31, జులై 2019, బుధవారం

ఒక కల రెండు కళ్లు సమీక్ష...!!

                           బిడ్డ ఆనందాలను గురించి అమ్మానాన్న కన్న కలే ఈ  " ఒక కల రెండు కళ్లు "..!!
                  గృహిణిగా, ఉద్యోగినిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజానికి తన వంతుగా సాహిత్య సేవ చేస్తూ ఎన్నో సామజిక అంశాలను ప్రశ్నలుగా సంధిస్తూ, అనేక పురస్కారాలు అందుకుంటూ, ఆధునిక వచన కవిత్వంలో తనదైన ముద్రను వేస్తున్న రజిత కొండసాని తొలి కవిత్వ సంపుటి " ఒక కల రెండు కళ్లు ".
               సాధారణంగా ఎవరమైనా కలను ఎలా కంటాము, మన రెండు కళ్లు మూసుకుని శరీరం అచేతనావస్థలో ఉన్నప్పుడు మనసు, మెదడు చేతనావస్థలో చూసే మరో ప్రపంచమే కల. అందుకేనేమో రజిత కొండసాని తన కవిత్వ సంపుటికి సరికొత్తగా " ఒక కల రెండు కళ్లు " అని పేరు పెట్టారు.
            వ్యవసాయ ప్రధానమైన మన దేశానికి రైతు వెన్నెముకాని చెప్తూ, ఆ బడుగుజీవి కష్టనష్టాలను కళ్లకు కట్టినట్టుగా " నా దేశపు వెన్నెముకా.." కవితలో చక్కని వచనాన్ని అందించారు, ఋతువుల  అందాలను,ఆనందాలను ఋతువుల సాక్షిగా కవితలో చక్కని వర్ణన చేసారు. ఇరువురి మనసుల మధ్యన అనుబంధాన్ని, అంతులేని ఆరాధనను " అద్దానికి సైతం.." అన్న కవితలో ఎంత అద్భుతంగా చెప్పారో మీరూ చూడండి.
" ఇంతకూ నాకు అర్థం కానిది ఒక్కటే
మనిద్దరం ఒకటేనని అద్దానికి ఎలా తెలుసో మరి
తనలోకి నేను తొంగిచూస్తే ప్రతిబింబంగా నిన్ను చూపిస్తోంది."
నువ్వే నేనుగా, ఆటను - ఆమె, కల నిజం చేసేందుకైనా, పలకరిస్తావని, నిరంతర యత్నం, మౌనమేలనోయి, కుదురుగా కూర్చోనిస్తేగా, జీవన సహచరుడు, కలను చెదిరిపోనీకు  కవితలు చక్కని, చిక్కని ఆరాధనా భావంతో నిండి చదువరుల మనసులను రంజింపజేస్తాయి. నిజం గ్రహిస్తే కవిత రాజకీయ నాయకులకు ఓ హెచ్చరిక. ప్రణయపు పరిచయాన్ని చిత్రమే కదూ కవిత వివరిస్తుంది. తన జ్ఞాపకాల ఊసులలోని అనుభూతులు నిత్యం వెలిగే చిరునవ్వులుగా, క్షణాల సంతోషాలు శాశ్వతంగా ప్రియుని మదిలో నిలిచిపోవాలన్న ఆశను మిగిలిపోవాలని... కవితలో హృద్యంగా చెప్తారు. రైతు దుస్థితిని కవులు తమ అక్షరాలతో కరువు పూలు పూయింస్తారని కరవుపూలు కవిత చెప్తుంది. నీ చెలిమితో.. నేను.. పల్లవించిన పాటగా.. సుతారంగా ఈ అక్షర శృతులలో ఒదిగిపోతానంటారు. ఆకలి అలారం కవిత జీవన పోరాటానికి బతుకు బాటన నడవమని ఆకలి ఆరాటాన్ని సరికొత్తగా చెప్పడం చాలా నచ్చింది. ప్రత్యూషపు సందడిని, సౌందర్యాన్ని గోరువెచ్చని సూరీడా చూపిస్తుంది. చదువుల కొనుగోలు బహిరంగ వేలాన్ని కార్పొ'రేట్' చదువు కవిత పేరులోనే చెప్పేస్తుంది. మనుష్యుల మనసుల దూరాల భారాన్ని దిగులు మేఘం కవిత తెలుపుతుంది. స(రి)తిగమలు ఇల్లాలి ఇంటి పనుల విన్యాసాన్ని ఎంత గొప్పగా చెప్పిందో.. ఈ కవితా వస్తువు, కవితను మలిచిన తీరు అమోఘం..ఇంతవరకు చూడని వస్తుశిల్పం. ఇంతి సహనాన్ని, సమరాన్ని ఆవిష్కరించిన కవితలు రెండో కోణం, ఆదిపరాశక్తివై, కీర్తి పతాకను. ప్రేమను, స్నేహాన్ని చెప్పిన కవిత నీ స్నేహమే. మన దేశపు రాజకీయ దౌర్భాగ్యాన్ని, నాయకుల అర్హతను సూటిగా ప్రశ్నించిన కవితలు మినహాయింపు, మహా నటులు. ఇవి అందరి మనసులలోని మాటలే. ఒక 'కల' రెండు 'కళ్లు' కవితను తన కవితా సంపుటికి పేరుగా ఎన్నుకోవడంలోనే రజిత దృక్పధం తెలుస్తోంది. బిడ్డలు అమ్మానాన్నల గురించి రాసిన ఎన్నో కవితలు చదివిన మనకు ఈ కవిత కొత్తగా కనిపిస్తుందనడంలో ఎట్టి సందేహమూ లేదు. తమ ఆశల దీపం ఎలా వెలుగొందాలో, తమ ఇద్దరి కలల మనోనేత్రమే బిడ్డ సంతోషమని, అమ్మానాన్న కలిసి కన్న రెండు కళ్ల ఒకే కలే ఈ  కలని ఎంత బాగా చెప్పారో. ఈ కవిత గురించో ఇంతకన్నా చెప్పడానికి నాకు మాటలు రావడంలేదు. చెట్టు ఆవశ్యకతను, అవసరాన్ని మనతో కడవరకు తోడుండే బంధమని చెప్పడం చాలా బావుంది. ఎన్నికల హడావుడిని చెప్పిన కవిత పోలింగ్ పండుగ. మురిపిస్తూ.. మైమరపిస్తూ .. నిజమే కదూ అంటూ.. కళ్ళు  కాయలు కాచేలా ఎదురు చూసిన ప్రేమను, మైమరపును, ఆశలను అందంగా అందించిన అక్షర కుసుమాంజలి ఈ " ఒక కల రెండు కళ్లు కవితా సంపుటి.
     చక్కని భావోద్వేగాలను, అనుభూతుల అందాలను, కోపాల శరాలను, ప్రేమామృత పాశాలను, సామాజిక అసమానతలను, ప్రకృతి సోయగాలను అలతి పదాల్లో అందంగా  అందించిన కవయిత్రి రజిత కొండసానికి హృదయపూర్వక అభినందనలు.

30, జులై 2019, మంగళవారం

ఏక్ తారలు..!!

1.   సహనానికీ ఓ హద్దుంటుంది_మౌనమే మరణశాసనమౌతూ..!!

2.  దాచుకున్న జ్ఞాపకాలివి_కాలాన్ని క్షణాల్లో వెనుకకు మరలిస్తూ...!!

3.   సహనాన్ని పరీక్షిస్తోంది_కాట్లకుక్కల కుటిలతత్వం బయటబడుతూ...!!

4.  చెలిమి మనసు మహా దొడ్డది_పరిచయాలు ఎన్ని గుణపాఠాలు నేర్పినా...!!

5.   పరిభ్రమణం నిరంతరాయమే ఎప్పుడూ_భ్రమలన్నింటా అలవాటైపోయి...!!

6.  విలక్షణమైనదే విన్యాసం_మనసాక్షరాలకు ఆకతాయితనమెక్కువైనా...!!

7.   పదాలకు ఉరవడి ఎక్కువే_కాలంతో పోటిగా...!!

8.  మన అనుబంధం అపురూపం_గుప్పెడు గుండెలో పదిలమై..!!

9.   తరుగు లెక్కలేయలేదు_తరగని అనుబంధం మనదని తెలిసి...!!

10.   ఎన్నదగిన బంధమే ఇది_అక్షరాల అనుభూతులతో ముడిబడి...!!

11.   భారాన్ని మెాయడమలవాటేగా భావాలకు_మనసుకు ఊరటనందిస్తూ...!!

12.  ఎన్నదగిన బంధమే మనది_అక్షరాల సాక్షిగా కలిసిన నెయ్యమై...!!

13.  అనుబంధాల సందడులే అన్నీ_నీ చెలిమి చేరికతో...!!

14.  తెలివైన వారి లక్షణం_అపహాస్యాన్ని అభినందనగా మార్చుకోవడమే...!!

15.   అలకలన్నీ అక్షరాల్లో కనిపిస్తాయి_అలిగిన ప్రతిసారి...!!

16.   అక్షరాల ఊసులతో ఊరడిస్తున్నా_గాయపడిన నేస్తాన్ని..!!

17.  వెంటబడుతున్నాయి భావాలు_అక్షరాల్లో ఒద్దికగా ఒదిగిపోతామంటూ..!!

18.   బంధించనలవి కానిదే ఈ బంధం_సొగసులీనే అక్షరాలకు దాసోహమవుతూ..!!

19.  మనసు తెలిసిన చెలి'మది_మార్మికత గుట్టు విప్పుతూ..!!

20.   రాయలేని అక్షరమైంది
రాతి మనసును చూపలేని ఉలి తానై మిగిలి...!!

21. మనసు రాల్చిన మౌన వేదన_శిథిలాలలోనూ సజీవమే..!!

22.    చరిత్రే చరితార్థం_అక్షరాంగనలద్దిన  పద చాతుర్యానికి..!!

23.  శిలకు చలనం వస్తుంది_మనసాక్షరాలు మౌనాన్ని వీడితే...!!

24.   మనసు మాటను రాద్దామనుకున్నా_కవనమై కాంతులీనుతోంది...!!

25.  నమ్మకమదే_మనసాక్షరాలు కఠిన పాషాణాన్నైనా చలింపజేస్తాయని...!!

26. భావాలెప్పుడూ అంతే_అలవికాని మాధుర్యాన్ని అక్షరాలకందించేస్తూ...!!

27.   మౌనమెప్పడూ ఇంతే_మాటలకడ్డం పడిపోతూ...!!

28.   మమతెప్పుడూ ఇంతే_మనసునొదిలి పోలేనంటూ...!!

29.   బంధాలెప్పుడూ ఇంతే_బాధ్యతల నడుమ బంధీలౌతూ..!!

30.   ప్రణయమంటే ఇదేనేమెా_గతజన్మ బంధాన్ని జ్ఞాపకం చేస్తూ..!!

20, జులై 2019, శనివారం

త్రిపదలు...!!

1.   కొన్ని జ్ఞాపకాలంతే
వీడనూ లేవు
అలా అని ఉండనూ లేవు..!!

2.  అలిగింది మాటలే
మౌన రాయబారాలు
మనసుల మధ్యన...!!

3.   ముసిరినందుకు మురిసిపోయింది
తరలి వచ్చిన జ్ఞాపకాలతో
తలమునకలైన తన్మయత్వం...!!

4.   వాస్తవమెప్పుడూ ఇంతే
భారాన్ని మనకొదిలి
అస్పష్ట ఆకృతిగా తానుండిపోతూ..!!

5.   కంటిధార ఓ అదృష్టమే
మింటికెగసే మంటలనార్పే
మనో ఒౌషదమైనప్పుడు...!!

6.   అక్షర లక్షణమది
రాయడమలవాటు చేసి
మనసు పుటల్ని నింపేయడానికి...!!

7.   పలకాలి
అమ్మ నేర్పిన పలుకులను
వాటిలో నిండిన ఆత్మీయతతో..!!

8.   చెప్పాలి
ఆనాటి జ్ఞాపకాన్ని
నువ్వున్న  క్షణాలను చేర్చి...!!

9.  జననం
కర్మ ఫలితానికి
తిరుగులేని సాక్ష్యం..!!

10.   అమాసని మరిచిందనుకుంటా
ముచ్చట్ల మాయకు లోనై
అవని ఆకాశం వైపు చూస్తూ...!!

11.   జవాబుదారీ తాము కావంటున్నాయి
ఆలోచనల ముసుగులను
తొలగించలేని అక్షరాలు...!!

12.   బాల్యాన్ని దాచిన
వెల కట్టలేని ఆత్మీయతల ఖజానా
అమ్మ చీర కొంగు...!!

13.   పాపాయికి దిష్టి తగలనీయకుండా
బాల్య జ్ఞాపకాలను దాచిన
మమతల మైమరపు అమ్మ చీరచెంగు..!!

14.   కొన్ని వాస్తవాలంతే
గతాన్ని మరువనివ్వవు
గాయాన్ని మాననీయవు..!!

15.   అంతర్ముఖం
మనకు మాత్రమే తెలిసిన
మన మనసు నైజం..!!

16.   మెా(క)హరింపులు
మెామాటానికనుకున్నా
మన నెయ్యపు చుట్టరికానికని తెలియక..!!

17.    నివేదించే నివేదనలేనన్నీ
మాలిమైన మనసుకు
మాటలద్దిన అక్షరాలుగా మారుతూ..!!

18.   పెరుగుతున్న దూరాలు
బలహీనమౌతున్న బంధాలు
ధనాపేక్షల కాలమందు...!!

19.   ఆకతాయి నీలిమబ్బు గుర్తు చేసిందందుకే
బాల్యపు తడి పొడి జ్ఞాపకాలతో
మనసుని తడిపేస్తూ...!!

20.   గెలిచింది మృత్యువు
ఓడింది అక్షరం కాదు
మానసిక నైర్మల్యం...!!

21.   నీతో నేను లేకున్నా
నీ జ్ఞాపకాలన్నీ నాతోనే
ఉన్నాయంటే దానర్థం...!!

22.   ఆశంటే అంతే మరి
కడవరకు చేరినా
కలల్లో కదలాడుతునే ఉంటుంది...!!

23.   రాతిరికెప్పుడూ మెలకువే
కలలను కాలరాయాలని
వేకువ వచ్చి చేరుతుందోనన్న భయంతో..!!

24.   ఆహ్వానం అనివార్యం
చీకటి వెలుగులు చుట్టాలు
మనం వద్దన్నా వలస వచ్చేస్తుంటాయి మరి..!!

25.    గాయానికి కొలతేం ఉండదు
చిన్నదయినా పెద్దదయినా
గురుతులలాగే మిగిల్చేస్తుంది...!!

26.   మెాదంతో ఖేదం
పోటిపడలేక పోతోంది
మనసైన క్షణాలు మనవైనప్పుడు...!!

27.    మారకాలు ఇప్పటివి కాదులే
మనసులు తెలియని
మనుషుల మధ్యన బతుకుతున్నంత కాలమింతే...!!

28.   గ్రాంథికం గ్రంథాలకే
పరిమితమట
వ్యవహారం మనదని...!!

29.   తెలియనితనాన్ని అమాయకత్వమంటే ఎలా
తెలుసన్న మాయలో
పడిన బంధాలను

30.   నిరాసక్తత
చెదిరిన మేఘమయ్యింది
మన మధ్యన ఇమడలేక...!!

18, జులై 2019, గురువారం

వెదుకులాట..!!

చేజారిన క్షణాలను
అక్షరాల్లో వెదుకుతున్నా

మాసిపోయిన జ్ఞాపకాలను
పదిలపర్చుకోవాలని చూస్తున్నా

రాలిపడిన కన్నీళ్ళను
గుప్పెట్లో దాయాలనుకుంటున్నా

కలత చెందిన కలలను
కలవర పడవద్దంటున్నా

గాయపడ్డ గుండెను
గతాన్ని మరవద్దంటున్నా

మౌనమైన మనసును
మాయమై పొమ్మంటున్నా

రెప్పలిప్పని కనులను
రేయి చాటునే దాగిపొమ్మంటున్నా

పలుకరించే భావాలను
పదవిన్యాసం చేయమంటున్నా

వేధించే వెతలను
వారించే జీవనచిత్రమిదేనంటున్నా...!!

గుండెలో నదులు నింపుకొని... సమీక్ష...!!

                                      " నిరంతర సాహితీ సేద్యగాడు రావి రంగారావు గారు "
          ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్జ్ఞాశాలి," సాహితీమిత్రులు " సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రావి రంగారావు సాహిత్య పీఠం ద్వారా ప్రతి సంవత్సరం " జన రంజక కవిత్వ " గ్రంథాలకు పురస్కారాలిస్తున్న నిరంతర సాహితీ వ్యవసాయదారుడు, పద్య, వచన కవి, వ్యాస రచయిత, బాల సాహిత్య సృష్టికర్తగా, ఎన్నో పురస్కారాలు, సన్మానాలు అందుకుంటూ, సాహిత్యంలో పలువురికి గురుతుల్యులుగా నిలిచిన దార్శనికుడు డా. రావి రంగారావు ఈ సాహితీ జనారణ్యంలో అందరికి సుపరిచితులే.
    వీరి కవితా సంపుటి " గుండెలో నదులు నింపుకొని.. " గురించి సంక్షిప్తంగా పరిశీలిస్తే వారిలోని కవిత్వ సేద్యగాడు ఇలా అంటాడు..
 " అక్షరాల్ని మట్టిలో విత్తాను, పంటలుగా మారాయి
అక్షరాల్ని నా గుండెలో ప్రతిష్ఠించుకొన్నాను, నేను మనిషినయ్యాను.. " అంటూ తనదైన వ్యక్తీకరణలో కవిత్వపు విత్తనాలుగా అక్షరాలను సాహిత్యపు పొలంలో నాటుతూ అక్షర భావాల సేద్యాన్ని తాను చేయడమే కాకుండా పలువురితో చేయిస్తూ, తెలుగు సాహిత్యాన్ని, గొప్పదనాన్ని నలుదెసలా చాటుతున్నారు.  వీరి కవిత్వంలో కవి ఎలా ఉండాలి, కవిత్వానికి, అక్షరాలకున్న అవినాభావ సంబంధం, మౌనం, అందం, రాజయాకియలు, సామజిక  సమస్యలు, అహం, బంధాలు, పండుగలు, పబ్బాలు, మనుష్యులు, మనస్తత్వాలు, అభిరుచులు, అందలాలు, కలం చేసే కనికట్టులు,  జీవిత కదనరంగంలో గెలుపోటములు, ప్రయాణాలు, ప్రామాణికాలు, పిల్లల అల్లరి, పెద్దల ఆలోచనలు, హత్యలు, ఆర్భాటాలు, మేఘాలు, నక్షత్రాలు, తెలుగు మీద మమకారము, నల్లధనం ఇలా ఒకటేమిటి మన చుట్టూ ఉన్న ప్రతిదీ కవితా వస్తువే ఈయనకు. కాఫీ పెడుతున్న సూర్యుడు కవితలో
" పగిలిన కొబ్బరిచిప్పల మధ్య నీరులా
రెండు కొండల మధ్య నది.. "  అంటూమొదలుబెట్టి పుట్టుక, చావు మధ్యన జీవితాన్ని, తరువాత చేసే శ్రాద్ధ కర్మలకు సాక్ష్యంగా మిగిలిన సూర్యుడు ఏమి పట్టించుకోకుండా పాలు పొయ్యి మీద పెట్టి కాఫీ తయారు చేసుకుంటూ, తన పని తానూ చేసుకుంటున్నాడు అని ఇటు ఓ మనిషిని, అటు ఆ సూర్య భగవానుడిని పోల్చి చెప్పడం చాలా కొత్తగా ఉంది. ఇలాంటి అభివ్యకిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు.
మరో చోట " దేవుడు నిదురపోతుంటాడు / రైతు మాత్రం ఎల్లప్పుడూ మేలుకొనే ఉంటాడు. అంటారు.
" నది అంటే - భూమి కాగితమ్మీద ఆకాశం కవి రాసే ఓ కమ్మని పద్యం / అది చదువుతున్నాం కాబట్టే ఇంకా మనం బతికే వున్నాం అంటూ కవి మీద తనకున్న ఇష్టాన్ని, సూర్యచంద్రుల పోలికలను, మానవ సంబంధాల విలువలను, నైతిక  సూత్రాలను, కష్టాలను, కన్నీళ్లను ఇలా ప్రతి ఒక్క భావాన్ని సరళంగా, సూటిగా చక్కని అలతి పదాల్లో వాడుక భాషలో వచనాన్ని అందించి చక్కని, చిక్కని వచన కవిత్వంగా ఈ"  గుండెలో నదులు నింపుకొని... " కవితా సంపుటి అందరికి చేరువ కాగలదని భావిస్తూ రావి రంగారావు గారికి హృదయపూర్వక అభినందనలు...

16, జులై 2019, మంగళవారం

అంతిమం...!!

శకలాలన్నీ శరాలుగా మారి
శాపాలై చుట్టేస్తూ
అస్పష్ట విజయంలో
మిగిలిన ఉన్మాదపు
అవశేషాల ఆనవాళ్ళకై
రణభూమిలో రాబందులను
పారద్రోలుతూ వెదుకులాటను
నిర్విరామంగా కొనసాగిస్తూ పోతుంటే
స్మశాన నిశ్శబ్దం చుట్టేసి
వేదనల్లో వైరాగ్యమలుముకుని
అబద్ధానికి కావలి కాస్తున్న
అధికారపు అంధకారానికి
నిజాయితీ నిప్పురవ్వలు
రగిలించిన చితిలో
ఏ హడావిడి లేని
సత్యం నిర్భయంగా నిలిచింది...!!

13, జులై 2019, శనివారం

మ'రణ వాంగ్మూలం...!!

నేను సామాన్యురాలిని. నాకు అనిపించింది నా గోడ మీద, నా బ్లాగులో రాసుకునే అతి సాధారణ సగటు మనిషిని. గత పదేళ్ళుగా నా రాతల గురించి, నా గురించి నేను తెలిసిన అందరికి నేనేంటన్నది తెలుసు. మరి ఎందుకు నన్ను టార్గెట్ చేసారో, ఎవరు చేయిస్తున్నారో తెలియదుగాని ఈ సోషల్ మీడియాలో 7వ తారీకు నుండి నా మీద జరుగుతున్న దాడి ఎలాంటిదో అందరికి తెలిసిందే. వ్యక్తిగత అభిమానం అందరికి ఒకేలా ఉండదు. ఎవరిష్టం వారిది. నేను కుల, మత, ప్రాంతీయత అవహేళనకు వ్యతిరేకం. రాజకీయ పరంగా నేను చాలా వ్యాసాలు ఇంతకు ముందు రాశాను. ఎవరికైనా అనుమానం ఉంటే నా బ్లాగులో చూడవచ్చు. నాకు అడగాలనిపించినప్పుడు తన, మన అని చూడను. అది నా రాతలు చదివిన ఎవరికైనా తెలుసు.

నేను, నా రాతలు తెలియకుండా, నేను ఒక వర్గానికి చెందినదాన్నని, కావాలని నన్ను కొందరు టార్గెట్ చేసి అసభ్యకరంగా, అవమానకరంగా పోస్ట్లు పెట్టించి శునకానందాన్ని పొందుతున్నారు. నాకు అనారోగ్యం ఉన్న మాట వాస్తవం. కానీ దీని మూలంగా, వ్యక్తిగతంగా మరొక వ్యక్తి మూలంగా ఆర్థికంగా నాకు జరిగిన అవమానానికి, నష్టానికిి నేను మందులు వేసుకోవడం మానేసాను. నాకు సరైన న్యాయం జరిగే వరకు మందులు వేసుకోను. కేస్ పెట్టాను. సగటు మనిషికి న్యాయం ఎంత వరకు జరుగుతుందో చూడాలి.  నాకు జరిగిన అవమానం వై సి పి కాంగ్రెస్ సోషల్ మీడియా వల్ల జరిగింది. నాకు ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. ఇవి నా చివరి మాటలు కావచ్చు, కాకపోవచ్చు. ఇవ్వాళ పోతే రేపు రెండు. కాని కారణం మాత్రం ఇది.

చిన్న పిల్లలని కూడా వదలకుండా అసభ్యంగా, అసహ్యంగా పోటోలు పెట్టి అశ్లీల కామెంట్లు పెడుతున్న వెధవలను చూసి వారిని కన్నవారు సిగ్గు పడండి. నైతిక విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయెా చూడండి..యథా రాజా తథా ప్రజా అన్న సామెతకు సాక్ష్యాలుగా మిగిలిపోతున్నామేమెా అన్న చిన్న ఆలోచన వచ్చినా చాలు... ఈ రకమైన దాడులు ఆగుతాయి... కాదంటారా.. మేము సామాన్యులం... సామాజిక న్యాయం ఆకాశంలో చుక్కలు మాకు అనుకొని బతికేస్తాం...!!


11, జులై 2019, గురువారం

ఏక్ తారలు...!!

1.  ఉదయపు అంతరంగమే_రాతిరి కలల్లో నిక్షిప్తమౌతూ...!!

2.   భావాలకు దృడత్వమెక్కువే_వేదనలకు చరమగీతాలు పలకడానికి...!!

3.   మనుష్యులకే రాహిత్యమనుకున్నా_రాతలక్కూడా అని తెలియకముందు..!!

4.   భాషతో పనిలేదు_శోకాన్ని శ్లోకంగా మలిచిన పుణ్యభూమిలో..!!

5.   నిజాయితి నెమ్మదిగానే ఉంటుంది_అబద్ధానికి గొంతెక్కువైనా...!!

6.   భాష్యమై మిగిలిపోతున్నా_అక్షరాల ఆంతర్యాన్నందిస్తూ..!!

7.   తీసుకోవడానికేముంది కొత్తగా_స్వప్నమై చేరువగా నువ్వుంటే..!!

8.   కొలిమి కాలుతూనే ఉంది_సమ్మెట దెబ్బలతో వంకర్లు సరి చేయడానికి...!!

9.   అనునయించేది ఆ అక్షరాలే_మనసుల మాలిన్యాలను కడిగేస్తూ...!!

10.    క్షణాలకెంత స్వార్థమెా_చిటికెలో తనను మాయం చేస్తూ...!!

11.  అపహాస్యపు బతుకులే అవి_అక్షరం విలువెరగక..!!

12.   ఎద ఏకాంతమంతే_జ్ఞాపకాలతో గలాటాలాడేస్తూ...!!

13.   పుట్టుకను మరిచిన జాతది_అమ్మకు ఆలికి తేడా తెలియక..!!

14.   అన్ని ప్రేమలు అంతే_బంధాన్నో బాధ్యతనో గుర్తుచేస్తూ...!!

15.   శరాలు సంధింపబడ్డాయి_ముసుగులు తొలగడమే తరువాయి...!!

16.   అల్లుకున్న ప్రేమలెప్పుడూ ఇంతే_విడదీయరాని పెంకిఘటాలైపోతూ..!!

17.    ఏమరుపాటది మనసుకు_రెప్పల తడి తనదని తెలియక..!!

18.   పరిమళం స్వభావమే అంత_భావాలకు అణుగుణంగా ఒదిగిపోతూ..!!

19.   మందహాసం మాయమవదు_ముగింపు తెలిసినా..!!

20.   అలసటెరుగనివే ఆ అక్షరాలు_నిరంతరం జీవనాదమాలపిస్తూ..!!

21.  తడబాటే అడుగులది_ఏడడుగులదే తీరమెానని..!!

22.   అవకాశం తీసుకుందో అధికారం_వక్రీకర వశీకరణ విద్యను చూపెడుతూ...!!

23.   మమకారమూ ఓ మాయే_నటించే మనుషుల చేతిలోని అక్షరాలకు..!!

24.   మాయక(త)త్వం మనసుదే_అక్షరాన్ని అనుకూలంగా మార్చేసుకుంటూ...!!

25.   భావాలకు అధిక్షేపణలెక్కువే_అక్షరాలకు ఆధిపత్యపు లక్షణాలు లేకున్నా..
!!

26.   మౌనంలోనే మిగులుతుంది మనసు_పరిచయమెా పలకురాయిగా మారినప్పుడు..!!

27.  కొన్ని మనసులు ఇంతే
వ్యధలకు చిరునామాగా వేసారిపోతూ...!!

28.   కాటు వేసే కాలసర్పాలెన్నో_ముఖపుస్తక ఆత్మీయతల మాటున...!!

29.   మౌనానిదెప్పుడూ అగ్రస్థానమే_మనసులని చదివేయడంలో...!!

30.   మౌనానిదో మహోన్నత స్థానం_ఓరిమిలో ధరిత్రిని తలపిస్తూ...!!

4, జులై 2019, గురువారం

ఆగస్టు జీవన మంజూష..!!

నేస్తం, 
    ఈ ప్రపంచంలో కనీసం మరణ వాంగ్మూలానికయినా విలువుందో లేదో తెలియదు. మనమెలాంటి వారమెా మనకు తెలియకపోయినా మనమేంటన్నది మన మరణం నలుగురికి తెలియజెప్తుందట. ఐనా దాని వలన మనకు కొత్తగా ఒరిగేదేం ఉండదు. ఓ నాలుగు మెుసలి కన్నీళ్ళు తప్ప. చనిపోయాక ఎలాంటి వారినయినా మంచోళ్ళని పొగడడం మనకలవాటే కదా అనాది కాలం నుండి. ఆనాటి రావణుడి నుండి ఈనాటి నాయకుల వరకు చనిపోయిన ప్రతోడూ " చుక్కల్లోకెక్కినాడు సక్కనోడే. "  సామాన్యుల చావెలాగు సమాజానికి పట్టదు. డబ్బు, అధికారమున్న వాడి చావు కూడా ఘనమైన కళ్యాణమే. ఆ చావుని కూడా తమ వ్యాపారానికి అనుగుణంగా మార్చుకునే అపర మేధావులే అందరు ఈనాడు. 
    బతికుండగా అయినవాళ్ళ బాగోగులు పట్టించుకోని పెద్దలు పోయాక మాత్రం విందు భోజనాలు, ఖరీదైన కానుకలు పోయిన వారి గుర్తుగా ఇవ్వడం నేటి నాగరికతగా మారిపొయింది. దూరాన ఉన్న  తోబుట్టువులు, బంధువులు ఈనాటి నిత్య వాడకాలైన వాట్సప్ వీడియోల్లో పార్థివ దేహాన్ని చూడటం, నాలుగు కన్నీటిబొట్లు కార్చడం పరిపాటై పోయింది. బతికున్నప్పుడు, బాలేనప్పుడు కనీసం అదే వీడియో కాల్ ఒక్కసారి కూడా చేసిన దాఖలాలుండవు. అయినవారైనా, బయటివారైనా ఎదుటివారు బాధలోనో, కష్టంలోనో ఉన్నప్పుడు ఓ చిన్న పలకరింపు ఎంత భరోసానిస్తుందో తెలుసుకుంటే ఏ అనుబంధమైనా పది కాలాలు పదిలంగా ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ విలువ తెలుస్తుందనుకుంటా చాలా మందికి. అందుకే మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు ఈమాట " తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది " అని. 
       నాగరిక ప్రపంచంలో బతుకుతున్న అనాగరికులమని చెప్పుకోవడానికి మనసు రాకున్నా ఇదే నిజమని మన చుట్టూ ఉన్న ఎందరో డబ్బు జబ్బు మనుష్యులు నిరూపిస్తున్నారు. మన తరం మన తరువాతి తరాలకు అందించాల్సిన సంస్కారాన్ని మనమే లేకుండా చేసుకుంటే, వారికి చెప్పడానికి ఏమి ఉండదు వర్చ్యువల్ ప్రపంచం తప్ప. యాంత్రిక జీవితాలే మిగులుతాయి , యంత్ర సంబంధిత అనుబంధాల మధ్యన. 
బతకడం కోసం ముందుతరాలకు ఆస్తుల్ని మాత్రమే పంచుతున్నారు. వాటితోపాటు కొంచం సంస్కారాన్నీ బలవంతంగానైనా పంచండి. ఎందుకంటే మనకు ప్రాణవాయువునందించే ప్రకృతితో పాటు అదీ కనుమరుగైపోతుంది. రేపటి తరాన్ని బ్రతికించేది ప్రాణవాయువైతే, కనుమరుగైన మన తరాన్ని వారిమధ్యన బతికించేది సంస్కారమే. అహంకారాన్ని అణచే ఆయుధం సంస్కారమే. 

       

హృదయ విపంచి కవితా సంపుటి సమీక్ష..!!

               http://m.gotelugu.com/issue326/8187/telugu-columns/hrudaya-vipanchi-kavita-sameeksha/

  మనసు రాగాల మౌన విపంచి ఈ " హృదయ విపంచి "
          కళలకు పుట్టినిల్లు మా దివిసీమ. ఆ దివిసీమ నుండి వచ్చిన  కవయిత్రి పద్మజ సబ్బినేని. వ్యవసాయమే వృత్తిగా జీవించే స్వచ్ఛమైన రైతు కుటుంబ నేపథ్యం. అతి సాధారణమైన సహజ జీవన విధానం వీరి సొంతం. అతి తక్కువ కాలంలో చక్కని భావ కవిత్వాన్ని అందిపుచ్చుకున్న వారిలో వీరు ఒకరు. అలతి పదాల్లోనే అర్థవంతమైన భావాలు ఒలికిస్తూ ముఖ పుస్తకంలో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు రాయడం మొదలు పెట్టిన అతి కొద్దీ కాలంలోనే. తన భావాలకు తగినట్టుగా చక్కని పేరు " హృదయ విపంచి " కవితా సంపుటిని వెలువరించి అందరి అభిమానాన్ని అందుకున్నారు.
       తన కవిత్వాన్ని భగవంతునికి కృతజ్ఞతలతో మొదలుపెట్టి స్త్రీ పరిపూర్ణత్వాన్ని, నిత్య వసంతాల మూగ భాషను, వెన్నెల గోదారిని, తన గమ్యాన్ని తెలుపుతూ హృదయాలాపనను హృదయ విపంచిగా వినిపిస్తూ, నిర్జీవాన్ని, జీవిత సత్యాన్ని, భరోసా కావాలన్న ఎద ఘోషను, జీవన గమనంలో వెన్నెలాకాశం మీద సంతకాలను, జవాబు లేని ప్రశ్నలను, కన్నీటి జ్ఞాపకాలను, నిరీక్షణను, ప్రేమను, వివక్షను, చెలిమిని, బాల్యాన్ని, నిజాల ఇజాలను, చేజారిన క్షణాలను, పరవశాన్ని, ఆధిపత్యాన్ని, స్త్రీ శక్తిని, బంధాలను, అనుబంధాలను, ఆశలను, ఆశయాలను, ఒంటరితనాన్ని, ఆరాధనను, పెళ్ళిని, బాధ్యతలను, మౌనాన్ని, మనసును, సమ్మోహన పరిచే ప్రకృతి అందాలను, చిరుజల్లులను, హరివిల్లును ఇలా ప్రతి భావాన్ని చాలా నిజాయితీగా ఏ హంగులు, ఆర్భాటాలు లేకుండా తన కవితల్లో అందించారు. నాన్న గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు నాన్నను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. కలలను తల్చుకుంటూ, అతిథులను అలరిస్తూ, తస్మాత్ జాగ్రత్త అంటూ మనకు హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. బంధం గురించి రాసిన ఓ కవిత తనకి తెలియకుండానే మొదటి వాక్యంలోని చివరి పదంతో రెండో వాక్యం మొదలుబెట్టడం. భావ కవితలే కాకుండా లఘు కవితలు కూడా ఈ కవితా సంపుటిలో చోటు చేసుకున్నాయి. అందమైన భావాలను ఇలా అందమైన " హృదయ విపంచి" గా మన ముందు ఆవిష్కరించడం అభినందించదగ్గ విషయం.
         ఈ కవితా సంపుటిలో జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు కనిపించాయి. ఓ సున్నితమైన మనసుకు చేరిన స్పందనల భావాలకు అక్షర రూపమే "హృదయ విపంచి." ప్రేమ, ఆరాధన, నిరీక్షణ, బాల్యం, వెనకబాటుతనం, పల్లె జీవితాలు, జ్ఞాపకాలు, గాయాలు, గతాలు, గుండె చప్పుళ్ళు, కలలు, కన్నీళ్లు, కోపం, ఆవేశం, సమాజంలో స్త్రీ పట్ల వివక్ష పై తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రశ్నించడం ఇలా అన్ని భావోద్వేగాలు సమపాళ్లలో కనిపిస్తాయి.
    వరం అన్న కవితలో 
" ఏ జ్ఞాపకాలు నిన్ను కలతపెట్టాయో 
ఆ జ్ఞాపకాలను తీసెయ్యలేను కానీ,
నా కనుపాపలలో నిను దాచుకుని 
నీ మనసు కలత చెందకుండా 
చూసుకుంటా..
నీవు నమ్మగలిగితే జీవితకాలం 
నీ మనసుకి ఊరటనిచ్ఛే 
నీ పేదలంపై చిరునవ్వునవుతా 
మరి ఆ వరం నాకిస్తావా నేస్తం...!!" 
ఎన్నో ఆశలతో చెంత చేరితే తనకు లభించిన నిర్లక్ష్యపు బహుమానాన్ని స్వీకరించి కూడా ఇంత ఆర్తిగా అడిగిన వరం ఎంత అద్భుతంగా అనిపించిందో..!!
నిశ్శబ్దాన్ని శబ్దం చేయిస్తూ అక్షరబద్దం చేయడం, స్నేహాన్ని, సవ్వడిని, ప్రేమ తత్వాన్ని, ఆలంబనను, అనురాగాన్ని, ఆశలను, ఆశయాలను, అహాలను, అనుభవాలను ఇలా జీవితంలో ప్రతి చిన్న భావనను మనసుతో చూడటం, దానిని ఓ చక్కని అక్షర భావనగా అందించాలన్న తపన ప్రతి కవితలోనూ కనిపిస్తుంది.  ప్రతి ఒక్కరి స్పందించే మనసు మౌనం ఈ అక్షరాల్లో మనకు దర్శనమిస్తుందనడానికి ఎట్టి సందేహం లేదు. 
      హృద్యమైన భావాలను అక్షరీకరించిన పద్మజ సబ్బినేని గారు అభినందనీయులు. పద్మజ సబ్బినేని మరిన్ని అందమైన భావ కవితలతో మరిన్ని కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో వెలువరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనల శుభాకాంక్షలు. 

2, జులై 2019, మంగళవారం

బతికిలేరా...!!

ఏదైనా సరే రెండు ముక్కలు రాయడమాలశ్యం. అప్పుడలా జరిగింది. మీ అవేర్నెస్ ఏమైంది, అని అది ఇది వాగుతున్నారు. మీరంతా అప్పుడు బతికే ఉన్నారుగా. కళ్ళు లేని గుడ్డివాళ్ళు కాదుగా. నోరు లేని మూగవాళ్ళు కాదుగా. మీ గోడల మీద మీరు లక్షా తొంభై రాసుకుంటున్నారు. నేనేమైనా అన్నానా లేదా మీ పోస్ట్ లకు వ్యతిరేక కామెంట్లు పెట్టానా. లేదా అప్పుడెందుకు రాయలేదన్నానా. నేను చూసినప్పుడు నాకనిపించింది, రాయాలనిపించింది రాస్తాను. మీ పేను కొరుకుడు పెత్తనాలు మీరు చూసుకోండి, నా దగ్గర కాదు. 

నా రాతల గురించి కాదు మీ ఏడుపు మీరేడవండి...

1, జులై 2019, సోమవారం

ఏటైపోతారో...!!

సమస్త పెజానీకానికి,
      ఈమధ్య అన్నదమ్ముళ్ళందరికి కాస్త ఎటకారాలెక్కువయ్యాయి. మన గోడ మీద మనం పోస్ట్లెట్టుకున్నప్పుడు లేదేటి. మనం  ఒకటంటే ఎదుటోడు 100 అంటాడు. ఎవరి లెక్కలెవరికి తెలియదు కనుక. మీ గోడల మీద మీర్రాసుకున్నప్పుడు నేనేమయినా మీ అభిప్రాయాన్ని తప్పుబట్టానా... లేదే. నా రాతలు నా గోడ మీద రాసుకుంటే మరెందుకంత బాధ. పోని నేనేమయినా చాటభారతాల తిట్లేమయినా తిట్టానా. అయ్యెారామ మీరు పదే పదే నొక్కి వక్కాణించిన మాటని...రెండు ముక్కల్లో అడిగితేనే తట్టుకోలేక పోతున్నారు.

" అవినీతి రహిత ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడే పాస్పోర్ట్ ఎంక్వైరికి వచ్చిన పోలీసాయనకు ఇచ్చిన అక్షరాలా 500 రూపాయలు. "

ఈ మాట రాసినందుకే ఎన్ని బిరుదులో నాకు... నా బాధో, సంతోషమెా నేను రాసుకున్నాను.  మీకు ఆ స్వేచ్ఛ ఉందిగా... మీ గోడ మీద రాసుకోండి. అంతేకాని అప్పుడిలా జరిగింది మీరెందుకు రాయలేదు,  మీకు కులగజ్జి అదీ ఇది అని అనడంలోనే మీరెంత సంస్కారవంతులో తెలుస్తోంది. పోస్ట్ కు సంబంధించిన స్పందనలు కాకుండా మీ ఏడుపు వెళ్ళగక్కడానికి నా గోడ వాడుకోవద్దు. మీ గోడల మీద మీ ఏడుపు ఏడవండి. నాగురించి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాగితే...మర్యాదగా ఉండదు.

ఎటకారమంటూ మెుదలెడితే అసలు మూలమెలా ఉంటుందో చూపిస్తాను. పేర్ల పక్కన టాగ్ లు తగిలించుకుని ఎదుటివాళ్ళకి అదుందని, ఇదుందని అంటగడితే మనమే నవ్వులపాలైపోతాం. 

నా రాతలు నచ్చని వారందరూ నిరభ్యంతరముగా వెళ్ళిపోవచ్చు...

ఏంటో రెండు ముక్కలు రాస్తేనే తట్టుకోలేనోళ్ళు...అసలు మూలాలుగా నుండి మెుదలెడితే ఏమైపోతారో ఏంటో.. 😊

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner