1, సెప్టెంబర్ 2020, మంగళవారం

మధూలిక కవితా సంపుటి సమీక్ష..!!

      ఓ రస రమ్య ప్రేమకావ్యం " మధూలిక "

  ఏక్ తారలు, మణిమాలికలు, త్రిపదలు కాకుండా, తనదైన ప్రత్యేక శైలిలో ప్రేమ కవిత్వం రాస్తున్న లక్ష్మీ రాధిక ముఖ పుస్తక నేస్తాలందరికి సుపరిచితులు. చాలా సరళంగా, హాయిగా సాగిపోయే కవిత్వం వీరిది. తన భావ కవితలను అందంగా అమర్చి, కొన్ని వర్గాలుగా విభజించి చూడముచ్చటైన కవితా సంపుటి " మధూలిక " గా మన ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఇది కినిగెలో డాట్ కాం లో ఈ పుస్తకంగా ఉంది.  
     మధూలిక కవితా సంపుటిలోని నేను అన్న పదానికి చెప్పిన భావోద్వేగాల హేల గురించి చూద్దాం.
నేను అంటూనే తనలోని సుగుణాలను ప్రశ్నలుగా చేస్తూ... 

" అవును.... నేను అపురూపం
  నీకు తప్ప ఎవరికీ తెలియదీ నిజం "  అంటూ తనని తాను ఆవిష్కరించుకునే క్రమంలో తనలోని ప్రేమకు, తనకున్న ఆశలు, ఊహల గురించి తను ఆరాధించే ఆరాధకుడికి చెప్పడం, చివరికి
" పైకి నాదో ప్రేమ ప్రయాణం..లోలోన నేనో ఏకాకి             స్వప్నం
          ప్రతిక్షణం..
          ప్రతీక్షణం..
నాకు నేనే అర్థం కాని అద్వైతం.." అంటూ ప్రేమ పారవశ్యానికి తాత్వికత జోడించడం చాలా బావుంది.  నేనంటే నువ్వు, నేను కలిపి మనం అంటూ ప్రేమకావ్యాన్ని నాలోని నేను నీ నేనంటూ సుందరమైన ప్రేమలోకాన్ని చంద్రోదయం వేళ తనలోని అంతర్ముఖాన్ని తన అక్షరాలతోనే మనకు పరిచయం చేస్తారు. అందరికి వాన కురుస్తున్నట్లుంటే తనకు మాత్రం అమృతం కురిసిన రేయిగా ఎందుకుందో తన మాటల్లోనే చెప్తారు. తన మనసులోని భావాల ఝల్లు ఇరువురి మధ్యన అక్షర వర్షమై ఎలా కురిసి మురిసిందో, ఆ హర్షాతిరేకాన్ని అందంగా వర్ణిస్తారు. సంధ్యారాగాన్ని, శ్రావణమాసాన్ని కూడా స్పృశిస్తారు. వాన గురించిన మరెన్నో భావాలను చెప్తూ తన అక్షరాల వర్షంతో  మనల్ని  తడిపేస్తారు సరికొత్తగా. అంతకు ముందు..ఆ తరువాత అంటూ మౌనాన్ని దాటక ముందు, మౌనంలో ఉన్నప్పుడు, మౌనాన్ని వీడిన తరువాత తన మది స్వగతాలను, ఏకాంతపు మౌనరాగాల సవ్వడులను  మౌనంలోనే మనకు వినిపించేస్తారు. ప్రేమ సంగీతంలో వినిపించిన స్వరాలను 
" నీ గుండె సవ్వడికి దగ్గరైన నా గీతం
   ఎన్ని జన్మ క్రితం మెుదలైందో మన అనుబంధం " అంటూ తనలోని ఊహల అలజడిని, మది పాడిన తలపుల సంగీతాన్ని మౌన మానస సమీరాలుగా చేసి వీనులవిందు విందుగా, కనులకింపుగా భావాలలో నింపేసారు. 
         కవిత్వాన్ని, కాలాన్ని, నయనాన్ని, జీవితాన్ని, విషాదాన్ని, జ్ఞాపకాన్ని, ప్రతీక్షణం విరహాన్ని, ప్రేమను వెరసి ఓ చక్కని రస రమ్య ప్రేమకావ్యాన్ని మధూలికగా మనకందించారు లక్ష్మీ రాధిక. భావ కవిత్వాన్ని, అదీ ప్రేమ, విరహం, ఆరాధన, ఆశలు,  కోరికలు, మౌనంతో మాటలు, మనసుతో సంగీతం పలికించడం అంతా మనమీ మధూలికలో చూడవచ్చు.  చక్కని భావ కవిత్వాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించిన లక్ష్మీ రాధికకు హృదయపూర్వక అభినందనలు. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner