19, జులై 2021, సోమవారం

కాలం వెంబడి కలం..63

      జనవరి 23న మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఓపెనింగ్ అనుకున్నాము. మా నరశింహాపురం ఊరిలో పూర్వం అందరూ బాగా చదువుకున్న వారే ఉండేవారు. నాన్న అందరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పట్లో మా ఊరు అంటే బయట చాలా విలువ కూడా ఉండేది. ఏ గొడవలు వచ్చినా ఊరి పెద్దలు పరిష్కరించేవారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన దాఖలాలు లేవు. రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నా ఊరంతా ఓ మాట మీద ఉండేవారు. ఇప్పుడంటారా రోజూ పోలీస్ స్టేషన్ గడప తొక్కుతూనే ఉంటారు దేనికోదానికి. పక్కవాడి బాగు చూడలేని అసూయాద్వేషాలు, పనికిమాలిన సంబంధాలు, ఏలిముద్రల పెద్దరికాలు, పెళ్ళాలున్నా పరాయిదాని కోసం వెంపర్లాటలు, అది ఇది అని లేకుండా దిక్కుమాలిన తిరుగుళ్ళు, ఎయిడ్స్ రోగులు ఇది ఇప్పటి పరిస్థితి. 
                  మండలి బుద్ధప్రసాద్ గారు, మంతెన నరసరాజు గారు, రేపల్లె దేవినేని మల్లికార్జునరావు గారు, అప్పటి కృష్టాజిల్లా కలక్టర్ నవీన్ మిట్టల్ గారు ఇంకా మా కోడూరు మండలం రాజకీయ నాయకులు, మా ఊరి పెద్దలు అందరిని పిలిచారు. నేను నా నేస్తాలను పిలిచాను. ఆఫీస్ లో కూడా అరి కేసరిని, చక్రధర్, వరప్రసాద్, కృష్ణకాంత్ సర్ వరకునే పిలిచాను. మా AMSOL CEO సుబ్బరాజు ఇందుకూరి ఇండియా వస్తే తనని కూడా పిలిచాను. అరి కేసరి అన్నారప్పుడు సుబ్బరాజుతో కూడా ఫండ్ ఇప్పిస్తాను అని. నేను అవసరం లేదండి. ప్రస్తుతానికి బయటివారి నుండి ఏమి తీసుకోవడం లేదండి. ఊరికి సంబంధించిన వారి నుండినే అని చెప్పాను. విజయనగరం నుండి నా చిన్ననాటి నేస్తం వాసు మాత్రమే వచ్చాడు. చాలామంది చుట్టపక్కల ఊళ్ళవారు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రోబ్లంతో నవీన్ మిట్టల్ గారు రాలేదు. 
                ఆలూరి లక్ష్మీనారాయణ పెదనాన్న ఆ రోజు ప్రొద్దుట ఇంటి దగ్గర నన్ను పలకరించడానికి వచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ, ఈ ట్రస్ట్ అసలు ఎందుకు, ఏమిటన్నది వివరంగా అన్ని చెప్పాను. అమ్మానాన్న లేని, ఆర్థిక స్థోమత లేని పిల్లలు చదువుకోవడానికి మా వంతుగా చేసే పని అని.  ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి, వాళ్ళ అబ్బాయితో మాట్లాడి లక్ష రూపాయలు ఇస్తానని అప్పటికప్పుడు చెప్పారు. ఉప్పల శ్రీను, తన ఫ్రెండ్స్ కలిపి మూడు లక్షలు, యాభైవేలే అనుకున్న మేమూ ఓ లక్ష, మా గోపాలరావు అన్నయ్య పాతికవేలు, లైబ్రరీ ప్రసాద్ గారు ముప్పైవేలు, ముమ్మనేని ప్రకాశరావు గారు పాతికవేలు, మా రాజా అన్నయ్య కూడా అప్పట్లో ఓ పాతికవేలు ఇస్తానన్నట్టు గుర్తు. అలా అంతా కలిపి ఏడు లక్షల చిల్లర వచ్చింది. దానిలో ఆ సంవత్సరానికి కొందరు పిల్లలకు ఇచ్చి, ఓ ఐదు లక్షలు డిపాజిట్ చేసాము. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. కొంత కాలంగా మాట్లాడని పసి అక్కని ఫంక్షన్ కి వచ్చినప్పుడు నేనే పలకరించాను. ఫంక్షన్ కి వచ్చిన అందరు చాలా బాగా మాట్లాడారు.నరసరాజు అంకుల్, మా రాధ పెదనాన్న, లక్ష్మీనారాయణ పెదనాన్న, ఇంకా పెద్దలు అందరు చక్కగా మాట్లాడారు. బుద్ధప్రసాద్ గారు ఫంక్షన్ అయ్యాక వెళిపోతూ, నా దగ్గరకు వచ్చి ఎప్పుడు నీకేం కావాలన్నా అడుగమ్మా, చేసి పెడతాను అని చెప్పి వెళ్ళారు. చేసిన పొరపాటు ఏంటంటే మా కోటేశ్వరరావు మామయ్యని స్టేజ్ మీదకు పిలవక పోవడం. ఆయన డాక్టర్ గా మా పక్క ఊరు కోడూరులోనే హాస్పిటల్ పెట్టి అందరికి అందుబాటులో వైద్యం చేస్తున్నారు. మా మామయ్య తనని స్టేజ్ పైకి పిలవలేదని కూడా పట్టించుకోలేదు. అది ఆయన మంచి మనసు. మా ఊరిలో అందరు టీచర్లుగా, ఇతరత్రా ఉద్యోగాల్లో బాగానే స్థిరపడ్డారు కాని, దాతృత్వగుణం కాస్త తక్కువే. అప్పటికే నేను, నావాళ్ళు అన్న స్వార్థం బలంగా వేళ్ళూరుకుంది. మేమదే అనుకున్నాం పిలిచామని దూర ప్రాంతాల నుండి కూడా కొందరు వచ్చారు, అదే సంతోషమనుకున్నాం. ఈ ఫంక్షన్ అంతా చూసి మా వాసు చాలా సంతోషపడిపోయాడు. అలా 2008 లో మెుదలైన మా ట్రస్ట్ కార్యకలాపాలు ఇప్పటి వరకు నిర్విఘ్నంగా  జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ట్రస్ట్ రిజిస్ట్రేషన్, సంవత్సరం అయ్యాక మరోసారి అందరం అలా కలిసాము. ప్రతి సంవత్సరం మా వంతుగా చేయడం మాత్రం మానలేదు. కరోనా కారణంగా క్రిందటి సంవత్సరం, ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఇవ్వలేదు. 

" పొరపాటు మానవ సహజం. అది తెలుసుకున్న వారు సమాజానికి మంచిని పంచినట్లే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner