8, నవంబర్ 2025, శనివారం

జీవన మంజూష నవంబరు25


 నేస్తం,

         రోజు ఎలా వుంటుందో మనకు తెలియదు. అంతెందుకు క్షణాలను కూడా మనం లెక్క కట్టలేము. క్షణం ఇలా వుంది, మరుక్షణం ఎలా వుండబోతోందో తెలియని మన జీవితాలకు ప్రతిది ప్రశ్నార్థకమే! పరుగెత్తి పోతున్న కాలంలో కనుమరుగౌతున్న గతాలు, జ్ఞాపకాలు బోలెడు. గతమే లేని కొన్ని జీవితాలకు జ్ఞాపకాలు గురుతే లేవన్నది పచ్చి నిజం. ఇది డిజిటల్ యుగమని మనం కూడా డిజిటలైజ్ అయిపోతున్నామని సంబరపడదాం.

         కొన్ని పరిస్థితులు మనిషిలో మార్పుకు దోహదపడతాయి అనుకోవడం సహజమే, కాని మార్పు కూడా నటనే అయిపోతోందిప్పుడు. అవసరాలకు అనువుగా మనిషి ఊసరవెల్లిలా మారడం చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది ఇప్పుడు. మనిషి మాటల్లో, చేతల్లో, నడవడిలో ఎక్కడ, ఎలా చూసినా సహజత్వం లోపించి కృత్రిమత్వమే సహజ లక్షణం అయిపోయింది. మనిషి మేధస్సు గగనాన్ని దాటేస్తోందని సంతోషపడాలేమో

            మనం చెప్పేదే అందరు వినాలి, మనకు చెప్పేంత స్థాయి మరొకరికి లేదు అని మనం అనుకోవడం మన అహంభావం. అందరు అన్ని విషయాల్లోనూ తెలివిగా వుండలేరు, అలాగని తెలివితక్కువ వారు కాదు. ప్రతివొక్కరిలో అంతర్లీనంగా ఏదోక ప్రతిభ దాగునే వుంటుంది. సమయాన్ని, పరిస్థితులను బట్టి అది వెలుగులోనికి వస్తుంది. పదవో, అధికారమో, పేరు, ప్రతిష్టలో ఇలా నలుగురికి తెలిసే సందర్భాలు వచ్చాయని మనమేదో మహా మేధావులమని మనమనుకుంటే సరిపోతుందా! కాలం కలిసొస్తే దరిద్రుడు కూడా కుబేరుడైపోడూ!

             జీవితంలో మనం చెప్పాల్సినవి కొన్నుంటే, మనం వినాల్సినవి కూడా కొన్నుంటాయి. బతకడానికి, జీవించడానికి చాలా తేడా వుంటుంది. మనకేంటి మన దగ్గర చాలా డబ్బుంది. మనం చాలా రిచ్(గొప్ప)గా బతికేస్తున్నామని చాలామంది సంబరపడిపోతారు. వీళ్ళలో కొందరు ఎంగిలిచేత్తో కాకిని కూడా విదిలించరు. పూట తిండి గడవడానికి కష్టంగా వున్నవారు, తమకున్నదాంట్లోనే తమ చుట్టూ వున్న ప్రాణికోటికి కూడా ఆకలి తీరుస్తారు. మీరే ఆలోచించండి వీరిద్దరిలో ఎవరు బాగా బతుకుతున్నట్టు?

              బంధం అనుబంధంగా మారడానికి, ఆత్మీయంగా అల్లుకుపోవడానికి మనమే కారణం. మన అవసరాలకు బంధాలను తారుమారు చేస్తూ, అనుబంధాలకు ఆత్మీయత తేనెలు పైపైన పూస్తూ ఎన్ని రోజులు మన నటనను కొనసాగించగలం చెప్పండి? అందరం రోజు అటూఇటూగా పోయేవాళ్ళమే కదా, కనీసం కాస్తయినా నిజాయితీగా మనతో మనమయినా వుండాలి కదా! దూరాన్ని దూరం చేయడం మానేసి, దూరాన్నే దగ్గరతనం అనుకుంటూ బతికేయడం మన సహజగుణమై పోయింది. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందన్నన్యూటన్ మూడవ సూత్రాన్నిమరిస్తే ఎలా! రెండిళ్ళ మధ్య దూరం ఒకటే కదా! సరైన దారి ఎంచుకోవడంలోనే విజ్ఞత, వివేకం బయటపడతాయి. మనిషిగా పుట్టినందుకు కాస్తయినా మానవత్వంతో బతుకుదాం..!




            

27, అక్టోబర్ 2025, సోమవారం

అమ్మ..!!


అమ్మ దాచిన తాయిలం

కొంగుముడిలో


మనం చూడలేని

అమ్మతనం అనుభవ’మది..!!

రెక్కలు

 1.  సారాయో

గంజాయో

ఎవడి యాపారం

వాడిది


ప్రపంచాన్ని 

ఆక్రమించేయడమే..!!

2.  వెలుతురు

చూడలేని వాస్తవాలు

చీకటి చుట్టాలై

బతికేస్తూ


ఆశల

విహంగాలు..!!

3.  అహం

అదిలిస్తుంది

ఆప్యాయత

అక్కున చేర్చుకుంటుంది


ఏదైనా 

బంధమే మరి..!!

4.  మనం

గుర్తుంచుకోవడం

మనల్ని

గుర్తించడం


తేడా తెలుసుకుని

మసలుకోవాలి..!!

24, అక్టోబర్ 2025, శుక్రవారం

కాల ప్రవాహంలో..!!


నేను నేనుగా

వున్నాను 

గతంలో


నన్ను నేను

కోల్పోయాను

వాస్తవంలో


రెండు కాలాలను

మోసుకుంటూ

నేనెవరో వర్తమానంలో..!!

8, అక్టోబర్ 2025, బుధవారం

ముదిర సమీక్ష


రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి సరికొత్త కవితా సంపుటి ముదిర గురించి నాలుగు మాటలు..!!


     తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగుభాష మీద మక్కువతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన, చేస్తున్న ప్రముఖ తెలుగుభాషా పరిశోధకురాలు, కథ, కవిత, నవల, లేఖా సాహిత్యం వంటి ఎన్నో తెలుగు సాహితీ ప్రక్రియలలో నిష్ణాతురాలు, తెలుగు గజల్ చరిత్రలో తనకంటూ సముచితమైన స్థానాన్నిసంపాదించుకుని, ఎన్నో పురస్కారాలు, పలు ప్రపంచరికార్డులను సొంతం చేసుకున్న ప్రముఖవ్యక్తిరాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మరో కొత్త పుస్తకంముదిరకు  హృదయపూర్వక శుభాభినందనలు.


       సృష్టికి మూలం స్త్రీ. అనాది నుండి ఈనాటి ఆధునిక యుగం వరకు స్త్రీ మనోభావాల గురించి ఎవరెన్ని చెప్పినా సమగ్రంగా స్త్రీమూర్తిని ఎవరూ ఆవిష్కరించలేదనే చెప్పాలి. ప్రయత్నంలోనే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు తనకున్న తెలుగుభాషా పటిమను ఉపయోగించి అచ్చంగా ముదిత మనోభావాలనే పలుకోణాల్లో ఆవిష్కరించే ప్రయత్నంముదిరకవితా సంపుటిలో చేసారు.


       ముదిరకవితా సంపుటిలో కొన్ని ఇలా నామాటల్లో మీ అందరి ముందుకు..

నాకంటూ ఎవరు లేకున్నా ప్రకృతి నాతో సహకరించినా, సహకరించకున్నా ప్రకృతిని నాలో ఇముడ్చుకుని స్నేహం కోసం, నాకంటూ చిరు గుర్తింపు కోసంనేనిక్కడే ఉన్నాఅంటూ మగువ మనసు సున్నితత్వాన్ని అందంగా కవితలో చెప్పారు

మౌనం విలువ కాలం విలువ తెలిసేది ఒక్క ప్రేమికులకేనేమో..అనుభూతులను ప్రేమించే వారికేనేమో..అక్షరాలను, అనుభూతులను అందంగా మలచే కవికేనేమో..” అని చక్కని భావుకత్వాన్నినీవు నాతో ఉన్నప్పుడు జీవితం రస ప్రవాహమౌతుంది అని చీకటి వెలుగుల జీవితాన్ని చిక్కని కవితగా చెప్పారు.

అక్షరాలను, పదాలను స్పర్శించే చూపులకు అక్షరాల, పదాల ఆత్మ అవగతమౌతుంది అనిఐనాకవితలో అతివ అంతరంగ కల్లోలాన్ని విప్పి చెప్పారు

 మరో కవితరాత్రి నిశ్శబ్దంలోఅనామికగా ఏకాంతమై ఏకాంతగా రాత్రి నిశ్శబ్దంలో వేలాడుతూ..మిగిలిన ఒంటరితనపు ఊసులను చెప్పారు.

నేనోకవిత నా గురించి ఎవరికి ఏం తెలుసు అన్న ప్రశ్నను సంధిస్తూ తనేంటో చెప్పడం చాలా బావుంది.


     చీకటి, వెలుగు, ప్రకృతి, ప్రేమ, వేదన, సంవేదన, ఒంటరితనం, కోపం, శాంతం, ఓర్పు..ఇలా ఒకటనేమిటి సమస్త ప్రకృతిని తనలోని భావాలకు ఆపాదించి భాషాపరమైన వాడుకలో మరిచిన చాలా పదాలను తన కవితలో జొప్పించి, పదుగురిని మెప్పించగల నేర్పు, నైపుణ్యం రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన విద్య. తనదైన ప్రత్యేక శైలితోముదిరను ముగ్ధవంతంగా తీర్చిదిద్దారు. వారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు.


 https://www.facebook.com/share/v/1PZ9LSumvs/?mibextid=wwXIfr

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner