31, డిసెంబర్ 2020, గురువారం

వీడ్కోలు...!!

నేస్తం, 
          కాలం విదిలించిన విషాదాన్ని మెాసింది ఈ సంవత్సరం. విషాన్ని చిమ్మే మనుష్యుల మధ్యన కదలాడుతున్నందుకేమెా క్షణాలు సైతం భయాన్ని కూడగట్టుకున్నాయి. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. మనవారెవరో, పరాయి వారెవరో తేటతెల్లం చేసింది. బంధాలను, అనుబంధాలను సవాలు చేసి తల ఎగరేసింది కాలం. ఆదుకోవడానికి అయినవారు, కానివారు అన్న భేదం లేదని చెప్తూ, మనవారెవరో నిక్కచ్చిగా నిరూపించింది. 
          నేనెప్పుడూ గుర్తు చేసుకునే మాట మా హింది టీచర్ రత్నకుమారి గారు చెప్పిన మాటే. చెడు జరిగినా అదీ మన మంచికే. అవసరానికి అడగకుండా ఆదుకున్న ఆత్మీయ నేస్తం. తనని కాస్తేమిటి బాగానే ఇబ్బంది పెట్టాను. అయినా ఓర్పుతో స్నేహబంధానికి విలువనిచ్చాడు. మాట అడిగినదే తడవుగా నీ టెన్షన్ నాకు వదిలేసి నువ్వు సంతోషంగా ఉండమ్మా. మేముండగా నువ్వు ఇబ్బంది పడకూడదంటూ క్షణాల్లో నా ఇబ్బందిని తీర్చిన పెదనాన్న, పెద్దమ్మ. ఏం రాసినా, రాయకున్నా పాతవైనా, కొత్తవైనా నా రాతలను ఆదరిస్తున్న సాహితీ ఆత్మీయులెందరో. 
          అనుక్షణం నన్ను జాగ్రత్తగా చూసుకునే మా డాక్టరమ్మలు ఉండగా నాకేమీ కాదన్న భరోసా. మన ఇంటివారి ప్రేమాభిమానాలు మనకుండగా దేనికీ లోటు లేదు, రాదు అన్న నమ్మకం. ఎన్నో అసహనాలు, సహనాల మధ్యన కడతేరుతున్న ఈ సంవత్సరానికి తుది వీడ్కోలు పలికేస్తూ...రేపటిపై ఆశతో....
       అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

29, డిసెంబర్ 2020, మంగళవారం

కాలం వెంబడి కలం...34

    వీసా స్టాంపింగ్ ప్రహసనం అయ్యాక మళ్లీ హైదరాబాదు బయలుదేరాను బస్ లో. మరీ తెల్లవారు ఝామునే కాకుండా ఐదు దాటాక అమీర్ పేటలో బస్ దిగాను. బానే వెలుగు వచ్చేసింది. జనాలు రోడ్డు మీద బాగానే తిరుగుతున్నారు. ఆ రోజు ఆగస్టు 15. బస్ దిగి మెల్లగా నడుచుకుంటూ మా హాస్టల్ వైపు బయలుదేరాను.  మెయిన్ రోడ్డు మీదే బస్ కి కొద్ది దూరంలోనే నా పక్కగా బైక్ ఆపి ఒకడు బైక్ ఎక్కండి. డ్రాప్ చేస్తాను అన్నాడు. అవసరం లేదు, దగ్గరే నేను వెళిపోగలను, అయినా మీరెవరో నాకు తెలియదు. అన్నాను. నా పేరు రాజు బైక్ ఎక్కండి అన్నాడు. ఎక్కనని వాడికి అందకుండా దూరం జరిగేసాను. అప్పటికే నాకు వాడి ప్రవర్తన చాలా తేడాగా అనిపించి. బాగా తాగేసి ఉన్నాడు. నా చేతిలో చిన్న కవరే ఉంది. అది పట్టుకుని నా చేయి పట్టుకోబోయాడు. వేంటనే దూరంగా ఓ గెంతు వేసి పరుగో పరుగు. ఆ పరుగు ఆపకుండా అవతల దూరంగా మెయిన్ రోడ్డు మీదున్న ఆటో వాళ్ళ దగ్గరకి వెళ్ళాను. పాపం వాళ్ళు అప్పుడే నా పరుగు చూసి అలర్ట్ అయ్యారు. గట్టిగా వాళ్ళతో వీడు నన్ను పట్టుకోవడానికి చూస్తున్నాడని చెప్పాను. నేను ఈ ఆటో వాళ్ళ దగ్గరకి ఎప్పుడైతే వచ్చానో, అప్పుడు నా వెంట పటం మానేసి వాడు బైక్ స్పీడ్ గా పోనిచ్చాడు.  ఓ ఆటోలో ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి నన్ను మా హాస్టల్ దగ్గర దింపి, గేట్ తీసి నేను లోపలికి వెళ్ళాక వాళ్ళు వెళిపోయారు. మెయిన్ రోడ్డు మీద జనం మధ్యలో జరిగినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఆ రోజుల్లోనే ఉన్నారు. ఎవరైతే మనం మర్యాదస్తులు, చదువుకున్న వారు అనుకునే సమాజం పరిస్థితి అది. జరుగుతున్న సంఘటన చూస్తూ కూడా ఎవరి దారిన వారు వెళిపోయారు. ఆ ఆటోవాళ్ళకున్న దొడ్డ మనసు కనీసం మనలో ఏ ఒక్కరికి లేకపోయింది. గొప్పదనం నిర్వచనం ఏమిటో ఇప్పటికయినా అందరికి తెలిసుండాలి. 
     వీసా స్టాంపింగ్ అయ్యాకా కార్ డైవర్ తో అలా, హైదరాబాదు నడిరోడ్డు మీద ఇలా...అదీ మన దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరగడం కాకతాళీయమేమెా మరి. మెుత్తానికి ఆగస్టు నెల నన్ను ఇలా కొన్ని అనుకోని సంఘటనలకు గురి చేసింది. తర్వాత అమెరికాలోని నరసరాజు అంకుల్ కి ఫోన్ చేసి చెప్పాను. వీసా వచ్చిందని. అంకుల్ వాళ్ళ పెద్దబ్బాయి చెప్పిన పారాడైమ్ కంపెనీ CEO శ్రీధర్ గారికి ఫోన్ చేస్తే VC++ నేర్చుకోమన్నారు. అప్పటి నుండి అస్సలు ఖాళీ ఉండేది కాదు. JAVA, ASP, VC++ నేర్చుకోవడము ఓ పక్క, కార్ డ్రైవింగ్ నేర్చుకోవడము మరో పక్కా జరిగిపోయింది. కావాల్సిన బట్టలు, పుస్తకాలు షాపింగ్ చేయడము అన్నీ జరిగిపోయాయి. ఆ టైమ్ లోనే మధ్యలో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని, మౌర్యని కూడా హైదరాబాదు తీసుకువచ్చి ఓ రెండు రోజులుంచుకుని పంపాను. అప్పుడు రాఘవేంద్ర కూడా హైదరాబాదులోనే ఉన్నాడు. 
            ఫ్లైట్ టికెట్ కూడా నరసరాజు అంకుల్ తీసుకున్నారు. వాళ్ళ తమ్ముడికి చెప్తే ఆయన తీసుకున్నారు. యూని యాడ్స్ అంకుల్ వాళ్ళ తమ్మడిదే. టికెట్ అక్టోబర్ 14 కి తీసుకున్నారనుకుంటా. బ్రిటీష్ ఎయిర్ వేస్. యూని యాడ్స్ ఆఫీస్ కి వెళ్ళి టికెట్ తీసుకుని ఇంటికి బయలుదేరాను మిగతా లగేజ్ సర్దుకోవడానికి. అమెరికా ప్రయాణానికి సన్నాహలు చేసుకుంటున్నా మెల్లగా. అమ్మ ఏదో మెుక్కుందని నాగాయలంక అవతల ఏదో అమ్మవారి దగ్గరకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఉష కూడా ఇంటికి వచ్చింది. ఆ మెుక్కు తీర్చుకుని వస్తూ, నాగాయలంకలో సుబ్బారావు అంకుల్ వాళ్ళకి చెప్పాలని ఇంటికి వెళితే ఆంటీ ఎవరింటికో వెళ్ళారని చెప్పారు. వాళ్ళింటికి వెళ్ళి అంటీకి చెప్పి, అక్కడే ఉన్న రాజేష్ గాడికి కూడా చెప్పా. వాడి ఇంటర్ రిజల్ట్స్ అప్పుడే వచ్చాయనుకుంటా. వాడు ఏదో వాడి గోలలో ఉన్నాడప్పుడు. నన్ను పట్టించుకోలేదు. అక్టోబర్ 14కి అంతా సిద్ధం చేసుకున్నా. ప్రయాణానికి రెండు రోజుల ముందు గా పీవర్ వచ్చింది. నాన్నకు ప్రయాణం వాయిదా వేయడం ఇష్టం లేదు. నాకేమెా ప్రయాణం చేయడానికి ఓపిక లేదు. అంకుల్ కి ఫోన్ చేసి ఓ వారం పోస్ట్ పోన్ చేయడానికి కుదుతుందేమెా చూడమన్నాను. అంకుల్ మాట్లాడి వారం పోస్ట్ పోన్ చేసారు. కాస్త నీర్సం తగ్గాక చుడిదార్ వేసుకుని ఫోటో దిగి అంకుల్ కి పంపాను. నన్ను గుర్తు పట్టడానికి. ఆ వారం రోజులు తిండి లేదు. కాస్త నీర్సపడ్డాను. 
         ఆ సమయంలోనే మా పెద్దాడపడుచు వాళ్ళ పెద్దాడపడుచు చనిపోయిందని తెలిసి, రాఘవేంద్ర వాళ్ల పెద్దమ్మ రాముడత్తయ్య చెప్తే, వాళ్ళు పలకరించడానికి వెళ్తుంటే నేను వాళ్ళతో కలిసి అవనిగడ్డ వెళ్ళాను. అప్పటికే నాలుగైదు రోజులైంది ఆవిడ చనిపోయి. మేం వెళ్లేసరికి మా పెద్దాడపడుచు అక్కడలేదు. భోజనం చేయము అని అంటే వాళ్ళు ఊరుకోలేదు. భోజనాలప్పుడు పెద్దాడపడుచు వాళ్ళ బావగారి అమ్మాయి పలకరించింది. తనకి మెడిసిన్ సీట్ వచ్చిందప్పుడు. తర్వాత రాఘవేంద్ర వాళ్ల బావగారు పలకరించారు. అమెరికా ఎందుకు ఇక్కడ లేవా ఉద్యోగాలు అని. ఇక్కడ నన్ను బతకనీయడం లేదు కదా అందుకే అమెరికా వెళుతున్నానని చెప్పాను. 
                  రేపు ప్రయాణమనగా ఈరోజు మారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవనిగడ్డ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాము.. సాయంత్రం అయిపోయింది. సాక్షి సంతకాల కోసం రాఘవేంద్ర ఇద్దరిని తీసుకువచ్చాడు. మల్లిగారని మా నాన్నకు కూడా బాగా తెలుసాయన. మరొకరు నాకు గుర్తులేదు. అప్పుడు తెలిసింది మా ఆయన చదువు నైన్త్ క్లాస్ అని. మెట్రిక్యులేషన్ ఎగ్జామ్స్ రాయలేదంట. నేను తన చదువు గురించి ఎప్పుడూ అడగనూ లేదు పట్టించుకోనూ లేదు. నాకు అది అవసరం అనిపించలేదప్పుడు. కాని అప్పటి వరకు నాకు తెలియదంటే ఎవరూ నమ్మరు కదా. మన దేశంలో డబ్బులతో జరగని పనంటూ ఉండదు కదా. మాది అన్ని పేపర్స్ ఉన్న పెళ్లి అయినా డబ్బులు తీసుకునే సర్టిఫికేట్ ఇచ్చారప్పుడు రాత్రిపూట. తెల్లవారుఝామున మద్రాస్ ప్రయాణం. ఆ రాత్రి జోరున వర్షం. మా శేషులు పెద్దమ్మ, పెదనాన్న ఆ వర్షంలో కూడా ఇంటికి వచ్చి మేము బయలుదేరే వరకు ఉన్నారు. లక్ష్మీ అక్క కూడా వచ్చింది. మిగతా ఎవరూ కనీసం తొంగి కూడా చూడలేదప్పుడు. సీతారామయ్య అన్నయ్య నా ప్రయాణానికి రెండు మూడు రోజుల ముందు వచ్చివెళ్ళాడు. కార్ బయలుదేరేటప్పుడు అమ్మమ్మ ఎదురువచ్చింది. ఈలోపల ఆ వర్షంలోనే హైమావతి మామ్మ, కోవా పట్టుకు వచ్చి ఇచ్చింది. వాళ్ళ  పెద్ద మనుమడు అమెరికా వెళ్ళినప్పుడు తనకి అలానే ఇచ్చానని చెప్పింది. కోటేశ్వరరావు మామయ్య, పద్మక్క వాళ్ళు కూడా వచ్చారప్పుడు. మా ఇంట్లో వాళ్ళం అందరం అమ్మమ్మ, తాతయ్యలని ఇంట్లో వదిలి, ఇద్దరు పిల్లలతో సహ, లక్ష్మక్క వాళ్ళ రమణతో కలిసి మద్రాస్ కి పినాకిని లో బయలుదేరాం. రాజగోపాల్ కి మద్రాస్ తాంబరం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో హోటల్ బుక్ చేయమని చెప్పాం. 

జీవితంలో అడ్డంకులు రావడం సహజమే. వాటిని అధిగమించడంలోనే మన నైపుణ్యం తెలుస్తుంది. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 




26, డిసెంబర్ 2020, శనివారం

పుస్తక సమీక్ష లైవ్

https://m.facebook.com/story.php?story_fbid=429476251505058&id=100033280607442&sfnsn=wiwspwa

25, డిసెంబర్ 2020, శుక్రవారం

నాలుగు మనసు మాటలు...

https://youtu.be/cdZMstGk4Yk

24, డిసెంబర్ 2020, గురువారం

ఖాళీ...!!

మనిషి ఆలోచనల్లో
పురుడు పోసుకుందా? 

మనసు అరల్లో
నిరంతరం తిరుగాడుతోందా? 

ఆశల చిట్టాల్లో
అంతులేని కోరికల పద్దులున్నందుకా? 

అవసరాల ఆరాటాలు
ఆకాశాన్ని అందుకుంటున్నందుకా? 

బాంధవ్యాలను తూకమేయడానికి
డబ్బుల తక్కెడ వాడుతున్నందుకా? 

అనుబంధాలను అంగడి సరుకుల్లా
మార్చేసిన మన మానసిక దుస్థితిదా? 

ఆధునికత మెాజులో పడి
ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్నందుకా? 

ఏ జీవితాన్ని వదలని
ఈ వెలితిని పూరించడమెలా? 

మనిషితనాన్ని  పట్టి పీడిస్తున్న 
ఈ ఖాళీలను పూరించే యంత్రమెాస్తే బావుండునేమెా..!! 


21, డిసెంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..33

                 హైదరాబాద్ లో మరిది వాళ్ళింట్లో ఓ వారం ఉన్నానేమెా. మా తోడికోడలు కూడా జావా నేర్చుకోవడానికి ఐసాల్వ్ నెట్ లో చేరింది. నాకు దానిలోనే మాట్లాడారు. కాని రాఘవేంద్ర తనకు తెలిసిన తెలుగు వన్ ఫౌండర్ కంఠమనేని రవిశంకర్ గారితో మాట్లాడి అమీర్ పేటలోని ఆబ్జెక్ట్ వన్ లో జాయిన్ చేసాడు. అంతకు ముందు నేనున్న హాస్టల్ లోనే మరలా జాయిన్ అయ్యాను. విని అమెరికా వెళిపోయింది. ఉష అక్కడే ఉంది. శ్రీదేవి, లత కూడా ఆ హాస్టల్ లోనే ఉన్నారు. రాణి అని కొత్త వంటమ్మాయి కూడా ఉంది. 
              జావా మాది మధ్యాహ్నం బాచ్. షరా మామూలుగా మనమెప్పుడు వెనుక బెంచ్ వెదుక్కుంటాం కదా. అలా నాతోపాటు విజయ, వత్సల, ప్రగతి చేరారన్న మాట. మా అందరిలో వత్సల చిన్నపిల్ల. విజయని, నన్ను పెద్ద అత్తయ్య, చిన్నత్తయ్య అనేది. ప్రగతి వాళ్ళాయన అమెరికాలో ఉన్నారు. తను జావా నేర్చుకుని అమెరికా వెళిపోతుంది. మెుదట్లో HTML ఒకావిడ చెప్పేది. తర్వాత కార్తీక్ అని చిన్నతనే కోర్ జావా అవి చెప్పేవాడు. మా అల్లరిని కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు. మాతో సరదాగా ఉండేవాడు. అలా మళ్లీ నేర్చుకోవడం మెుదలైంది. ఓరోజు మధ్యాహ్నం క్లాస్ కి బయలుదేరి వెళుతుంటే మా హాస్టల్ సందు చివర్లో నన్ను ఎవరో పిలిచినట్లనిపించి, నన్నా కాదా అని చూసాను. మీరు జయపురం మంజు కదా అని ఒకతను అడిగాడు. మనకసలే మనుషులు గుర్తుండరు కదా. అవునండి, మీరెవరు అంటే తెనాలి వేణుని ఇంజనీరింగ్ క్లాస్మేట్ ని అని చెప్పాడు. మా ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ శ్రీనివాస రెడ్డి కంపెని ఓపెన్ చేసాడు అని కూడా చెప్పాడు. వేణు ఆఫీస్ కూడా మా హాస్టల్ కి దగ్గరే అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా రెండు మూడుసార్లు చూసాను. నువ్వా కాదా అనుకున్నాను. కాని నీ నడక చూసి గుర్తు పట్టానని చెప్పాడు. నేను గుర్తు పట్టలేదని కాస్త ఫీలయినట్టు అనిపించాడు. నాకేమెా ఈ మతిమరుపు అప్పుడే  ఉందాయే. అదేంటో దారులు, ఫోన్ నెంబర్లు గుర్తుండేవి కాని మనుషులు పెద్దగా గుర్తుండేవారు కాదు చిన్నప్పటి నుండి. ఎందుకిలా అని అనుకుంటూనే ఉంటానిప్పటికి. 
             వారం వారం ఇంటికి వెళ్ళి మౌర్యని చూసి, మళ్లీ వెంటనే బయలుదేరి వచ్చేయడం జరుగుతోంది. బాబు, కొడుకు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి స్కూటర్ మీద కోడూరు వచ్చేవారు. స్కూటర్ ముందు కూర్చుని మౌర్య ఇంటికి వెళ్లేవరకు నన్ను తొంగి తొంగి దొంగలా సిగ్గుపడుతూ చూస్తుండేవాడు. మళ్లీ సాయంత్రం బయలుదేరి అవనిగడ్డ వచ్చి హైదరాబాదు బస్ ఎక్కేసేదాన్ని పొద్దున్నే క్లాస్ కి అటెండ్ కావడానికి. మధ్య మధ్యలో ప్రాక్టీస్ వర్క్ కోసం నైట్ కూడా లాబ్ కి వెళుతుండేవాళ్ళం. మాతో ఉష కూడా వచ్చేది. తనప్పటికే జావా నేర్చుకుంది. ASP నేర్చుకోవడానికి ఉదయం బాచ్ కి ఉష నేను వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేవాళ్ళం. కార్ డ్రైవింగ్ కోసం కొన్ని రోజులు పొద్దు పొద్దున్నే వెళ్ళేదాన్ని. ఈ లోపల మద్రాస్ లో నాతోపాటు HIET వారి KCG ఎలక్ట్రానిక్స్ లో చేసిన రాజగోపాల్ హైదరాబాదు వచ్చాడు. SAP నేర్చుకుంటే జాబ్ తనకి ఇక్కడ వచ్చింది. 
             నాకు H1B పేపర్స్ వచ్చాయని చెప్పారు. ఆదిత్య ఎన్క్లేవ్ లో GIS కంపెని ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి పేపర్స్ తీసుకున్నాను. వీసా కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రాజగోపాల్ రడీ చేయించి ఇచ్చాడు. మేమూ ఆ పని మీద బాగా తిరిగాము అప్పట్లో. నేను రాఘవేంద్ర మద్రాస్ వీసా స్టాంపింగ్ కోసం వెళ్ళాము. మద్రాస్ బాంక్ లో డిడి లు రెండు తీసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. హోటల్ లో మాతోపాటుగా మరొకరు కూడా వీసా స్టాంపింగ్ కి వచ్చారు. రాఘవేంద్ర, అతను తెల్లవారు ఝామునే వెళ్ళి క్యూ లో నిలుచున్నారు. ఆ అమ్మాయి, నేను తెల్లవారాక వెళ్ళాము. అప్పట్లో అలా క్యూ ఉండేది. ఇప్పట్లా అపాయింట్మెంట్ లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత టోకెన్ నంబర్ ఇచ్చి, మైక్ లో డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్పి, ఆర్డర్ లో పెట్టమన్నారు. వరుసనే వీసా కౌంటర్స్ దగ్గరకి పంపిస్తున్నారు. అంతకు ముందే అందరు చెప్పుకుంటుంటే విన్నాను. అమ్మాయి ఉన్న కౌంటర్ లో వీసాలు ఎక్కువగా రిజక్ట్ అవుతున్నాయని. ఏదైనా నాకు ఇబ్బంది లేదులే అనుకున్నా. వీసా వస్తే మౌర్యని వదిలిపెట్టి వెళ్ళాలని బాధ. కాని నా ముందు ఉన్న అవసరం వెళ్ళక తప్పదని చెప్తోంది. ఈలోపల నా టోకెన్ నంబర్ పిలిచి, కౌంటర్ నెంబర్ చెప్పారు. తీరా చూస్తే తమిళ్ ఆవిడ కౌంటర్ లో ఉంది. విండో దగ్గరకి వెళ్ళాను. అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చాను. అవి చూస్తూ జాబ్ చేయడానికి వెళుతున్నారా అని అడిగింది. అవునని చెప్పాను.ఒక డిడి తీసుకుని,  వెళ్ళి ఫీజ్ కట్టండి అని చెప్పింది. అప్పుడు అర్థం అయ్యింది వీసా వస్తుందని. మా పాతింటి వాళ్ళకు ముందే చెప్పాను వీసా కోసం ఇంటి అడ్రస్ ఇస్తానని. మా ఆయన సలహా మేరకు నేను మద్రాస్ మా పాతింటి అడ్రస్ ఇచ్చాను, మరుసటి రోజు పాస్పోర్ట్ వచ్చేస్తుందని. లేదంటే ఓ వారం పడుతుంది రావడానికి. మరుసటి రోజు పాతింటికి వెళ్ళి అక్కడి వాళ్ళతో మాట్లాడుతుండగానే కొరియర్ అతను వచ్చి పాస్పోర్ట్ ఇచ్చాడు. పాస్పోర్ట్ చూసేవరకు అనుమానమే వీసా స్టాంపింగ్ అవుతుందో లేదోనని. వెంటనే పాస్పోర్ట్ చూడగానే వీసా స్టాంపింగ్ రెండేళ్ళకు వేసి ఉంది. అక్కడ అందరికి చెప్పి, మా పాత ఆఫీస్ HIET కి వెళ్ళి, అక్కడ యాస్మిన్ ని కలిసి,పినాకినిలో విజయవాడ బయలుదేరాము. విజయవాడ వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది. రెంటల్ కార్ మాట్లాడుకుని, రాఘవేంద్రకు, నాన్నకు ఖద్దరు షర్టులకు క్లాత్ తీసుకుని బయలుదేరాం. ఆ బట్టల కోసం రాఘవేంద్ర షాప్ లోపలికి వెళితే, ఈలోపల డ్రైవర్ హారన్ బాగా కొట్టేసి, ఎవరితోనో గొడవ పెట్టుకుంటే వాళ్ళు కొట్టబోయారు. అమ్మా పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నాను, చిరాకుగా ఉందని చెప్పాడు డ్రైవర్. ఏమైనా తిన్నామెా లేదో కూడా నాకు గుర్తు లేదు. నాకు అర్థం అయ్యింది ఏంటంటే డ్రైవర్ బాగా తాగి ఉన్నాడని. రాఘవేంద్రతో అన్నాను సరిగ్గా మనం ఇంటికి వెళతామా అని. ఈలోపల తాడిగడప దగ్గరకు రావడం, లారి ఏదో వెనుక నుండి వస్తుంటే కార్ పక్కకి వెళ్ళి, సిమ్మెంట్ గట్టు ఎక్కేయబోవడం కాస్తలో తప్పింది. ఇలా కాదని రాఘవేంద్ర డ్రైవర్ ని జరగమంటే, లేదు సార్ నేను తీసుకువెళతానంటాడే. కాదని స్టీరింగ్ రాఘవేంద్ర తీసుకుని, నరశింహాపురం ఇంటి వరకు తనే డ్రైవ్ చేసుకువచ్చి, డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి, పడుకుని పొద్దున్నే వెళ్ళమంటే, కాదు వెళిపోతానంటే, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి పంపించాడు. మరుసటిరోజు పొద్దుటే విజయవాడ వరకు అందరికి ఫోన్లు చేసి, దారిలో ఏమైనా యాక్సిడెంట్ జరిగిందేమెానని కనుక్కున్నాడు. ఏది జరగలేదని తెలిసి చాలా సంతోషపడ్డాము.
  
     ఏ క్షణం మనదో తెలియని జీవితానికి ఎన్ని ఆశలు, అహాలు, ఆర్భాటాలో కదా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక పోయినా అంతా మన ఘనకార్యమేనన్న దురహంకారం మనకు దేవుడు బహుమతిగా ఇచ్చాడేమెా మరి. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

19, డిసెంబర్ 2020, శనివారం

కోరికల చిట్టా..!!

నేస్తం, 

       ఏంటోయ్ చాలా రోజుల తర్వాత ఈ పలకరింపులేంటా అని కోపమా.. ఏంటో ఈ మధ్యన కాస్త నిరాసక్తత అలవాటైన క్షణాలు ఎక్కువే. అలా అని వ్యాపకాన్ని వ్యసనంగా మార్చాలన్న ప్రయత్నమూ చేయలేదు. అందుకే ఈ ఆలశ్యపు పలకరింపులన్న మాట. అవునోయ్ నీ సంగతేంటో కాని కొందరికి కొన్ని తీరని కోరికలుంటాయి కదా. నాకయితే బోలెడుండిపోయాయి మరి.
      చిన్నప్పటి నుండి మెుదలెడతాను. అప్పట్లో మన దేశంలో అందరికన్నా రాష్ట్రపతికి ఎక్కువ జీతం పదివేలట. ఏమైనా సరే రాష్ట్రపతి ఓసారయినా అయిపోయి పదివేల రూపాయలు తీసేసుకోవాలని.  తర్వాత పాడుతా తీయగా మెుదలయ్యింది టీవిలో. అప్పటి నుండి ఓ పేద్ద కోరిక ఉండిపోయింది. పాడాలని కాదు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో బాలుగారి పక్కన కూర్చోవాలని. MBBS ఎలాగూ చేయలేదు MS అయినా చేయాలనుకున్నా. అదీ తీరలేదు. సరే అమెరికా వెళ్ళానా.. నయాగరా ఫాల్స్ కూడా చూడలేదు. పోని అమెరికా నుండి వచ్చాక నాకిష్టమైన స్పెషల్ తెలుగులో పిజి చేసి, తర్వాత డాక్టరేట్ కోసం ప్రయత్నించి పేరు ముందు డాక్టర్ అని అయినా పెట్టుకుందామనుకున్నా. అదీ కుదరలేదు. 
       చిన్నప్పటి నుండి సముద్రంలో నుండి పొద్దు పొద్దున్నే వచ్చే సూర్యుడిని చూడటానికే ముందురోజే హంసలదీవి సముద్రస్నానాల తిరునాళ్లకు వెళిపోయేవాళ్ళం. అలా అని అసలు కోరికేంటంటే కన్యాకుమారి దగ్గర పౌర్ణమి రోజు ఒకేసారి సూర్యాస్తమయాన్ని, చంద్రోదయాన్ని చూడాలని బలీయమైన కోరికన్నమాట. నా తీరని కోరికల లిస్ట్ చాలా చిన్నదే కదా... 😊 .

18, డిసెంబర్ 2020, శుక్రవారం

రాయితీలు ఇవ్వబడవు...!!

కష్టంలో లేని పలకరింపు
సుఖాలలో అక్కర్లేదు 

అవసరానికి అక్కరకు రాని ఏ బంధమూ
పెంచుకోవాల్సిన అగత్యమూ లేదు

చావుపుట్టుకలకు కనీసం మాటామంచి లేని  చుట్టరికాలను వదిలించు కోవడమే మంచిది

అశుభమని భావించే శుభప్రదాయిలకు 
తులసినీళ్ళు వదిలేయడమే

బాధ ఈరోజు నాఇంటిది కావచ్చు
రేపటిరోజున నీ ఇంటి తలుపు తట్టదని లేదుగా

డబ్బు జబ్బు చుట్టుకున్న
అహంకారులెవరైనా నా దృష్టిలో లేనట్లే లెక్క

ఎవరినైనా క్షమించవచ్చు కాని
మానసిక హింసాంతకులను క్షమించేంత సుగుణమూ నాకు లేదు

అక్షరాలా ఇది నిజం
ఈ విషయాల్లో ఏ రాయితీలు ఇవ్వబడవు



16, డిసెంబర్ 2020, బుధవారం

అంతర్లీనం..!!

ఎక్కడో ఉన్న శూన్యాన్ని 
అదాటున చుట్టేయాలన్న ఆత్రమెందుకో 

ఉలికిపాటును రెప్పల మాటున
దాచేయాలన్న ప్రయత్నమెందుకో

కనబడని మనసు కలతను
కనుమాయ చేయాలన్న కోరికెందుకో

అడ్డు పడుతున్న బంధాలను వదిలేసి
వైతరణి దాటేయాలన్న తొందరెందుకో

గుండె చప్పుడును తెలిపే అక్షరాంగనల 
అభ్యంగన స్నానానికి సిద్ధపడాలన్న సాహసమెందుకో

అంతర్లోచనాలకు సాయంగా నిలిచిన
అంతర్లీన ఆలోచనా ప్రవాహానికి ఆనకట్ట వేయడానికేమెా...!! 

14, డిసెంబర్ 2020, సోమవారం

ఏక్ తారలు

1.  మనసు తెలుపుతోంది_మౌనాన్ని  అర్థవంతంగా...!!
2.   తొలగించేంత అడ్డుతెరలేమున్నాయ్ మన మధ్యన_అహాన్ని వదిలేస్తే...!!
3.  పరిధి తెలియక కాదు_పర్యవసానమాలోచించనివే ఆ బంధాలు..!!
4.  భ్రమత తీరదేమెా_అక్షరాలతో మనోభావాలనెంతగా అలకరించినా..!!
5.   మౌనం ఆవహించాలి_మనిషిలోని మనసు తెలియాలంటే...!!
6.  అలవాటైన అక్షరాలకు తెలిసిపోతుంది_సందర్భం చెప్పకుండానే...!!
7.   పరాజితులమయ్యామని మర్చిపోతున్నాం_విరాజితులమన్న భ్రమలో పడి..!!
8.  సంతసాలతో సందిగ్ధాలకు తెరలేయడమే_ప్రశ్నలకు తావీయక..!!
9.   అమ్మంటే అంతే_తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చేస్తూ..!!
10.  మనసు పనే అది_మరల మరల తరచి చూసుకోమంటూ...!!
11.   చీకటితో కబుర్లాడుతోంది_వెన్నెలకూ చోటిమ్మంటూ...!!
12.   విడమరిచి చెప్పడానికేముంది_విషాదాన్ని విదిలించిన కా(క)లానికి..!!
13.  ఎడదలో నిండినవీ ఎడబాటులే_అక్షరాలకు అలవాటుగా మారిన ఆనవాళ్ళై...!!
14.   తడబడినా తప్పని పయనం_కాలం విదిల్చిన క్షణాల్లో జ్ఞాపకాలను దాచేస్తూ...!!
15.  అక్షరాలు గుప్పెడే_అవి అందించే భావాలే అనంతం..!!
16.  ఆవిష్కరణ అలవాటైపోయింది_అంతరంగాన్ని అదిలించాలంటే..!!
17.  అనునయింపు ఆత్మాక్షరానిదే_మనోతరంగం మాటల సంద్రమైతే...!!
18.   ఎన్ని నిరీక్షణలో మనసుకి_వ్యర్థమవుతున్న అనుబంధాల నడుమన...!!
19.   బంధాలిప్పుడంతే_ఎప్పుడూ ఓడిపోయేది మనసే మరి..!!
20.  ఇప్పటి మనిషితనం అలవాటిదే_మనసుతనాన్ని చేతగాని తనమంటూ...!!
21.   మనవారనే భ్రమపడ్డానిన్నాళ్ళు_మనసు మాయలో పడి గ్రహించక...!!
22.  సాంకేతిక పరిజ్ఞానం పెరిగి యంత్రాలమైపోయాం_అనుబంధాలను వదిలేస్తూ...!!
23.  వొంపేయడానికేం మిగిలాయని_కడగండ్లన్నీ కన్నీళ్లతో కలిసి జారిపోయాకా...!!
24.   అయిన చుట్టరికమే మరి_అక్షరాల సాంగత్యానిది...!!
25.   పొంతన కుదిరితేనే కదా_అక్షరాలు కుందనంగా అమరేది...!!
26.  సత్వరమే అందుతుంది సాంత్వన_అక్షరాలకు మాలిమైన మనసుకు..!!
27.  అమ్మ పంచిన ఆస్తి ఈ అక్షరం_బంధాలకు లోబడిపోతామనేమెా ఇలా..!!
28.  ఎదురీత తప్పని బతుకులివి_నిందలేయడం బంధాలకు నిత్యకృత్యమేగా..!!
29.   అనుబంధపు రణరంగాలింతే_ఆత్మ సంబంధం అక్షరాలతో అయినప్పుడు...!!
30.   చూపక చెప్పక తప్పలేదు_నా అక్షర ఖడ్గానికి రెండు వైపులా పదునేనని...!!

కాలం వెంబడి కలం..32

   
    పిల్లల మనసులు ఎంత మంచివో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. కాలేజ్ లో మా ఊరి అబ్బాయి కూడా చదువుతుండేవాడు. మెకానికల్ క్లాస్ లో అనుకుంటా ఉండేవాడు. రాఘవేంద్ర వేరే వాళ్ళ కోసం వెళ్ళి ఓ కేస్ లో ఇరుక్కున్నాడు. అంతకు ముందు కూడా తనని ఎవరో ఏదో అన్నారని, ఈయన ఫ్రెండ్స్ వాళ్ళని కొడితే ఆ కేస్ లో ఈయన్ని పెట్టారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడన్న విషయం మాకసలు తెలియదు. కొందరు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండటం గొప్ప అనుకుంటారనుకుంటా. రాజా అన్నయ్య వచ్చి ఎక్కడికి వెళ్ళాడు రాఘవేంద్ర అంటే, హైదరాబాద్ వెళ్ళాడనుకుంటా అని చెప్పాను. కాదు శ్రీకాకుళం వెళ్ళి, అక్కడ కేస్ లో ఇరుక్కున్నాడు, పేపర్ లో పడింది అని చెప్పాడు. తర్వాత పోలీస్ ఎంక్వైరీకి వచ్చి, నన్ను వివరాలడిగి, ఇప్పటికే రెండు కేస్ లు ఉన్నాయి. మరో కేస్ అయితే షీట్ ఫైల్ చేస్తారు. జాగ్రత్త మిమ్మల్ని చూసి ఊరుకుంటున్నాను ఈసారికి అని చెప్పి వెళ్ళారు. పల్లెటూరు కదా పోలీస్ లు వచ్చే సరికి ఊరంతా ఇంటికి వచ్చేసారు. ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ రారు కాని, చోద్యం చూడటానికి అందరూ వస్తారు. పోలీస్ అడిగిన ఆ మాటకు నిజంగా అప్పటికప్పుడు చనిపోవాలనిపించింది. ఎప్పుడూ సొమ్ము ఉన్నా లేకపోయినా విలువగానే బతికాము. అలాంటిది ఆ మాట పడేసరికి, ఎవరితో ఓ మాట అనిపించుకుని ఎరగని నాకు చాలా బాధ వేసింది. ఇంత చదువుకున్నావు ఎలా చేసుకున్నావమ్మా అని కూడా అన్నాడు. 
         
       తర్వాత రాఘవేంద్ర వచ్చాక పసి అక్క తనకు రాఘవేంద్ర ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ చిన్నాడికి చీటి రాసి పంపింది. ఆరోజు తను ఇంటికి వచ్చి వెళ్ళింది కాని తను అడగలేదు. సాయంత్రం పిల్లాడిని పంపింది. ఆ విషయానికి గొడవ పెట్టుకుని ఓ దెబ్బ వేశాడు. నేనూ ఎదురు తిరిగాను. అమ్మ మీద కూడ పోట్లాడాడు. అమ్మ ఇంటికి వెళ్ళి పోయిందప్పుడు. అయినా నా దగ్గరకి వస్తూనే ఉండేది. గొడవ జరిగిందని పాపక్క వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారు. తర్వాత మండా రాజేశ్వరరావు గారి ఇంట్లో వేరే చిన్న గదిలోకి మారాము. గొడవ ఇందుకు. రాఘవేంద్ర వాళ్ళ అక్క వాళ్ళింటికి వెళ్ళి డబ్బులు అడుగుతాడట. నేను తనతో వెళ్ళాలట. నన్ను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటావా అని అడిగాను. నువ్వు వాళ్ళని అడిగినా, నేను మా నాన్నని అడిగినా ఒకటే. మా నాన్ననే అడుగుతాను అని చెప్పాను. అడిగాను కాని మా నాన్న కూడా ఇవ్వలేదప్పుడు.  

            పసి అక్క నాకు చాలా సాయం చేసింది. ఆ విషయాలు ఏవి కాదనలేను. కూతురిలానే అనుకుంటున్నా అనేది. కనీసం తనే ఆ డబ్బులు అడిగితే బావుండేది.  చిన్నపిల్లాడితో చీటి రాసి పంపింది. అమ్మ కూతురిని ఇలానే అడుగుతుందా అని చాలా బాధ వేసింది. అయినవారు ఎవరు ఏమి చేయకపోయినా నన్ను బాగా చూసుకునే పసి అక్క ఇలా చేయడం బాగా కష్టంగా అనిపించింది మనసుకి. రాఘవేంద్ర ఇవ్వలేక పోయినా వడ్డీతో సహా నేను ఇచ్చేస్తానని తను మద్రాస్ వచ్చినప్పుడు చెప్పినా ఇలా చేసింది. మా వాళ్ళందరు మా ఇంటి వైపు నుండి వెళితే, మేము కనబడితే ఏ అప్పు అడుగుతానోనని వేరే దారి నుండి వెళ్ళేవారు ఇటు రాకుండా. 

          మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళాలంటే బెరుకుగా అనిపించింది. సహజంగా మనకు ఇతరుల వ్యవహారాలపై మక్కువ ఎక్కువ కదా. ఏ చిన్న విషయం తెలిసినా దానిని గోరంతలు కొండంతలుగా చేసి చెప్పుకోవడం పల్లెటూర్లులో మామూలే. కాలేజ్ లో పిల్లలందరికి ఈ విషయం తెలిసి నన్ను చులకనగా చూస్తారేమెానన్న మీమాంస. ఈ విషయం పిల్లలకు తెలుసో లేదో నాకు ఇప్పటికి తెలియదు. పిల్లలందరు ఎప్పటిలానే నాతో ఇష్టంగానూ, గౌరవంగానూ ఉండేవారు. 

           మేము ఇంటరులో నేర్చుకున్న ఫిజిక్స్ ప్రాక్టికల్స్ పిల్లలకు చెప్పడమే కాకుండా ఆ పరికరాలన్ని పిల్లలు ప్రాక్టికల్స్ చేయడానికి వీలుగా అమర్చుకుని, ప్రతి పాక్టికల్ చేసి పరికరాలు సరిగ్గా పని చేస్తున్నాయెా లేదో చూసుకోవడం కూడా చేయాల్సి వచ్చింది. పిల్లలకు ఫైనల్ పరీక్షలు మెుదలయ్యాయి. ఇన్విజిలేషన్ కూడా చేయడం బావుండేది. మెుత్తానికి పిల్లలందరు బాగా నే పరీక్షలు రాసేసారు. 
               మౌర్యకు తొమ్మిదవ నెలలో మెాపిదేవిలో జుట్టు తీయించాము. శ్రీశైలం మాతో వచ్చిన చిన్నోడే మౌర్యకి జుట్టు కత్తెర వేశాడు. చిన్నా బట్టలు తర్వాత పెడతాలేరా అన్నాను. అలా జీవితం జరిగిపోతూ ఉంది. అంతలో కోడూరు బాలభాను మురళి మాస్టారు ఇంగ్లీష్ మీడియం యుకేజి పిల్లలకు లెక్కలు చెప్పమని అడిగారు. రాఘవేంద్ర వద్దన్నాడు. పాపం పిల్లలకు చెప్పే టీచర్ డెలివరీకి వెళ్ళారట. ఆ టైమ్ లో మరొకరు దొరకడం కష్టం కదా. రాఘవేంద్ర వద్దన్నా, తనకు తెలియకుండా చెప్పేదాన్ని. కాలేజ్ అయ్యాక మధ్యాహ్నం నాకు ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు బాలభాను స్కూల్ కి వెళ్ళి పిల్లలకు క్లాస్  చెప్పేసి, మళ్ళీ సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చి, మా రోడ్డుకి వచ్చేదాన్ని. పెద్ద పిల్లలకు చెప్పడం చాలా తేలిక. ఈ చిన్న పిల్లలకు చెప్పడం కష్టంగా అనిపించేది. అదీ తీసివేతలు చెప్పడం బాగా కష్టం అనిపించేది. పునాది గట్టిగా ఉండాలి కదా అందుకన్న మాట. నాకు మా చిన్నప్పుడు శిశువిద్యామందిరంలో లెక్కలు ఎలా చెప్పారా అని గుర్తుకు తెచ్చుకునేదాన్ని. ఓ ఇద్దరు అల్లరి పిల్లలు మినహా మిగిలిన పిల్లలు అందరు బుద్ధిగా చెప్పింది విని నేర్చుకునే వారు. బావుండేది చిన్నపిల్లలకు చెప్పడం. 

         పిల్లల పరీక్షల చివరిలో నాకు ఇంట్లో సమస్య మూలంగా ఓ రెండు, మూడు రోజులు అనుకోకుండా కాలేజ్ కి వెళ్ళడం కుదరలేదు. రాఘవేంద్ర మౌర్యని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు. మా మరిది వాళ్ళింటికి వెళ్ళాడు. అతను ఫోన్ చేసి పిల్లాడు ఉండటం లేదు ఏడుస్తున్నాడని చెప్తే అమ్మానాన్న, నేను అప్పటికప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాము. అవనిగడ్డలో హైదరాబాదు బస్ కోసం ఎదురుచూస్తుంటే కాలేజ్ పిల్లలు కొందరు చూసి నా దగ్గరకు వచ్చారు. రెండు గ్రూప్ ల మధ్యన పెద్ద గొడవ జరిగిందని చెప్పారు. వెంటనే ఆ పిల్లలను పిలిచి ఇద్దరికి కాంప్రమైజ్ చేసాను. పిల్లలు గబగబా వెళ్ళి అప్పటికప్పుడు నాకు చిన్న ఫ్లవర్ వాజ్ గిఫ్ట్ గా తెచ్చారు. ఈ లోపల మిగతా పిల్లలందరికి నేను ఊరు వెళుతున్నానని తెలిసి బస్ దగ్గరకి వచ్చేసారు సెండాఫ్ ఇవ్వడానికి. వాళ్ళందరిని చూసి మా నాన్న నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చాలా సంతోషపడిపోయారు. 

         మౌర్యని రాఘవేంద్ర హైదరాబాదు తీసుకు వెళ్ళేటప్పటికి మౌర్య నా దగ్గర పాలు మానలేదు. వాడి పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందు తీసుకువెళ్ళాడు. మేం వెళ్ళి నా పిల్లాడిని ఇవ్వలేదు. మా బావగారు కూడా వచ్చి తిట్టి వెళ్ళారు. సరేనని మేం ఇంటికి వచ్చేసాం. నేను అప్పుడు అమ్మా వాళ్ళింట్లోనే ఉన్నాను. మా తోడికోడలు మాట అననే అంది. సెటిలవ్వకుండా పిల్లలని కనకూడదని. తప్పు మాదే మరి. మన బంగారం మంచిది కానప్పుడు ఎవరు ఏమి అన్నా పడాలి తప్పదు. తర్వాత రెండు రోజులకే మౌర్యని తీసుకువచ్చి ఇచ్చేసాడు. 

              నేను మళ్లీసారి మౌర్య పుట్టినరోజుకి ఉంటానో ఉండనో అని బాగా చేయాలనుకున్నా. కాని ఈ గొడవ జరిగేసరికి ఊరిలో పిల్లలందరిని మాత్రమే పిలిచి చేసాను. తర్వాత నేను కాలేజ్ లో మానేసి హైదరాబాదు వెళ్ళాను. అమెరికా వెళ్ళడానికి జావా నేర్చుకోవడానికి. 

     ఏ ఉద్యోగానికైతే నేను పనికిరానని అన్నారో, వారికి తెలిసేటట్లుగా నన్ను నేను నిరూపించుకుని, మరో మజిలికి ప్రయాణమయ్యాను. 
 
      జీవితంలో అడ్డంకులు, ఆటుపోట్లు మనిషిలోని, తనకు తెలియని శక్తిని బయట పడేస్తాయి. పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయెాగపడతాయి.దేనినైనా తట్టుకునే శక్తిని కూడా ఇస్తాయి. కాస్త ఓర్పు, నేర్పు ఉంటే చాలు. 


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

13, డిసెంబర్ 2020, ఆదివారం

కొన్ని..!!

కొన్ని మనసులింతేనేమెా
ఎప్పుడూ వెలితిగా

కొన్ని నవ్వులింతేనేమెా
ఎప్పుడూ  వెలవెలబోతూ

కొన్ని బంధాలింతేనేమెా
ఎప్పుడూ అంటీ అంటనట్టుగా

కొన్ని కలలింతేనేమెా
ఎప్పుడూ కలకలం రేపుతూ

కొన్ని ప్రేమలింతేనేమెా
ఎప్పుడూ అర్థం చేసుకోలేనట్లుగా

కొన్ని నిజాలింతేనేమెా
ఎప్పుడూ నమ్మలేనట్టుగా

కొన్ని ఆశలింతేనేమెా
ఎప్పుడూ తీర్చుకోలేనట్టుగా

కొన్ని ఖాళీలింతేనేమెా
ఎప్పుడూ పూడ్చుకోలేనంతగా

కొన్ని జీవితాలింతేనేమెా
ఎప్పుడూ అసంతృప్తిగా....!!

8, డిసెంబర్ 2020, మంగళవారం

మనకో నీతి - తనకో నీతి..!!

     నాయకులూ మీ ప్రాణాలు పదిలంగా కాపాడుకోండి. పిల్లల ప్రాణాలు ఏమైనా మీకనవసరం. మీకు మాత్రం ఎన్నికలు వద్దు కాని పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు తెరిచి, పరీక్షలు పెట్టి మీ చేతులు దులిపేసుకోండి. తప్పు మీది కాదులెండి. గుడ్డిగా నమ్ముతూ వెనకేసుకు వస్తున్న మాది. మాకింతే జరగాలి. మీరు మీ మీ పనులు రాజబాటలో పూర్తి చేసుకోండి నాలుగు చిల్లర రాళ్ళు మా మీద విసిరేస్తూ... ఆ మహా ప్రసాదాన్ని మేం ఆనందంగా స్వీకరించేస్తాం. మీ ప్రాణాలు మీరు భద్రంగా కాపాడుకోండి. పిల్లలు ఏమైతే నీకెందుకు?  

7, డిసెంబర్ 2020, సోమవారం

తప్పొప్పులు...!!

నేస్తం, 
          ఒకరికి రాని విద్య మనకు వచ్చునని గర్వము కూడదు. ధనం మూలమిదం జగత్ అన్నది అక్షరాల సాక్షిగా పచ్చి నిజం. ఏం చేస్తాం ప్రపంచమే అలా ఉంది మరి. విద్యను వ్యాపారంగా చూడవచ్చు కాని మంచి చెడు కాస్త ఆలోచించాలి. కృతజ్ఞత చూపడం కూడా మన వ్యాపార ధోరణికి తప్పని భావిస్తే, రేపటి రోజున అమ్మని కూడా అమ్మకానికి పెట్టేస్తామేమెా. ఇష్టపడో లేదా అభిమానంతోనో చేసిన పనికి వెల కట్టలేము. బహుశా అదే కష్టానికి ఫలితం కోట్లలో రావచ్చు. కృతజ్ఞత తెలపడమే నేరమని భావించే వారికి చెప్పగలిగినది ఏమి ఉండదు. ఎవరి కారణాలు వారికుంటాయని సరి పెట్టుకోవడం తప్ప. ఈ కారణం చూపించి నింద వేయడం సరి కాదు. 
         సినిమా వాళ్ళు కొందరు కొందరికి డబ్బు తీసుకోకుండా పని చేస్తారు. అలా అని అందరు వాళ్ళను అందరికి ఊరికినే చేయమని అడగరు కదా. అలాగే ఏ పనైనా అంతే. కొందరి మీద అభిమానంతోనో, ఇష్టంతోనో, పోని మెామాటంతోనో చేయాల్సి వస్తుంది. అదే పని అందరికి చేయలేం కదా. వారికి చేసారు, నాకెందుకు చేయరంటే చెప్పడానికి కారణమే ఉండదా చెప్పండి. 
            మా హిందీ టీచర్ చెప్పిన మాటే గుర్తు చేసుకుంటూ... చెడు జరిగినా అది మన మంచికే... కాలమే నిర్ణయిస్తుంది మన తప్పొప్పులను. విషయ పరిజ్ఞానం లేకుండా రాసానని అనిపిస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించేయండి అందరూ...!!

కాలం వెంబడి కలం...31

         
          మెుదటి ఫిజిక్స్ క్లాస్ తీసుకోవడానికి ఎందుకయినా మంచిదని, రెండు గంటల క్లాస్ కి అని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అవనిగడ్డ పాలిటెక్నిక్ కాలేజ్ లో మెుదటి ఫిజిక్స్ క్లాస్ మెకానికల్ బాచ్ కి తీసుకున్నాను. నాకు ఇష్టమైన వెక్టర్స్ తో మెుదలుబెట్టాను. క్లాస్ రూమ్ కి వెళ్ళగానే క్లాస్ తీసుకున్నాను. రెండు గంటలకని ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ గంట కూడా రాలేదు. క్లాస్ చెప్పడం అవగానే పిల్లల పరిచయం అయ్యింది. ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ రెండు బాచ్ లను కలిపి ఓ క్లాస్ తీసుకునేదాన్ని. కంప్యూటర్ గ్రూప్ లో మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. అలా నా లెక్చరర్ జీవితం, మేం చిన్నప్పుడు చదువుకున్న అవనిగడ్డలో మెుదలైంది. నాతోపాటు కెమిస్ట్రీ లెక్చరర్ సంధ్య గారు ఉండేవారు. ఇంక మిగతా అందరు అబ్బాయిలే. సంధ్యను అడిగాను ఇలా. రెండు గంటలకు ప్రిపేర్ అయితే గంటే వచ్చిందండి ఏం చేయాలి అంటే ఆవిడ నవ్వేసారు. కబుర్లతో టైమ్ పాస్ చేయవచ్చు కాని పిల్లలకు చెప్పాల్సిన సిలబస్ చాలా ఉంది. పాఠమే కాకుండా నోట్స్ కూడా చెప్పాలి. ఇన్ని పనులు టైంకి  అవ్వాలంటే క్లాస్ లో టైమ్ వేస్ట్ చేయకూడదని నా ఉద్దేశ్యం. నాకేమెా కాస్త ఫాస్ట్ గా చెప్పడం అలవాటు. అందుకనే మెుదట్లో కొందరు పిల్లలు ఇబ్బంది పడేవారు. కొందరు వేరే లెక్చరర్స్ పిల్లలను అడిగినట్లున్నారు. మాడం ఎలా చెప్తున్నారని. ఈ విషయం చెప్పినట్లున్నారు పిల్లలు. ఇంగ్లీష్ లెక్చరర్ పేరు గుర్తు లేదు నాకు. ఆయన మాడం మీరు చాలా ఫాస్ట్ గా చెప్తున్నారంట. కాస్త నెమ్మదిగా చెప్పండని సలహా ఇచ్చారు. 
            తర్వాత రోజు రెండు గ్రూప్ లను కలిపి ఫిజిక్స్ క్లాస్ తీసుకున్నా. ఈ మాటే అడిగాను. నేను ఫాస్ట్ గా చెప్తున్నాను, కాని మీకు అర్థం కాకుండా చెప్పడం లేదు కదా అని అడిగాను. మీకు పాఠం చెప్పాలి, నోట్స్ చెప్పాలి స్పెల్లింగ్స్ తో సహా. మనకు టైమ్ ఎక్కువ లేదు. మీ ఇష్టం మరి పాఠం నెమ్మదిగా చెప్పి, నోట్స్ ఇవ్వను. మీరేం చేయమంటే అది చేస్తాను అని. పిల్లలందరు మాడం మీరు ఇప్పుడెలా చెప్తున్నారో అలాగే చెప్పండి అని ముక్త కంఠంతో అరిచారు. అలా పిల్లలందరు బాగా దగ్గరైపోయారు అతి కొద్ది కాలంలోనే. 
                 నేను కాలేజ్ నుండి వచ్చి మరుసటి రోజు క్లాస్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటే మౌర్యగాడు అస్సలు ఊరుకునేవాడు కాదు. నేను అన్నం తినేటప్పుడు కూడా ఏడిచేవాడు కాదు. అలాంటిది పుస్తకం పట్టుకుంటే ఏడ్చేవాడు. వాడిని నిద్రపుచ్చి, అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. మా ఊరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలోని కోడూరు వెళ్ళి బస్ ఎక్కి అవనిగడ్డ వెళ్ళాలి రోజూ. ఎక్కువగా నడుచుకుంటూ కోడూరు వెళ్ళి, అక్కడి నుండి బస్ లో అవనిగడ్డ వెళ్ళేదాన్ని. అప్పుడప్పుడూ రాఘవేంద్ర కోడూరులో బండి మీద దింపేవాడు. వచ్చేటప్పుడు కూడా అంతే. 
        ఎలక్ట్రికల్, కంప్యూటర్ గ్రూప్స్ కి కామన్ గా ఉన్న ఫిజిక్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు కూడా చెప్పేదాన్ని. మాథ్స్ ఓ సర్ చెప్పేవారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వేరే సర్ చెప్పేవారు. అలా ఫిజిక్స్ అని జాయిన్ అయ్యి, మిగతా సబ్జక్ట్ కూడా చెప్పేదాన్ని. పిల్లలు గులాబిపువ్వులు తెచ్చి ఇస్తుండేవారు. పూలు ఎక్కువగా నేను పెట్టుకోను. అందుకని పిల్లలు బాధ పడకుండా, పువ్వులు తీసుకుని సంధ్య గారికి ఇచ్చేసేదాన్ని. ఆవిడ నవ్వేవారు ముందునుండి ఉన్నా నాకు ఇవ్వలేదు, చూసారా మీకు ఇస్తున్నారు అని. వాళ్ళకి తెలుసులెండి నేను మీకే ఇచ్చేస్తానని అని నేను నవ్వేసేదాన్ని. అందరం అనుకుంటుంటాం ఈ మాట. సహజంగా ఇద్దరు ఆడవాళ్లు ఉన్న చోట గొడవలుంటాయని. కాని ఇక్కడ రివర్స్. మేమిద్దరం చాలా బావుండేవాళ్ళం. అబ్బాయిల ఆరోపణలు వింటూ మేమిద్దరము ఈ మాటే అనుకుని బాగా నవ్వుకునేవాళ్ళం. మధ్యలో మాథ్స్ సర్ ఎందుకనో చాలా రోజులు రాలేదు. కాలేజ్లో కూడా ఎవరికి చెప్పలేదు. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చేస్తున్నాయని. సిలబస్ చాలా ఉందని. నాకు పాపం పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారనిపించి, సరే నేను కొన్ని చాప్టర్స్ చెప్తానని నాకిష్టమైన ఇంటిగ్రేషన్ తో స్టార్ట్ చేసాను. ఆ రోజు పిల్లలందరు బాగా కుషి. మాడం మీరు ఆల్ రౌండరా అంటూ. తర్వాత మాథ్స్ సర్ వచ్చేసారు. నేను హెల్ప్ చేసినందుకు థాంక్స్ కూడా చెప్పారు. 
         పిల్లలు అందరు చాలా మంచివాళ్ళు. చెప్పేది చక్కగా వినేవారు. అప్పుడే టెంత్ అయి వచ్చారు కదా బుద్ధిగానే ఉండేవాళ్ళు. మేమంటే గౌరవంగానే ఉండేవారు. మెకానికల్ వాళ్ళకి, కంప్యూటర్స్ వాళ్ళకి ఎందుకో పడలేదు. ఈ కార్తీకం మాసంలోనే అనుకుంటా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. మెుత్తానికి ఏదో గోడవ అయ్యింది. చిన్నా చితకా గొడవలకు సర్దిచెప్తుండేదాన్ని. సంధ్య నవ్వుతుండేవారు... మీ మాటలు బాగా వింటున్నారండి అని. పిల్లలకు నాకు తెలిసిన మంచి విషయాలు కూడా చదువుతో పాటుగా చెప్తుండేదాన్ని. ఇది మా హింది టీచర్ రత్నకుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ మాకు చదువే కాకుండా లోకజ్ఞానం కూడా నేర్పేవారు. బోలెడు మంచి విషయాలు కూడా చెప్పేవారు. ఓ రోజు మా జయపురం నుండి అమ్మయ్యగారి మనుమరాలు జనని బస్ లో కలిసింది. తను చిన్నప్పుడు మేము చదువుకున్న శిశువిద్యామందిరంలో టీచర్ గా చేస్తోంది. మా శ్రీలత టీచర్ గారి గురించి అడిగితే కలవమని చెప్పారని చెప్పింది. తర్వాత ఓ రోజు మధ్యాహ్నం పూట మా శిశువిద్యామందిరంకి వెళ్ళి టీచర్ గారిని కలిసాను. ఎంత సంతోష పడిపోయారో మా శ్రీలత టీచర్ గారు, నా అల్లరంతా గుర్తు చేసుకుంటూ.  పెద్ద తెలుగు మాస్టారిని పలుకరించాను కాని ఆయనకు అప్పటికే మతిమరుపు వచ్చేసింది. అలా బస్ లో ఎక్కువగా సాయంత్రం పూట నేను, జనని కలిసేవాళ్ళం. ఇంతకి జీతం ఎంతో చెప్పలేదు కదూ. రెండు గంటలకి రెండు వేలు అనుకుంటా. తర్వాత తర్వాత క్లాస్ లు ఎక్కువసేపు చెప్పేదాన్ని. 

మనం చేసే పని ఏదయినా ఇష్టంగా చేస్తేనే ఆ పనిలో ఆనందం పొందగలుగుతాం. అంతే కాని పని చిన్నదా, పెద్దదా అని కాదు. ఎంత సంపాదించామన్నదీ కాదు. ఆత్మతృప్తి కలిగిందా లేదా అని చూసుకోవాలి. 


వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

5, డిసెంబర్ 2020, శనివారం

న్యాయం జరిగేదెన్నడో...?

కాలం కాటునుండి
తప్పించుకోలేని కష్టజీవి
దళారుల చేతుల్లో 
దగాపడుతున్న సేద్యగాడు 

నేలను నమ్ముకుని 
అమ్మలా కాచుకునే రైతుబిడ్డను 
ప్రకృతి కూడా పరిహసిస్తోంది
తన చేతిలో కీలుబొమ్మంటూ

విత్తుల దగ్గర నుండి 
ఎరువుల పురుగుమందుల వరకు
కల్తీ కోరల్లో చిక్కుకున్నది
దేశానికి బువ్వనందించే భూమాత సారం

కాసులు కూడబెట్టుకోవడం తెలియని
అలుపెరుగని ధరణీ సుతుడితడు
కూలీగా మారి మన ఆకలిదీర్చే ఆత్మబంధువితడు
అప్పుల ఊబిలో ప్రాణాలర్పిస్తున్న అన్నార్తుడితడు

ఎన్నికల మాయాజాలంలో
ఓట్లకు నోట్లకు అమ్ముడుబోతున్న 
మధ్యతరగతి బతుకులను మార్చలేని 
రాజకీయ రాక్షస కోరల్లో నలుగుతున్న దగా పడిన రైతన్నకు న్యాయం జరిగేదెన్నడో

శ్రమను అమ్ముకోవడం 
చేతగాని భూమి పుత్రుడు కన్నెర్రజేస్తే
పంట వేయనని మెుండికేస్తే
పరిణామమెలా ఉంటుందో ఊహించగలమా...!!







ప్రవాసుని చేతిలో తెలుగు భాషకు దక్కిన అరుదైన గౌరవం....!!

               పూర్వీకుల తెలుగు మూలాలను మహోన్నతంగా, దేదీప్యమానంగా వెలిగించి చరిత్ర పుటల్లో ఓ నూతనాధ్యాయాన్ని లిఖించిన అద్భుతవ్యక్తి మారిషస్ నివాసి శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న తెలుగు అక్షరాల పట్టి(ఫాంట్) త్వరలో "మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్)గా వెలుగులోనికి రానుంది. 
         భరతభూమికి 5445 యెాజనాల దూరంలో గల మారిషస్ దీవుల నివాసితులయిన శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారి ముత్తాతలు మన ఆంధ్రులు. సంజీవ నరశింహ అప్పడు గారికి ముత్తాతల మాతృ
భాష అన్న అంతులేని ప్రేమ. భరతభూమికి సుదూరంగా ఉన్నా తెలుగు మీద అభిమానంతో, మారిషస్ ప్రభుత్వ సహాయ, సహకారాలతో అక్కడి పిల్లలకు పాఠశాలలో తెలుగు నేర్పడము, మన భారతీయ సంస్కృతీ, సనాతన సంప్రదాయాలను వివరించడములో చాలా కృషి చేస్తున్నారు. 
      శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరికి తెలుగు భాషపై మంచి పట్టు ఉండటమే కాకుండా, దైవానుగ్రహముతో వివిధ రంగుల పెన్నులతో, 8,12,16 కలాలను ఒకేసారి ఉపయెాగిస్తూ తెలుగు లిపిని తనదైన శైలిలో అందంగా రాయగలరు. అంతేకాకుండా సొంపుగా పెద్ద పెద్ద రంగవల్లులను అత్యద్భుతంగా వేయగలరు, అదీ అతి తక్కువ సమయంలో. వీరు  తెలుగు సాంస్కృతిక పసుపు ఝండాను రూపొందించారు. ప్రపంచంలోని లక్షలాది తెలుగువారికి తెలుగు వ్యాఖ్యాతగా పరిచితులై, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన అద్భుత వ్యాఖ్యానంతో మన కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నారు. పదివేల సార్లు భారతదేశాన్ని సందర్శించాలన్న దృడ సంకల్పం వీరిది. ఇప్పటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 149 పుణ్య ప్రదేశాల నుండి మట్టి ప్రసాదాన్ని తమ ఇంటి దేవుని గదిలో గుట్టలు గుట్టలుగా అలంకరించారు. తాను వెళ్ళిన ప్రతి ఊరిలోని ప్రముఖులతో తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి, అదే వేదికపై అందరి సమక్షంలో వయసులో పెద్దాయనను, ఓ యువకుడిని పిలిచి, ఆ యువకుడితో పుట్ట మట్టిని తవ్వించి, ఆ పెద్దాయన చేతుల మీదుగా మట్టిని స్వీకరించి తనతో మారిషస్ తీసుకువెళ్ళారు. తెలంగాణా ప్రభుత్వం మారిషస్ లో పెట్టబోతున్న శ్రీ పాములపర్తి వేంకట నరశింహారావు గారి విగ్రహానికి, తెలుగుతల్లి విగ్రహానికి భూమి పూజలో ముందుగా శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు ఇప్పటి వరకు సేకరించిన భరతభూమి మట్టి ప్రసాదాన్ని ముందుగా వేసి, ఆ తరువాత విగ్రహ ప్రతిష్ఠ పనులు మెదలుబెడతారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చేయని ఈ మట్టి సేకరణకు దక్కిన అపూర్వ గౌరవమిది. ఈ గౌరవాన్ని శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారికి అందించిన తెలంగాణా ప్రభుత్వానికి శుభాభినందనలు. 
    తెలుగు భాషలో చిరస్థాయిగా నిలిచిపోయిన సి పి బ్రౌన్ మహాశయుని మనం నిత్యం స్మరించుకున్నట్లే, శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారి తెలుగు భాషా సేవలలో సరి కొత్త అధ్యాయం చోటు చేసుకుంది. అది ఈయన రాసిన తెలుగు అక్షరాలను మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్)గా వాడుకలోనికి రానుంది. అను ఫాంట్, బాపు ఫాంట్ వగైరా ఫాంట్ లు మనకు అందుబాటులో ఉన్నట్లుగా ఈ "మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్) త్వరలో వాడుకలోనికి రానుంది. ప్రవాసులలో ఈ ఘనతను అందుకున్న మెుదటి వ్యక్తి శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు. తెలుగు భాషా చరిత్రలో వీరి పేరు అజరామరంగా నిలిచిపోతుంది. ఈ మారిషస్ సంజీవ తెలుగు పట్టి తయారు చేయడానికి దాదాపుగా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది. ఇది చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న పని. అతి తక్కువ ఖర్చుతో ఈ మారిషస్ సంజీవ తెలుగు పట్టి తయారయ్యింది. దీనికి ఆర్థిక సహాయ, సహకారాలను అందించి తమ దొడ్డ మనసును చాటుకున్న శ్రీ లయన్ విజయకుమార్ గారు, కృష్ణ వల్లభనేని గార్లకు తెలుగు భాషాభిమానులందరు బుుణపడి ఉంటారు. శ్రీ లయన్ విజయకుమార్ గారు తెలుగు సాహిత్యాభిమాని. ఎందరి పుస్తకాలకో ఆర్థిక సహాయం అందించారు. పలు సేవా కార్యక్రమాల్లో తన ధాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరంతా శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారికి ముఖ పరిచయం లేని వారే. అయినా తెలుగు భాష  మీద ప్రేమతో వీరంతా ఈ మహా యజ్ఞంలో తమ వంతుగా సహాయ సహకారాలందించి భాషాభిమానాన్ని చాటుకున్నారు.
         భగవదనుగ్రహం మెండుగానున్న సంజీవ నరశింహ అప్పడు గారు మరో మహతి కార్యం తలపెట్టారు. అది శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 32000 సంకీర్తనలలో ప్రసిద్ధి పొందిన 30 సంకీర్తనలను " మారిషస్ అన్నమయ్య గీతాలు " పుస్తకంగా తీసుకురానున్నారు. దాతల సహయంతో 55 వేల పుస్తకాలు ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా, ఈ  పుస్తకం కావాల్సిన వారికి ఉచితముగా ఇవ్వనున్నారు. ఈ పుస్తకంలో ప్రతి కీర్తన ఐదు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మెుదటి భాగంలో సంకీర్తన తెలుగులో, రెండవ భాగంలో ఆంగ్లంలో మూడవ భాగంలో తెలుగు భావం, నాలుగవ భాగంలో ఆంగ్ల భావం, ఐదవ భాగం పుస్తకం వెనుక ఈ కీర్తనలన్ని వినడానికి వీలుగా సిడి లో పొందుపరిచి మనకు ఉచితముగా అందివ్వనున్నారు. ఈ పుస్తకం వేయడానికి ముఖ్య కారణం తెలుగుభాష తెలియని ఎంతోమంది ఈ సంకీర్తనలను రాగతాళ యుక్తంగా పాడగలుగుతున్నారు కాని భావయుక్తంగా పాడలేక పోతున్నారన్న కారణంతో ఈ అద్భుతమైన ఆలోచన చేసారు.  

           ఈ " మారిషస్ సంజీవ తెలుగు పట్టి " ఎవరికైనా తమ తమ గణన తంత్ర యంత్రములు(కంప్యూటర్) లేదా చర వాణి యంత్రము(సెల్ ఫోన్) ద్వారా ఎవరి అనుమతి లేకుండా వాడుకోవచ్చును. ఒక్క నయా పైసా కూడా మనం ఎవరికి ఇవ్వనవసరం లేదు.

          ఇప్పటి వరకు తెలుగు పట్టీలు వెలువడ్డాయి. భారత పుణ్య భూమి లో ఉన్న తెలుగు ప్రజలు వాళ్ల వాళ్ల తెలుగు చేతిరాతల నైపుణ్యము వలన ఎన్నెన్నో తెలుగు లిపులు వివిధ శైలులలో సృష్టించబడ్డాయి.అవి అన్నీ భారతీయుల చేతిలో తయారు అయ్యాయి. కాని ఇప్పుడు భారత పుణ్య భూమి యొక్క సరిహద్దులు దాటి, మన తెలుగు కళామతల్లి వారి పరిమళమైన సుమధుర సువాసనతో సప్త సముద్రాలు దాటి ఓ చిన్ని ద్వీపములో పుట్టి పెరిగిన మారీచ మహర్షి పుణ్య భూమి అయిన మారిషస్ ద్వీపములో పుట్టి పెరిగిన సంజీవ నరసింహ అప్పడు వారి తెలుగు హస్త రేఖలతో రాసిన అన్ని తెలుగు అక్షరాలు, ద్విత్వాలు, సంఖ్యలు, చిహ్నాలు ఇప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పద్ధతి లో చేయబోతున్నది. తెలుగు చరిత్రలో ఈ అద్భుత సంఘటన సువర్ణ తెలుగు అక్షరాలతో రాయబడుతున్న దేశీయ  తెలుగు పట్టి ఈ " మారిషస్ సంజీవ తెలుగు పట్టి", 

   ఈ పట్టి తయారుచేయాలన్న సుమధుర ఆలోచన సంజివ నరశింహ అప్పడు గారికి ఎలా వచ్చిందంటే, తన తాతయ్య ఒక అతి పాత తెలుగు పెద్ద బాల శిక్ష అనే తెలుగు జాతికి " తెలుగు వేదం " లాంటి పుస్తకాన్ని ప్రసాదించారు. ఉభయ తెలుగు  రాష్ట్రాల్లో ఈ తెలుగు పెద్ద బాలశిక్ష అందరికిచిరపరిచితమే. 

       సంజీవ నరశింహ అప్పడు వారి తాతయ్య " ఆంధ్ర"  జనానండ సహాయ సంఘం " నడుపుతున్న దేవస్థానము మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు తొలుతగా కట్టి, విగ్రహం స్థాపించిన శ్రీ విష్ణు దేవస్థానం. వీరి తాతయ్య గారే ఆ ఆలయ అస్తానార్చకులు.         

        ఐదు సంవత్సరాల పసి వయస్సు నుంచి తాతయ్య సంజీవ నరశింహ అప్పడు వ్రేళ్ళను పట్టుకుని ప్రతి రోజు ఆలయానికి తీసుకుని వెళ్లేవారు. ఆలయంలోనే చాలా మంది తెలుగు యువతీ యువకులు తాతయ్య దగ్గర తెలుగు నేర్చుకునే వారు. సంజీవ నరశింహ అప్పడుకి తాతయ్య మాట్లాడే తెలుగు మరియు రాసే తెలుగు వలన అతనికి ఒక ప్రేరణ ఉత్సాహం ఉద్భవించింది. 

        తెలుగు యొక్క అందం మరియు తెలుగు అన్ని అక్షరాల లిపులు గుంద్రాకారంలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న వేలాది భాషల లిపులతో పోల్చి చూస్తే తెలుగు లిపి యొక్క లిపి అన్ని అక్షరాలు తామర పువ్వులు ఉన్న దళాల ఆకారంలో మనకు దర్శనం ఇస్తాయి. శ్రీ మహా విష్ణువు, శ్రీ మహా లక్ష్మీ, శ్రీ సరస్వతీ దేవి బొమ్మలు మనకు పద్మము మీదనే దర్శనం ఇస్తాయి.ఈ కారణంగా సంజీవ నరశింహ అప్పడు గారు ఎంతో ఆసక్తితో సొంతంగా అనేక వ్యయప్రయాసలకు ఓర్చు, వినూత్న  పద్ధతి సృష్టించారు పరాయి దేశంలో తెలుగు కోసం.తెలుగు మీద ప్రేమతో. 
         మారిషస్ ద్వీపము లో ఎప్పుడైన ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా శుభ కార్యం ఉంటే సంజీవ నరశింహ అప్పడు గారి దగ్గరకు వచ్చి, శుభకార్యం గురించి చెప్తే ప్రత్యేక ఆహ్వాన పత్రికలు చేతితో ఉచితముగా చేసి ఇచ్చి ముద్రణాలయంలో వందలాది ప్రతులు చేస్తారు. అదే విధముగా అన్ని తరగతులలో ప్రతి సంవత్సరంలో తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరికీ విశేష తెలుగు పరీక్షల్లో  ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ప్రమాణ పత్రాలు సంజీవ నరశింహ అప్పడు గారు ఉచితంగా చేసి ఇస్తారు.
        అంతర్జాతీయ తెలుగు మహా సభలు 1990
 సం||లో మూడవ ప్రపంచ తెలుగు మహా సభలు మరియు 1994 సం||లో ప్రథమ అంతర్జాతీయ తెలుగు ఉపాధ్యాయుల మహా సభల యొక్క  అధికార చిహ్నానికి(లోగో) రూపకల్పనలు సంజీవ నరశింహ అప్పడు గారే తయారు చేసారు. ఇంకా అనేక తెలుగు సభలకు, మారిషస్ ఆలయాల సభలకు ఆహ్వాన పత్రికల రూపకల్పన వీరే చేసారు. 

• రావి ఆకుల మీద చిత్రాలతో సంజీవ నరశింహ అప్పడు గారి కీర్తి ప్రపంచ స్థాయికి  ఎదిగింది. గిన్నీస్  అంతర్జాతీయ ప్రసిద్ధి పుస్తకంలో ఈయన పేరు నమెాదయ్యింది. ఎందుకంటే " తెలుగు సాంస్కృతిక వారసత్వం అనే శీర్షిక తో తెలుగు తనం, తెలుగు ధనం, తెలుగు ధర్మం గురించి 1400ల బొమ్మలు రావి ఆకుల మీద గీశారు. ఎవరైనా తనని అడిగితే అవి కూడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో సహృదయంతో తెలుగు మీద భక్తితో, అడిగిన వారికి అందిస్తారు.ముఖ పుస్తకములో సంజీవ నరశింహ అప్పడు గారి తెలుగు కళలు మనం చూడవచ్చు. 

      వీరిని సంప్రదించడానికి ముఖ పుస్తకము ద్వారా : Sanjiva Narasimha Appadoo
అతని వాట్సాప్ చరవాని సంఖ్య(వాట్సప్ నెంబర్):
±౨౩౦౫౭౬౯౫౬౭౬
23057695676
సంజీవ యొక్క విద్యుల్లేఖ విలాసము (ఈమెయిల్ ఐడి) :
simhasan1008@yahoo.com

• ఎవరైనా మీ పేరు పన్నెండు వివిధ రంగుల కలములతో గీయమని అడిగితే, తెలుగు మీద ప్రేమతో ఉచితముగా ఆనందంతో చేసి ఇస్తారు.

           ఇంతటి మహోన్నత తెలుగు భాషాభిమానికి ఈ నాలుగు మాటలు ఉడుతాభక్తిగా సమర్పిస్తూ...యావత్ ప్రపంచ తెలుగు వారందరి తరపునా హృదయపూర్వక శుభాభినందనలు. 

         
               

3, డిసెంబర్ 2020, గురువారం

రైతు రాజీనామా...!!

జీవన చదరంగంలో
ఎప్పుడూ ఓడిపోతోంది రైతే
రాజకీయ కుతంత్రాలకు
అనాది నుండి నష్టపోతూనే ఉన్నా
నలుగురి ఆకలి తీర్చాలన్న ధ్యేయంతో
అప్పు చేసి వ్యవసాయం చేసినా
కనికరించని వరుణుడు
సహకరించని ప్రకృతిల నడుమన నలుగుతూ
బాలారిష్టాలన్నీ దాటినా
దళారుల దురాగతాలకు
అయినకాడికి పండిన పంటను  
అమ్ముకోవలసి దుస్థితి నేడు

తాను కష్టపడి పండించి పంటకు
సరైన ధరను నిర్ణయించలేని రైతన్న 
చెమట చుక్కలను తిండి గింజలుగా మార్చి
అందరి ఆకలిని తీరుస్తున్న
రైతంటే ప్రతి ఒక్కరికి చిన్నచూపే
కాయకష్టానికి కనీస కూలి గిట్టని రైతన్న
కడుపు మండి పంటకు శలవు ప్రకటిస్తే
ఆ పరిణామమెలా ఉంటుందో 
ఊహించగలమా... 

ఓటు కోసం 
నోటు కోసం
సన్నకారు చిన్నకారు రైతుల
కడుపు కొట్టే రాజకీయ నాయకుల 
దురాగతాలను అడ్డుకోవడానికి
మార్చండి రాజ్యాంగం
రైతుకు ఇవ్వండి హక్కు
తన పంటకు తానే ధర నిర్ణయించే అధికారం
అదే సమన్యాయం
అప్పుడే సమ సమాజ నిర్మాణం...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner