29, నవంబర్ 2019, శుక్రవారం

కోల్పోతున్న మనిషితనం...!!

నేస్తం,
         అనాది నుండి అహానిదే ఆధిపత్యం. అధికారం కట్టబెట్టిన ప్రజలకు నాయకులిచ్చే నజరానాలేమిటా అని ఒకింత ఆలోచన రేకెత్తించాల్సిన అవసరమేర్పడుతోంది ఈనాడు. భద్రత ఇవ్వాల్సిన రక్షక వ్యవస్థే మనకు అభద్రతా భావాన్ని పరిచయం చేస్తోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ పాలకుల కోసం పని చేస్తోంది. న్యాయం కోసం  పోలీస్ స్టేషన్ కి నా వెళ్ళినా, కొత్తగా వచ్చిన సైబర్ క్రైమ్ కి వెళ్ళినా మనకు న్యాయం జరగదు. మన రక్షణ మనమే చూసుకోవాలి. పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకు వదలని కామాంధులకు మాత్రమే రక్షణ ఈ సమాజంలో. ధరించే వస్త్రధారణలో లోపాలంటారు మేధావులు కొందరు. పసిబిడ్డ ఏ రకమైన దుస్తులు ధరించిందని ఈ దుర్గతి? అమ్మను, బిడ్డను కూడా వదలని నికృష్టులను సమర్థిస్తున్న సమాజమిది. రాజకీయ నాయకులకు ఇవేమీ పట్టవు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా హేళనగా మాట్లాడి, అవమానించి పంపడం తప్ప చర్యలు తీసుకోలేని అసమర్థులు. లంచాలు మరిగిన  వ్యవస్థలో న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే తప్పు చేసిన ఏ ఒక్కరినైనా వెంటనే శిక్షిస్తే, ఆ శిక్ష కూడా మరొకరు తప్పు చేయాలంటే భయపడేలా ఉంటే ఈ ఘోరాలు కాస్త తగ్గుతాయి. నాయకులు పదవి మీద మమకారాన్ని తగ్గించుకుని, ప్రజల కనీస బాగు కోసం ఆలోచించాలి. విజ్ఞులు రాజకీయ నాయకులు ఏది చేసినా సమర్ధించడం మానేసి సామాన్య జన జీవితాలు కాస్త భయం లేకుండా బతకడానికి ఏం చేయాలో అది చేయించండి. ఈ అకృత్యాలను ఆపండి మనుషులుగా మీలో మానవత్వం ఎక్కడైనా మిగిలుంటే...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner