27, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 73

    మెుదటి పుస్తకంలో కొన్ని కవితలు వేశాను. అప్పటి ముఖపుస్తక పరిచయస్తులు రామకృష్ణ వజ్జా గారు, మరి కొంతమంది పుస్తకం పంపమంటే పంపాను. తర్వాత రామకృష్ణ గారు ఇంటికి వస్తుండేవారు. నన్ను వారింటి ఆడపిల్లగానే చూసేవారు. అప్పటికే హెల్త్ ప్రోబ్లం బాగా ఎక్కువై జాబ్ నుండి ఓ నెల రెస్ట్ తీసుకుంటానని చెప్పి, మెుత్తంగానే మానేసాను. రామకృష్ణ గారు పుస్తకం వేయిస్తానని ముందుకి వచ్చారు. ఈసారి కవితలు కాకుండా వ్యాసాలు వేద్దామని చెప్పి, కొన్ని పుస్తకం కోసమని సెలక్ట్ చేసాను. అవన్నీ కలిమిశ్రీ గారికి పంపేసాను. నా హెల్త్ కూడా రానురానూ బాగా పాడయ్యింది. మా గోపాలరావు అన్నయ్య అమెరికా నుండి వచ్చి, నన్ను చూసి, తనే తన ఫ్రెండ్ కి చెప్పి రుమటాలజి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. నా హెల్త్ హిస్టరీ మెుత్తం ఆవిడకి చెప్తే, మరికొన్ని టెస్ట్లు రాశారు. చివరికి SLE అని తేలింది. మెడిసిన్స్ వాడుతూనే ఉన్నా బాగా సివియర్ అయ్యి, ప్లేట్ లెట్స్ బాగా తగ్గి, ఓ మూడు నెలలు మంచం దిగలేదు. విజన్ తో సహా బాగా తేడా వచ్చేసింది. ఇక చూడటానికి వచ్చేవాళ్ళతో ఇల్లు సందడిగా ఉండేది. దీని గురించిన వివరాలు నన్ను చూడటానికి వచ్చిన అందరికి చెప్పేదాన్ని ఓపిక లేకున్నా, మనుష్యులు సరిగా కనబడకున్నా. దానికీ కొందరన్నారు.. బానే మాట్లాడుతోందిగా అని. నవ్వుకున్నా ఆ మాటలకు. మా ఊరి జనాల కొందరి మనస్తత్వమది.
          నా పుస్తకం అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు చదివిన సాగర్ శ్రీరామ కవచం గారు టెక్ట్స్ మెసేజ్ తెల్లవారుఝామున 2.45 కి Your poetry is promising అని పెట్టారు. మరుసటి రోజు కాల్ చేసి మాట్లాడాను. రాయడం మానకమ్మా అని చెప్పారు.  ఇంతలో కొందరి ఏక్ తారలతో ఏక్ తారల పుస్తకం వేసి, ఆవిష్కరణ దిగ్విజయంగా హైదరాబాదులో పద్మాశ్రీరాం గారు, వంకాయలపాటి చంద్రశేఖర్ గారు చేసారు. నాకు ఆ పుస్తకం ఇవ్వడానికి ఇంటికి వచ్చారు చంద్రశేఖర్ గారు, మరి కొందరు. తర్వాత నా రెండో పుస్తకం " సడి చేయని (అ)ముద్రితాక్షరాలు "ఆవిష్కరణ జరిగింది. మా విజయనగరం నేస్తాలు మా సీనియర్ ఎర్రయమ్మ, నా ప్రియ నేస్తం రమణి, సాధూరావు, తన ఫ్రెండ్స్, ప్రదీప్ వచ్చారు. ఆ సమయానికి మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదిన కూడా అమెరికా నుండి వస్తే, వారిని రమ్మని పిలిస్తే ఏ భేషజాలు లేకుండా వచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఫంక్షన్ జరిగింది. నా ఆత్మీయులు బోలెడుమంది, నా అనుంగు బిడ్డలు, బంధువులు అందరు వచ్చారు. రాజశేఖరం అన్నయ్య, రాజకుమారి అక్క వచ్చి కనబడి, ఫంక్షన్ కోసం బొకేలు ఇచ్చి వెళిపోయారు. ఈ పుస్తకం కూడా మండలి బుద్ధప్రసాద్ గారు ఆవిష్కరించారు. మెుదటి పుస్తకం కూడా వారే ఆవిష్కరించారు.    
       షరా మామూలుగానే ముందురోజు బాగా గొడవ పెట్టుకున్నారు మా ఆయన. కనీసం డ్రైవర్ కి డబ్బులు కూడా ఇవ్వలేదు ఫంక్షన్ రోజు. ఓ అజ్ఞాత బంధువు పదివేలు ఫంక్షన్ కోసం ఇచ్చారు. చంద్రశేఖర్ గారు అడిగారు సాయం ఏమైనా కావాలమ్మా అని. అవసరం లేదని చెప్పాను. రాజశేఖరం అన్నయ్య వాళ్ళు డబ్బులు తీసుకోలేదు. క్రాంతి శ్రీనివాసరావు గారు, కొంపెల్ల శర్మ గారు, సాగర్ అంకుల్, కొండ్రెడ్డి అంకుల్, కోసూరి రవి గారి సమీక్ష, హరిశ్చంద్ర పద్యాలు, నఖచిత్రకారులు రామారావు గారు మెుదలైన పెద్దల సమక్షంలో  మెుత్తానికి అలా రెండో పుస్తకం బయటికి వచ్చిందన్న మాట. కొన్ని ముఖపుస్తకపు మెాసపు పరిచయాలను తల్చుకోవడం ఇష్టంలేదు. 
       మూడవ పుస్తకం చెదరని శి(థి)లాక్షరాలు నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ నీరజ, శోభ, అనిత స్పాన్సర్ చేసారు. నాలుగవ పుస్తకం గుప్పెడు గుండె సవ్వడులు నేను, వాణి గారు కలిపి వేసిన కవితా సంకలనం. దీనికి రామకృష్ణ వజ్జా గారు ఆర్థిక సహకారమందించారు. చంద్రశేఖర్ వంకాయలపాటి గారు మరో పుస్తకం వేయిస్తానమ్మా అంటే మరి కొన్ని వ్యాసాలు తీసాను. అనుకోకుండా ప్రసాద్ అన్నయ్య, మెహది ఆలీ గారివి, మరి కొందరివి పుస్తకాలు వేయడంతో నా అంతర్లోచనాలు పుస్తకం ముద్రణ ఆగిపోయింది. తర్వాత నా ఇంజనీరింగ్ క్లాస్మేట్, తమ్ముడు రఘు ఆ పుస్తకం వేయించాడు. మరో పుస్తకం ఏ'కాంతా'క్షరాలు ఏక్ తారలతో ఇంజనీరింగ్ ఫ్రెండ్ అను కోనేరు వేయించింది. మరో కవితా సంపుటి అక్షర స(వి)న్యాసం ఇంజనీరింగ్ నేస్తాలు నీరజ, శోభ, అనిత, మమత, నీలిమ వేయించారు. ఇవి నా పుస్తకాల ముద్రణల కబుర్లు క్లుప్తంగా. ఇవన్నీ మల్లెతీగ పబ్లికేషన్స్ నుండి కలిమిశ్రీ గారు, రాజేశ్వరి గారి చేతుల మీదుగా వచ్చినవే. 

" నటించే నైజం మనదైనప్పుడు ఆ నటన నేర్పిన దేవుని ముందు మన నటన కుప్పిగంతులే అని మరిచిపోవడం హాస్యాస్పదం. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
             
             


25, సెప్టెంబర్ 2021, శనివారం

ఏక్ తారలు..!!

1.  కొన్ని మాటలు మరిచిపోవాలంతే_మనసులేని మనిషిగా బతికేయడానికి...!!
2.  దాగలేనంటున్నాయి గుప్పెట్లో గురుతులు_గుండె బరువును మెాయలేక..!!
3.  గొప్పవారికేదైనా ఘనమే_చావుపుట్టుకలు వేడుకగా..!!
4.    గుండె గూడు ఉండనే ఉందిగా_భావాల బాంధవ్యాన్ని దాచుకోవడానికి..!!
5.   అనుభవమేదైనా ఓ పాఠమే_జీవిత పాఠశాలలో...!!
6.   ఎన్ని ప్రశ్నలను సంధిస్తుందో అక్షరం_సమాధానాలు వెదకమంటూ.!!
7.  అప్పుడప్పుడూ వెన్నెలా ఉంటుంది_రాతిరికి తోడుగా..!!
8.   జ్ఞాపకమే నువ్వు_కన్నీరుగానో పన్నీరుగానో..!!
9.  జన్మజన్మల ఋణానుబంధమిది_గతానికి వర్తమానానికి లంకెలేస్తూ..!!
10.   తెలిసినా కాదనలేని మోమాటం అక్షరాలది_బాధైనా భారమైనా భరించేస్తూ..!!
11.   పదాలెన్ని ఉంటేనేం_అర్థవంతం కాలేని వాక్యంలో..!!
12.   మధ్యలో తెర దించలేని నాటకమే ఇది_ముగింపు ముందే తెలిసినా..!!
13.  జీవితమంటే ఇంతేనేమో_తిరిగి రాయలేని పుస్తకంలా..!!
14.   మదికి అంతులేని సంబరమే ఇప్పుడు_అక్షరాలతో ఆడటం నేర్చుకున్నందుకు..!!
15.   పొడి పొడి మాటలే అన్నీ_కలుపుకుపోలేని అనుబంధాలై పోతూ..!!
16.  ఋణశేషాలు పాశాలై పట్టుకున్నాయి_అనుబంధమెరుగని అనాకారాలుగా మారి..!!
17.  కనుమాయ చేసిన అబద్ధాలెన్నో_నిజాలను నీటి పాలుజేస్తూ..!!
18.   అనుబంధాలకు అర్థం మారిపోయింది_ధనబంధం కమ్ముకున్న ఈ కాలంలో..!!
19.   అక్షరాల ఆలంబనే ఇది_మనసు శబ్దాలు సద్దుమణిగిన వేళ..!!
20.   కలానికీ తొట్రుపాటే_కష్టాల కాలాన్ని కదిలించడానికి..!!
21.   గ్రహపాట్లన్నీ మనిషివే_సరిచేయలేని మనసులను కాలానికిచ్చేసాక..!!
22.   పరిచయం వయసెంతని కాదు_ఆ ఆస్వాదన వెలకట్టలేనంత..!!
23.   విరామానికి వినోదం పంచుతాయి జ్ఞాపకాలు_విశ్రాంతికి చోటీయకుండా..!!
24.   మూడు ముళ్లేనని రవ్వంత అజాగ్రత్త_శూన్యాన్ని కానుకిస్తాయని తెలుసుకోలేక..!!
25.   పాద ముద్రలు పదపదమంటున్నాయి_సైకతం శాశ్వతం కాదంటూ..!!
26.   కల’వరాల కలబోతలే జీవితాలు_లలాటలిఖితపు వడపోతల్లో..!!
27.   వినోదం చూస్తున్నాడు దేవుడు_వదిలేస్తే మనిషి నేర్పు ఎంతని..!!
28.  మారని రాతైనా మరుగున పడాల్సిందే_మనోధైర్యం మనదైనప్పుడు..!!
29.  శూన్యంలోనూ చిత్రాలే_జీవితంలో ఖాళీలను పూరించే ప్రయత్నంలో…!!
30.  ఎదలో లీనమైపోతుంటాను_కనుకొలుకుల్లో ప్రత్యక్షమైతూ..!!



రెక్కలు

1.  సహనం 
కొందరికే
అసహనం
అందరికి

మాటలు చెప్పినంత తేలిక కాదు
ఆచరణ..!!

2.  విసిగించడం
కొందరి నైజం
విరాగిలాబ్రతికేస్తారు 
మరి కొందరు 

లలాటలిఖితం
విధాత వింత...!!

3.  ఓర్పుకెప్పుడూ
ఓరిమే
క్షణాలను
అవలీలగా దాచేస్తూ

దాపరికం కొత్తేమీ కాదు
మనసుకు..!!

4.  లోపాలు
సహజం
బ్రహ్మ చేసిన
బొమ్మలకు

దైవమేమీ మినహాయింపు కాదు
అరిషడ్వర్గాలకు..!!

5.   సాధ్యాసాధ్యాలకు
కారణాలెన్నో
సుఖదుఃఖాలకు
చేరువగా

పరమాత్మ 
లీలావినోదమీ జీవితం..!!

6.  లక్ష్యం లేని
జన్మే లేదు
అది 
ఏ లక్షణమైనా

అవకతవకలు తప్పవు
అవసరార్థపు అనుబంధాలకు..!!

7.  వినోదాన్నిచ్చే 
యంత్రాన్ని కాదు
విరహగీతికలకు పరవశించే
ప్రేమపక్షినసలే కాదు

జీవన సంద్రాన్ని
ఆస్వాదించే సామాన్యురాలిని..!!

8.   వివేకం
ఆలోచననిస్తుంది
విచక్షణ
బాధ్యత నేర్పుతుంది

గాయమైనా గేయమైన
మనసుని కదిలించగలగాలంతే...!!

9.   విలాసం
కొందరికి
విలాపం
కొందరిది

ఏదెలా వున్నా
మన ఆనందం మనది...!!

10.   గమకం
అలవాటుగా పడిపోతుంది
స్వరం
అలవోకగా పాడేస్తుంది

విషాదమైనా ఆనందమైనా
గానం వినసొంపుగానే ఉంటుంది..!!

11.   పదాల్లో
భావం కనబడుతుంది
అక్షరాలకు
అలవాటైన విద్యది

వేదనను 
వాటంగా చెప్పడమే నేర్పు మరి..!!

12.   భాష 
సహకరిస్తుంది
అక్షరం
అల్లుకుంటుంది

జనిస్తుంది 
సుస్వరాల సాహిత్యం...!!

13.   జీవితం
ఇమిడిపోయింది
అక్షరంతో
సహవాసం చేస్తూ

సన్నిహితమే
ఏ అనుబంధమైనా..!!

14.   మౌనం
కనపడని గాయం
మాట
మానసిక హింస 

అన్నింటిని భరిస్తుంది
సముద్రం...!!

15.   గొప్పోళ్ళందరూ
మనకి తెలుసు
మనమెంతమందికి
తెలుసో మరి

మాటలు కోటలు దాటటం
నిజమేగా..!!

16.   ఘనత
ఎవరిదైనా
గొప్పదనం
నాదే

వదిలేసిన విలువలే 
ఘనకార్యాలిప్పుడు..!!

17.   మనమేంటన్నది
మనకు తెలుసు
లోకం పోకడెప్పుడూ
నిలకడే

ఛాయను నిజమనే 
భ్రమను వీడగలగాలి..!!

18.   క్లిష్టమైన 
పదాలు అందమేమెా
వాడుక భాష 
వద్దకు చేరుతుంది త్వరగా

అక్షరం అక్కరకు రావడమే
నిజమైన సాహిత్యం..!!

19.  జ్ఞాపకాలే
జీవితం
అక్షరాలే
సన్మిత్రులు

శూన్యంతో సహవాసమైనా
మదినిండా సంతోషమే..!!

20.   అక్షరానికి
అందమైన అలంకారంమౌతుంది
రాయాలన్న 
తపన తోడైతే

భాషకు
భావం వొనగూడితే...!!

21.   అహంభావం 
అలంకారమూ కాదు
మౌనం
అంగీకారమూ కాదెన్నటికి

నువ్వేంటన్నది
నీ మనస్సాక్షికి తెలుసు..!!

22.   అర్థం కాని
ఆశ్చర్యమే
మనిషి
నైజమెప్పుడూ

అనుభవాలెన్నో
ఈ జీవితానికి..!!

23.   అనుబంధాల
వెదుకులాటలు
అనుభవాల
ఆటుపోట్లు

వెరసి కాలానికి
కలంతో సమాధానం..!!

24.   ఎడతెగని
ముడులెన్నో
ఎగసిపడే
అంతరంగ తరంగాలెన్నో

మనసుకు మెదడుకు
అనుసంధానం కావాలి..!!

25.   అక్షరాలతో
అనునయించడం
నిర్వేదనను
వేదంగా మలచడం 

మానసానికి
సులభమే..!!

26.   ఊపిరి 
నిలిపేది
ఊరట
ఇచ్చేది

ఊతమైన
ఈ అక్షరానుబంధమే...!!

27.   మనిషి
నడవడి
మనసు
అలజడి

ఈ అక్షరాల
ఉరవడి...!!

28.  బెణుకో
బెదురో
హత్యో
ఆత్మహత్యో

ఏదైనా 
పదవి మహిమే..!!

29.  ఆస్తులు పంచుకోవడం 
సర్వసాధారణం
ప్రాంతాలను విభజించి
ఏలాలనుకోవడమే వింత 

జనానికి 
అర్థమైన చతురతే ఇది...!!

30.   మాటలు రాని
మనసు
కనబడని
గాయపు ఆనవాళ్ళు

చూపాలన్న తాపత్రయం 
అక్షరాలకి..!!

20, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం...72


      ఓ పది నెలలు దినేష్ దగ్గర అన్ లైన్ లో నైట్ షిప్ట్ వర్క్ చేసాను. మా అమెరికా జనాలకి కొందరికి ఫోన్ చేసినా పెద్దగా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఏదో మెామాటానికి మాట్లాడినట్టు మాట్లాడారు తప్పించి ఆప్యాయంగా మాట్లాడలేదు. వాళ్ళకు మనతో అవసరం తీరిపోయింది కదా, అదన్న మాట సంగతి.మనల్ని కావాలనుకునే వాళ్ళను మనమూ కావాలనుకుంటే సరని నేను పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఆరోగ్యం బాలేదని తెలిసినప్పుడు కూడా ఓ మాట మాట్లాడే తీరిక లేనంత బిజీ పాపం వాళ్ళందరు. అప్పట్లోలా ఫోన్ కి ఖర్చు కూడా కాదు. అయినా ఓ మాట కూడా బరువైపోయింది చాలామందికి. కనీసం వాళ్ళు ఈరోజు అమెరికాలో సిటిజన్స్ గా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గా ఉన్నారంటే, దానికి కారణమైన వారు కష్టంలోనే ఉంటే, పలకరించేంత సమయం లేని బతుకులైపోయాయి మరి. మనిషి సహజ లక్షణం ఇదేనని మరోమారు తెలిసింది.
            ఏదో మాటల్లో పుస్తకం వేయాలని అంటే మా వేంకటేశ్వరరావు బాబాయి, అమ్మాయి నేను వేయిస్తాను, ఆపనేంటో చూడు అని అన్నారు. అప్పటికే బాబాయి ఇంట్లో అవసరమని అడిగితే 35 వేలు ఇచ్చారు. తర్వాత ఓ 10 వేలు ఆయనకు ఇచ్చేసాను. శ్రీ శ్రీ ప్రింటర్స్ లో కనుక్కోమని అభి చెప్తే, అక్కడ అడిగితే 40, 42 వేల వరకు అవుతుందని చెప్పారు. జ్యోతి వలభోజు గారిని అడిగినా అలాగే చెప్పారు. ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారికి చెప్తే మల్లెతీగ కలిమిశ్రీ గారి నెంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పారు. ఫోన్ చేసి మాట్లాడితే 35 వేలని చెప్పారు. ఓ రోజు నేను, మా బేబి వెళ్లి 10వేలు ఇచ్చి వచ్చాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కలిమిశ్రీ గారి కుటుంబంతో సత్ సంబంధమే. తర్వాత నాకు చిన్న ఆపరేషన్ జరిగింది. రానురానూ హెల్త్ ప్రోబ్లమ్స్ బాగా ఎక్కువైయ్యాయి. ఆ సమయంలోనే విజయనగరం ఫ్రెండ్ శ్రీను, తన వైఫ్ చూడటానికి అనుకోకుండా వచ్చి ఓ రెండు రోజులుండి వెళ్ళారు. అప్పటికింకా పుస్తకాలు రాలేదు. 
         అప్పటికే అంతర్వేదిలో మరోసారి కవి సమ్మేళనం రికార్డ్ కోసం జరిపించడానికి ఏర్పాట్లు అన్ని చేసారు కత్తిమండ ప్రతాప్ గారు. నా పుస్తకం కూడా అక్కడే ఆవిష్కరణ చేద్దామని అనుకున్నాము. నేను, వనజ గారు ఆ రోజు వెళదామని ప్లాన్ చేసుకున్నాము. ఆ ఫంక్షన్ కోసం దాచిన డబ్బులు అంతకు ముందు నా కజిన్ లక్ష్మి అడిగితే ఇచ్చాను. కాకపోతే ఫలానా టైమ్ కి కావాలని చెప్పి ఇచ్చాను. వెళ్ళే సమయానికి డబ్బులు ఇవ్వలేదు, వనజ గారు ఏదో ఇబ్బంది వచ్చి ప్రయాణం మానుకున్నారు. ముందు రోజు సాయంత్రం చెప్పారు తనకు వీలు కాదని. నేనూ ఇక డ్రాప్ అయిపోయాను, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని. ఈయన తీసుకువెళతానన్నాడు కాని నేనే వద్దని మానేసాను. 
       మెుత్తానికి అలా ఇలా అని పుస్తకం ఆవిష్కరణ చాలా గ్రాండ్ గా జరిపించడానికి ముహూర్తం కుదిరింది. అప్పటికే పిల్లల పంచెల ఫంక్షన్ ఆపేసిన ఎఫెక్ట్ నా మీద ఉంది కదా. అందుకే నేనుగా ఎవరికి ఎక్కువగా చెప్పలేదు. బోలెడు మంది పుస్తకానికి తమ సందేశాన్ని అడిగిన వెంటనే రాశారు. ఈయన మా ఊరి వారందరికి చెప్పాడు. నేను మా రెండు కుటుంబాల వరకు చెప్పాను. మా పెద్దాడపడుచుకి చెప్పనన్నాను. అప్పటి వరకు దేనికి వదిలిపెట్టకుండా పిలిచినా రాలేదు. ఆవిడ, ఆవిడ అనుయాయలు నన్ను వేటికి పిలవలేదు. ఇదే ఆఖరుసారి పిలువు. రాకపోతే ఇంకెప్పుడూ నిన్ను పిలవమని అడగము అని అమ్మ, రాఘవేంద్ర అంటే, సరేనని ఫోన్ చేసి భార్యాభర్తలు ఇద్దరికి చెప్పాను. షరా మామూలే రాలేదు వారిద్దరు. 
               హోటల్ మినర్వా గ్రాండ్ లో మెుదటి పుస్తక ఆవిష్కరణ చాలా బాగా జరిగింది. పుస్తకం పేరు " అక్షరాల సాక్షిగా..నేను ఓడిపోలేదు. " నా ఇంజనీరింగ్ క్లాస్మేట్, తమ్ముడు రఘు, మా సీనియర్ దావులూరి శ్రీనివాస్ గారు రావడం చాలా సంతోషమనిపించింది. ముఖపుస్తక నేస్తాలు బోలెడు మంది తమ ఇంటి కార్యక్రమమే అన్నంత బాధ్యతగా వచ్చారు. నా చిన్నప్పటి శిశువిద్యామందిరం నేస్తాలు సాయి, నిర్మల, శ్రీలక్ష్మి కూడా వచ్చారు. మా అక్క కొడుకు సత్యకృష్ణ తీసిన వీడియెా, ఉమిత్ తీసిన ఫోటోలతో ఫంక్షన్ బాగా జరిగింది. అప్పటి నుండి కొన్ని పరిచయాలు ఆత్మీయంగా మారి, జీవితంలో ఓ భాగంగా నిలిచిపోయాయి ఇప్పటికి. 

" మనం ఎలా పథకం వేసినా ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దీనిలో ఏ మార్పు ఉండదు. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో ..

          

13, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం..71


          బ్లాగులో రాయడం మెుదలు పెట్టిన తర్వాత చిన్న చిన్న వాటికి కూడా అందరు చక్కగా ప్రోత్సహించేవారు. బ్లాగును కాస్త ముస్తాబు చేయడంలో జ్యోతి వలభోజు గారు, మా AMSOL పిల్లలు శరత్, చంద్రశేఖర్ మరి కొంతమంది హెల్ప్ చేసారు. మేరాజ్ ఫాతిమా అక్క, వనజ గారు, జలతారు వెన్నెల, మెహదీ ఆలీ గారు, మాలా గారు, శివ, అశోక్ పాపాయి, సత్య నీలహంస ఇంకా చాలామంది పరిచయమయ్యారు. అశోక్ దుబాయ్ లో పని చేసేవాడనుకుంటా. ఇండియా వచ్చినప్పుడు హైదరాబాదులో కలిసి, నాకు మేకప్ కిట్, పెన్ డ్రైవ్ ఇచ్చాడు. శివ ఇంటికి వచ్చేవాడు. తన టాబ్ పిల్లలకు ఇచ్చాడు. అక్కా అని పలకరిస్తుంటాడు ఇప్పటికి. బ్లాగు పరిచయాలన్నీ మంచి జ్ఞాపకాలే. నా చిన్నప్పటి నేస్తం నా రాతలు బ్లాగులో చదువుతూ, కామెంట్లు పెడుతూ ప్రోత్సహించేవాడు. ఎప్పుడోకసారి నేనే పుస్తకం వేయించేస్తా అని, పుస్తకానికి పేరు కూడా సెలక్ట్ చేసేసాడు అప్పట్లోనే. 
       బ్లాగుల నేస్తాలందరు ముఖపుస్తకంలోనూ ఉండేవారు. ముఖపుస్తకానికి నా ఇంజనీరింగ్ నేస్తాల కోసం రావడం జరిగింది. మెుదట్లో పోస్ట్ లు ఏమి పెట్టేదాన్ని కాదు. బ్లాగుల్లో స్నేహితులైన ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారు బ్లాగులో రాసేవి ఇక్కడ గ్రూప్ లలో కూడా పోస్ట్ చేయండి అని చెప్పారు. అలా మెల్లగా ముఖపుస్తకంలో రాతలు అలవాటయ్యాయి. చాలామంది పెద్దలతో నా స్నేహం ముందుగా తగవుతోనే మెుదలైంది. 
        మన తెలుగు మన సంస్కృతి గ్రూప్ లో వారం వారం నిర్వహించే చిత్ర కవితకు ఓ న్యాయ నిర్ణేతగా, కో అడ్మిన్ గా ఉండేదాన్ని. మీగడ త్రినాథ్ గారు మెుదటగా నాకు కో అడ్మిన్ బాధ్యతను అప్పగించారు, నాకు ఏమీ తెలియదని చెప్పినా వినకుండా. కత్తిమండ ప్రతాప్ గారు, సబ్బాని లక్ష్మీనారాయణ గారు గౌరవ న్యాయమూర్తులుగా వ్యవహరించేవారు. మనసంతా నువ్వే, కోకిల గీతం గ్రూపులకు కూడా కో అడ్మిన్ గా ఉండేదాన్ని. అప్పట్లో ఓ 7, 8 గ్రూపులుండేవి కవితలకు. రావి సురేష్ గారిది ఉత్తరాలకు ఓ గ్రూప్ ఉండేది. ప్రశాంత్ ఏక్ తార గ్రూప్ లో జాయిన్ చేసాడు. తర్వాత తర్వాత ద్విపదలు, త్రిపదలు, రెక్కలు, వంటలు ఇలా చాలా గ్రూప్ లలో ఉన్నాను ఇప్పటికి. ఏక్ తారలు పద్మా శ్రీరాం గారు నేర్పించారు. 
            ముఖపుస్తకంలో పరిచయమైన కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అంకుల్ ని మెుదట్లో బాగా సతాయించాను. నా పోస్ట్ కి అంకుల్ కామెంట్ పెడితే సమాధానమిచ్చాను. అంకుల్ ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వకుండా 4, 5 రోజులు సతాయించి ఇచ్చాను. అప్పుడు అంకుల్, ఆంటీ అమెరికాలో ఉన్నారు. అక్కడి నుండి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ మాటల్లో తెలిసిన విషయమేమిటంటే అంకుల్ మా నాన్నకు మచిలీపట్నంలో హిందూ కాలేజ్ లో క్లాస్మేట్. అప్పటి నుండి అంకుల్ అనేవారు. అమ్మాయ్ మంజూ నీ కవితల పుస్తకం అచ్చులో రావాలి అని. నేనెప్పుడూ నా రాతలు పుస్తకాలుగా రావాలని కాని, పత్రికల్లో రావాలని కాని అనుకోలేదు. సాహితీసేవ ముఖాముఖిలో పరిచయమైన ఎమ్ ఎన్ ఆర్ గుప్త గారు కూడా పుస్తకం వేయండి అని అంటూనే ఉండేవారు. 
    అసలు నా రాతల గురించి చాలా సంవత్సరాలు ఇంట్లోవాళ్ళకు తెలియదు. ఇంట్లో లాప్ టాప్ లేనప్పుడు కూడా, ఇంట్లో పనయ్యాక మధ్యాహ్నం అప్పుడు నెట్ సెంటర్ కి ఓ గంట వెళ్ళి గబగబా రాసి, పోస్ట్ పెట్టేసేదాన్ని. తర్వాత తర్వాత ఇంట్లోనే రాయడమైనా, ఎందుకా రాతలు? కాసేపు పడుకోరాదా! అని అమ్మ అనేది. అప్పట్లో అనుకూల పరిస్థితుల్లో రాసిన రాతలు చాలా తక్కువ. బ్రెయిన్ డెడ్ అయి, మామూలుగా అయిన తర్వాత, గోపాళం శివన్నారాయణ గారు చెప్పిన మాట..." అమెకు ఎలా సంతోషంగా ఉంటే అలా ఉండనివ్వండని. " అప్పటి నుండి అందరికి కాస్త తెలుసు నా రాతల గురించి. 

           " అనుకున్నామని జరగవు అన్ని. అనుకోలేదని ఆగవు కొన్ని. " ఇది నిజంగా నిజం. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 
              

6, సెప్టెంబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం..70


    బయటికి బావుందని ఇల్లు మారాం కాని, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇబ్బందులు బాగా ఎక్కువైయ్యాయి. పాతింట్లో ఉండగా డబ్బులకు అస్సలు ఇబ్బంది పడలేదు ఎప్పుడూ. ఈ ఇంటికి వచ్చాక 50 రూపాయలకు కూడా ఇబ్బంది పడినవరోజులున్నాయి. ఆరోగ్యం కూడా చాలా పాడయ్యింది. మానసిక ప్రశాంతత లేదు. చాలామంది ఇల్లు మారమని చెప్పినా కూడా నేను వినలేదు. మా పిన్ని వాళ్ళు వాళ్ళబ్బాయి పెళ్లిలో పిల్లలకు బట్టలిస్తామంటే, ఈయన అప్పుడేం అనకుండా తర్వాత వద్దంటే, మా ఇంట్లోనే చేద్దామని అన్ని రడీ చేసుకుని, అందరికి చెప్పిన తర్వాత,  ఈయన పిల్లలకు పంచలు కట్టబెట్టనీయకుండా గొడవ పెట్టుకుని, అది జరగనివ్వలేదు. అప్పటి నుండి అది బుర్రలో బాగా ఉండిపోయిందనుకుంటా. తర్వాత కొన్ని నెలలకి నాకు ఫిట్స్ వచ్చి, ఓ 20 నిమిషాలు బ్రెయిన్ డెడ్ అయ్యింది. తర్వాత ఓ మూడు గంటలు మెలకువలోనే ఉన్నా జరిగినదేది నాకు తెలియదు. మా చెల్లెళ్ళు స్రవంతి, శిరీషలే జాగ్రత్తగా చూసుకున్నారు ఆ టైంలో. పిల్లలు, నేనే ఉన్నామప్పుడు. శౌర్య ఇంట్లోనే ఉన్నాడు ఆ టైమ్ లో. వాడే అందరిని పిలిచాడట. అప్పటి నుండి కాస్త మతిమరుపు కూడా వచ్చేసింది. అప్పటి నుండి ఓ మూడేళ్ళు విజయవాడ గోపాళం శివన్నారాయణ గారి దగ్గర మందులు వాడటం, మధ్యలో బాగా జుట్టంతా ఊడిపోయి, మనిషిని కూడా సన్నబడిపోవడంతో విజయ హాస్పిటల్ లో రమణారెడ్డి గారి దగ్గర చూపించడం, ANA టెస్ట్ పాజిటివ్ రావడం ఇవన్నీ జరిగిపోయాయి. 
       అప్పుడే మళ్ళీ జాబ్ లో జాయినవడం కాకతాళీయంగా జరిగింది. అప్పటికే మన రాతలు బ్లాగు నుండి ముఖపుస్తకానికి విస్తరించడం, సాహితీసేవ గ్రూప్ మీట్ అంతర్వేదిలో జరిగితే దానికి కంచర్ల సుబ్బానాయుడు గారు ఆహ్వానించడం, కవితల పోటిలో నేను ఓ న్యాయనిర్ణేతగా ఉండటం జరిగింది. మన తెలుగు మన సంస్కృతి, మనసంతా నువ్వే గ్రూపులకు నేనూ ఓ అడ్మిన్ గా చేయడం జరుగుతోంది అప్పటికే. నా పుట్టినరోజుకి అందరి శుభాకాంక్షలతో పాటుగా దినేష్ కూడా చెప్పడం, తర్వాత పలకరింపుల కబుర్లలో నాకు జాబ్ కావాలంటే, తను ఇస్తాననడం అనుకోకుండా జరిగిపోయింది. అది నైట్ షిప్ట్. సాహితీసేవ గ్రూప్ లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం, దానికి మంచి పేరు రావడం కూడా జరిగింది. సాహితీసేవ గ్రూప్ లో తెలుగు సాహితీ ముచ్చట్లు పేరుతో ఓ శీర్షిక నిర్వహణ బాధ్యత నాపై పెట్టారు. దగ్గర దగ్గర 40 వారాల పాటు ఆ శీర్షిక కొనసాగింది. 
              విశ్వభారతిలో పని చేసే టీచర్ వాసవి గారు వేరే ఇంటికి మారిపోయారు. కొత్తగా వేరేేవాళ్ళు వచ్చారు పిల్లల చదువు కోసం. ఈవిడ వచ్చినప్పటి నుండి తేడానే. అన్నింటికి వాదులాట పెట్టుకునేది. ఇంటావిడకు కూడా మా మీద చాడీలు చెప్పడంతో, చెప్పుడు మాటలు బావుంటాయి కదా. ఆవిడ ఏదేదో మాట్లాడితే నేనూ ఊరుకోలేదు. నాకు బాలేనప్పుడు కూడా అందరు ఇంటి గురించి అంటే కూడా ఏమెా ఇల్లు బావుండబట్టే బతికానేమెా అని కూడా అన్నాను. అప్పటి నుండి ఇంటివాళ్ళు చాలా తేడాగా ప్రవర్తించేవారు. చాలా ఇబ్బంది పెట్టారు. అప్పటి వరకు మనం చేసినదంతా ఏదో వాళ్ళకి బాకీ ఉండి చేసినట్టుగా ఫీల్ అయ్యారు. నాకసలు వీళ్ళ గురించి తల్చుకోవడం కూడా ఇష్టం లేదు. నేను చాలా చోట్ల ఉన్నాను కాని ఇలాంటి వారిని మాత్రం ఎక్కడా చూడలేదు. అమెరికాలో కాలే దంపతులతోనూ, ఇక్కడ  వీళ్ళతోనూ అన్నమాట. ఇంతకీ ఇంటివారి పేరు చెప్పలేదు కదూ... స్కూటర్ (కొల్లి) పూర్ణ గారు. 
        తర్వాత పిల్లల చదువుల కోసం మళ్లీ విజయవాడ మా ఇంటికి వచ్చేయడం, నా రాతలు, ఆ రాతల్లో కొన్ని పుస్తకాలు వేయించుకోవడం జరిగింది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టడంతో ఉద్యోగానికి విరామం, రాతలకు కాస్త విశ్రాంతిని ఇవ్వడం మెుదలైంది. ఎందరో సాహితీ పెద్దల పరిచయాలు, ముఖపుస్తక మిత్రుల పరిచయాలు, మంచి చెడులు జీవితంలో సమభాగాలుగా జరిగిపోయాయి. 

" మనిషికి సొమ్ము ఉండగానే సరిపోదు. వ్యక్తిత్వం ఉంటేనే మనిషికి గౌరవం వస్తుంది. రేపు మెాయడానికి నలుగురు వస్తారు. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సత్యారాధేయం..!!

" నేనిప్పుడు మందహాసాల్ని
జారవిడుచుకుని
నిత్యం ప్రశార్థకాల్ని మెాసుకుంటూ
తిరుగుతున్నాను "

       ఇవి డాక్టర్ రాధేయ గారి మనసు మాటలు. సత్యారాధేయం నా చేతికి వచ్చి రెండు రోజులయ్యింది. చదవాలంటే ఒకింత బాధగా అనిపించింది. కనీసం పుస్తకం చేరిందని కూడా రాధేయ గారికి చెప్పలేదు. చదవడం మెుదలు పెట్టిన తర్వాత ఆపకుండా ఈమధ్యన చదివిన రెండో పుస్తకం ఇది. రాధేయ గారికి కవిత్వమంటే ఎంత ఆరాధన ఉందో ఆ ప్రేమంతా సత్యమ్మ గారికి పంచేసారు తన సత్యారాధేయంలో. కవిత్వాన్ని కథలా చెప్పిన రాధేయ గారి మనసుకత ఇది. 
   దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాల సహజీవనాన్ని, జీవితపు అనుభవాలను పంచుకోవడంలోని దగ్గరతనాన్ని, బంధం బాధ్యతను, అనుబంధం ఆసరాని, ఇద్దరు కలిసి కడగండ్లు నింపిన కల్లోలాలను దాటిన వైనాలను, సాహిత్య అభిమానాన్ని, కుటుంబం కన్నా మిన్నగా ప్రేమించిన ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం వెనుక, ముందు కారణాలను, బతుకుబాటలో సత్యమ్మ ఇచ్చిన ధైర్యాన్ని...ఇలా చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవేమెా. 
        సత్యారాధేయం చదువుతుంటే ఏం చెప్పాలనిపించడం లేదు. మీరూ చదవండని చెప్పడం తప్ప. ముడిబడిన బంధం విలువ తెలిసిన అతి కొద్దిమంది జంటలలో సత్యారాధేయం గారు ఒకరు అంతే. వీరు ఇద్దరు కాదు ఒకరే. అర్ధనారీశ్వర తత్వానికి అసలైన ఉదాహరణ. రాధేయ గారి మనసంతా సత్యమ్మే ఉండగా ఇక అక్షరాల్లో ఉండటం వింతేమీ కాదు. చేరలేని దూరాన్ని కూడా సునాయాసంగా చేరగలనన్న ధీమా ఇచ్చిన సత్యమ్మ చేయూతే రాధేయ గారికి కొండంత బలం. శోకం శ్లోకమౌతుందని మరోమారు బుుజువైంది. 

అభిమానంగా " సత్యారాధేయం " ని నాకందించినందుకు రాధేయ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

1, సెప్టెంబర్ 2021, బుధవారం

జీవన మంజూష.. సెప్టెంబర్

నేస్తం, 
       బంధాలు పలుచన అవడానికి కారణాలు వెదకడంలోనే మన సమయమంతా సరిపోతోంది. ఈ కాలంలో రాహిత్యం కాగితానికి చేరువ కావడంలో వింతేమీ కనబడటం లేదు.మూడుముళ్ళ అనుబంధం అభాసుపాలు కావడంలో లోపాలు వెదుకుతూనే ఉంటున్నాం, కాని సరైన కారణాలు కనిపెట్టలేక పోతున్నాం. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇలా దగ్గర అనుబంధాలు కూడా దూరదూరంగానే ఉంటున్నాయి నేటి పరిస్థితుల్లో. 
        ముఖ్యంగా జంట మధ్య అవగాహనా రాహిత్యమెా, లేక అహం అడ్డుగోడగా నిలవడమెా, అదీ కాదంటే సంపాదన వలన కలిగే గర్వమెా కాని యాంత్రికంగా మారిపోతున్న అనుబంధాల్లో ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి ఇంటికో సమస్య తప్పడం లేదు. అది సంపాదన, లేదా అక్రమ సంబంధం లేదా మరేదైనా ఇతర కారణం కావచ్చు. కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఇవి ప్రధాన కారణాలు ఇప్పుడు. 
    ఒక బంధమంటూ ఏర్పడ్డాక, బాధ్యతను మరిచిపోవడం, అబద్ధపు బతుకు బతకడం చావుతో సమానం. ఈ సాంకేతిక మాధ్యమాలు, అంతర్జాలం వగైరా, వగైరా అందరికి అందుబాటులోనికి వచ్చాక క్రమానుబంధాలు బలహీన పడి, వయసుతో నిమిత్తం లేకుండా అక్రమానుబంధాలు బలపడ్డాయనడంలో సందేహమేమీ లేదు. చదువుకున్న సంస్కారహీనులు ఎందరో ఈ కోవలో నేడు జీవితాలు వెళ్ళదీస్తున్నారు. ఇంట్లోని వారిని మెాసం చేస్తున్నామన్న భ్రమలో తమని తామే మెాసం చేసుకుంటూ, అదే జీవిత పరమార్థమనుకుంటున్నారు. 
          ప్రేమ రాహిత్యం, బాధ్యతా రాహిత్యం వలన బాధపడే ఎందరో మానసికంగా, శారీరకంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ అనుకున్న వారి నిర్లక్ష్య వైఖరిని భరించలేకపోవడమే ఇందుకు కారణం. దీనికి సరైన మందు మళ్ళింపు(డైవర్షన్). చెప్పడం తేలికే, ఆచరణ కష్టమని మనకు అనిపిస్తుంది. కాని ప్రయత్నం మన విధి. పెద్దలు చెప్పిన మాట " సాధనమున పనులు సమకూరు ధరణిలోన. " అన్న ఆర్యోక్తిని గుర్తు చేసుకుని సమస్యలతో యుద్ధం చేయడం మన పని. అంతేకాని ఉత్తమమైన మానవ జన్మను అర్ధాంతరంగా, అదీ బలవంతంగా ముగించడం తగదు. సమస్యతో పోరాడటమే మన నైతిక విజయం. 

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner