15, ఆగస్టు 2024, గురువారం

స్వతంత్రం ఎవరికి..?

అంగబలానికి

అర్థబలానికి

వచ్చిన స్వేచ్ఛని

స్వతంత్రమందామా..


మనిషితనానికి

మనసుతనానికి

వేసిన ముసుగులను

స్వతంత్రమందామా..


బంధాలను

అనుబంధాలను

గాలికొదిలేయడాన్ని

స్వతంత్రమందామా..


వి(వీ)ధిరాతల

వింతపోకడలను

రాయలేనితనాన్ని

స్వతంత్రమందామా..


ఏదేమైనా

ఎవరెలా పోతున్నా

మనకు మనం బావుండాలంటూ

లేని స్వతంత్రానికి 

రాని స్వాతంత్ర్యానికి

మరోసారి శుభాకాంక్షలు..!!


12, ఆగస్టు 2024, సోమవారం

పుస్తక సమీక్ష

 రాము కోలా గారికి, సూర్య పత్రిక యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు…


6, ఆగస్టు 2024, మంగళవారం

ధన్యవాదాలు..!!

 రాము కోలాగారికి, ప్రజాహితం యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు…


అభినందనలు..!!

 చిరంజీవిగారు, 

      మీరంటే కొన్ని విషయాల్లో నాకు కోపమున్న మాట వాస్తవం. అయినా మీ కుటుంబాన్ని చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. బయటివారు సరే, మన రక్త సంబంధాలు ఎదుగుతుంటే ఓర్వలేని ఈరోజుల్లో, మీ కుటుంబమంతా పవన్ కళ్యాణ్ గారి ఉన్నతిని హృదయపూర్వకంగా అభినందించి, ఆనందపడిన క్షణాలను చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. 

        అయినవారి సొమ్ము తింటూనే, వారిని నలుగురిలో నవ్వులపాలు చేసే రక్త సంబంధాలున్న రోజులివి. మీ ఆస్తుల విలువలు పెరిగాయని ఆడపడుచులకు అదనంగా, ఆనందంగా కానుకలు ఇచ్చిన మిమ్మల్ని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. 

    ఎదుటివారి ఉన్నతిని అభినందించే మంచిగుణం బహు అరుదు. ఏదేమైనా మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమందయినా మీనుండి ఈ మంచిని నేర్చుకుంటే సమాజం కాస్తయినా బావుంటుంది.

5, ఆగస్టు 2024, సోమవారం

గాలివాటం పై రాము కోలా గారి సమీక్ష

 మన తెలంగాణ దిన పత్రికలో నేను వ్రాసిన  మంజు యనమదల గారి "గాలి వాటం"  పుస్తక సమీక్ష .



     ✍️గాలి వాటం పుస్తక సమీక్ష ✍️


శీర్షిక. నేటి సామాజిక అంశాల పరిశీలనాత్మక గ్రంథం.


ప్రముఖ కవయిత్రి విభిన్నమైన ప్రక్రియల్లో రచనలు అందిస్తున్నా మంజు యనమదల గారి రెక్కలు లఘు రూప కవితా సంపుటి గాలి వాటం పుస్తక సమీక్ష.


గాలివాటం కాదు “నేటి సామాజిక అంశాల పరిశీలనాత్మక గ్రంథం “అంటాను నేను.

కాలాన్ని కనుమరుగు చేస్తూ పాఠకులను తనతో ప్రయాణించేలా చేయగలిగేది సాహిత్యం. వర్ధమాన కవులు తమ సత్తాను చాటుకుంటున్న ప్రక్రియల్లో రెక్కలు లఘు కవితా ప్రక్రియ ఒకటి.


ప్రముఖ కవి విమర్శకలు. డా: అద్దేప ల్లి రామ్మోహనరావు గారి" మాటల్లో.

ఆరు పాదాలతో సాగుతున్నా లఘు కవిత్వం.

నాలుగు పాదాలు ఒక జీవితానుభవాన్ని గూర్చి చెబితే, చివరి రెండు పాదాలు ఆ అనుభవం ద్వారా కవి చెప్పదలచిన తత్త్వం గూర్చి తెలియజేయాలి అంటారు.


కవిత్వం మానసిక సంఘర్షణ నుండి జనిస్తుందంటారు సాహితీ విశ్లేషకులు.

సంఘర్షణకు అక్షర రూపం ఇవ్వాలంటే

భాష పైన పట్టు ఉండాలి.

ముఖ్యంగా పుస్తకాలను చదివిన పరిజ్ఞానం కావాలి.

సామాన్య పాఠకలు సులువుగా అర్థం చేసుకునేలా రచనా శైలితో సాగాలి.


విమర్శలను సద్విమర్శలుగా స్వీకరిస్తూ పాఠకులకు తన భావాన్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా వివరణ ఇవ్వగల నేర్పు కవి/కవయిత్రిలో తప్పకుండా ఉండాల్సిన లక్షణం..


నేటి సామాజిక స్థితిగతులు పట్ల,నేటి ప్రభుత్వ విధివిధానాలు పట్ల, స్వార్థ రాజకీయాల పట్ల,

స్థిరమైన అభిప్రాయాలను వెలిబుచ్చగల ధైర్యం ఉండాలి.

నమ్మిన సిద్ధాంతాన్ని నలుగురు ముందు చర్చించేందుకు సంసిద్ధంగా ఉండాలి.


రచనా శైలితో అశేష పాఠకులను తన రచనల వైపు తిప్పుకున్న మంజు యనమదల గారు ఇప్పటికే అనేక పుస్తకాలను ముద్రణా రూపంలో తీసుకు రావడం జరిగింది.బహూళ ఆదరణ పొందడం మనందరికీ తెలిసిన విషయమే.


జీవితంలో ఎదురైనా సమస్యలను నేటి సమాజంలోని ఆర్థిక వ్యవస్థలో దాగున్న లొసుగులను,మానవత్వం మరచిన మానవ సంబంధాలను, "రెక్కలు అనే ప్రక్రియతో పాఠకుల ముందుంచే ప్రయత్నంలో వారి నుండి వెలువడిన కవితా సంపుటి గాలి వాటం.


ఇది గాలి వాటం కాదు సాహితీ ప్రభంజనం.

తనదైనశైలితో సమాజాన్ని నిగ్గదీస్తూ 

సంధించిన శాస్త్రాలు ఈ రెక్కలు ప్రక్రియ నుండి పురుడు పోసుకున్న కవిత్వంలో మనం చూడవచ్చు.


"వేల కొలది/పేజీలు

వందల కొద్దీ/అభియోగాలు


తీర్పులకు

సమయమెక్కడా .. !!

చట్టం అందరికీ వర్తిస్తుంది.

అనే మాట ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తుంటుంది.

అభియోగాలతో ,అధికారంలో ఉన్న వ్యక్తిని 

చట్టం చుట్టంలా ఆదరిస్తుంటే!న్యాయం నిస్సహాయంగా చూస్తుంది.

న్యాయ దేవత కళ్ళు తెరిచేది ఎప్పటికో?.

కవయిత్రి సంధించిన ప్రశ్న మాత్రమే కాదు ఇది.

 ప్రతి సామాన్యూడి ప్రశ్న.చట్టంలోని లొసుగులు కొందరినే ఎందుకు కాపాడుతున్నాయ్ అనేది ప్రశ్నార్థకమే!.

సమాధానం చెప్పడానికి న్యాయవ్యవస్థ సిద్దంగా లేదేమో!.


ధనం మూలం ఇదం జగత్ అనే మాటలకు వాస్తవ రూపం నేడు మనం చూస్తూనే ఉన్నాం.

అనుబంధాలు ఆప్యాయతలు కనుమరుగై ధనంతో కలుపుకున్న బంధాలు నింగిలో ఇంద్రధనుస్సులా కనిపిస్తున్నాయ్.

ఎందుకంటే డబ్బుతో ఏదైనా దేన్నైనా సొంతం చేసుకోవచ్చును అనుకునే వాళ్లు సమాజంలో మనకు నిత్యం తారస్తపడుతునే ఉంటారు.


ప్రపంచాన్ని శాసిస్తున్న వాటిల్లో ధనం ఒకటి. పెద్దలు భవిష్యత్తును ముందుగానే ఊహించి "ధనం మూలం ఇదం జగత్" ఉన్నారేమో!.


అదే మాటను తన రెక్కలు ప్రక్రియలో కవయిత్రి 

ఎలా మలచారో చదవండి.

అమ్మనీ / మర్చిపోతున్నాం / అనుబంధాలకు / దూరమౌతున్నాం .

దగ్గరి చుట్టం / ధనమే .

అంటారు కవయిత్రి.

ఎవ్వరితోనూ పనిలేదు.నాకు ధనం ఉంటే చాలు అనుకునే మనిషి మనస్తత్వం. ధనం పై మక్కువ పతనం వైపు నడిపిస్తుందే కానీ,శాస్వత బంధాలకు దూరం చేస్తుందనేది కవయిత్రి సూటిగా చెప్పిన మాట.


ఏ ఆటైనా /ఆడించేది వాడే

ఫలితాన్ని /నిర్దేశించేది వాడే/

చతురుడు

పైవాడు .. !!.అనే రెక్కలు పరిశీలించినట్లైతే 


నమ్మినా నమ్మక పోయినా

మనిషిని నడిపించే శక్తి కంటికి కనిపించకుండా 

వెన్నంటే ఉంటుంది అంటుంటారు.

ఆ శక్తినే ధైవస్వరూవం అని మనం నామకరణం చేసుకున్నాం..

మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఉంటుంది.

ఇదే విషయాన్ని తాత్వికంగా చర్చిస్తే.


"అంతిమ వాస్తవికతను గ్రహించడం" లేదా "అస్తిత్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం". ఇది హిందూ తత్వశాస్త్రంలో, ముఖ్యంగా అద్వైత వేదాంత సంప్రదాయంలో ఉపయోగించే పదం.

 

చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసి వచ్చినప్పుడే,అంతా పైవాడి లీల అంటూ వేదాంతం వల్లిస్తుంటారు.

మనం చేసినది తప్పు అని ఓప్పుకోరు.

ఆడించేసింది అంతా పైవాడే అని నిట్టూర్చేది కూడా మనమే.


మనిషైనా /దైవమైనా /తప్పదు 

కర్మ ఫలితం/కాలానికి/కాదెవరూ అతీతం .. !!.


ఇది ఎక్కువుగా పాలక వర్గానికి దగ్గరగా ఉంటుంది.

అధికారంలో ఉన్నంత వరకు తమకు తిరుగులేదని తాము చేసినదే శాసనం అనుకునే మనస్తత్వంను గుర్తుచేస్తుంది.

మనిషిఎప్పుడూ “ కర్మిష్ఠి ”గానే ఉండాలి !

‘ అకర్మణ్యత్వం ’ అన్నది ఎప్పుడూ వుండకూడదు.

మనం చేసే కర్మలు భవిషత్తులో నలుగురు కీర్తించేలా ఉండాలి కాని మనం పాపఫలం అనుభవించేలా ఉండకూడదనే నిగూఢమైన అర్థం ఈ కవితలో అంతరంగా దాగి ఉంది.


ఎప్పుడో చదివిన నాలుగైదు మాటలు ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని ఇక్కడ ఉంచుతున్నాను.

కవిత్వం అనేది సందర్భాన్ని అవగాహన చేసుకుంటూ రాయాలి. మెత్తగా కొత్తగా రాయాలి. చమత్కారంగా రాయాలి. 

ప్రజలు జీవన విధానాన్ని ప్రతిభించాలి.

మన చూట్టూ జరుగుతున్న సంఘటనలకు దర్పణంలా ఉండాలి.

సమాజాన్ని ప్రశ్నిస్తూనే 

ప్రజల్ని ఆలోచింపచేయాలి.

లేదా కనీసం కవి రాసిన భావాల పైన చిన్న చర్చ అయినా జరగాలి.అప్పుడే కవి/కవయిత్రి రాసిన కవిత్వానికి సార్థకత.


అర్హత/అనర్హత/అక్షరమే/తేడా

వ్యవస్థ/పు ( తి ) రోగతికి మూలం .. !!

పైన కనిపిస్తున్న రెక్కలు చదివిన తర్వాత 

నా భావం ఇలా పంచుకోవాలనిపించింది.


కవిత్వం అనేది భావోద్వేగాల సమ్మేళనం, ఆలోచనలు మరియు అనుభవాలనుండి జీవం నింపుకునే సౌందర్యం . పదాల అమరికతో ప్రత్యేకమైన శైలితో పాఠకులను మెస్మరై చేయగలగాలిగే పదాల కూర్పు.

ఇది గుర్తెరిగి రచనలు చేస్తున్న మంజు యనమదల గారు అవినీతి అధికార దుర్వినియోగాన్ని నాయకుల కుటిల రాజకీయ చతురతను అధ్యయనం చేస్తూ ,ఈ సంపుటిలో రెక్కలు గా మలిచారనేది నా అభిప్రాయం.

 

చివరగా నాకు బాగా నచ్చిన రెక్కలు ఇక్కడ ఉంచుతున్నాను 


అర్హత/అనర్హత

అక్షరమే/తేడా

వ్యవస్థ/పు ( తి ) రోగతికి మూలం .. !!

ఇది ప్రజలు గుర్తెరిగి తమ నాయకులను ఎన్నుకున్నప్పడే సమగ్రాభివృద్ధి చూడగలం.

ప్రజల కర్తవ్యాన్ని ఇలా గుర్తుచేసే రచనలు మరెన్నో మంజు యనమదల గారి నుండి రావాలని, హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.

పాఠకులు ఇటువంటి రచనలను ఆదరించవలసిన అవస్యకత ఎంతైనా ఉంది.


అమూల్యమైన పుస్తకం కావలసిన వారు “92464 15150 “ నెంబర్ నందు సంప్రదిచగలరు.

పోస్టల్ అడ్రస్ వాట్సప్ పంపండి–

రిజిస్టర్ పోస్టులో మీ ఇంటికి భద్రంగా అందుతుంది.చదవండి స్పందించండి.


                                                  మీ 

                                       కవి/కథా రచయిత.

                                    రాము కోలా.దెందుకూరు.

                                    ఖమ్మం.9849001201.

3, ఆగస్టు 2024, శనివారం

అలసిన వాక్యాలు..!!

అడుగులు తడబడిన 

అక్షరాలు కొన్ని 

తప్పిపోయాయి


తప్పటడుగులతో 

గమ్యాన్ని చేరలేమన్న 

నిరాశలో మునిగిపోయాయి


మాటలకు వ్యాకరణాల

అలంకారాలు అక్కర్లేదంటూ

గదమాయిస్తున్నాయి


తెలియని దారుల్లో

పరమపద సోపానాలు

ఎదురుపడుతున్నాయి


కాలం విసిరెళ్లిన

గా()లపు వలకు

చిక్కుబడ్డాయి


క్షణమయినా సేదదీరడానికి

అలసిన వాక్యాలు 

కొన్నయినా చాలంటున్నాయి..!!




1, ఆగస్టు 2024, గురువారం

జీవన మంజూష ఆగస్ట్ 24


 నేస్తం,

          బంధాన్ని కొనసాగించాలంటే బోలెడు సర్దుబాట్లు, మరెన్నో దిద్దుబాట్లు వుంటాయి. అదే బంధాన్ని వదిలించుకోవాలంటే మనకు సవాలక్ష కారణాలు భూతద్దంలో ఏంటి..మామూలు అద్దంలోనే కనిపించేస్తాయి. రక్త సంబంధమైనా, మరేదైనా అనుబంధమయినా పెంచుకోవాలంటే కష్టం కాని తుంచుకోవడం ఎంతసేపు ఈరోజుల్లో. బాధ్యతల నుండి తప్పుకోవడానికి కారణాలు వెదకడం మనిషితనమని అనిపించుకోదు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన జన్మకు సార్థకత.

          అమ్మ, ఆలిలో ఎవరు ముఖ్యమని కాదు, మనం ఎవరి విలువ వారికి ఇస్తున్నామో లేదో మన మనస్సాక్షిని అడిగితే తెలుస్తుంది. ఎంతసేపూ మనమే నిజాయితీపరులమని చెప్పుకుంటే సరిపోదు. మన నిజాయితీ ఏపాటిదో నలుగురు చెప్పుకుంటే అప్పుడు దానికి విలువ. ఎదుటివారి మీద నెపం వేసే ముందు మన ప్రవర్తన ఎలావుందని మనం క్షణం ఆలోచిస్తే మాట తూలడం అన్న పొరపాటు జరగకుండా వుంటుంది

           కోపం, ఆవేశం మనిషన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రేమాభిమానాలు కొందరికే వుంటాయి. మనం ఏమన్నా ఎదుటివారు ఊరుకుంటున్నారంటే అది వారి చేతగానితనం కాదు. బంధాలను కొనసాగించడానికి వారు తమను తాము తగ్గించుకుంటున్నారని అర్థం. దూరం రెండిళ్ల మధ్యనా సమానమే. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. మనమిచ్చినదే ఎదుటివారు మనకిస్తుంటే తీసుకోవడానికి కష్టంగా వుందనుకుంటే ఎలా? మనిషికయినా ఒక స్థాయి వరకే ఓర్పు, సహనం వుంటాయి. అవి దాటితే మనసు సముద్రానికి ఆనకట్ట వేయగలమా..! 

            ఎదుటివారి నుండి ఏదైనా మనం ఆశించడానికి, మనకి ఏపాటి అర్హత వుందో చూసుకోవాలి. మన అవసరాలు తీర్చుకుని, “ఏరు దాటి తెప్ప తగలేయడంకాదు. ఒకప్పుడు మనిషి చనిపోయిన తరువాత ఆస్తుల పంపకాలు జరిగేవి. ఇప్పుడు మనిషి బతికుండగానే పం(అం)పకాలు జరుగుతున్నాయి. డబ్బుల బంధాలు తప్ప అనుబంధాలు అవసరం లేని మనుష్యులుగా మారిపోతున్నాం.అవసరానికి నటించడమే మన తక్షణ కర్తవ్యమన్నట్టుగా మనం మసలుతున్నాం. ఋణపాశాలు అక్కర్లేని ధనపాశాల చుట్టూ మనం తిరుగుతున్నాం. రక్త సంబంధాలు కూడా రోతగా మారిపోతున్న ఈరోజులను చూస్తూ బాధపడటం మినహా ఏమి చేయలేక పోతున్నాం..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner