నేస్తం,
ఏ బంధమయినా దృఢంగా వుండాలంటే, ఈ రోజుల్లో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం కాదు. మనిషి తన జీవితంలో కోల్పోయింది, కోల్పోతున్నది ఈ నమ్మకాన్నే. అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెడుతున్న రోజులు కదా! అందుకే ఏ తనాన్నయినా అమ్మడానికి సిద్ధంగా వున్నారు ఈనాటి మనుష్యులు. అలాగే అమ్మేవారుంటే కొనేవారికేం కొదవ అన్నట్టుంది మన సమాజం కూడా. సమాజమేముంది ప్రపంచమే అలా మారిపోయింది. మనిషి ఆలోచనలు వింత పోకడలు పోతుంటే దానికి తగినట్లుగానే మనిషి మేధావితనమూ సహకరిస్తోంది. కాని మనిషిగా మనమేం కోల్పోతున్నామో మనకే తెలియనంతగా ఆధునికీకరణ మాయలో పడిపోయాం.
మనం సంతోషాన్ని పంచుకోవడానికి మన తాహత్తుకు తగ్గ వారిని అతిథులుగా ఆహ్వానించడం మన సంస్కారంగా చూపించుకుంటున్నాము. అయినవారు, ఆత్మీయులు మనకు, మన హోదాకు తగ్గవారే అవుతున్నారు ఆ సమయంలో. అదే మనకు ఆపదో, కష్టమో వచ్చినప్పుడు ఈ తాహత్తు గుర్తురాదు. ఎందుకంటే ఆ సంస్కారులు ముఖం చాటేస్తారు కనుక. ఆ సమయంలో మనకు మనలో మరుగున పడిపోయిన ఎక్కడెక్కడి చుట్టరికాలు, రక్త సంబంధాలు భలే గుర్తొస్తాయంటే నమ్మండి. దూరాన్ని మనమే పెంచి పోషించి ఇలాంటి అవసర సమయాల్లో దగ్గరతనం దగ్గరగా రావాలని కోరుకోవడం సమంజసం కాదు కదా. మనం ఇచ్చిందే మనకి తిరిగి వస్తుంది. ఈ విషయం అందరం గుర్తు పెట్టుకోవాలి.
మనలో చాలామందిలో ఈర్ష్య, అసూయలు ఎంత బలంగా నాటుపోయాయో చూస్తుంటే నిజంగా మనం మానవ సంబంధాల గురించి గొప్పగా చెప్పుకునే సమాజంలోనే బ్రతుకుతున్నామా అని ఒకింత అయోమయంలో వున్నట్టుగా అనిపిస్తోంది. మన గొప్పలు చెప్పుకోవడానికి ఇతరులను హీనం చేసి చూపనక్కర్లేదు కదా! అది మనకు మంచి చేస్తుంది అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి వుండదు. ఏదోక గొప్పదనం అందరిలో వుంటుంది. గుర్తించే గొప్ప మనసు మాత్రం కొందరికే వుంటుంది. ఆ కొందరిలో మనమున్నామా లేదా అన్నది మన మనసుకు తెలియాలి.
కీర్తిశేషులయ్యాక కీర్తించడం మనకు పరిపాటి అయిపోయింది. ఈ మాట అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే. “పోయినోళ్ళందరు మంచోళ్ళూ కాదు, అలా అని బతికున్నోళ్ళందరూ పాపులు కాదు”. మనిషి చనిపోయాక కాని మనకు ఆ మనిషి గొప్పదనం తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి చేసిన విలువైన పనులకు ఆ వ్యక్తి సేవలను గుర్తించి వారు జీవించి వున్నప్పుడే వారికి తగిన గుర్తింపు ఇస్తే, అది మనం వారికి ఇచ్చే గౌరవం అవుతుంది. ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే తర్వాత ఇతరుల సంస్కారం గురించి మాటలు, రాతలు వంటివి చేయవచ్చు.
నూరు పుస్తకాల “నవ మల్లెతీగ”తో నా అనుబంధం కూడా దాదాపుగా “నూరు పుస్తకాల నవ మల్లెతీగ పదిహేను పుస్తకాల నా అక్షర ప్రయాణం” వెరసి లెక్కకు మూడు శీర్షికలకు తక్కువగా. నూరు “జీవన మంజూష” లతో నా పయనం నవ మల్లెతీగతో కొనసాగుతోంది. నెల నెలా నవ మల్లెతీగ నిత్య నూతనంగా రూపుదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ, అవసరమైతే పుస్తకం కోసం “దొంగని” కూడా అవుతానన్న “కలిమిశ్రీ” గారి సాహితీ తపస్సుకు ఏ విఘ్నాలు కలగకుండా “నవ మల్లెతీగ” సాహితీ మిత్రుల చేతుల్లో కలకాలం కళకళలాడాలని కోరుకుంటూ..నూరవ పత్రికకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

