27, డిసెంబర్ 2017, బుధవారం

కొత్త స్నేహాలతో జాగ్రత్త...!!

నేస్తం,
          స్నేహం చాలా విలువైనది, తీయనైనది. 1977 లో మొదలైన చిన్నప్పటి స్నేహం 2017 కి .. ఇప్పటికి అలానే ఉందంటే నిజంగా అదృష్టం అనే చెప్పాలి.  36 ఏళ్ల క్రిందట చూసిన చిన్ననాటి మిత్రుడు మొన్నీమధ్యన వచ్చి వెళితే ఆ ఆనందాన్ని పంచడానికి కాస్త సమయమే పట్టింది.
       గత రెండు నెలలుగా జరిగిన కొన్ని సంఘటనల మూలంగా స్నేహంలో అతి హేయమైన కోణాన్ని చూసిన నా మనసు కుదుటబడటానికి చాలా సమయమే పట్టింది.  నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇప్పటి స్నేహాల్లో చాలా వరకు వ్యాపార సంబంధిత స్నేహాలే ఎక్కువ.  అవసరాలకు నటించడం వారి నైజంగా మారింది. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారడం, నమ్మిన స్నేహాన్ని నట్టేట ముంచడం, వారి స్వార్థం కోసం ఎంతకైనా దిగజారడం చాలా హేయంగా ఉంది. బెదిరింపులు, అరవడాలు అనేవి కొంత వరకే పని చేస్తాయి. మనిషి మీద నమ్మకం పోవడానికి ఒక్క మాట చాలు. మనమేమయినా శిభి చక్రవర్తులమా అన్న మాట మీద నిలబడటానికి, ప్రాణ త్యాగం చేయడానికి. నా దగ్గర ఒక ఆడియో రికార్డ్ ఉంది. అది వింటే ఏమి జరిగింది అన్నది అందరికి తెలుస్తుంది. కాకపొతే అది వినడానికి ఓపిక కావాలి. మధుర కలయిక అంటూ ఓ పెద్ద మాయని మచ్చకలయికగా మార్చిన కొందరిని జీవితంలో మరచిపోలేము. వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి పబ్బం గడుపుకోవాలని చూసే కొందరికి ఇప్పటికికయినా తెలిస్తే బావుండు నటనకు ఎక్కువ రోజులు అవకాశం ఉండదని. సూక్తులు పెట్టడం కాదు అవి మనకే వర్తిస్తాయని తెలుసుకుంటే బావుంటుంది. ఓ ఇద్దరు సూక్తి సుధలు నా కళ్ళు బాగా తెరిపించారు.
       ఒకరు పుస్తకం వేయమని వేరే వాళ్ళతో అడిగిస్తే భువన విజయం తరపున వేస్తాము అనిచెప్పాము. డి టి పి చేయించి ఇవ్వమని చెప్పాము. డిసెంబర్లో వేసి ఇస్తాము అని చెప్పినా వారు తన పుస్తకాలు వేయడానికి దాతలు కావాలని ముఖపుస్తకంలో పోస్ట్ పెట్టారు కనీసం  మాకు చెప్పకుండా. ఆ పోస్ట్ చూసి నేను మాట్లాడదామని ప్రయత్నం చేసినా వారు మాట్లాడలేదు. భువన విజయం ఎవరికైనా తమ మొదటి పుస్తకం అచ్చులో చూసుకోవాలని కోరికగా ఉండి అచ్చు వేయించుకోలేని వారి కోసమే స్థాపించబడిన సాహితీ సంస్థ. వ్యవస్థాపకులు శ్రీ వంకాయలపాటి చంద్రశేఖర్ గారు. అంతరించిపోతున్న తెలుగుకు జీవం పొసే సాహితీ కృషిలో తర తమ బేధం లేని నిస్వార్ధపరులు. మన కుటుంబం మధుర కలయికలో పెట్టిన ఖర్చులో కొంత అయినా ఇస్తాము అన్న డబ్బులు కూడా ఇవ్వని వారు, ఈ పుస్తక ప్రచురణలో నా మూలంగా నష్ట పోయిన చంద్రశేఖర్ గారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను.
         ఒకరి మూలంగా జరిగిన చాలా నష్టాలు ఇవి. వారు వారి స్నేహితులు అందరు ఒక్కటే. మంచితో పాటు ఇలాంటి పంటి క్రింద గులకరాళ్లు ఉంటాయని గుర్తుంచుకోవాలని 2017 పోతూ పోతూ నాకు నేర్పిన గుణపాఠం. అందుకే కొత్తవారిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలనే ఈ పోస్ట్. 

జీవన 'మంజూ'ష (5)..!!

నేస్తం,
       అహం అనేది ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనచుట్టూ ఉన్న కొందరిని చూస్తుంటే అహానికి అర్ధం తేటతెల్లంగా తెలిసిపోతుంది. నేను అని అనడంలోనే అహం రూపం తెలిసిపోతుంది. ఆత్మాభిమానం మనలో ఉంటే అది ఎదుటివారిని చిన్నబుచ్చదు. అదే అహంకారమనుకోండి ఎదుటివారి లోపాలు ఎట్టి చూపడమే లక్ష్యంగా ఉంటుంది. మన గత అనుభవాలు, ఎదురు దెబ్బలు, కష్టాలు, కన్నీళ్లు ఏమి గుర్తుండవు. నిన్ను పొగిడేవాడెప్పుడూ నీకు మంచి మిత్రుడు కాలేడు, అలా అని తిట్టేవాళ్ళందరూ నీ శత్రువులూ కాదు. ఎప్పుడయినా మన క్షేమం కోసం ఆలోచించేవారు ఆత్మీయులుగా ఉండిపోతారు.
         డబ్బు అనేది అప్పుడు, ఇప్పుడు , ఎప్పుడూ మనలోని అహానికి కారణం అవుతోంది. మన చేతి నిండా డబ్బుంటే గతంలో మనకి సాయపడిన ఏ బంధము గుర్తుకే ఉండటం లేదు. ఒకప్పుడు నచ్చినవారు ఇప్పుడు నచ్చడం లేదు. మన అవసరానికి మంచి చెడు విచక్షణ మరిచిపోతున్నాం. పెద్దలు అన్నట్లు బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే కాకుండా, వ్యాపార సంబంధాలుగా, నాటకీయంగా రూపాంతరాలు చెందుతున్నాయి. మన స్వార్ధం కోసం అమ్మానాన్న, సోదర సోదరీ, స్నేహం, భార్యాభర్తల, పిల్లల అనుబంధాలన్నీ అస్తవ్యస్తంగా మార్చేసి డబ్బే లోకంగా బతికేస్తున్న ఎందరిలోనో మనమూ ఒకరిగా మిగిలిపోతున్నాము.
        అవసరానికి డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి కానీ ఆ డబ్బే అవసరంగా మార్చేసుకున్న నేటి మన జీవితాలు ఏమి కోల్పోతున్నాయో కూడా తెలుసుకోలేని దుస్థితిలో మనం కొట్టుకుపోతున్నాం. ఆత్మీయ పలకరింపులు కోల్పోతున్నాం, బంధాలను విచ్చిన్నం చేసుకుంటున్నాం, జీవితపు విలువలు నష్టపోతున్నాం, మానవత్వాన్ని మర్చిపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పొతే బోలెడు... చివరాఖరికి మనల్ని మనమే కోల్పోతున్నామని మనకు తెలియకుండానే మన జీవితం ముగిసిపోయేలా చేసుకుంటున్నాం. నీతులు ఒకరికి చెప్పకుండా ముందు మనం ఎంత వరకు పాటిస్తున్నామని బేరీజు వేసుకుంటే మన తరువాతి తరాలకు కొన్ని అయినా మానవతా విలువలు మిగిల్చిన వాళ్ళం అవుతాము. ఎదుటి మనిషి వెనుకనున్న డబ్బుకు విలువ ఇవ్వకుండా వ్యక్తిత్వానికి విలువ ఇవ్వడం మొదలైతే మన సమాజంలో ఓ మంచి మార్పుకు బీజం పడినట్లే....!!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

26, డిసెంబర్ 2017, మంగళవారం

ద్విపదలు...!!

1.   చీకటిలోనూ వెలుతురే
మదినిండుగా నీ జ్ఞాపకాల తారకలతో...!!

2.  చీకటి విస్తరణ స్వల్పమే
లెక్కకందని వెలుగు చుక్కల్లో ....!!

3.  తొలగుతాయి ముసుగులు
నాటకాన్ని బట్టబయలుచేస్తూ....!!

4.   నీడనై నీతోనే ఉంటా
చీకటివెన్నెలతో స్నేహం మనదని....!!

5.  మానసానికెప్పుడూ పురిటినొప్పులే నిన్నారేపుల్ని తలచుకుంటూ ఈరోజులో బతికేస్తూ... !!

6.   శబ్దమూ సడి చేయకుంది
నీ మౌనానికి భయపడేమెా...!!

7.   చైతన్యానికి చిరునామా నువ్వు
మౌనం మనసు పారేసుకుందందుకే....!!

8.  మాటల కోసమే ఈ అగచాట్లన్నీ
మనసులో మౌనాన్ని వెలుపలికి తేవడానికి....!!

9.   నీతోనే నేనంటుంది
చెలిమి సంబంధమది....!!

10.  తారలు తళుకుమంటున్నాయి
ఙాబిల్లినొదిలి పోతున్న రాహుకేతువులను చూసి...!!

11.   మనసంతా మురిపాలే
నీ మౌనపు అలికిడి తాకిడికి...!!

12.   గెలుపుకు బాసట
అక్షరమిచ్చిన ధైర్యమే...!!

13.   ఏకాంతం ఏకపక్షమైంది
ఎద నిండా నీవున్నావని తెలిసేమెా....!!

14.   రాహిత్యం ఎక్కువైనందుకేమెా
సాహిత్యం చిక్కబడుతోంది....!!

15.   కలల కన్నీరు జాలువారింది
కాలాన్ని సవాలు చేస్తూ కలం రాస్తున్న అక్షరాల్లో....!!

16.   వెన్నెల వల వేసింది
చీకటి చుట్టానికి చిక్కనీయక...!!

17.  చీకటిలో వెన్నెల కురిపిస్తున్నా
వెతల కన్నీళ్ళకు సంబరాలందిస్తూ...!!

18.  విషాదానికి వీడ్కోలిచ్చేస్తూ
నిన్నటిని సాగనంపడమే....!!

19.  అంతరిక్షమూ అరిచేతికి అందింది
నీ సాన్నిహిత్యానికి దాసోహమై...!!

20.  జీవిత సజీవ చిత్రాలే అన్నీ
కాలం చేతిలో చిత్రవిచిత్ర రూపాల్లో....!!

21.   భారమూ బాంధవ్యమైంది
నీ ఆప్యాయత అక్షరాలుగా అల్లుకుపోతుంటే...!!

22.  పరిమళిస్తుంటే పారిజాతాలనుకున్నా
నీ స్నేహపు సుమగంధాలని తెలియక...!!

23.  తీర్చుతున్నా నీ అలుకని
చెలిమి చిరునవ్వుల సాక్షిగా

24.  మనసు మౌనిగా మారింది
అక్షరాలు మాటలు నేర్చాయని...!!

25.  నేనంటే చైతన్యమే
విషాదాన్ని సైతం సంతసంగా మార్చేస్తూ... !!

26.   తోడుగా వస్తున్న జ్ఞాపకాలు
గతాన్ని వాస్తవంలో చూపిస్తూ...!!

27.   అక్షరాలకూ ఆనందమైందట
నీలో నన్ను చూసిన క్షణాల్లో....!!

28.   కోరికలన్నీ క్షణికాలేనట
మన మనసులు అక్షరాలకు అంకితమైయ్యాక...!!

29.   అక్షరాలన్నీ రాతలకే పరిమితం
మనసు మూగదనాన్ని బయటేస్తూ...!!

30.   కొన్ని స్వగతాలింతే
మనసుని దాచేస్తూ....!!

20, డిసెంబర్ 2017, బుధవారం

ఏక్ తారలు...!!

1.   హరించిన ప్రశాంతత ఎక్కడో మరి_పరిహాసమైన స్నేహ వలయంలో.. !!

2.  చెమరింతలన్నీ చేవ్రాలులయ్యాయి_అక్షరాలొంపిన భావాలతో.. !!

3.  ముంగిలి ముచ్చటగా ఉంది_గెలుపు ముగ్గు అలంకారంతో...!!

4.  ఒక రాగం వీనులవిందు చేసింది_అది నీ ఆత్మీయ సరాగమై...!!

5.  గుప్పెడుగుండె సంగతులివి_అంబరాన్నాక్రమించే అక్షరసుమాలతో...!!

6.  ధైర్యమూ అక్షరమే_అవాంతరాలను అధిగమింపజేస్తూ....!!

7.  సువిశాల ఆకాశం_హద్దుల పద్దులు లేని భావాలతో...!!

8.  గగననీతికో సవాల్_అవనిలోని ఇంతి...!!

9.  ఊసులన్నీ వినమంటున్నాయి_మనసు మౌనాన్ని....!!

10.  నిజమేనేమెా అనుకున్నా_నువ్వు తట్టి లేపే వరకు...!!

11.   మనసుకి మౌనం నేర్పిస్తున్నా_మాటలతో వేగలేక....!!

12.  అలంకరణ సాగుతూనే ఉంది_అక్షరాలకు అలుపన్నది లేకుండా...!!

13.   ఆలంబనగా నిలిచాయి అక్షరాలు_అమ్మలా అక్కున చేర్చుకుని...!!

14.    ఊహ వాస్తవమైంది_మౌనం వీడిన నీ స్నేహంతో...!!

15.   సహజ ప్రక్రియలే అన్నీ_సమానత్వాన్ని  సమూలంగా కోల్పోతూ.. !!

16.  శూన్యాన్నీ కొల్లగొట్టావుగా_నా మది ఖాళీలు పూరించడానికి.
.!!

17.   నేనే నీవుగా... చేరువ దూరము మనకేలా...!!

18.   జ్ఞాపకం తచ్చాడుతోంది_గతం వెంబడిస్తోంటే....!!

19.  రేపటిని ఆహ్వానించమంటోంది_గాయపు మరకలను మాయం చేస్తూ...!!

20.   మౌనమూ మరణసదృశమే_నీ మాటలు కరువైనప్పుడు...!!

21.  సన్నిహితానికి చలనమెందుకు_విశ్వాన్ని  ఒడిసిపట్టే నీ ప్రేముండగా ....!!

22.  ముల్లోకాలు ముంగిలి ముందే_ స్వచ్చమైన నీ ఆత్మీయతకు ఆభరణమై...!!

23.  ఇలకు అలుపట భ్రమణానికి_ఇంతి మెాము చంద్రబింబమైందని వగలుపోతూ....!!

24.  చీకటికి వెలుగుపూలే_అతివ నవ్వుల మెాము పూర్ణబింబమైనప్పుడు...!!

25.  ముంగిలి ముచ్చట పడుతోంది_ప్రేమ రంగవల్లుల పారవశ్యానికి...!!

26.  శూన్యమూ చుట్టమైంది_చెదిరిన మనసును సముదాయించలేక...!!

27.   పలకరింపుల పరిమళాలే...గాయాలకు లేపనాలౌతూ...!!

28.  అక్షరం పంచుకుంటానంటోంది_మది భారాన్ని తగ్గించుకోమంటూ..
!!

29.   నిన్నటి కథలో శేషాన్ని_రేపటి స్వప్నానికి ఊపిరిగా...!!

30.   నిశ్శబ్దమూ ఓ రాగమైంది_మౌనం నా నేస్తమైనందుకేమెా....!!

16, డిసెంబర్ 2017, శనివారం

ద్విపదలు..!!

1.   అంబరాన్నంటుతున్నాయి సంబరాలు
లెక్కబెట్టలేని చుక్కల్లో నువ్వు ఎక్కడో...!!

2.  మనసు ఇంకిపోయినా
మానసంలో జీవమున్నట్లుంది...!!

3.   వేకువ వంత పాడింది
చీకటి చుట్టానికి వీడ్కోలిమ్మంటూ...!!

4.  వెతలన్నీ వెలుపలికి రానంటున్నాయి
గుండె గూడు చిన్నబోతుందేమెానని..!!

5.   భావాలకూ గాయాలే
అక్షరశరాలు సంధిస్తుంటే...!!

6.  గుండె గుప్పెడే
మనసుకోటలో బందీగా...!!

7.  కదిలించిన నాదం నీవేగా
గాయమై మిగిలిన అక్షరగేయాలుగా....!!

8.   అసౌకర్యమే మిగిలింది
నీ మది గూడు ఇరుకై...!!

9.   ఆత్రమెక్కువలే మాయ బుద్దికి
చివరిపేజి త్వరగా చదివేయాలని..!!

10.   పరమపద సోపానమే అయ్యింది
విషపు కోరలకు చిక్కకుండా విజయానికి చేరువ కావడానికి...!!

11.  మెలకువలోనూ కలతలే
నీ వలకు చిక్కిన నేరానికి...!!

12.  భాషకు అందనిది
భావమైన బాధేనేమెా...!!

13.   అక్షరానికి అపజయమన్నదే లేదు
అవాంతరాలు ఎన్ని ఎదురైనా...!!

14.  పాట పల్లవి కుదిరాయి
స్వర సమ్మిళితమే ఆలస్యమింక...!!

15.   పదము కలపడమూ సంతోషమే
నువ్వు నేనైన క్షణాల్లో..!!

16.  పన్నాగాన్ని ప్రేమనకు
భ్రమలో ఉంచి బజారున  పడేస్తారు...!!

17.  ఆత్మీయంగా అల్లుకున్న అక్షరాలు
భావ చౌర్యపు కోరల్లో...!!

18.   మనసే కల్లోల సాగరం
ఆటుపోట్ల అలజడుల అంతరంగంలో...!!

19.   విజయం వరించిందిగా
శూన్యాన్ని వెలివేస్తూ...!!

20.  పట్టి తెచ్చాను గెలుపుని
జీవితానికి కొత్త అర్ధానిస్తూ...!!

21.  అపజయాలే గీటురాళ్ళు
విజయానికి కొలబద్దలై...!!

22.  అజాగ్రత్త పనికిరాదు
అనునయింపులు అవసరార్ధమేమెా...!!

23.   కొందరికి అంతర్జాలమే జీవితం
ఇతరుల మనసులు కుళ్ళబొడుస్తూ...!!

24.  అపశృతులని సవరించడమే
తీపిజ్ఞాపకాల స్వరాలకై...!!

25.   అహం అడ్డుగా నిలుస్తుంది
గమ్యాలను చేరే క్రమంలో...!!

26.  రేపటిని ఆహ్వానించు
ముగిసిన నిన్నల్ని జ్ఞాపకంగా మార్చి...!!

27.   మనసుకు సున్నితత్వమెక్కువ
ముళ్ళు పూలు ఒకేలా చూడడటంలో...!!

28.   దానవత్వానికి సమాధానం
దైవత్వమని తెలుసుకోవాలి...!!

29.    వేకువ కోసం వెదుకుతోంది
చీకటిపొద్దుల్లో చితికిన మనసు....!!

30.   వెలుగడుగు దూరమే
అడ్డంకులను అధిగమించాలంతే...!!

15, డిసెంబర్ 2017, శుక్రవారం

నేను రాసుకున్న లేఖ..!!

నేస్తం,
నాలుగు తరాలకు సాక్ష్యంగా మిగిలిన నా మనస్సాక్షి ఎందుకో ఈ రోజు మాట్లాడాలనుకుంటోంది. మనుష్యులతో, మానవ బంధాలతో సంబంధాలు లేని ఈ రోజుల్లో వినడానికి శ్రోతలే లేరు కాని వినిపించాలన్న ఆతృత మాత్రం చావలేదు.' స్వ'గతంలోని గతం నాతోపాటుగా నాలుగు జ్ఞాపకాలు నెమరు వేసుకుంటోంది.

అల్లారుముద్దుగా అందరి మధ్యలో పెరిగిన బాల్యాన్ని మళ్ళి మళ్ళి కోరుకుంటోంది మనసు. చేజారిన క్షణాల్లోని సంతోషాన్ని అందుకోవాలని మది తహ తహలాడటం, తప్పొప్పుల తక్కెడలో నేనెక్కడ ఉన్నానో చూసుకోవాలని ఈ ఐదు పదుల జీవితాన్ని మరొక్కసారి చదవడం మొదలుపెట్టా మనసు పుస్తకం తెరిచి..

అమాయకమైన బాల్యం అమాయకంగానే ఆడుతూ పాడుతూ అందమైన జ్ఞాపకాలను అందించింది. అనుబంధాల పొదరింటిలో ఆత్మీయతారాగాల నడుమ బంధాలకు పుట్టినిల్లుగా, మమతల వెల్లువలో అన్ని ప్రేమలను అందుకుంది.
కౌమారం సెలఏరు చల్లగాలిలా హాయిగా సాగిపోయింది. చదువు అయిపొయింది ఇక అసలు జీవితం మొదలయ్యింది.

ఆడపిల్లను 'ఆడ'పిల్లగా పెంచలేదు నాన్న. కాలు కింద పెడితే కందిపోతుందేమో అని తన చేతులతో అరుగు మీద మట్టి తుడిచి నన్ను నిలబెట్టిన నాన్న.. చిన్నప్పటి నుంచి ఇద్దరి ఇష్టాలు ఒకటిగా నాన్న కూతురిగానే పెరిగాను. అడగకుండానే అన్ని అమర్చి పెట్టేవారు, అందుకేనేమో ఇప్పటికి నాకిది కావాలి అని అడగడం చేతకాదు. ఎవరి విషయంలోనైనా సరే చిన్న తప్పుని కూడా ఒప్పుకోలేని నేను పెళ్లి విషయంలో నాన్న చేసిన పనికి ఎదురు తిరిగాను. పరిణామం నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేశారు. జనారణ్యంలోనికి తొలి అడుగు పెట్టాను. ఆరు నెలల వ్యవధిలో అరవై ఏళ్ళ జీవితాన్ని చూపించి జీవిత పాఠాలు నేర్పిన తొలి గురువుతో మొదలు పెట్టి జీవిత సంద్రాన్ని ఈదడం మొదలుపెట్టాను. అటు మంచివాడు కాదు ఇటు చెడ్డవాడు కాదు భర్త. తన కోసం అన్ని వదలి వచ్చిన భార్యను పట్టించుకోని నైజం, భాద్యతా రాహిత్యం, సమస్యలకు దూరంగా పారిపోవాలని చూడటం వెరసి నాకు మిగినవి కాసిని కన్నీళ్లు, కష్టాలు. జీవిత వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కాలన్న నా ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకునే యత్నాలు బోలెడు తోడు అయ్యాయి. ఓటమి ఒప్పుకోలేని నా నైజం నిరంతరం గెలవాలన్న ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇద్దరు బిడ్డలకు అమ్మగా, అమ్మానాన్నలకు కూతురిగా, భర్త వైపు బంధువులు కాదన్నా బాధ్యత గల ఇల్లాలిగా బాధ్యతలను నెరవేర్చి ... ఒకప్పుడు కాకులు వర్షంలో తడిచి పోతున్నాయి లోపలకు పిలువు అమ్మా అని చెప్పిన పసితనం ఈనాడు మరణం ఎన్నిసార్లు తలుపు తడుతున్నా మళ్ళి రమ్మని చెప్తూ చావుని సైతం తన చేతిలోనే ఉంచుకుంది. సమస్యలతో ఆడుకున్న నేను విధాతకే సవాలుగా మారాను ఈనాడు. సంకల్పం బలమైనది అయితే మరణం కూడా మన దరి చేరడానికి భయపడుతుంది. మనకున్న చిన్న జీవితంలో ప్రతి క్షణమూ విలువైనదే. జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలన్న సిద్ధాంతంలో మన డబ్బు అవసరాలకు బంధాలను వాడుకొనకుండా ప్రేమ ఆప్యాయతలను పంచుతూ కొన్నైనా మానవతా విలువలు మన తరువాతి తరాలకు అందిద్దాం.

నేను జీవితంలో గెలిచాను అని చెప్పడానికి ఈ ఒక్క కారణం సరిపోదూ..!!

తరతరాలకు చెదరని ఆస్తిగా...!!


 ఈనాడు అవసరాల కోసమో, ఆనందాల కోసమో, నలుగురు వెళుతున్నారు నేను వెళ్లకపోతే ఎలా అన్న ఆలోచనతోనో మనలో చాలా మంది విదేశాలకు వెళ్ళడం పరిపాటి అయిపొయింది. భారత దేశాన్ని వదలి వెళ్ళినంత మాత్రాన మన భారతీయతను వదులుకోవాల్సిన అగత్యం ఏమి లేదు. మహాకవి రాయప్రోలు సుబ్బారావుగారు అన్నట్టు " ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అన్న మాటలు మనకు గుర్తు ఉంటే చాలు. మన సంస్కృతీ సంప్రదాయాలను మనం ఆచరించడమే కాకుండా తరువాతి తరాలకు కూడా అందించగలం. తరతరాలకు చెదరని ఆస్తిగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మిగిలిపోతాయి.

ఏళ్ళ తరబడి విదేశాల్లో ఉండి అక్కడి అలవాట్లకు అలవాటు పడిపోయిన మన భారతీయులు తమ పిల్లలకు ముందుగా కుటుంబ బంధాలను వివరించడం ముఖ్యం. బంధుత్వపు వరుసలు, వస్త్రధారణ, మాతృభాషపై మమకారాన్ని పెంపొందించడం, మన పండుగలు వాటి ప్రాధాన్యతలు చెప్తూ దైవ భక్తి పెంపొందించడం, మన భారతీయ కళలు నాట్యం, సంగీతం వంటి వివిధ కళలు పిల్లలకు నేర్పించడం ద్వారా  మనం లేక పోయినా తరువాతి తరాలకు ఈ కళలు అందుతాయి. మన వేదాలు, పురాణాలలోని నైతిక విలువలు తెలియజెప్పే కథలు చెప్పడం ద్వారా పిల్లలకు వాటి  పట్ల ఆసక్తిని పెంచవచ్చు.
ఈ ఉరుకు పరుగుల జీవితంలో పిల్లలకు ఆటవిడుపుగా ఆత్మీయుల కలయికలో ఆనందాన్ని చూపించడం, కుటుంబంలో నలుగురు కలిసి కష్టసుఖాలు పంచుకోవడం, పెద్దల సలహాలు, సూచనలు పాటించడం, పిల్లలకు పెద్దల యెడ గౌరవంగా మెలగడం, విదేశీ చదువులతో పాటు స్వదేశీ విలువలు నేర్పించడం, అనుబంధాలను, అభిమానాలను ఎలా పెంపొందించుకోవాలో తెలియజెప్పడం, ఒక్కరు కాదు అందరం అన్న భావన (నా అన్న భావన నుండి మనం అన్న భావన) కలిగేలా చేయడం.
ఇవి అన్ని మనం ఆచరిస్తూ పిల్లలు నేర్చుకునేలా చేస్తే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తరతరాలకు అందుతూనే ఉంటాయి.  

తెలుగుభాషా వికాసం..!!

      భాష లేనిదే జాతిలేదు అన్నది ఎంత నిజమంటే ఈనాడు తెలుగుజాతి ప్రాంతీయత కోసం విడిపోయినా అందరు తెలుగువారే అన్నంత నిజం. లిపి లేకుండా భాష లేదు. మాండలికాలను మమేకం చేసుకున్న భాష మన తెలుగు భాష. తెలుగు సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబించేది మన తెలుగు భాష. భాతరదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష తెలుగు. త్రిలింగ అనే పదం నుండి పుట్టింది తెలుగు అని, తేనే వంటిది తెనుగు అని నానుడి. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌గా వ్యవహరించారు.

   అజ్ఞాత యుగం,.ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు మనిషి మనుగడలో పరిణామక్రమాలున్నట్లే భాషలోనూ మార్పులు చోటుకున్నాయి. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలుగుభాషకు ప్రాచీన హోదానైతే తీసుకురాగలిగారు కానీ తెలుగుభాష మనుగడకు ఏర్పడుతున్న ముప్పును తప్పించలేక పోతున్నారు. తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన సంతోషం లేకుండా అంతరించి పోతున్న తెలుగు అక్షరాలను కాపాడుకునే ప్రయత్నంలో తెలుగు భాషాభిమానులు వివిధ సాహితీ ప్రక్రియలను అందుబాటులోనికి తెస్తూ తాము చేసే పనికి ప్రభుత్వ సహకారం అందక పలు ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రాచీన హోదాకు కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అక్రమంగా తరలించబడుతున్నాయి. దానిలో కాస్తయినా తెలుగుభాషను బ్రతికించడానికి ఉపయోగిస్తే బావుంటుంది. 
      తెలుగు భాష మీద మమకారం ఎంతగా ఉంటే  తెలుగుభాషా వికాసం అంతగా జరుగుతుంది. అమ్మ పాలు బిడ్డకు ఎంత అవసమో అమ్మభాష మీద కూడా మమకారం కూడా అంతే అవసరం. అక్షరాలూ, పదాలు, నుడికారాలు, పద పొందికలు, సొగసులు  చెప్పుకుంటూపొతే చాలా ఉంటాయి భాషలో.  అంతరించిపోతున్న తెలుగుభాషలోని అందాలను మన తరువాతి తరాలకు అందించాలంటే తెలుగుభాషను వినేటట్లు చేయడం ముఖ్యం. మనకున్న ఎన్నో సాహితీ ప్రక్రియలు, నృత్య రీతులు అందుకు దోహదపడతాయి. రూపకాలు, పాటలు, వినసొంపైన  తేలిక పదాల పద్యాలు పిల్లలకు వినిపించి నేర్పించడం ద్వారా తెలుగుభాషపై ఇష్టాన్ని పెంపొందించవచ్చు.
     బిడ్డకు తల్లికి మధ్య భాష అవసరం లేకపోవచ్చు, స్పర్శ ద్వారా అనుభూతులను పంచుకుంటారు తల్లిబిడ్డలు. అమ్మపాడే జోలపాట ప్రతి బిడ్డకు అమృతతుల్యమే. పాటలో స్వరాలూ, సంగీతము బిడ్డకు అవసరం లేదు, అమ్మ గొంతు ఎలా ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం బిడ్డకు అద్భుతంగా ఉంటుంది. అలానే మన తెలుగుభాషలో ఎన్ని  ప్రాంతీయతలున్నా అన్ని జనరంజకాలే.  జోలపాటలు, లాలిపాటలు, జనపదాలు, జానపదాలు, లొల్లాయి పాటలు, పల్లె పదాలు ఇలా అన్ని తెలుగు వెలుగులే.  ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుంది కానీ అక్షరాలు ఒక్కటే. ప్రాంతాన్ని బట్టి ప్రతి యాసకు ఓ సొగసుంటుంది. మాండలికాలకు మకుటంగా మన తెలుగు భాష నిలిచింది.

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
  1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
  2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
  3. తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
  4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.
మన ప్రాంతాలలోనే కాకుండా తెలుగును ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వాడుతున్నారు. భాషలన్నింటికీ మూలం దేవభాష సంస్కృతం. దీని నుండి పుట్టిన భాషలన్నీ పదాలను కలుపుకుంటాయి. అందుకే ఇతర భాషల్లోని పదాలు మన తెలుగు భాషలో చాలా వరకు చేరిపోయాయి.  సుసంపన్నమయినదిగా, సుమధురమైనదిగా తేనెలొలుకు తెలుగు భాష దేశభాషలందు తెలుగులెస్స అని అందరితో కీర్తించబడుతున్నది. 





   

 
        

12, డిసెంబర్ 2017, మంగళవారం

త్రిపదలు...!!

1.  వలపులతో వల వేశా
ప్రేమైనా ప్రాణమైనా
నీతోనే నేనని...!!

2.    కల"వరమెా"
కలకలమెా
తెలియని భావమిది...!!

3.  ఒక్క క్షణం చాలదూ
నీ జ్ఞాపకాలలో
నేనున్నానని తెలియడానికి...!!

4.  పాద ముద్రలు
పద ముద్రితాలై
మదినిండా పరుచుకున్నాయి...!!

5.  అక్షరం వర్షిస్తోంది
పద భావాల బంధాలతో
మది ప్రవాహానికి రూపమిస్తూ....!!

6.  నైరాశ్యం వీడనంటోంది
నాతో నీవు లేవని
తెలిసిందేమెా మరి...!!

7.  మనోగతమెరుకని
గతం జ్ఞాపకమైందని
మనసుకి అవగతమైనందుకేమెా...!!

8.   నీ నిష్క్రమణం తెలిపింది
భావాల్లో జీవాన్ని నింపి
నీవెప్పుడూ నాతోనేనంటూ....!!

9.    నిత్యం స్మరిస్తూనే ఉన్నా
వసి వాడని
మన చెలిమిని...!!

10.    అలరిస్తోంది
అల్లరి చెలిమి
నిత్య నూతనంగా...!!

11.  మమత
వెదుకుతుంది
మనసున్న ఆత్మీయుల కోసం...!!

12.   అడగకుండానే
అన్నీ తానైన అమ్మ
తన కోసమంటూ ఏమి దాచుకోలేదు...!!

13.   మరణం
తెలిసినా తెలియనట్లుండే
జీవన గమ్యం...!!

14.   శిథిలాక్షరాన్నైనా
శిలాక్షరమై పోవాలని
చిరకాలముండి పోవాలని చిన్న కోరిక...!!

15.   అక్షరం ఆప్త మిత్రుడే
అలసిన మదికి
ఆలంబనగా....!!

16.  చక్కనైన అక్షరాలు
ముచ్చటగా భావాల్లో ఒదిగిపోతూ
మురిపెంగా నీ పేరే రాస్తూ... !!

17.   గురుతెరగని గుండెకు
మనసెరిగిన మౌనానికి
మనోజ్ఞమే జ్ఞాపకాల చేవ్రాలు...!!

18.   ఆత్మానందం మెుదలైంది
అనుభవసారంలో పండిన
జీవితపు చివరి అంకంలో....!!

19.   అలికిడిలో అలజడి
మది పలికిన నీ గురుతుల
గమకాల గాంధర్వ గానం...!!

20.   విధిని ధిక్కరించి
విధాతకు సవాలుగా
విధివంచిత విజయకేతనం... !!

21.   విషాదం వలసెళ్ళింది
నాలో నిండిన
నీ చెలిమి సవ్వడికి...!!

22.  ఏ కన్నుల్లో మెరవాలో
కలల విరుపు
మనసు తెలుపుతూ... !!

23.   మనసు రాల్చిన కన్నీళ్లని
అక్షరాలుగా అలంకరిస్తూ
అసూయాద్వేషాలకు అతీతంగా...!!

24.   తడీయారని స్వప్నాలన్నీ
గుండె గొంతుని వినిపిస్తున్న
వేదనల స్వరాలే...!!

25.   రెప్ప పడని
క్షణాలే అన్నీ
కలల దారులకడ్డుపడుతూ...!!

26.   మనసుని ఏమార్చి
దుఃఖాన్ని దారి మళ్ళించి
కన్నీళ్ళపై గెలుపు ఈ అక్షరాలదే...!!

27.  కన్నీరు కడలిగా
మారిన క్షణాలన్నీ
కలగా మిగిలిపోతే...!!

28.   కలలూ కావాలి
కలత పడిన
మదిని సముదాయించడానికి..!!

29.   వేకువపొద్దు వేళకు
కలల వరాలన్నీ
కనుల ఎదుట సాక్షాత్కారమే...!!

30.  అక్షరాలను అల్లేస్తూ
పదం పదానికీ కొత్తదనమే
భావాలతో నెయ్యాన్ని కోరుతూ...!!

7, డిసెంబర్ 2017, గురువారం

ఏక్ తారలు...!!

1.  ఊరడిస్తున్న వాస్తవ కథనం_ఊపిరై తానుంటానంటూ...!!

2.  ప్రాణ వాయువు పక్కుమంటోంది_అక్షరమే నీ ఊపిరైందని...!!

3.  మరలిపోతోంది కాలం_కనికట్టు మాయలో కకావికలమై...!!

4.  దిగులుకు గుబులైంది_సంతోషం చోటడిగిందని...!!

5.  నిశ్శబ్దమే నచ్చింది_మనుష్యుల మనసు మర్మాలు తెలిసాక...!!

6.  మమేకమైన మనసుల సవ్వడులు_ఓదార్పుకి వారధులు..!!

7.  అర్ధమూ మారింది_నిశ్శబ్దానికి నిట్టూర్పులు మెుదలై.. !!

8.   చెప్పలేని మౌనాలే_మది కోటలో గాథలన్నీ....!!

9.  గుట్టు విప్పని భావాలెన్నో ...గుండె గుప్పెడయినా..!!

10.  పేర్చిన ఇటుకల్లో_జ్ఞాపకాల సమాధులు...!!

11.  రతనాల రాశులవి_జీవించడం నేర్పిన అక్షరాలు...!!

12.  తూనీగలా తుళ్ళింది_నీ తలపులు ఒంపిన వయ్యారమనుకుంటా...!!

13.   విలాసాల వెర్రితలలు_మనో వికృతరూప ఆవిష్కరణలు..!!

14.   కలతలు వెంబడిస్తున్నాయి_కష్టమైన నిజాన్ని భరించలేక...!!

15.    వేకువ వద్దంటోంది_ముసుగు తొలిగిన మృగాలను చూడలేక...!!

16.    మౌనం మనసు విప్పింది_నీ జ్ఞాపకాలు నాతోనేనని చెప్తూ...!!

17.   అలక అలంకారమైన మెామది_అనునయాల అవసరం లేకుండా...!!

18. కాలమే తెలియలేదు_నీ అనురాగఝురిలో మునిగిన మదికి...!!

19.   అపహాస్యం అయ్యింది_అభిమానాన్ని నడిరోడ్డున నిలబెట్టిన స్నేహం...!!

20.   ఆత్మీయతానుబంధాలకు నిలయం_ప్రాణమెుకటైన మన స్నేహాం...!!

21.  మీనమేషాలు లెక్కించదు చెలిమి_మనసుని ఆవహించిన మాధుర్యంలో...!!

22.  జ్ఞాపకాలను వరించా_స్మ్రతిగా నిను మిగుల్చుకోలేక..!!

23.   అపస్వరమే బావుంది_అసలు స్వరూపం బయటపడితే...!!

24.  నానార్థాలెక్కువయ్యాయి_నరుని నాలుక వంపుల్లో పడి...!!

25.  ఊసరవెల్లి సహజ లక్షణం_మనిషి నైజానికి ఆపాదిస్తూ...!!

26.  దిగజారుడుతనానికి నిదర్శనం_మా(కా)టే'సిన మార్పు..!!

6, డిసెంబర్ 2017, బుధవారం

స్నేహానికి మరో కోణం...!!


   

నేస్తం,

        స్నేహం ముసుగులో కొందరు చేసిన మోసాన్ని భరించాక ఈ నాలుగు మాటలు చెప్పాలనిపించింది. ఇంటి మనిషి అని నమ్మినందుకు ఇంటినే అల్లరి చేసి, ఎవరో ఒకరు కాస్త ఆవేశంలో, బాధలో ఆలోచనలేకుండా పెట్టిన దానికి నమ్మిన స్నేహితులని మోసం చేసిన మనిషి తానే మోసపోయానని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకరినో ఇద్దరినో మంచివాళ్ళు కాదని అనడం సహజం కానీ ప్రతి ఒక్కరిని ఇంటికి తీసుకువచ్చి వారి వెనుక వారిని చాలా చెడ్డగా మాట్లాడటం కొందరి సహజ లక్షణం. తన అవసరానికి అడ్డాగా నా స్నేహాన్ని, ఇంటిని వాడుకుని పాపం బోలెడు కష్టాలు నా ఇంట్లో పడ్డానని వారికి చెప్పి మరి కొందరి ఇండ్లలో చేరి వారిని అల్లరిపాలు చేసి, కాపురాల మధ్యన చిచ్చు పెట్టి, నా ఆప్తుల మీద నాకే చెప్పిన మా దొడ్డ ఇల్లాలు. తన అసలు రూపానికి తానే నాకు సాక్ష్యాలు ఇచ్చి, ఆత్మీయమైన స్నేహాన్ని అభాసుపాలు చేసిన మహా 'మనీ' 'షి'.  కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏమి చెప్పలేని అశక్తురాలిని చేసిన ఘనత ఆమెది. తన అనుకున్న వారి దగ్గరే నా గురించి వాగితే వాళ్ళు అప్పటినుండి తననే దూరం పెట్టారు. తాను తప్ప అందరు పాతివ్రత్యం లేనివాళ్లే అని భావించే పతివ్రతాశిరోమణి తాను వాగిన వాగుడు బయటపడుతోందని అందరు ఒకరి గురించి ఒకరు అన్నారని చెప్పడం మొదలు పెట్టి నాలుగురోజులు పబ్బం గడుపుకుంటూ తన ఉనికి కోసం శాయశక్తులా కష్టపడుతోంది. ఇలాంటిదాన్ని, దాని మాటలను  నమ్మినవాళ్లను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. దయచేసి దాని మాయలో పడకండి.  బురదలో పద్మం వికశిస్తుంది కానీ ఈ పుట్టుకలో బురదలో మకిలే ఆభరణం. క్షేత్ర లక్షణాలు బాగా వంటబట్టాయి.
     స్నేహాన్ని వ్యాపారంగా మార్చి లెక్కలు వేయడం, అనుబంధాలను అల్లరిపాలు చేయడం,  ఆత్మీయతను మోసం చేయడం వంటివి వారికి వెన్నతో పెట్టిన విద్య అని తెలుసుకోలేక పోవడం నా తెలివితక్కువతనం. ముఖపుసక్తంలో మంచి చెడు ఉంటాయని మనమే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పవు. ఒకరి మీద ఒకరికి చెప్పి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకుంటారో ఇలాంటి వాళ్ళు. నిజం అనేది ఎప్పటికయినా బయటపడుతుందని మర్చిపోతే ఎలా. పచ్చకామెర్లు సామెత అందరికి గుర్తుండే ఉంటుంది కదా. అదే ఈవిడ నైజం కూడా. చాలామంది నాకు చెప్పారు రెండో వైపు వినకుండా ఎలా అని, నిజానిజాలు తెలియకుండా నేను ఏ నిర్ణయమూ తొందరపడి తీసుకోను. అందులోనూ స్నేహం విషయంలో అస్సలు పొరపాటు చేయను. క్షమ అనే పదం కూడా ఇలాంటి వారికి వాడకూడదు. ఇంతకన్నా ఏమి చెప్పలేను. పెద్దలు, సన్నిహిత మిత్రులు, ఆత్మీయులు ఇచ్చిన సలహాలకి, నాపై చూపిన అభిమానానికి నా కృజ్ఞతలు.
    
నాలాంటి కొందరికి అక్షరాలే  ఆయుధాలైనా ఆదరిస్తున్న ఆత్మీయుల అభిమానమే మాకు అండ. నా కబుర్లు కాకరకాయలు బ్లాగుని గత ఎనిమిదేళ్లుగా అభిమానిస్తూ, ఆదరిస్తున్న అందరికి నా కృతజ్ఞతావందనాలు. తొమ్మిదో వసంతంలోకి అడుగిడుతున్న కబుర్లు కాకరకాయలు పుట్టినరోజు సందర్భంగా నాకెంతో ఇష్టమైన స్నేహాన్ని మరో కోణంలో చూడటానికి బాధగా ఉన్నా మరికొందరు మోసపోకూడదనే ఈ పోస్ట్.     

28, నవంబర్ 2017, మంగళవారం

ఏకాంతం - ఒంటరితనం...!!

నేస్తం,
        ఏకాంతం -  ఒంటరితనం అనేవి ప్రస్తుతం మన అందరితో స్నేహం చేస్తున్న స్నేహితులు. ఏకాంతం కొందరికిష్టమైతే మరి కొందరేమో ఒంటరితనానికి ఏకాంతపు స్నేహాన్ని ఆశిస్తారు. ఒంటరితనం కొందరికి భయాన్ని, బాధను కలిగిస్తుంది. అభద్రతాభావాన్ని ఎక్కువ చేస్తుంది. ఒంటరితనం ఎంత ప్రమాదకారి అంటే ఒక్కోసారి మరణానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. కానీ ఏకాంతం అలా కాదు మరణంలో సైతం మళ్ళి బతికితే బావుండుననిపిస్తుంది.
      మన ఒంటరితనానికి కారణం మనమే అవుతున్నాం. మనకంటూ మనం లేనప్పుడు ఒంటరినన్న భావన పొడచూపుతుంది. తన చుట్టూ ఎందరున్నా ఎవరూలేని ఏకాంతానికి చోటిస్తారు కొందరు. మరికొందరేమో తన అన్న బంధాలెన్నున్నా ఎవరూలేని ఏకాకుల్లా ఒంటరిగా మిగిలిపోతారు.కొన్ని స్వయంకృతాపరాధం అయితే మిగిలినవి విధిరాతలని సరిపెట్టేసుకుంటున్నాం.
     ఒంటరితనం శాపమని, జీవితానికి ముగింపని అనుకుంటే మన  చుట్టూ చీకటే ఉంటుంది. ప్రపంచంలో ఒంటరితనమంత పెద్ద శిక్ష మరొకటి లేదనుకునే ముందు భరించలేని ఆ ఒంటరితనానికి కారణాలను తెలుసుకోగలిగితే దాన్ని అధిగమించడం చాలా సులువు. మనకంటూ, మనకోసం ఎవరు ఉండరు మనం తప్ప. మనలోని మనకిష్టం లేని ఒంటరితనం సమస్యను పెంచి పోషించకుండా దాన్ని నాశనం చేయడానికి మన వంతుగా ప్రయత్నించాలి. నాకు తెలిసి ఏకాంతం ఒంటరితనానికి సన్నిహితం. బాధగా కాకుండా ఇష్టంగా భరిస్తే ఒంటరితనమూ ఓ వరమే నువ్వేంటో నీకు తెలియడానికి. ఈ ప్రపంచంలో మనదే పెద్ద కష్టం అనుకుని మన మీద మనమే జాలి పడటం కన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఇష్టంగా భరిస్తే కష్టమూ ఇష్టంగానే ఉంటుంది. ఒక్కసారి అలా అనుకుని చూడండి ఎంత బావుంటుందో మీకే తెలుస్తుంది... !!

జత కలిపేవారెందరు..??

ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని గగ్గోలు పెడుతున్నాయి కానీ ఆచరణ ఎక్కడ..? నిన్నటికి నిన్న గన్నవరం దగ్గర శివాలయానికి వెళితే తెలిసిన పెద్దావిడ మా ఇంటికి వచ్చేవరకు ఎంత ఇబ్బంది పడిందో.. అభివృద్ధిలో మునుముందుకు వెళుతున్నాం అని నాయకులు చెప్పుకునే మాటల్లో ఎంత నిజం ఉందనేది తేటతెల్లం అవుతోంది. పార్టీ  ఆఫీసులు,  పబ్బులు, మాల్స్, సినిమా హాల్స్ కాదు సామాన్యులకు కావాల్సింది... ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మనం ఏం చేయాలన్నది ఆలోచించండి. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎప్పటిలాగే ఎదురుచూసి మోసపోవద్దు. ఏ రాజకీయపార్టీ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపదు, నిధులు స్వాహా చేయడం తప్ప....
దయచేసి మానవతా భావంతో ఈ సమస్యకు పరిషారాన్ని చూపండి. సుందర్ మోహన్ గారు ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఊరికి కట్టిద్దాం అంటున్నారు. తన వంతుగా 5000 రూపాయలు ఇస్తాను అని కూడా అంటున్నారు. మొదటి అడుగు పడింది. మరి ఆ అడుగులో జత కలిపేవారెందరు..??

https://www.facebook.com/jordarpori/videos/523662558010068/

27, నవంబర్ 2017, సోమవారం

సహజత్వమైన నటన...!!

నేస్తం, 
          సూక్తిముక్తావళి సూక్తులు చాలా ఎక్కువై, మనం పెట్టే సూక్తులు మనకే వర్తిస్తున్నాయని మర్చిపోతూ మనమూ గురువింద గింజలమై పోతున్నాం. మనలో సహజత్వమైన నటన సహజాతంగా మనతో కలిసిపోయిందని ఇతరులు గుర్తించరని అనుకుంటే అది పొరబాటే. మనం మంచివాళ్ళం అని నలుగురు గుర్తించడానికి మనతోనే ఉన్నవారిని అల్లరిపాలు చేయడం, లేనిపోని నిందలు వేయడం, అవాకులు, చవాకులు పేలడం వంటి పనులు ఎంత వరకు సబబు...? 
          వ్యక్తిత్వం పుట్టుకతోను, పెరిగిన పరిసరాల నుంచి మనకు ఆభరణంగా వస్తుంది. మన చుట్టూ వెన్నెలే చిమ్ముతున్నామని మనమనుకుంటే సరిపోదు, చీకటి నుంచి ఆ వెన్నెలను అనుభూతించే వాళ్లకు తెలుస్తుంది ఆ చల్లదనం. జీవితం విలువ తెలిసినవాళ్ళు ఇతరుల జీవితాలను నవ్వులపాలు చేయడానికి ప్రయత్నించరు. విలాసాలు, విందులు జీవితం కాదు, మనలని నమ్మినవాళ్లకు నేనున్నానన్న భరోసా ఇవ్వగలిగితే ఆ నమ్మకానికి వెల కట్టలేము. బంధం అనేది బలీయంగా ఉండాలి కానీ భరించలేనిదిగా ఉండకూడదు. ఆచరణ లేని సూక్తిముక్తావళి అసహ్యంగా ఉంటుంది. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, మనసుతో ముడిపడేది. నిజాయితీగా బతకాలంటే చాలా ధైర్యం కావాలి, సమయమూ ఉండాలి కానీ ఆ నిజాయితీని కోల్పోవడానికి ఒక్క క్షణం కానీ, ఓ మాట కానీ చాలు. నమ్మకం పోయిన తరువాత మళ్ళి ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే వెనక్కు ఎలా తీసుకోగలం..? 
          మనసులతోనూ, మనుష్యులతోను బంధాల పేర్లు, స్నేహ సంబంధాల ముసుగులు వేసి వక్ర భాష్యాలతో మంచితనంగా నటిస్తూ మోసాలు చేస్తున్న ఎందరో మహానుభావులందరికి మా పాదాభి వందనాలు. కాని ఒకటి మాత్రం మర్చిపోకండి ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీమీదే పడుతుందని తెలుసుకోండి చాలు...!!

26, నవంబర్ 2017, ఆదివారం

నాలోని నువ్వు పుస్తక సమీక్ష...!!

         సాహిత్యంతో గత 20 ఏళ్లుగా అనుబంధం ఉన్న సాహితీవేత్త శ్రీ మహిది ఆలీ గారు. కథా రచయితగా,
నవలాకారునిగా సాహితీ లోకానికి చిరపరిచితులు. వీరి మనసు నుంచి జారిపడిన అక్షరాల కవితా ప్రవాహం " నాలోని నువ్వు" గా మనముందుకు వచ్చింది. ఈ కవితాసంపుటి గురించి సమీక్ష రాయడం ఆంటే అది నాకు చేతగాని పనే. ఎదో నాలుగు మాటలు నాకు తోచిన విధంగా మీ ముందుంచుతున్నాను.
       ఈ సృష్టిలో అనిర్వచనీయమైన అవ్యక్తానుభూతి ప్రేమని ఆహ్లాదంగా, అందంగా తన అక్షరాల్లో పొందుపరచి మనముందుంచారు ఆలిగారు. నువ్వొక్కదానివే వెళ్ళిపోతే నా జీవితమేమి శిశిరమైపోదు, కానీ వసంతం కూడా ఇక నా దరికి రాదు అంటూ నాలోని నీకై అన్న చిన్న కవితలో నువ్వులేని నేను లేను అంటూ ఎంత గొప్పగా చెప్పారో. నీ  కోసంలో రెండు విషయాలే అంటూ ఓ ప్రేమికుడి ఆత్మానందాన్ని మనకు చాలా అలవాటైన పదాల్లోనే పరిచయం చేశారు. ఇంతవరకు తీయనిది.. తీస్తే తీయనైనది.. ని మనసులో నాపై ఉన్న భావం అని అందమైన భావంలో ప్రేమతత్వాన్ని బహు చక్కగా చెప్పారు. ఇలానే చూడలేమా అన్న కవితలో కూడా తన భావుకత్వాన్ని ప్రేమ పరిపూర్ణత్వాన్ని పలికించారు. నక్షత్రాలను లెక్కబెడుతూ ఉండు .. మళ్ళి వస్తానని చెప్పి వెళ్లిన నేస్తపు నిష్క్రమణాన్ని ఎంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయావు నేస్తమా లో చదువుతుంటే మనసు ఓ అలౌకిక లోకములోనికి వెళ్ళిపోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎ భావాలైతే పెదాలు చెప్పలేవో ఏవ్ కన్నీరు అవుతాయి అని కన్నీళ్లకు ఓ సరి కొత్త భాష్యాన్ని చెప్పారు. నీకెలా చెప్పనూ లో సముద్రపు సాంద్రతతో ప్రేయసిని పోల్చడంలో మనకు అక్షరాలను ఆపాదించిన అలంకారాలను నిజాయితీగా తన మనసులో జనించిన భావాలకు జీవం పోశారు. నువ్వుండకపోవచ్చు అనుక్షణంలో నువ్వు నాతోలేని శూన్యాన్ని నీ జ్ఞాపకాల  నింపుకోవడానికి తపన పడుతున్నానంటారు. నువ్వొక్కదానివే వెళ్ళిపోతే ఎవరు నాతో లేకపోయినా నువ్వుంటే చాలు అనుకునే అమాయకత్వాన్ని అద్భుతంగా చెప్పారు. ఇక తెలిసిందిలేలో ప్రేయసి మనసు గెలిచిన సంతోషాన్ని అందించారు. నా హృదయాన్ని స్పృశించవూ అంటూ చిరు ఆశలని వివరిస్తూ భావాల తడిని మనసు సవ్వడికి ఆపాదించారు. ఆకృతిలో అస్పష్ట జీవితానికి పరిపూర్ణ ఆకృతి ఎలా వస్తుందో మనిషిలోని వివిధ భావాల ముసుగులు పొరల నుంచి పరిణితి చెందిన పూర్ణ వ్యక్తిత్వం ఎలా ఉండాలో వివరించారు. అందాన్ని సరికొత్త కోణంలో చెప్పారు. రా నేస్తమా అంటూ ఇద్దరి మధ్యన సయోధ్యకు సోపానాలు ఏమిటనేది చెప్పారు. అసంకల్పితంగా జరిగే కొన్ని చర్యలను అందరి మనోభావాలేనని చెప్పేసారు. కాగితపు పూలు గురించి చెప్పాలంటే దీని ఒక్కదానికే సమీక్ష రాయాల్సి ఉంటుంది.  నాకు చాలా ఇష్టమైన కవిత ఇది. ప్రేయసికి ఇవ్వడానికి పూలను కానుకగా కోద్దామనుకున్న ప్రియుడికి వినిపించిన ఆధునిక పుష్ప విలాపం అనిపించింది. ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన అద్భుతం దాగిఉంది ఈ కవితలో. నీ  మనసు, నేస్తమా చూసుకో ,అందం, ఎలా గుర్తుంచుకుంటావు నన్ను, భావ్యం కాదు కదా, స్మృతి మొదలైన కవితల్లో మరపురాని ప్రేయసి జ్ఞాపకాల గురుతులను, పల్లె మనసులో తెలంగాణా యాసలో పల్లె ప్రేమ స్వచ్ఛతను అందించారు. స్వరం, స్మృతులు చెదారావు కదా, నీ మహిమ, అసాధ్యం కదా కవితల్లో తన మది ఆశల రంగుల
కలలను చూపించారు. ప్రేమలో చెప్పిన నాలుగు వాక్యాల్లో ప్రేమలోని గాఢతను చూపించారు. వెళ్లిపోతూ ఉన్నది, నీ  తోనే కదా,  కొన్నిసార్లు, నీ రాక వంటి కవితల్లో కాలాన్ని ప్రేయసి గురుతుల గమనాన్ని అక్షర భావాల్లో ఇముడ్చుతున్నా అని చెప్పడం బావుంది.  మస్త్ యాదికొస్తావే మరో తెలంగాణా మాండలిక కవిత. సాంత్వన, నువ్వెందుకిలా అయ్యావు, ఏమైపోయింది నీకు కవితలలో దూరం చేసిన చెలి ప్రేమను ఎందుకిలా చేసావని ప్రశ్నిస్తారు. గ్యాపకం వస్తావే కవిత మరో ఆణిముత్యం.. తమతో అమ్మలేని దూరాన్ని అక్షరాల్లో కొలిచి నాన్నకు తోడుగా ఉంటామని చాలా హృద్యంగా చెప్పారు. ఏమని కోరను, నువ్విలా ఉంటావు, నీ విజ్ఞత అది, శిశిర దశ, ఇంతకూ మించి ఏంకావాలి కవితల్లో రాలిపోతున్న ఆశల చిగురుదనాన్ని బాగా చెప్పారు. కవిత పుట్టుకను తనదైన మాటల్లో చెప్పారు. చివరి కోరికలో తరగని దూరాన్ని కొలవలేనని చెప్పడం ఆలిగారి భావ ప్రకటనకు పరాకాష్ట.  ప్రేమ విఫలమైతే ప్రేయసి ఆత్మను త్యజించడం ఎంత నిగూఢమైన భావాన్ని నింపిందో కవితలో మనకి తెలుస్తుంది. నీకు నీ జ్ఞాపకానికి తేడా ఏమిటనేది తేడా కవితలో చక్కగా చెప్పారు. ఎలా చెప్పనూ, తేడా ఆమెకు అతనికి ఇంతే, తనే కదా,  స్పందన, తార్కాణం, వేచిచూడు, నిరీక్షణ, వెళ్ళాకనే కదా తెలిసేది, మరవకు, అందం, ఎవరితరం కాదు, సహజత్వం, సందిగ్ధం, అదృశ్య దూరం, చనువు, స్తబ్దత, ప్రత్యేకత, ఏకాంతం, ముత్యాలు వంటి కవితలు ప్రేమలోని దూరాన్ని, దగ్గరతనాన్ని జ్ఞాపకాలతో పంచుకోవడం చాలా బావుంది. మరి ఎలా కవితలో మరచిపోలేని గతానివి నువ్వైతే వెంటాడే జ్ఞాపకాన్ని నేనంటారు. నా జీవితానికి కవితలో తన ప్రేమ పారదర్శకతను నిరూపించుకున్నారు. కేవలం ఇంతే, నిద్ర రానప్పుడు, ఏనాటికి తిరిగి రానివి కవితలు కూడా ప్రియమైన ప్రేమవే. చేయుట ఇస్తారు కదూ కవితలో అమ్మానాన్న వదిలేసిన ఓ పసి హృదయపు ప్రేమ రాహిత్యం కనిపిస్తుంది. అమరత్వం కవిత గతంగా నే మిగిలినా ఓ సజీవ చరిత్రగా నిలబడతానని ప్రేమ సగర్వంగా చెప్తుంది. వస్తాడు ఒకరోజు కవిత ప్రేమకు ధీటుగా రాసిన సామాజిక ఉద్యమ కవిత. భార్య, నిశబ్దం, నాన్న, కోపం రాదా, కూతురు, కోల్పోయినవి, నిజం, ఒక తండ్రి ఆవేదన, ఉద్యోగిని, ఎన్నాళ్ళయింది, కఠినం, ఎప్పుడొస్తావు నాన్న, ఆర్ధ్రం, మర్చిపోకూ, సంఘర్షణ, తోడు, నేటి సమాజం, మట్టి  బంధం,నిశబ్దం ధ్వనిస్తే వంటి కవితలు సమాజంలో మానవ సంబంధాలు, అనుభూతులు, ఆప్యాయతలు, ప్రేమానురాగాల, కుటుంబ విలువలు తెలియజెప్తాయి. చివరిగా నా అక్షరాలు కవిత తిలక్ అక్షరాల్లా వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలు కాకపోయినా ఒక్కోసారి గ్రీష్మంలో ఆహ్లాదాన్నిచ్చే చిరుజల్లులు కదా... అని మన అంగీకారాన్ని సవినయంగా కోరుతున్నాయి...

మహిది ఆలీ గారు మరిన్ని అందరి మనసులకు చల్లదనాన్నిచ్చే చిరు అక్షర కావ్యాల ముత్యపు చినుకులు మన ముందుకు తేవాలని కాంక్షిస్తూ... అభినందనలతో ఈ "నాలోని నువ్వు" కవితా కన్నియకు అభినందనలు....!!

22, నవంబర్ 2017, బుధవారం

తెలుగు గురించి నాలుగు మాటలు...!!

నే రాసిన తెలుగు గురించి నాలుగు మాటలు ఈరోజు ఆంధ్ర ప్రభ వార్తాపత్రిక లో చోటు చేసుకున్నాయి. దానికి కారణమైన సుబ్రహ్మణ్యం గారికి,  వారిని పరిచయం చేసిన సూర్య ప్రకాశరావు  గారికి, సంపాదక  వర్గానికి నా ధన్యవాదాలు.....

http://epaper.prabhanews.com/m5/1439603/Hyderabad-Main/22.11.2017-Hyderabad-Main#page/4/1

భాష లేనిదే జాతిలేదు అన్నది ఎంత నిజమంటే ఈనాడు తెలుగుజాతి ప్రాంతీయత కోసం విడిపోయినా అందరు తెలుగువారే అన్నంత నిజం. లిపి లేకుండా భాష లేదు. మాండలికాలను మమేకం చేసుకున్న భాష మన తెలుగు భాష. తెలుగు సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబించేది మన తెలుగు భాష. భాతరదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష తెలుగు. త్రిలింగ అనే పదం నుండి పుట్టింది తెలుగు అని, తేనే వంటిది తెనుగు అని నానుడి. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌గా వ్యవహరించారు.

   అజ్ఞాత యుగం,.ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు మనిషి మనుగడలో పరిణామక్రమాలున్నట్లే భాషలోనూ మార్పులు చోటుకున్నాయి. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలుగుభాషకు ప్రాచీన హోదానైతే తీసుకురాగలిగారు కానీ తెలుగుభాష మనుగడకు ఏర్పడుతున్న ముప్పును తప్పించలేక పోతున్నారు. తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన సంతోషం లేకుండా అంతరించి పోతున్న తెలుగు అక్షరాలను కాపాడుకునే ప్రయత్నంలో తెలుగు భాషాభిమానులు వివిధ సాహితీ ప్రక్రియలను అందుబాటులోనికి తెస్తూ తాము చేసే పనికి ప్రభుత్వ సహకారం అందక పలు ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రాచీన హోదాకు కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అక్రమంగా తరలించబడుతున్నాయి. దానిలో కాస్తయినా తెలుగుభాషను బ్రతికించడానికి ఉపయోగిస్తే బావుంటుంది.    

      తెలుగు భాష మీద మమకారం ఎంతగా ఉంటే  తెలుగుభాషా వికాసం అంతగా జరుగుతుంది. అమ్మ పాలు బిడ్డకు ఎంత అవసమో అమ్మభాష మీద కూడా మమకారం కూడా అంతే అవసరం. అక్షరాలూ, పదాలు, నుడికారాలు, పద పొందికలు, సొగసులు  చెప్పుకుంటూపొతే చాలా ఉంటాయి భాషలో.  అంతరించిపోతున్న తెలుగుభాషలోని అందాలను మన తరువాతి తరాలకు అందించాలంటే తెలుగుభాషను వినేటట్లు చేయడం ముఖ్యం. మనకున్న ఎన్నో సాహితీ ప్రక్రియలు, నృత్య రీతులు అందుకు దోహదపడతాయి. రూపకాలు, పాటలు, వినసొంపైన  తేలిక పదాల పద్యాలు పిల్లలకు వినిపించి నేర్పించడం ద్వారా తెలుగుభాషపై ఇష్టాన్ని పెంపొందించవచ్చు. 

     బిడ్డకు తల్లికి మధ్య భాష అవసరం లేకపోవచ్చు, స్పర్శ ద్వారా అనుభూతులను పంచుకుంటారు తల్లిబిడ్డలు. అమ్మపాడే జోలపాట ప్రతి బిడ్డకు అమృతతుల్యమే. పాటలో స్వరాలూ, సంగీతము బిడ్డకు అవసరం లేదు, అమ్మ గొంతు ఎలా ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం బిడ్డకు అద్భుతంగా ఉంటుంది. అలానే మన తెలుగుభాషలో ఎన్ని  ప్రాంతీయతలున్నా అన్ని జనరంజకాలే.  జోలపాటలు, లాలిపాటలు, జనపదాలు, జానపదాలు, లొల్లాయి పాటలు, పల్లె పదాలు ఇలా అన్ని తెలుగు వెలుగులే.  ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుంది కానీ అక్షరాలు ఒక్కటే. ప్రాంతాన్ని బట్టి ప్రతి యాసకు ఓ సొగసుంటుంది. మాండలికాలకు మకుటంగా మన తెలుగు భాష నిలిచింది. 

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.

మన ప్రాంతాలలోనే కాకుండా తెలుగును ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వాడుతున్నారు. భాషలన్నింటికీ మూలం దేవభాష సంస్కృతం. దీని నుండి పుట్టిన భాషలన్నీ పదాలను కలుపుకుంటాయి. అందుకే ఇతర భాషల్లోని పదాలు మన తెలుగు భాషలో చాలా వరకు చేరిపోయాయి.  సుసంపన్నమయినదిగా, సుమధురమైనదిగా తేనెలొలుకు తెలుగు భాష దేశభాషలందు తెలుగులెస్స అని అందరితో కీర్తించబడుతున్నది. 



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner