9, జనవరి 2020, గురువారం

అనితరసాధ్యుడు.. !!

            అసాధ్యాన్ని సుసాధ్యం కొందరే చేసుకోగలరు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు ఎమ్ ఎన్ ఆర్ గుప్త. అకుంఠిత దీక్షతో అతి పిన్న వయసులోనే 40 ఏళ్ళకు 80 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించి ప్రపంచానికి తన ఉనికిని పరిచయం చేసిన అనితరసాధ్యుడు ఎమ్ ఎన్ ఆర్ గుప్త.
    క్రియేటివ్ ఇండియా - పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 గా ఓ తెలుగోడు, అదీ వెనుక ఏ అండా, అధికారం లేని అతి సామాన్యుడు తనకున్న అపారమైన తెలివితేటలతో, వాగ్దేవి ఆశీస్సులతో గెలుచుకుని తెలుగువాడి ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసారు. ప్రతిభకు కొలమానం గుర్తింపు అయితే ఆ గుర్తింపు మెండుగా ఉన్న సరస్వతీ మానసపుత్రుడీయన. తన ప్రతిభతో ప్రపంచ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పది ప్రపంచ రికార్డులను తిరగరాసి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ (లండన్). వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లలో స్థానం సంపాదించుకున్న ఏకైక తెలుగు ఇంజనీర్, జూనియర్ మెాక్షగుండం విశ్వేశ్వరయ్య,
అపర మేధావి అన్న పదానికి సరైన అర్థం ఎమ్ ఎన్ ఆర్ గుప్త.
           అమెరికా, దుబాయ్, యూరప్, కువైట్, ఒమన్, భారతదేశాలలో గడచిన 15 ఏళ్ళలో 80 ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుని చరిత్ర సృష్టించడమే కాకుండా యుకే కి చెందిన ఐటిపి గ్రూప్ కంపెనీస్ నుండి వెలువడే ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్్ట్రక్షన్ వీక్ వారు ప్రతి ఏటా అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో అన్ని కేటగిరీలలో 2012 నుండి  2016 వరకు కన్ స్ట్రక్షన్ ఇంజనీర్  ఆఫ్ ది ఇయర్, ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 195 దేశాల ఇంజనీర్స్ తో పోటి పడి వరుసగా గెలుచుకోవడం ప్రపంచ చరిత్రలో ఏ ఇంజనీర్కి సాధ్యం కాలేదు. ఆ ఘనత మన తెలుగువాడు భీమవరం బుల్లోడు అయిన ఎమ్ ఎన్ ఆర్ గుప్త సాధించడం తెలుగుజాతికి గర్వ కారణం.
     ఎక్కడో తెనాలిలో పుట్టి ఈనాడు ప్రపంచంలో గుర్తింపు పొందిన అతి కొద్ది మంది మేధావుల్లో ఒకరు శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త. మిడిల్ ఈస్ట్ దేశాల్లో లెక్కకు మించి పురస్కారాలు.. ఆ దేశపు రాజరికపు అధికారుల మెప్పును పొందిన ఏకైక వ్యక్తి... ఈ పురస్కారాల రికార్డుల వెనుక ఓ జీవితపు ఆటు పోట్లు ఎలా విజయానికి సోపానాలుగా మారాయో... నేటి యువ తరానికి స్పూర్తిదాయకంగా నిలిచిన యువ మేధావి శ్రీ ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారి గురించి...సామాన్య కుటుంబం నుంచి వచ్చి, చిన్నతనం నుంచి చదువులో మేటిగా ఎదిగి ఉన్నత విద్యను NIT Warangal MTech( Transportation) లో అభ్యసించి స్వదేశంలో కొన్ని రోజులు పని చేసి తరువాత తన ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఒమన్ దేశంలో Dec 2003 లో తన ప్రస్థానాన్ని పెట్రోలియం ప్రాజెక్టులో ప్రాజెక్ట్ ఇంజనీరుగా మొదలు పెట్టి ఒమన్ లో ఇన్ ప్రాస్ట్రక్చర్ రంగంలో రెసిడెంట్ ఇంజనీరుగా పనిచేస్తూ అనుకున్నది సాధించి ఈ రోజున ఎమ్ ఎన్ ఆర్ గుప్త ఆంటే తెలియనివారు లేరని నిరుపించుకున్న ఘనులు...సమస్యకు భయపడక మీ సమస్యను నాకొదిలేయండి... పరిష్కారం నేను చూపిస్తా అన్న ఆత్మ విశ్వాసం ముందు ఎంతటి సమస్యైనా తలను వంచక తప్పలేదు... అది ఎమ్ ఎన్ ఆర్ గారి ఆత్మ విశ్వాసం....  
         ఎప్పటికైనా భారత దేశం సూపర్ పవర్ గా ఎదగాలని నిరంతరం కష్టపడి పదిహేడు ఏళ్ళు అనేక ప్రపోజల్స్(సిద్దాంతాలు) రూపొందించి సమాజం అభివృద్ధి చెందటానికి అత్యంత కీలకమైన రంగం మౌలిక సదుపాయాలు అందించడం అని బలమైన వాదన వినిపిస్తూ..." Development of Transportation sector to reach vision 2020"  ప్రత్యేక ప్రపోజల్ రూపొందించి... అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 2002లో అందచేశారు. చంద్రబాబు ఆనాడు చాలా ఘనంగా ప్రచారం సాగించుకున్న విజన్ 2020 ప్రోగ్రాంలో గుప్త ప్రతిపాదించిన సిద్ధాంతాలను యధాతథంగా వినియోగించుకున్నారు.ఇవే కాకుండా 2003లో కర్నాటక ముఖ్యమంత్రిగా ఎస్ ఎం కృష్ణ ఉన్నప్పుడు,   ఆయన స్వయంగా గుప్తను ఆహ్వానించి రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు.తరువాత 2008లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరియు ఆర్ధిక మంత్రి రోశయ్య గారు infrastructure development మరియు project management కోసం సలహాలు సూచనలు తీసుకున్నారు...
ఈ గుర్తింపులతో సరి పెట్టుకొనక  దేశ ఆర్ధిక పురోభివృద్ధికి ఐటి రంగం చాలా చేయూతనిస్తుందని చెబుతూనే దానికంటే ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాల్సిన రంగం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అని ఖచ్చితంగా తన వాదన వినిపిస్తూ దానికి తగిన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలి అన్న తన ఆలోచనను అంతర్జాతీయ, జాతీయ వేదికలపై కీ నోడ్ స్పీకర్ గా వ్యక్త పరుస్తూ.... గడచిన అరవై ఏళ్ళ కాలమంతా అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఈ రంగం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ... అభివృద్దికి బాటలు వేసే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రహదారుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే దేశ ఆర్ధిక పురోగతికి స్థిరమైన ప్రగతికి బాటలు వేస్తుందని... దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంథానం చేస్తూ విశాలమైన రహదారులు, అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, నౌకాశ్రయాలు, నీటి ప్రాజెక్టులు, నీటి పారుదల వ్యవస్థ, రైలు మార్గాలు ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనే దేశ భవితకు తిరుగులేని రాచమార్గాలని సోదాహరణంగా వివరిస్తున్నారు...ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి అభివృద్ధి చెందిన 160 దేశాల్లోని స్థితిగతులను అధ్యయనంచేసిన అనుభవాన్ని మేళవిస్తూ... భారతదేశ సహజ ఒనరులను, మానవ ఒనరులను, చక్కని ప్రతిభ ఉన్న యువతను కాస్త సానపట్టి, రాజకీయ, విద్యా రంగాలలో మార్పులు చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ....ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణానికి తాను ఓ సమిధగా మారి నిరంతరంగా కృషి చేస్తున్న శ్రీ ఎమ్  ఎన్ ఆర్ గుప్త గారు ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు అనడంలో అతిశయోక్తి ఏమి లేదు...
భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి కష్టనష్టాలను భరించి చదువులో మెండుగా రాణించి ఉన్నత శిఖరాలను అందుకుని ఈనాడు ప్రపంచ మేధావులతో శబాష్ అనిపించుకున్న ఈ అతి పిన్న వయసు అపర మేధావి మనోగతంలో తన దేశం, తన రాష్ట్రం ప్రపంచంలో ప్ర ప్రధమ స్థానంలో ఉండాలన్న చిన్న కోరిక  పెరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా బలీయమై తను ఎన్నో పరిశోధనలు చేసిన infrastructure project management రంగంలో మెళకువలు తనవారికే ఉపయోగపడాలన్న బలీయమైన కోరికతో స్వదేశానికి తన సేవలను అందించడానికి ముందుకు వచ్చిన ఈ తెలుగు తేజం... ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం అన్న నడవడితోవిదేశాల్లో సైతం తెలుగు వారికి అజాత శత్రువై తన అండ దండలు అందిస్తూ... అందరి అభివృద్ధితో పాటుగా తన దేశం, రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని ఆరాటపడుతూ... ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటోనిరూపించిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు చరిత్రలో చిరస్మరణీయులు... రాబోయే రోజుల్లో infrastructure రంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టిస్తారనడంలో ఏమాత్రము సందేహం లేదు...
            ఎన్నోఅత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు విదేశీయుల చేతుల మీదుగా పొంది స్వదేశ కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పి భారతీయత విలువతో పాటు తెలుగు'వాడి' మేధోసంపత్తిని తేటతెల్లం చేసి పిన్న వయసులోనేఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ తెలివితేటల భాండాగారం మన తెలుగు వారిదే అని.. తెలుగు నేల పులకరిస్తోంది సంతోషంతో....ఈనాటి యువతకు రేపటి నవతకు దిశా నిర్దేశకులు, స్పూర్తిదాయకులు అయిన శ్రీ ఎం ఎన్ ఆర్ గుప్త గారు దేశ విదేశాల్లో ప్రాజెక్ట్ మానేజ్మెంట్ పై అందుకున్న ప్రశంసలు, అవార్డుల, రివార్డుల జాబితాలు పరిశీలిస్తే వారి ప్రతిభ గురించే చెప్పడానికి మాటలు చాలని పరిస్థితి...నిజంగా చెప్పాలంటే మన దేశంలో కన్నా విదేశాల్లో ఆయన చూపిన ప్రతిభకు ఒక తెలుగు వాడిగా ఎవరికి దక్కని ప్రతిష్టాత్మక గుర్తింపు విదేశీయులు ఇచ్చారంటే వారి మేధకు మరియు 20 సంవత్సరాల అవిశ్రాంత కృషికి కొలమానం ఏమిటో మనకు తెలుస్తుంది...ఒమన్‌ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2200 కిలో మీటర్ల రైల్వే నెట్ వర్క్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించడం కోసం ఆగష్టు 2014 లోఅంతర్జాతీయ నిపుణులతో మస్కట్ లో జరిగిన సమావేశంలో దేశ విదేశ ప్రముఖులతో పాటు భారత దేశం నుంచి అతి చిన్న వయసులో proactive project maangement , Integrated Transportation Planning కి సంబంధించిన టెక్నికల్ key note presentation మరియు పానల్ డిస్కషన్ మెంబర్ గా అమెరికా, లండన్ నిపులులతో పాటు గుప్త గారు ఇచ్చిన సలహాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి. అంతర్జాతీయ నిపుణులలో అద్వితీయ ప్రతిభను కనబరిచి అందరి మెప్పును పొంది ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు ఈ తెలుగు తేజం.  

1961 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్ధుల్లో NIT వరంగల్ వారు గత రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ Distinguished Young Alumni Professional Achievement award 2015ఈ సంవత్సరం  అతి పిన్న వయస్సులో గెలుచుకున్న ఘనత ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారికి దక్కింది. వారి అవార్డుల ఖాతాలో మరో ఆణిముత్యం చేరింది.
          ఈ అవార్డ్ ఎంపికకు ఒక కమిటి, వారు ఎన్నుకునే విధానం చాలా విలక్షణంగా ఉంటుంది.. ఎన్నో వడపోతల తరువాత ఆచి తూచి ఎన్నుకుంటారు...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న NIT విద్యార్ధుల్లో అత్యంత ప్రతిభావంతులను ఎన్నుకోవడంలో ప్రతిభకు పట్టం కట్టడంలో ఈ కమిటి ప్రతిభ గుర్తించ తగినది.. అందుకే ఈ అవార్డ్ కు ఇంతటి విలువ.  ఎందఱో కలలు కనే ఈ ప్రతిభా పురస్కారం ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారిని వరించడం ఆ అవార్డ్ కే వన్నెను తెచ్చింది.. ఇది తెలుగు వారికి, ఆంధ్రులకు గర్వకారణం.
         ఒమన్ రాజు నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్లెన్నీ అవార్డ్ తీసుకున్న ఏకైక వ్యక్తి. ఇదే కాకుండా ఇండియాలో మెుట్టమెుదటి యూరోపియన్ ప్రీ స్కూల్ రిడ్జి గ్రూప్ కి సిఈఓ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఎంపిక చేసిన 50 మంది
స్వేరో సర్కిల్స్ కమాండర్స్ ను AK47 మిషన్ గన్ బులెట్స్ లాగా తయారుచేస్తూ తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటున్నారు.
      ఒమన్ లో పదిమందితో స్థాపించిన WAM NRI VIBHG ఇప్పుడు దాదాపు 33 దేశాలలో తెలుగువారికి అన్ని రకాలుగా తమ సహాయ, సహకారాలు అందిస్తోంది.
         మన దౌర్భాగ్యం ఏమిటంటే క్రీడలకు ఉన్న గుర్తింపు మేధస్సుకు లేకపోవడమే.. అందుకే మేధావులు అందరు వలసలు వెళ్ళిపోయారు... కాని గుప్తా గారి లాంటి కొందరు మాతృ దేశంపై మమకారాన్ని చంపుకోలేక ఎక్కడ ఉన్నా పురిటి గడ్డ గొప్పగా ఉండాలని కోరుకుంటూ తమ సాయాన్ని అందిస్తూ ముందుకి రావడం మరింత మందికి ఆదర్శప్రాయం....!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner