21, ఆగస్టు 2019, బుధవారం

జీవన 'మంజూ'ష ..!! ( సెప్టెంబర్ )

 నేస్తం,
        ఈ ఆధునిక యుగంలో యంత్రాల మాయలో పడి 
మనుషుల మనసుల మధ్యన  రాహిత్యం ఎక్కువై బంధాలు బలహీన పడిపోతున్నాయేమో అన్న చిన్న సందేహం కలుగుతోంది. అన్ని బంధాలకు మూలం ధనమే అన్నది తిరుగులేని సత్యంగా నిలిచింది. అనుబంధాలు కూడా యాంత్రికమై పోవడానికి ఆర్థిక అవసరాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర వహించడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చేమో. బిడ్డలు ఎందరున్నా తల్లిదండ్రులను కష్ట సమయంలో ఆదుకోవడానికి ముందు వెనుకా చూస్తున్నారంటే..తరాలు మారుతున్నా అంతరాలు, ఆంతర్యాలు ఎంతగా బయటపడుతున్నాయో చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది.
      ఒకప్పుడు పల్లెల్లో ఒక ఇంటిలో శుభకార్యమే కానివ్వండి, అశుభకార్యమే కానివ్వండి ఏదైనా ఊరంతా తమ ఇంటి కార్యక్రమమే అన్నట్టుగా భావించేవారు చుట్టరికంతో సంబంధం లేకుండా. ఇప్పుడు పల్లెలు లేదు పట్నాలు లేదు అన్ని అతికించుకోవడాలే అయిపోయాయి. చావైనా, పెళ్లయినా ఎవరు ఎంత ఘనంగా నగలు, బట్టలతో వచ్చారన్నదానికే ప్రాముఖ్యత పెరిగింది. విలువన్నది మనం కట్టుకున్న బట్టలకి, వేసుకున్న నగలకు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. చాలామంది పలకరింపులు కూడా పుల్లవిరుపుగా పలకరిస్తారు. ఇప్పుడు రక్తసంబంధం కూడా డబ్బు సంబంధంగా మారిపోవడానికి కారణం ఎవరు? తేడా ఎక్కడ? ప్రశ్న చిన్నదే కాని సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది.
     చట్టం, న్యాయం కూడా అధికారానికి, ధనానికి దాసోహమంటున్నాయంటే అతిశయోక్తి ఏమి లేదు. ఇక బంధాలు, బాధ్యతలు ఎంత? మనం కనిపెట్టిన రూపాయే మనల్ని శాసిస్తోంది అంటే ఎంత విచిత్రం. మనిషి జీవితమే చిత్రమనుకుంటే ఆ చిత్రంలో " ధనమేరా అన్నిటికి మూలం" అన్న మాటను నిజం చేస్తున్న మన మనస్తత్వాల్లో మార్పు ఎన్నడో మరి..!!

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...
     

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner