణువునే అనే భావనతో జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఎక్కడో కొన్ని మాత్రమే రంగుల జ్ఞాపికలు రాతిరి తెరలో ఒంటరి నక్షత్రంలా మెరుస్తుంటే రాలిపోతున్న చిన్నదనం తెలియని సంగతిని నిత్యమైన ఆత్మ సత్యంగా కవిత్వం చేసి అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు అని అంటున్న కవయిత్రి మంజు యనమదల గారు.

“నా అక్షరాలు
నాతో స్నేహం చేసే నా నేస్తాలు
నా అక్షరాలు
నాలో నన్ను పంచుకునే బంధాలు...
నా అక్షరాలు
నే దాచుకునే విలువైన జ్ఞాపకాలు
నా అక్షరాలు
నే పెంచుకునే అనుబంధాలకు సాక్ష్యాలు
నా అక్షరాలు
నన్ను నాకు చూపే నా అంతర్నేత్రాలు
నా అక్షరాలు
నాతో ఆడుకునే అందమైన ఏకాంతాలు...

ఈ వాక్యాల్ని చదివి చదువగానే ‘ తనలో తానొక ఏకాంత సౌందర్యాన్ని రచించుకున్న స్వాప్నికుడు ‘ ‘తెలుగు కవితా సతి నుదుటి రసగంగాధర తిలకమైన ఆ బాలగంగాధర తిలక్ ఎవరికైనా గుర్తుకు రాక మానడు. అలా అని ఈ కవయిత్రి మంజు గారు తిలక్ ని అనుసరించారనో అనుకరించారనో అనడం నా ఉద్దేశ్యం కాదు. అక్షరాలు తమకేమవుతాయో వాటిని చూస్తే తమకేమనిపించిందో తిలక్ రాశాడు. మంజు గారు కూడా రాశారు. తిలక్ కాల్పనిక భావ లోచనాలతో “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అడపిల్లలు “ అనిఅన్నా నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావాతాలు ..నా అక్షరాలు ప్రజా శక్తులావహించే విజయ ఐరావతాలు “- అని కూడా అన్నాడు. “నా అక్షరాలు నా జీవిత గమనానికి రూపాలు;
నా అక్షరాలు అటు ఇటు వెరసి నేనే అని నాకు తెలిపిన దాఖలాలు “ - అంటూ తన అంతరంగపు ఆలోచనలకు కవిత్వ రూపమిచ్చారు మంజు గారు.

అక్షరాలతో ఆత్మ బంధం ఈ కవయిత్రి ఏర్పరుచుకున్నట్టు ఎన్నో కవితలు చెప్పకనె చెబుతాయి. ‘ మది మధనాన్ని అక్షరాలలో రంగరించి “; “ చుక్కల్లా లెక్కల్లా తేలని బాంధవ్యాలు ఎన్నూన్నా వేసారిన మదికి ఊరట అందించే చెలిమి ఈ అక్షరాల ఆత్మ బంధమైంది “; “ మది మౌనానికి వేదికగా రూపు దిద్దుకుంటున్న అక్షరాలు “; “ అక్షరం ఏడుస్తోంది మనసు భావాలకు రూపాన్నే చెక్కే శిల్పి చేతిలో ఉలి తానైనందుకు “; “ అక్షర సాకారంలో అందమైన కలగా మిగిలింది నా నువ్వే ..”; ‘ ఎదలోని వెతలు కతలుగా కలసి అందమైన అక్షరాల్లో అలసి జారిపోతున్నాయి..”; “ –ఇలా అక్షరాలతో మమేకమైనా వాక్యాలు ఎన్నో ఈ సంపుటిలో వుండటం మూలానేమో “ అక్షరాల సాక్షిగా ..నేను ఓడిపొలేదు” అని ఈ కవయిత్రి అనగలుతున్నది.అక్షరాలపై ఇంత మమకారమున్న వార్ని ఇదే మొదట చూడటం నేను.అంటే కవులందరు రచయితలందరు అక్షరాలతోనే కదా సృజన చేసేది అని మీరు అనొచ్చు.కానీ అక్షరం అన్న దాని మీద ఆ మమకారమే లేకపోతే ఈ కవయిత్రి “ అమ్మ భాష తెలిసిన అక్షరాన్ని ఆశ్రయం కోరితే సాంత్వన అందిస్తూ కడుపులో దాచుకుంది అమ్మలా “ అని అనగలదా ?. ప్రతి గేయం ఒక గాయమై తాకుతుంటే అక్షరాన్ని అమ్మను చేసుకున్నారు మంజు గారు.అక్షరానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చారు అమ్మను చేసి.

డా.తన్నీరు సురేశ్ బాబు గారు ఈ కవయిత్రిని లేడీ కృష్ణ్ శాస్త్రి అని అన్నారు.అందుకు కారణం భావ కవులు తమ ప్రేయసిని ఊహించుకొని కవిత్వమల్లినట్లుగా ఈ కవయిత్రి చెలికాడు ,జీవిత భాగస్వామి, జ్ఞాపకాలు ,ప్రకృతి మున్నగు వాటిని వస్తువులుగా చేసుకొని రాయడమే కారణం కావచ్చునేమో ?తనదైన అనుబంధాల్ని జన్మ జన్మల బంధంగా చెబుతుంది. ఈ కవయిత్రి పదాల సౌకుమార్యానికి భావ గాంభీర్యానికి ముగ్ధులం కాకుండ వుండలేం.

“వెలుగు చూడలేని నాకు
నీ జ్ఞాపకాల గురుతులు
ఆ వెలుగుల్లో కనిపిస్తాయని..
చీకటితో చెలిమిని
పంచుకుంటున్నా..
నీ వలపుల ఊహల నుంచి
బయట పడాలని “

ఎంత భావ గాంభీర్యాన్ని పొందుపరచిందో ఈ కవయిత్రి ఈ అతి తక్కువ మాటల్లో .

భావకవుల్లో ప్రధానంగా కృష్ణ శాస్త్రి కవిత్వంలో వున్న గుణాలు పదలాలిత్యం,భావ గాంభీర్యం,అనుభూతి గాఢత్వం అనేవి .ఇవి ఈ కవయిత్రి కవిత్వంలో అద్దంలో బింబంలా నిలుస్తాయి.

“జారి పడుతోన్న కన్నీటి చుక్కకేం తెలుసు
తన పయనం ఎక్కడికో
తన తావిని వీడిపోతున్నా
చేరే మజీలి ఎక్కడుందో..”
విరిపువ్వుల చిరునవ్వుల
కేరింతలు వినిపిస్తుంటే..
చటుక్కున బయట పడింది
కలల సంతోషాలు చూద్దామని”

ఇలా.. అంటూ ఎంతో ధ్వనితో ఎటు పోవాలో తెలీనీ కన్నీటి చుక్కను బాధైనా సంతోషమైన కారేది ఒక కన్నీటి చుక్కే కదా అని ఈ కవయిత్రి వ్యాఖ్యానిస్తుంది. ఈ కవితలో సుకుమార పదాలున్నాయి.లోతైన భావం వుంది. అనుభూతిలో చిక్కదనం వుంది.

అక్కడక్కడ విషాదపు జీరల్ని భావ కవుల్లా మంజు గారు తన కవితల్లో ప్రదర్శిస్తారు.

‘ఎన్నో ఏళ్ళుగా ఎడారి జీవితంలో
మానుతున్న గాయాలకు చేరుతున్న
చుట్టపు పరామర్శలను,వంకర నవ్వులను
దేహమంతా రక్త సిక్తమై ధారలు కట్టినా...

ఇలా విషాదాన్ని దుఃఖాన్ని సైతం తన కవిత్వవస్తువుల్ని చేసుకొంది ఈవిడ. అంతే కాదు మెదడు పోరాటాల్ని గుండె ఆరాటాల్ని కవిత్వం చేసింది.ఆకాశమంత ప్రేమను పంచే ముదిత మనసు అందమైన జపాతమవ్వడాన్ని అక్షరాల్లో వొంపింది.తనను తాను వదిలేసుకొనే కారణాల్ని పదాల్లో ప్రవహింప చేసింది. మంచు కురిసే వేళల్ని మనసు మురిసే వేళల్ని పట్టి అక్షరాల్లోకి బట్వాడ చేసింది కవిత్వంగా. అంతర్ముఖంలో ఆలోచిస్తూ అంతరంగాన్ని కవిత్వం చేసి ఆవిష్కరించింది.అహాన్ని ఆపాలన్న కోరికల్ని ఏకాంతంలో తనకు తానుగా సాధన చేసిన వైనాన్ని కవిత్వపు మాటలుగా మార్చింది. మూగబోయిన తన మది మాటలకు భాష్యాలు తన కవిత్వంతో చెప్పెప్రయత్నం చేసింది.కవిత్వాన్ని కాల్పనిక భావుకతతో మెరిపించింది.

మంజు గారు సొంత అనుభూతుల వ్యక్తీకరణలోనూ,స్త్రీ మనోభావ వ్యక్తీకరణలోను కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించారు.భావ కవిత్వ సామాగ్రి అయిన మౌన సమీరాలు,సుగంధ పరిమళాలు,భావాల రాగాల భూపాలాలు,సైకతాలు, మంచు పూల గంధాలు,వేదన ,ప్రేమ ,మాతృభూమి పై భక్తి, నిర్వేదన ..అన్నీ ఇవన్నీ అనేక కవితల్లో కిరీటంలో పొదగబడిన మణిలా కనిపిస్తాయి. ఒకింత ఊహా శక్తి కూడా ఈవిడ కవితల్నిమన మనో వీధుల్లో తిరిగేటట్లు చేస్తుంది.

“కాగితం పై కలంలో ఇమిడి
మనసెలా ఒలికిందో చూడు
నీ భావాలను పలికిస్తూ”

మది అలజడి కాగితంపైకి ఎలా వొచ్చిందో మంజు గారు మంచి ఊహ చేశారు. యెంకి పాటల్లాంటి నడక ఒక కవితలో ఇలా కనిపిస్తుంది.

“ఎటెల్లి పోనాదో
యాడ తానున్నాదో
మదినే మాయ చేసింది..

ఇలా చెప్పడమే కాదు ఒక దుఃఖంతో అంతరంగం మండినప్పుడు ఆ మంటను కవిత్వం చేయడం మంజు గారికి తెలుసు.వివాహం కలకంఠి కలల్ని కల్లలు చేసినప్పుడు వాటిని తన మనసు పరచిన కలలుగా చెబుతుంది.

వేదనాదాన్ని మోదంగా
మౌన మంత్రాన్ని ఖేదంగా
మదితలుపులు మూసిన క్షణాలు

రాలిన కన్నీటి సాక్షిగా ఆ కళ్యాణ వేదిక మూగబోయిన రాగాల వేదికే అయినప్పుడు రెప్పలు దాటి రాని కన్నీళ్ళు రాలపూల తేనియలయ్యాయని అంటూ ఏడడుగులు,హోమగుండం మున్నగు వాటిని వల్ల కూడా ఆ కలకంఠి కలలేమి సంతోష అక్షరకావ్యాలు కాలేదని అంటుంది ఇందులో.

వేసిన అడుగులు బాసటగా
మండిన నిప్పుల కణికల చట్రంగా

చేయిదాటిన అక్షర కావ్యాలుగా కలకంఠి కలలు అయ్యాయని అంటే విషాదంగా మారాయనే ధ్వనిని ఈ “కల కంఠి కలలు” కవితలో ఇమిడ్చింది ఈ కవయిత్రి.

ఇది కవిత్వమని ఇదే కవిత్వమని ఇదమిత్ధంగా ఎవరూ చెప్పలేదు.చెప్పినా వాదనకు నిలువనూ లేదు.”రసాత్మక వాక్యమే కవిత్వం అనుకుంటే మంజు గారిది అచ్చమైన కవిత్వం.
వస్తువును రూపంతో సమన్వయం చేసుకోగలనేర్పు అభ్యాసంతో సాధ్యం.కవిత్వాన్ని చెక్కడం
డ్రైడెన్ అన్నట్లు పాలిష్ చేయడం కవులు సాధన చేయాలి. ఈ మాటలు ఎందుకంటే మంజుల మనోహర శబ్దపద ప్రయోగశీలత, అద్భుత భావన పటిమ,భాషా సంపత్తి, ఉన్న ఈ కవయిత్రిలో కొరవడింది శిల్ప నేర్పే. ఈ శిల్ప విద్యను మంజు యనమదల గారు వంటపట్టించుకోగలిగితే ఒక మంచి కవయిత్రి తెలుగు భాషకు దొరుకుతుంది.

మండలి బుద్ధప్రసాద్ గారన్నట్లు “ ఈ కవితా సంపుటి మనసుతో చద్వాల్సిన ఒక మంచి రచన.

“ఆయుధంగా మలచుకున్నా
ఆశయాన్ని పంచుకున్నా
అనుబంధాన్ని పెంచుకున్నా

అని అంటూ నమ్ముకున్న అక్షరానికి వందనం అంటున్న ఈ కవయిత్రి కవిత్వానికి దాదాపు 33 మంది ముందు మాటలు అభినందన వాక్యాలు రాయడం ,వారిలో చాలా మంది ఫేస్ బుక్ మిత్రులు కవులు కావడం ఒక ఆనందం. అందరూ ఈ కవయిత్రి కవిత్వాన్ని తృప్తి తీరా ఆస్వాదించిన వారే.మంచి విశ్లేషణ చేశారు. వారికి అభినందనలు.

అనుభవాల సాంద్రతతో , జీవితంలోని ఆర్తిని వేదనని ఒక చిక్కని కవిత్వంగా మలిచిన మంజు గారిని అభినందిస్తూ ...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner