11, జులై 2021, ఆదివారం

నిశ్శబ్ద లయలు సమీక్ష...!!

      " నిశ్శబ్దాన్ని వినిపించే అక్షర లయలు "

        కొన్ని భావాలను నలుగురికి పంచాలంటే అక్షరాల అమరిక బాగా తెలియాలి. పదాలు పొందికగా, అందంగా అమర్చడంలోనే భావ కవితల సౌందర్యం తేటతెల్లమౌతుంది. శిరీషా శ్రీభాష్యం తనలోని కళాతృష్ణకు పరాకాష్టగా మలిచిన కవితా కావ్యమే ఈ నిశ్శబ్ధ లయలు. వినే మనసుండాలే కాని దీనిలోని ప్రతి పదమూ మనకో సవ్వడిని లయబద్దంగా వినిపిస్తుంది. సంగీత, నాట్య కళలలో రాణించిన శిరీష భావ కవిత్వాన్ని కూడా భలే అందంగా రాసేసారు. 
        నాలో నేను నాతో నేను అంటూ తన మనసులోని ముచ్చట్లను, ఆశలను, కోరికలను అక్షరాలతో పంచేసుకోవడంలో నేర్పును చూపించేసారు. బుుతువులతో, ప్రకృతితో మమేకమైన మనసును, వేదనను, విరహాన్ని, ప్రేమను, ఆర్ద్రతను, జ్ఞాపకాలను, బాల్యాన్ని,అనుబంధాన్ని..ఇలా జీవితంలోని అన్ని పార్శ్వాలను తడిమి, చక్కని భావకవితలను ఈ నిశ్శబ్ద లయలు లో నిక్షిప్తం చేసారు. 
  
        "జీవిత పయనం!
          విరిసీవిరియని వసంతం
          రాలీరాలని శిశిరం... " అంటూ సున్నితంగా చెప్పినా.. 

"జీవితమంతా... 
నా మనసును దాటని నీ భావం
నీ మనసుని చేరని నా మౌనం...." అని ఎంత చిన్న పదాలతో అద్భుతంగా చెప్పారో. 

ఇలాంటి బోలెడు సుకుమారమైన భావాలు అలవోకగా, అలతి పదాలతో అద్భుతంగా రాసేసారు.

 " నీ  జాడ అందనంత దూరంలో
   నిస్సహాయంగా చూస్తున్నప్పుడు
   నేనిక్కడ జారిన కాలాన్ని
   అపురూపంగా చూసుకుంటాను
   అపుడిక అంతా అసంపూర్ణ వాక్యమే! " అంటారు అసంపూర్ణ వాక్యం కవితలో. ఎక్కడా క్లిష్టమైన పదాలు లేవు, చెప్పాలనుకున్న లోతైన విషయాన్ని ఎంత సుళువుగా చెప్పేసారో, అదీ ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా. 
       కవిత్వాన్ని, జీవితాన్ని, జీవితపు నడవడులను, అమ్మానాన్నలను, స్నేహాన్ని, ఆర్తిని, ఇలా మనసు స్పందించిన ప్రతి చిన్న విషయాన్ని తన కళాత్మక దృష్టితో సొగసైన భావ కవిత్వాన్ని అందించిన శిరీషా శ్రీభాష్యం " నిశ్శబ్ద లయలు " అక్షర మువ్వల సవ్వడి నలుగురికీ చేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...మరిన్ని భావ కవిత్వ సంపదలు తెలుగు సాహిత్యానికి చేర్చాలని కోరుకుంటూ... హృదయపూర్వక అభినందనలు.     

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner