19, మార్చి 2023, ఆదివారం

అవ్యక్తం పుస్తక సమీక్ష

ఈ రోజు జన ప్రతిధ్వని దిన పత్రికలో ప్రచురితమైన "నేను వ్రాసిన పుస్తక సమీక్ష.

        "అవ్యక్తం.. పుస్తక పరిచయం."


సమాజాన్ని సున్నితంగానే ప్రశ్నించే వ్యాసాలు ,నిజాలను నిగ్గు తేల్చాలని సంధిస్తున్న లేఖాస్త్రాలు.


"సగటు మనిషికి న్యాయం అందుబాటులో లేనప్పుడు,

ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు . 

నీతులు , సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి , ముందు మనం, ఆ చెప్పే వాటిలో కొన్నయినా పాటించి , అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం ."

ఇలా నిరభ్యరంతరంగా తనలోని భావాలను , ఎవ్వరేమనుకున్నా నాకేంటి?.

నే వ్రాయాలని అనుకుంటున్నది వ్రాస్తూవుంటా.

"నిజాలను నిర్భయంగా ప్రకటించడంలో,నా స్వేచ్చను ఎవరి మెహర్బానీ కోసమో,కోల్పోలేను".

అని చెప్పగల కవయిత్రి "మంజు యనమదల" గారు.


ఇలా ఎన్నో విషయాలపైన తనదైన శైలితో, వ్యవస్థలోని అనేక విషయాలను, లోతుగా విశ్లేషిస్తూ వ్రాసిన వ్యాసాలను "అవ్యక్తం" లేఖావ్యాసాలు పేరుతో పుస్తక రూపంలోనికి తీసుకు రావడం హర్షించదగ్గ విషయమని చెప్పుకోవచ్చును.


వ్యక్తపరచాలి అనుకున్నది ,వ్యక్త పరచలేనిదీ.

తెలుసుకున్నది, నలుగురితో పంచుకోవాలనే తపనకు మూలం, అవ్యక్తం లేఖావ్యాసాలు పుస్తకం.


మనిషిలోని పది రాక్షస దుర్గుణాలపై విజయం సాధించగల శక్తినిచ్చేది అక్షరం మాత్రమేనని,

అనేక మనస్తత్వాల సముదాయమే సమాజమని,.

సమాజాన్ని దగ్గరిగా చూపించగల శక్తి అక్షరానికి మాత్రమే ఉందని ,మరోసారి ఋజువు చేసారు "కవయిత్రి మంజు యనమదల" గారు.


వ్యక్తపరచ గలిగిన భావాలను,అక్షరబద్దం గావిస్తూ అనేక వ్యాసాల రూపంలో, మనకు అందించిన అమూల్యం ఈ అవ్యక్తం లేఖావ్యాసాలు. నేడు ప్రతి ఒక్కరూ చదవ వలసిన పుస్తకం.

ప్రతి ఎదలోని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.

వ్యవస్థను ప్రశ్నించాలి అనుకునే వారికి, ఎందుకు ప్రశ్నించాలో వివరించగల పుస్తకం "అవ్యక్తం."


నేటి సమాజాన్ని అధ్యయనం చేస్తూ,మనిషి అంతరంగాన్ని శోధిస్తూ,సమగ్ర పరిశోధనాత్మక వ్యాసాలను పొందుపరిచిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిందే.

అందుకు రచయిత్రి ముందు మాటలే బలం చేకూరుస్తాయి. వారి మాటల్లో

"ఎవ్వరు ఏమనుకున్నా నేను చెప్పాలనుకున్నది వ్రాయడం.నా మనసు చెప్పినట్లు వ్రాయడమే నాకు అలవాటు,లెక్కలు కోసమో మరిదేనికోసమో నేను రచనలు చేయడం లేదు ..నా మనసులోని భావాలను వెల్లడిస్తున్నాను" అంటారు రచయిత్రి..


స్వలాభాపేక్ష లేని ఇటువంటి రచనలను తెలుగు సాహిత్యం స్వాగతిస్తుంది. అలా సాహిత్య రంగంలో నిలిచిపోగల రచనలు ఎంతో ఓపికతో మనకు అందించిన మంజు యనమదల అమ్మకు హృదయ పూర్వక అభినందనలు.


నిజమైన ప్రతిభకు గుర్తింపు తక్కువే అనే వాస్తవాన్ని "వ్యవస్థకు కావాల్సింది వ్యక్తిత్వం కాదు.విలువలు కాదు.వ్యక్తిగా గుర్తింపు మాత్రమే .ఆ గుర్తింపు అధికారం,బలం,ధనం వలన వస్తుంది .అనే సూటి మాటల్తో సమాజాన్ని పోస్టుమార్టం చేసి నిజాలేవో చూపించారు .అర్హత అనే వ్యాసంలో.


కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం ఒక్కోసారి మౌనం మాత్రమే.కొన్ని దశాబ్దాల మౌనం విస్ఫోటనం చెందితే వెలువడేది అక్షరవ్యాసం అనేది వాస్తవం అంటాను నేను..


ఎన్నో ప్రశ్నలకు.. సమాధానాలు ఈ వ్యాసాలలో రచయిత్రి పొందుపరిచారు., సమాజాన్ని అధ్యయనం చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ చక్కటి గైడ్ లైన్ వంటిదే ఈ పుస్తకం అనిపిస్తుంది.


నేడు ఆర్థిక అసమానతల్తో కునారిల్లుతున్న వ్యవస్థలోని బంధాలకు,అనుబంధాలకు మధ్య జరిగే మనిషి ,మానశిక‌ సంఘర్ణ,వాటి పర్యవస్థానాలు చక్కగా వివరించిన వ్యాసలు.

అదే విధంగా నేడు ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్న టెక్నాలజీ, వాట్సాప్,ఫేస్ బుక్,ఇన్స్టోగ్రామ్,వంటి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో,వాటిని విజ్ఞాన సంపార్జనకు వినియోగించుకోవాలనే సందేశంను అందించిన వ్యాసం చాలా విలువైనది.


నే చెప్పేదేంటంటే.. వ్యాసంలో..

"సగటు మనిషికి న్యాయం అందుబాటులో లేనప్పుడు, ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు . నీతులు , సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి , ముందు మనం, ఆ చెప్పే వాటిలో కొన్నయినా పాటించి , అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం ."

రాజరిక వ్యవస్థ కనుమరుగై ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్న రోజుల్లో..

రంగులు మార్చే రాజకీయ వ్యవస్థను చూస్తూ అక్షరాలను తూటాలుగా మలిచిన విధానమే లేఖావ్యాసాలు.


నేటి సమాజంలోని కొందరి ప్రవర్తనను ప్రస్తావిస్తూ.

"వల్లమాలిన ప్రేమలు కురిపిస్తూ , లోపల విషపు సెగ విరజిమ్మే నైజాలిప్పుడు మన చుట్టూ చాలా ఎక్కువే, 

మనం జాగ్రత్తగా మసలుకోవాలి .ఈ నటనలే అగ్రస్థానా ఆక్రమిస్తున్నాయి . చూసి చూసి మనకూ నటన అలవాటై పోతుందేమోనని భయము వేస్తోంది ఓ పక్కన "అంటారు రచయిత్రి.

 .

"రెప్పపాటు ఈ జీవితానికీ ఎన్ని రెప్పలు కింద కన్నీటిని పారించాలో , శత్రువును తలుచుకున్నంతగా, మిత్రులను కూడా తల్చుకోం కొన్ని బాధ్యతల నడుమ బంధాలకు చోటు తక్కువే మరి" అనే వాస్తవాన్ని నిర్భయంగా ప్రకటించడంలో , రచయిత్రి ఎదుర్కొన్న ఎన్నో పరిస్థితిల ప్రభావం కావచ్చు.,.


ఇలా ఎన్నో విషయాలపై,అనేక కోణాల్లో తనదైన భావాలను ప్రస్పుటంగా ప్రకటిస్తూ,మనకు అందిస్తున్న లేఖావ్యాసాలు. "అవ్యక్తం లేఖావ్యాసాలు"పుస్తకం తప్పక చదవండి.

మనం స్పందించలేని,మన మనసులో గూడుకట్టుకున్న ఎన్నో ప్రశ్నలను సూటిగా, ప్రశ్నించే తత్వాన్ని స్వాగతిద్దాం రండి.

 

                                       

                                      అక్షరాభిమాని.

                                రాము కోలా.దెందుకూరు.

                                ఖమ్మం.9849001201.



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner