13, డిసెంబర్ 2018, గురువారం

ఆవాజ్ సమీక్ష..!!

                    సహజ భావాల అక్షర గుళికలు - సామాన్యుని శర పరంపర  " ఆవాజ్ "


         స్వతహాగా భౌతిక శాస్త్ర అధ్యాపకులైన బండి చంద్రశేఖర్ కవిని కాదంటూనే చక్కని కవిత్వాన్ని
మనకందించారు. తన చుట్టూ జరుగుతున్న విషయాలపై స్పందిస్తూ ఎదుటివారి మనసులకు హత్తుకునేలా రాయడంలో కవి కృతకృత్యులయ్యారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతీయత మీద ఇష్టాన్ని, తెలంగాణా మాండలీకంపై ఉన్న మక్కువను ఎక్కడా తగ్గనీయకుండా "ఆవాజ్"  కవితా సంపుటి ఆసాంతమూ తెలంగాణా యాసలోనే ఉంటుంది.  
             ఎక్కడో రాతి పొరల్లో చిక్కుకున్న ఆత్మీయ పిలుపులు, ఇప్పటి యాంత్రిక రాక్షసత్వానికి చిక్కుకుని విల విలలాడుతున్నా మానవత్వపు పరిమళాలు విశ్వమంతా వ్యాపించాలన్నకోరికను  "ఎక్కడో చిన్న ఆశ" కవితలో వినిపిస్తారు. ఇది ఇప్పటి విషాదం కవితలో ఒకప్పటి బాల కార్మికులను, చట్టాలు వచ్చిన తరువాతి బాల్యం కార్పొరేట్ చదువుల  కార్కానాలో ఎలా మగ్గిపోతోందో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. సమాజపు గాయాలకు పూత పూసే చల్లటి అమృత స్పర్శ కావాలి.. ఇప్పుడు కావాలీ అంటారు. డబ్బుకు, అధికారానికి అమ్ముడుబోతున్న పత్రికల అనైతికత్వాన్ని పేరున్న దిన పత్రికలా.. మీరు చేస్తున్న పనేంటి అని నిలదీస్తున్నారు. కల్లోల కాశ్మీరాన్ని, కులం, మతం మంటల్లో బతుకుతున్న ఉగ్రవాదపు ఉన్మాదాన్ని చూస్తూ కూడా ఏమి చేయలేని తోలుబొమ్మలం అవుతున్నాం, శాంతి కోసం ఇక ఎలుగెత్తి చాటే గొంతుకగా మారదాం అని పిలుపునిస్తున్నారు. రాజయకీయపు సర్జికల్ ఎటాక్ ను బాగా చెప్పారు. కార్పొరేట్  వైద్యపు కష్ట నష్టాలు చెప్తూ అత్యాశే అయినా కాని, రోగాలు లేని తన దేశాన్ని చూడటం ఎంత బాగుండు అంటారు. బూటకపు ఎన్ కౌంటర్లలో హతమారిన ధీరులకు " అక్షర నివాళి " అర్పిస్తారు. భజనపరులారా..భద్రం అన్న కవితలో విభజన కోసం జరిగిన యుద్దాన్ని, నాయకుల వాగ్దానాలను మరోసారి గుర్తు చేసి, వేటి కోసం పోరాటం చేసామో అవి దక్కాయో లేదో తెలుసుకోమన్నారు. ఉద్యమ పార్టీ పాలనను, దొరల తీరును ఎండగడితే, నోరు మెదిపితే జైళ్ళు కరుస్తయ్ అని వాస్తవాన్ని ఎంత బాగా చెప్పారో. ఇది నాకు బాగా నచ్చిన కవిత కూడానూ. ఉద్యమ గీతాలను, ధిక్కార స్వరాన్ని ఛిద్రం చేయాలని చూస్తున్నారని ధర్నా చౌక్ కవితలో బాగా చెప్పారు. పెద్ద గీత చిన్న గీతల మధ్య తేడాని అంతరాల తరతమ్యాన్ని రెండు గీతలే...నా అయినా ఎంత తేడా ఉందో  అంటారు. మనసు ఆశలను, ఆలోచనలను చెప్తూ మనస్సుకెందుకు..రెక్కలు అంటారు. ఆహా ఏమి అద్భుతం కవిత ఎన్నికల ముందు రాజకీయ నాయకులు విరజిమ్మిన వాగ్దానాలను గుర్తు చేస్తుంది. ప్రశలెన్నింటినో బందించేసినా కవిత ప్రజల పక్షాన నిలబడిన గళాలను బతికించే పని మనదేనని చెప్తూ ధర్నా చౌక్ కోసం అహర్నిశలు పోరాడే ఉద్యమ గళాలకు మద్దతుగా తన అక్షరాలను అందించారు. కాలపు మాయాజాలాన్ని ప్రశ్నిస్తూ కాలానికెందుకో..ఈ మురిపెం అంటారు. ఉద్యమాల కోసం ప్రాణాలొడ్డిన వారికి జేజేలంటారు నింగిన నలచిన తారలకే కవితలో. మూడు గీరెల చెత్త బండీ కవితలో ఓటును నాగరికుడు తన స్వచ్ఛత కోసం సృష్టించిన రక్తం ఓడుతున్న ఓ కొత్త గాయమని ఇప్పటి నాయకుల తీరుని కొత్తగా చెప్తారు. అవుట్ ఆఫ్ ఆర్డర్ కవిత ఏ టి ఎం మెషిన్ల దగ్గర తరచూ దర్శనమిస్తున్న నోటీసుల కథను చెప్తుంది. ఛానళ్లు రేటింగ్ కక్కుర్తికి ఆశపడి అబద్దాలను నిజాలుగా ప్రచారం చేయడాన్ని నిరశిస్తారు. మాయమవుతున్న మా బడి కవిత అప్పటి చదువుల గుడిని, ఇప్పటి చదువును అమ్ముకుంటున్న బడిని కళ్ళ ముందుకు తెస్తుంది. అధికారం ప్రజా ధనాన్ని తెలియకుండా ఎలా దోచుకుంటుందో కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కవితలో చెప్తారు. కలికాలంలో ద్వాపర యుగాన్ని, గౌరీ లంకేశ్ హత్యను, జ్ఞానం ఎలా వస్తుందనేది, కార్పొరేట్ గోడలను, ఢిల్లోలో కాదు గల్లీలోనే కవితల్లో నాయకుల నటనను,మోసాలను చూపిస్తారు.  వికృత రూపం కవిత రాయడానికి చాలా ధైర్యం కావాలి. ఓ సామాన్యుడు జనాన్ని ఎలా నమ్మించాడు, అడ్డు తగిలిన వాళ్ళని ఎలా తుదముట్టించాడు, చివరకు ఎలా మరణించాడన్నది ఎంత బాగా చెప్పారంటే మాటలు కూడా చాలనంతగా. 
తెలంగాణమా ఊపిరి బిగబట్టినవా, తెలంగాణా మాగాణంలో..ప్రపంచ తెలుగు, పతంగ్ ఉడ్ రహి హై, ఊహల్లో కలం, క్వారీ, రాజు వేట..రాజరికం ఆట, మాట మారింది గాలి మారిందా, ఇంద్రావతి అమరత్వాన్ని ముద్దాడింది వంటి కవితలు నాయకత్వపు పనితనాన్ని ప్రశ్నిస్తున్నవి. ప్రకృతి నిత్యత్వం కవిత బడుగు జీవికి  చుక్కలు నేర్పిన బతుకు పాఠాన్ని చెప్తుంది. నేను మనిషిని కవిత అంగడిబొమ్మగా మారిన ఆడతనపు మనసు గోడుని చెప్తుంది. బాపు..తమాషా కల్ కా, నీ కడుపుల అంబలి పొయ్య కవితలు  ప్రభుత్వ పాలనను అద్దంలో చూపించాయి. అమ్మా... ఓ మారు ప్రత్యక్షం కావా కవిత ప్రతి ఒక్కరి మనసుని తాకుతుంది. ప్రసవ వేదన పడి, జన్మనిచ్చి, దూరమైన తల్లి ఒడికి మళ్ళి చేరాలని ఏ బిడ్డకు ఉండదు చెప్పండి. నీ పాద ముద్ర కవిత కడుపులోనే పిండాలను చిదిమేస్తున్న రాక్షసత్వాలను చూపిస్తుంది. మాస్క్ కవిత నాగరికత చేసే అనాగరిక చర్యలను, పసి పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. విడివడని కొంగు  ముడి కవిత మూడు పదులు దాటినా తమ వివాహ బంధపు పరిమళాల జ్ఞాపకాలను అందంగా అక్షరాల్లో పొడగడం చాలా బావుంది. ఆరు పదులు దాటిన జీవితంలో ఆత్మీయ మిత్రులను, తనతో ముడిబడిన అనుబంధాలను నెమరు వేసుకున్నారు పర్మనెంట్ స్నేహితులు కవితలో. ఊబి కవిత జీవితపు రహదారిలో బాంధవ్యాలను, బాధలను గుర్తు చేస్తుంది.  బాపూ..నువ్వు యాదికి వస్తున్నవ్ కవిత నాన్న పడిన కష్టాన్ని, నాన్నతో అనుబంధాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుకు తెస్తుంది. అందనంత ఎత్తులో కవిత మనసు భావాలను కవిత్వంగా మార్చడానికి అక్షరాల సహకారాన్ని తెలుపుతుంది. పుస్తకావిష్కరణ కవిత ఇప్పటి సాహిత్యపు తీరుతెన్నులను, దేశభక్తుని ఎట్లైత, చెదరని స్వప్నం కవితలు కాలపు మార్పులకు మారిపోతూ, జ్ఞాపకాలుగా ద్వాపర యుగాలను చేసుకుంటున్న మనిషి నైజాన్ని ప్రశ్నించడం బావుంది. అక్కింటి గలుమ కవిత అక్కా తమ్ముళ్ళ ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తుంది. బోలెడు జ్ఞాపకాల గులాబీలను మనకు పంచుతుంది. చివరగా ఫట్..ఫట్.. మోటర్ సైకిల్ కవిత ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కున్న మోటర్ సైకిల్ సంబరాన్ని, దానిపై చేసిన స్వారీని తలుచుంటూ ఆఖరి ఇన్స్టాల్మెంట్ పైసలు కట్టి సొంతం చేసుకున్నప్పటి ఆనందాన్ని మాటల్లో చెప్ప తరమా అంటూ కవితగా మన ముందుకు తీసుకువచ్చారు. చాలామంది మనసులో కూడా ఇదే భావన సొంతమైన మోటార్ సైకిల్ని చూసుకున్నప్పుడు. 
               చక్కటి యాసలో, తేలిక పదాలతో ప్రాంతీయతను ప్రతిబింబిస్తూ, తన జ్ఞాపకాలను, అనుబుభూతులను, అనుభవాలను, అనుబంధాలను, కోపాన్ని, ఆవేశాన్ని, ఆత్మీయతను ఇలా ప్రతి చిన్న స్పందనను చక్కగా 
ఈ " ఆవాజ్ " కవితా సంపుటిలో అక్షరీకరించి కవిని కాదన్న" సుకవి "బండి చంద్రశేఖర్ కు హృదయపూర్వక అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner