7, అక్టోబర్ 2018, ఆదివారం

మైనపు బొమ్మలు సమీక్ష...!!

                      ఆంతర్యాలను స్పృశించిన అక్షరాలు ఈ మైనపు బొమ్మలు..!!     

సుధాకర్  లోసారి కవిత్వం చదువుతుంటే వృత్తికి, ప్రవృత్తికి, సామాజిక విలువలకు, మానవత్వానికి, మంచితనానికి ప్రతీకలుగా చిన్న చిన్న పదాలతో అర్ధవంతమైన భావాలను అక్షరీకరించారని చెప్పడం అతిశయోక్తి కాదు. మైనపు బొమ్మలు సమీక్ష రాయడానికి చదవడం మొదలు పెట్టిన వెంటనే మొదటి కవిత నుంచి చివరి కవిత వరకు మనసు తడి గుండెలను తాకుతూనే ఉంది.
   వానాకాలం మన చిన్నప్పుడు ఎలా ఉండేదో, వాన కోసం ఎదురుచూసిన కరువు నేల తడిసి ముద్దైన తీరు, దాన్ని చూసిన సంతోషాల సంబరాలు, వాస్తవంలో రాని వాన కోసం తపన పడుతూ రాతిరి కలలో
" వానలో తడిచిన నేను
నాలో తడిచిన వాన
తడిచి తడిచి చెరిసగం మట్టిముద్దలవుతాం. " అంటూ కలల పక్షుల కోసం ఎదురుచూడటం చాలా బావుంది.
ఓ నా ప్రియ సైనికుడా కవితలో
" ఏ వీర స్వర్గపు ద్వారాల వద్దో నీవు
నన్నీ చీకటి తీరాన్నొదిలి..." తన వద్దకు వస్తాడో రాడో తెలియని సందిగ్ధతను సైనికుడి భార్య పడే వేదనను, వియోగాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పలేరేమో.
" బతుకు ద్వార బంధాల వద్ద తలక్రిందులై వేలాడే గబ్బిలాల జీవితాలు మావి, చీకటి ఖండాలు మా జీవితాలు, దేవుడా నగ్న హృదయంతో నమస్కరిస్తున్నా, మావి కాని జీవితాలు మాకెందుకని గబ్బిలాలు కవితలో పావలాకి, పాతిక్కి అంగడి సరుకులైన బతుకుల ఆక్రోశాన్ని వినిపిస్తారు తనదైన గొంతుకతో.
కర్ఫ్యూ కవితలో యుద్దానికి, విధ్వంసానికి మధ్యన ఓ గంట విరామ కాలాన్ని వాస్తవాల దృశ్యాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. మానవీయుడు కవిత మనలో మరో మనిషిని మేల్కొల్పుతుంది. ట్రాఫిక్ పోలీస్ గురించి చెప్పిన అక్షర సత్యం ఇది.
" కాలుతూ నానుతూ సహనమై
మానవీయ స్నేహమై
నాలుగు రోడ్ల కూడలిలో
అతనలా అలుపెరగని యోధుడై
కాలానికి క్రమశిక్షణ నేర్పుతూ.."
ఉద్యమ గీతంలో నిజాలకు, అబద్ధాలకు మధ్యన నిలిచిన శాసనాల చీకటిపై ధిక్కారాన్ని ప్రకటిస్తారు.
అమ్మని లేకుండా చేసిన కాలం మీద కోపాన్ని, అమ్మతోనూ, తనకి జ్ఞాపకాలనిచ్చిన అమ్మ గదితోనూ తన అనుబంధాలను తల్చుకుంటూ అమ్మ గురుతులు దాచుకోవడానికి అక్షరాలను హత్తుకోవడం అద్భుతం.
ఏకాకి ప్రయాణం కవితలో అపరిచితులుగా మిగిలిపోయిన రెండు మనసుల మద్యన ప్రేమ ఏకాకిగా నిలిచి ఎవరిది  వారిది ఒంటరి ప్రయాణం అంటూ ముగించడం కొత్తగా ఉంది. లోకమంతా వెలుగులు చిమ్మే మానవతా దీపాన్నవుతానంటారు మానవత్వం నా మతం కవితలో. జ్ఞాపకాల స్వప్నాలను వెదుకుతుంటారు నిరీక్షణ కవితలో.
పోగొట్టుకున్నది ఎవరికీ దొరకదని, కాలం ఎవరిదీ కాదని వెదకాలి కవితలో చెప్తారు. చావుకి, బతుక్కి,  ఆనందానికి,విషాదానికి పెద్ద తేడా లేదంటూ పల్లె గొడవల్లో ఇరు కుటుంబాలు క్షతగాత్రులే అంటూ ఫ్యాక్షన్ గొడవలకు వాస్తవ రూపాన్ని ఆవిష్కరించారు. అరుణిమ కవితలో అన్యాయానికి సమాధానం చూపించారు. నిశ్శబ్దంగా చెట్టు కరిగిపోయి ఒక అనాధ గీతమాలపించడం, మనసైన జ్ఞాపకంగా ప్రియసఖి, డయానా స్మృతికి స్వేచ్చా గీతాన్ని ఆలపించడం, జీవితం ఓ పెద్ద అబద్దం, బతుకు బార్లా తెరిచిన రహస్యం, ఎప్పుడు తడి గాయాల పర్వమే అంటూ అంగడి బొమ్మల ఆవేదనను ఎండుపూలు కవితలో చెప్తారు. వెలుతురు పాట పాడుతూ ప్రశ్నించడం కావాలంటూ తుపాకీ నీడలో నిలబడతారు. ఊరి పొలిమేర గ్రామదేవత గ్రామ కక్షలకు, కార్పణ్యాలకు సాక్ష్యమని ఆ పరిస్థితులను వివరిస్తారు. నిషేధించే నిజాలను, విజేతలను, పరాజితులను, అక్షరాల పరమార్ధాన్ని అందించిన ఆమెకు ప్రణామాన్ని, చరిత్ర మరచిన రాత్రులను గుర్తుచేస్తూ, ఊహారేఖలో అనువదించుకుంటూ, విశ్వమానవ దీపావళి కోసం కాలానికి అటు ఇటు గాయాలను తుడుస్తూ, రాలుతున్న పసి మొగ్గల కథనాలను అక్షరాల్లో చూపిస్తూ కవిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఓ యుగాంతానికి ఎరుపెక్కిన ఆకాశాన్ని పరిచయం చేస్తూ, పంజరంలోని ఆమె దేహాన్ని, శూన్యమైన అస్థిత్వపు బతుకును, హెచ్ ఈ వి తో ఆఖరి పోరాటాన్ని, ఇరు సంధ్యల అందాన్ని, ఆట వేట అడవిలో మొదలైనా నేటి నగరపు అడవిలో నాగరికత ఓ మహా అనాగరికత అని చెప్తారు. మానని గాయానికి మందు రాసి మహానుభావుల కోసం ఎదురు చూడటం, మా ఊరొక  వసుదైక కుటుంబం అంటూ సేద దీరడానికి తన ఊరెళ్ళినప్పుడు కనిపించిన, అనిపించిన భావాలకు, ఒకప్పటి జ్ఞాపకాల గురుతులను మేళవించి మన అందరిని కూడా మన ఊరికి పయనింపజేస్తారు. వియోగాన్ని ది బెడ్ రూమ్ కవితలో, మనసులోని ప్రేమను ప్రవహించే జ్ఞాపకంగా, రెండు గుండె గొంతుల ఏక గీతాన్ని గాయ పడిన ఒక మౌన శబ్దంలో, విషాద మోహనాన్ని విరచించడం, సూర్య చంద్రులను, ఉన్మాద ప్రేమను, నిజాలను నీడలను నిర్భయంగా చెప్తారు. ప్రశ్నించడం ఒక చారిత్రక అవసరమంటూ, నల్ల పంజరపు అవశేషాలను వెలికి తీస్తారు. పిడికిలి పట్టును గుర్తెరగమంటారు. వాస్తవికతను దూరం చేస్తున్న ఆధునికతను నాలోంచి నాలోకి కవితలో ఎవరికి వారు తరచి చూసుకునేటట్లు చెప్తారు.
ఘనీభవించిన జీవితం మరో జన్మకు వాయిదా మన జ్ఞాపకాల సాక్షిగా అంటూ అగాధాన్ని సృష్టించి విడిపోయిన ప్రిన్స్ డయానాలకు తన సున్నిత హృదయాన్ని చాటుకుంటారు. విస్మృతి కవిత వింత సోయగంతో చెప్పడానికి మాటలు చాలలేదు. నాకు బాగా నచ్చిన కవిత. చివరగా ఈ కవితా సంపుటి పేరైన మైనపు బొమ్మలు కవితలో
"దేహం వ్రణమై
బతుకు రణమై
క్షణక్షణం ఓ పదునైన కరవాలమై .." అంటూ సాగే అక్షర శరాలు మహాకవి శ్రీ శ్రీ ని  గుర్తుకు తీసుకురాక మానవు.
జీవితంలో తారసపడే ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ అక్షరికృతం చేసే సున్నిత హృదయమున్న సుధాకర్ లోసారి మైనపుబొమ్మలు కవితా సంపుటికి హృదయపూర్వక అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner