20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువదవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన సాహితీ ముచ్చట్ల ప్రయాణం క్రిందటి వారం తెలుగు స్వర్ణ యుగాన్ని... దానికి మూలమైన ఆంధ్ర భోజులు శ్రీకృష్ణ దేవరాయల గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాము... ఈ వారం రాయల యుగం తరువాతి యుగమైన దక్షిణాంధ్ర యుగం గురించి కొన్ని వివరాలు చూద్దాం...

1600 - 1775 : దక్షిణాంధ్ర యుగము

తెలుగు సాహిత్యంలో 1600 నుండి 1775 వరకు దాక్షిణాత్య యుగము అంటారు.

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
  • పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
  • క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.

రఘునాథ నాయకుడు తంజావూరు ను ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. పారిజాతా హరణం అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే సంస్కృతం లో రచించినాడు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు వాల్మీకి చరిత్ర, రామాయణము అను పద్య కావ్యములు, నల చరిత్ర అను ద్విపద కావ్యము, జానకీ కల్యాణం అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను యక్ష గానములు. ఈయన పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు మరియు కర్ణాటక సంగీతము నకు ప్రధాన కేంద్రమైనది.

ప్రారంభ జీవితం

రఘునాథ నాయకుడు, అచ్యుతప్ప నాయకుని పెద్ద కుమారుడు. తండ్రి ఘోర తపస్సు చేసిన తర్వాత కలిగిన సంతానము. రఘునాథాభ్యుదయము మరియు సాహిత్యనాట్యకారలో ఈయన బాల్య వివరాలు వివరంగా ఇవ్వబడినవి. బాలునిగా ఉన్నప్పుడే రఘునాథునికి శాస్త్రాలు, యుద్ధవిద్యలు మరియు పాలనవ్యవహారాలలో మంచి శిక్షణ పొందాడు. రఘునాథ నాయకునికి అనేకమంది భార్యలు ఉండేవారు. ఈయన భార్యలలో ప్రముఖురాలైన కళావతి, "రఘునాథాభ్యుదయం"లో పట్టపురాణిగా వర్ణించబడింది. తంజావూరు నాయక వంశ చరిత్ర వ్రాసిన రామభద్రమ్మ రఘునాథుని భోగపత్ని. 
తొలిరోజుల్లో రఘునాథ నాయకుడు గోల్కొండ రాజ్యంతో పోరాడి అందరి ప్రశంసలు అందుకొన్నాడు. రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు.

కళా పోషణ

రఘునాథ నాయకుడు సంస్కృతము, ఆంధ్రము లలో తొమ్మిది రచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 4 మాత్రమే లభ్యం.. వీనిలో 3 ప్రబంధాలు. అవి
  • 1. వాల్మీకి చరిత్ర : వాల్మీకి గాథ కావ్యంగా రచించబడింది.
  • 2. రఘునాథ రామాయణము: కొంతమాత్రమే లభిస్తోంది. శ్రీ రామచంద్రునికే అంకితమీయబడింది.
  • 3. శృంగార సావిత్రి: ఇది శృంగారప్రబంధం. దీని మరో పేరు ' సావిత్రీ కల్యాణం '.
ఈయన ఆస్థానంలోని కవులలో ప్రముఖులు :
  1. చేమకూర వేంకటకవి
  2. గోవింద దీక్షితులు
  3. యజ్ఞనారాయణ దీక్షితులు
  4. కృష్ణాధ్వరి
  5. రామభద్రాంబ
  6. మధురవాణి

ఈ కాలంలో కవయిత్రులు ముద్దుపళని, రంగాజమ్మ, మధురవాణి, రామభద్రాంబ

ముద్దుపళని
(1730-1790) 18వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. ఈమె 1739 నుండి 1763 వరకు తంజావూరు నేలిన మరాఠ నాయక వంశపు రాజు ప్రతాపసింహ యొక్క భోగపత్ని. ఈమె ప్రతాపసింహుని ఆస్థానములో నెల్లూరు శివరామకవితో పాటు ఆస్థాన కవయిత్రి కూడా. ముద్దుపళని యొక్క గురువు తిరుమల తాతాచార్యుల వంశమునకు చెందిన వీరరాఘవదేశికుడు.
దేవదాసీల కుటుంబములో జన్మించిన ముద్దుపళని తల్లి పోతిబోటి, అమ్మమ్మ తంజనాయకి కూడా కవియిత్రులని, తండ్రి పేరు ముత్యాలు అని రాధికా స్వాంతనముకు ఈమె రాసిన ప్రవేశికలో తెలుస్తున్నది.
ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము. అలిగి కోపముతో ఉన్న రాధను కృష్ణుడు బుజ్జగించడము ఈ కావ్య ఇతివృత్తము. దీనికి యిళా దేవీయము అని కూడా పేరుకలదు. చిన్ని కృష్ణునికి అకింతమైన ఈ గ్రంధములో నాలుగు భాగములలో 584 పద్యములు కలవు. ముద్దుపళని యొక్క వర్ణనా శైలిని అనుకరించి నంది తిమ్మన పారిజాతాపహరణము రచించాడని ఒక ఆలోచన కలదు.
ముద్దుపళని యొక్క కవితా జాలమునకు ఒక మచ్చుకైన ఉదాహరణ
శౌరిని బిల్వగా జనిన చక్కని కీరమదేల రాదొయే
దారిని జన్నదో నడుమ దారెనో చేరెదొలేదొ గోపికా
జారుని గాంచెనోకనదొ చక్కగ నావెతవిన్నవించెనో
సారెకులేక శౌరినుడి చక్కెరయుక్కెఋఅ మెక్కిచిక్కెనో
                -- రాధికా సాంత్వనము 2-104.
ముద్దుపళని గొప్ప విష్ణు భక్తురాలు. ఈమె గోదాదేవి రచించిన తిరుప్పావై లోని 30 పాశురాలలో పదింటిని తెలుగులోకి అనువదించి సప్తపది అని నామకరణము చేసినది. వైష్ణవులు ధనుర్మాసములో సప్తపదిని పఠిస్తారు.

పసుపులేటి రంగాజమ్మ
17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరు ను పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
రంగాజమ్మ మన్నారు దాసవిలాసము అనే కావ్యము రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.
ఒక చాటువు విజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం:
ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ

ఒక నింద

తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ ఆత్మహత్యకు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.

రచనలు


  • మన్నారు దాస విలాసము
  • ఉషా పరిణయము
  • రామాయణ సంగ్రము
  • భారత సంగ్రహము
  • భాగవత సంగ్రహము

మన్నారు దాస విలాసము

ప్రాకృతనాటకమనబడు ఈ యక్షగానం మన్నారు దాస విలాసము రంగాజమ్మ రచించినది. దీనిని 1926లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించింది.

మధురవాణి
తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానములో విదుషీమణులలో ఒకరు. "శుకవాణి" అని ఈమె మొదటి పేరు . సంస్కృతములో సుందరకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణముగా లభించలేదు. 1500 శ్లోకములుగల 14 సర్గల గ్రంధము మాత్రమే లభించుచున్నది. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలో" మధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా" అని ఈమె చెప్పుకున్నది.

భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)

వాగ్గేయకారులలో ఆధ్యుడు

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు.

చేమకూర వెంకటకవి
నాయకరాజుల్లో ముఖ్యుడు, సాహితీప్రియుడైన రఘునాథనాయకుని కొలువులో ప్రముఖ కవి. దక్షిణాంధ్ర సాహిత్య యుగంలో చేమకూర వెంకటకవిది ముఖ్యస్థానం.

జీవిత విశేషాలు

చేమకూర వెంకట కవి కాలం క్రీ.శ.1630 ప్రాంతం. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు.

రచనలు

చేమకూర వెంకటకవి సారంగధర చరిత్ర, విజయవిలాసం రచించారు. ఆయన రచనల్లో విశిష్టమైన విజయవిలాసాన్ని అర్జునుడి(విజయుని) తీర్థయాత్ర, మానవ, నాగ కన్యలను అయన వివాహం చేసుకోవడం ఇతివృత్తంగా రచించారు.

శైలి

ప్రబంధయుగాన్ని దాటి దక్షిణాంధ్రయుగంలోకి సాహిత్యం అడుగుపెట్టాకా ఆ శైలిలో అత్యున్నత స్థాయిని అందుకున్న కవి చేమకూర వెంకన్న. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చమత్కారాలతో కళ్లు మిరుమిట్లుగొలిపేలా చేస్తారంటూ ఆయన శైలిని ప్రముఖ సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మం ప్రశంసించారు.

ప్రఖ్యాతి

చేమకూర వేంకటరాజకవిని, అతడు వ్రాసిన ప్రబంధరాజాలు విజయవిలాసం, సారంగధర చరిత్రలను నోరార ప్రశంసించని కవులుగాని, పండితులుగాని, విమర్శకులుగాని ఈ మూడువందల యాభై సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో ఎవ్వరూ లేరని నిరాఘాటంగ చెప్పవచ్చు. కొందరు చేమకూర పాకాన పండిందన్నారు. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందన్నారు కొందరు. చక్కెరమళ్ళలో అమృతం పారించి పండించిన చేమకూర అని ఒకరు అన్నారు. ఇంకొకరు కడుంగడుం గడుసువాడు అని మెచ్చారు.
కందుకూరి వీరేశలింగము "అచ్చ తెలుగు పదములను పొందికగ గూర్చి కవనము చెప్పు నేర్పు ఈ కవికి కుదిరినట్లు మరియొక కవికి కుదిరిందని చెప్పవనలు వడదు ...పింగళ సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునకు తరువాత విజయవిలాసము సర్వ విధములచేతను తెలుగులో శ్లాఘ్య కావ్యముగ నున్నది, జాతియాది చమత్కృతినిబట్టి విజయవిలాసమే శ్లామ్యతరమయినదని అనేకు లభిప్రాయపడుచున్నారు" అన్నారు. కృతిపతి రఘునాథనాయకుడు "ప్రతి పద్యంలోనూ చమత్కృతి ఉండేట్టు రచించా"వని చేమకూర వెంకన్నను ప్రశంసించారు.

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది.
క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

క్షేత్రయ్య పద విశిష్టత

మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు.
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దం లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా కు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.

క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది -
  • భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం.
  • క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది.
  • ఈతని పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో షుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడాడు.
  • క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ.దృశ్య యోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడాడు.మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశాడు.
  • ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంధి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనాడు.



మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం
ఆనంద భైరవి రాగం - ఆదితాళం
పల్లవి:
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner