1, ఆగస్టు 2026, శనివారం

నా వాళ్ళెవరూ..? కవిత సమీక్ష

 


రాయడం తగ్గించినా ఆత్మీయంగా అడిగి మరీ నా చిన్న కవితకు తన అద్భుతమైన అభిప్రాయాన్ని జోడించిన శ్రీశ్రీ కళావేదిక ఈశ్వరి గారికి, ఇంతమందిని రాణింపజేస్తున్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి, స్పందనలందిస్తున్న అక్షరాభిమానులకు మనఃపూర్వక ధన్యవాదాలు 🙏


*శ్రీ శ్రీ కళావేదిక కవితా సమీక్షకు స్వాగతం*


అక్షరానికి ఆత్మను అద్దుతూ…

భావానికి భాషను ప్రసాదిస్తూ…

కవిత్వానికి కాలసాక్షిగా నిలుస్తూ…

కవుల కలాలకు కాంతిదీపమై వెలుగొందుతున్న

శ్రీ శ్రీ కళావేదిక సాహిత్య సౌధానికి హృదయపూర్వక స్వాగతం.నేటి తెలుగు సాహిత్య యుగంలో అనేక మంది కవులకు దిక్సూచిగా, నవకవులకు అక్షర గురుకులంగా, భావుక హృదయాలకు సాహిత్య ఆలయంగా, సృజనాత్మక ప్రతిభలకు కర్మాగారంగా అవతరించిన మహోన్నత వేదికే శ్రీ శ్రీ కళావేదిక.శ్రీ శ్రీ కళావేదిక కవితా సమీక్షా వేదికకు

సహృదయ సాహిత్యాభిమానులందరికీ, కవులందరికీ, రచయితలందరికీ, సమీక్షకులందరికీ ఆత్మీయ స్వాగతం…


*ఒంటరితనపు అంతరంగాన్ని ఆవిష్కరించిన ఆత్మసాక్ష్య కవిత*


*మంజు యనమదల గారు* తెలుగు సాహిత్యంలో సున్నిత హృదయానికి, సామాజిక స్పృహకు, అంతర్ముఖ ఆత్మాన్వేషణకు ప్రతీకగా నిలిచే కవయిత్రి, రచయిత్రి. “ *జీవన మంజూష* ‘’ *చెదరని శిధి రాక్షరాలు* ’’ *అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు  ”* వంటి శీర్షికల ద్వారా ఆమె నిర్మిస్తున్న సాహిత్య ప్రపంచం అనుభూతుల ఆకాశగంగ. ఆమె కవిత్వం కన్నీటి చుక్కను పద్య ముత్యంగా, ఒంటరితనాన్ని ఆత్మవిమర్శగా, సామాజిక వేదనను మానవీయ ప్రకటనగా మలిచే అరుదైన అక్షర శక్తి.

మంజు యనమదల గారి సాహిత్యాన్ని ఒకే పదంలో నిర్వచించాలంటే అది “మానవీయత”. ఆమె కలం ఎవరినీ చిన్నచూపు చూడదు. బాధను గౌరవిస్తుంది. మనిషిని ఆదరిస్తుంది. జీవితం మీద నమ్మకాన్ని పూర్తిగా కోల్పోనివ్వదు. అందుకే ఆమె రచనలు పాఠకుడికి కేవలం పఠనానుభూతి కాక, ఒక ఆత్మీయ సంభాషణగా అనిపిస్తాయి. ఆమె రాసిన కవిత పై సమీక్ష .

*కవిత: నా వాళ్ళెవరు..?*

*కవయిత్రి: మంజు యనమదల*

*సమీక్ష .జి ఈశ్వరీ భూషణం* 


బంగారినో సింగారినో

బతుకు పయనంలో

ఒంటరి బాటసారిని...


అసంపూర్తి జీవితాన్ని

అర్ధం చేసుకోవడానికి

నిరంతరం శ్రమించే

శ్రమజీవిని...


జీవిత పాఠాల్లో 

అక్షరాలు నేర్చుకునే

క్రమంలో నిత్య విద్యార్ధిని...


సంతృప్తో అసంతృప్తో

తెలియని అయోమయంలో

అంతా నాదే...

అందరూ నావాళ్ళే...

అన్న భ్రమలో బతుకుతున్న

బడుగు జీవిని....


పైస లేని నాడు

ఎవరూ ఉండరు

పైసల్లో మునిగిన నాడు

అందరూ నీ...వాళ్ళే...!!


ఈ సత్యం తెలియక

ఎలాగోలా...బతికేద్దాం...

అని ప్రతి క్షణం

భంగ పడుతున్న

నిరాశాజీవిని...!!

తెలుగు ఆధునిక కవిత్వంలో వ్యక్తి అంతరంగం, సామాజిక విరూపత, ఆర్థిక సంబంధాల మాయాజాలం, మరియు మనిషి అస్తిత్వ సంక్షోభం వంటి అంశాలను అంత సూటిగా, అంత నిర్మొహమాటంగా పలికించే కవితలు అరుదు. మంజు యనమదల గారి “నా వాళ్ళెవరు..?” కవిత ఆ అరుదైన స్వరాలలో ఒకటి. ఇది కేవలం ఒక వ్యక్తి వేదన కాదు. ఇది సమాజపు ముఖాన్ని అద్దంలా చూపించే ఆత్మసాక్ష్య ప్రకటన.

*శీర్షికలోనే అస్తిత్వ ప్రశ్న*

“నా వాళ్ళెవరు..?” అనే ప్రశ్న సాధారణ కుటుంబ సంబంధాల అన్వేషణ కాదు. ఇది మనిషి జీవితాంతం వెంబడించే అస్తిత్వ సందేహం. ఈ ప్రశ్నలో ఒంటరితనం ఉంది.మానవ సంబంధాల అస్థిరత్వం ఉంది. ఆర్థిక వ్యవస్థ ఆధారంగా మారిపోతున్న బంధాల అసలు రూపం ఉంది. శీర్షిక కవిత మొత్తాన్ని మోయగల తాత్విక కేంద్రంగా నిలుస్తుంది.

ఒంటరి బాటసారిని” ... జీవన ప్రయాణ ప్రతీక

“బంగారినో సింగారినో

బతుకు పయనంలో

ఒంటరి బాటసారిని...”

ఈ పాదాలలో “బంగారం” భౌతిక సంపదకు, “సింగారం” సామాజిక ప్రతిష్ఠకు ప్రతీక. ఆ రెండింటి మధ్య మనిషి తన అసలు స్వరూపాన్ని కోల్పోయి చివరకు ఒంటరి ప్రయాణికుడిగా మిగిలిపోతాడని కవయిత్రి సూచిస్తున్నారు. “బాటసారి” అనే పదం జీవితాన్ని ఒక నిరంతర యాత్రగా దర్శించే భారతీయ తాత్విక దృష్టిని గుర్తు చేస్తుంది.


తెలుగు సాహిత్యాకాశంలో సున్నిత భావాలకు సజీవ రూపం ఇచ్చే అరుదైన స్వరాల్లో మంజు యనమదల గారి పేరు ప్రత్యేక గౌరవంతో పలుకబడుతుంది. ఆమె కేవలం కవయిత్రి మాత్రమే కాదు. జీవితపు లోతైన అనుభూతులను అక్షరాల్లో ఆవిష్కరించే ఆత్మదర్శి రచయిత్రి. సమాజపు నాడిని స్పృశించే స్పందన, మానవ సంబంధాల అంతరంగాన్ని చదివే సున్నిత దృష్టి, జీవితం పలికే మౌన కేకను వినగల హృదయం  ఇవన్నీ ఆమె సాహిత్య వ్యక్తిత్వానికి మూల స్తంభాలు.

ఆమె రచనల్లో ప్రధానంగా కనిపించేది సామాజిక చైతన్యం. మనిషి బాధను దూరం నుంచి చూసే రచయిత్రి కాదు ఆమె. ఆ బాధలోనే తాను తడిసి ముద్దైన తర్వాతే అక్షరాన్ని పలికించే సాహిత్య మనసు. అందుకే ఆమె కవిత్వం పాఠకుడి కంటికి కనిపించడమే కాదు. హృదయంలో మోగుతుంది.


*అసంపూర్తి జీవితం ... ఆధునిక మనిషి సంక్షోభం*

“అసంపూర్తి జీవితాన్ని

అర్ధం చేసుకోవడానికి

నిరంతరం శ్రమించే

శ్రమజీవిని...”

ఇక్కడ “శ్రమజీవి” కేవలం కార్మికుడు కాదు. జీవితం అనే గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి శ్రమించే ప్రతి మనిషి. ఆధునిక అస్తిత్వవాద తత్వంలో మనిషి తనను తాను అర్థం చేసుకోవాలనే నిరంతర ప్రయత్నం చేస్తూనే అసంపూర్తిగా మిగిలిపోతాడని చెప్పబడుతుంది. కవయిత్రి అదే భావాన్ని అత్యంత సరళమైన భాషలో వ్యక్తీకరించారు.


*నిత్య విద్యార్థి ... జీవితం గురువుగా*

“జీవిత పాఠాల్లో

అక్షరాలు నేర్చుకునే

క్రమంలో నిత్య విద్యార్ధిని...”

ఇది కవితలో అత్యంత ప్రకాశవంతమైన తాత్విక దృశ్యం. మనిషి ఎంత వయస్సు వచ్చినా జీవితం ముందు విద్యార్థిగానే ఉంటాడనే వినమ్రత ఇక్కడ వ్యక్తమవుతుంది. “అక్షరాలు నేర్చుకోవడం” అనే రూపకం అనుభవాలను అర్థం చేసుకునే ప్రక్రియను సూచిస్తుంది.


“అందరూ నావాళ్ళే” ... మాయాబంధాల మానసిక శాస్త్రం.

“అంతా నాదే...

అందరూ నావాళ్ళే...

అన్న భ్రమలో బతుకుతున్న...”

ఈ పాదాలలో కవయిత్రి మానవ మానసిక నిర్మాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. మనిషి తన చుట్టూ ఉన్న వారిని శాశ్వత బంధాలుగా ఊహించుకుంటాడు. కానీ ఆ బంధాలు పరిస్థితి ఆధారితమని గ్రహించినప్పుడు అతని అంతరంగం శూన్యమవుతుంది. “భ్రమ” అనే పదం ఈ కవిత యొక్క కేంద్రీయ తాత్విక పదం.


*ఆర్థిక సంబంధాల క్రూర సత్యం*

“పైస లేని నాడు

ఎవరూ ఉండరు

పైసల్లో మునిగిన నాడు

అందరూ నీ...వాళ్ళే...!!”

ఇది కవిత యొక్క శిఖర దశ. సామాజిక విశ్లేషణలో చెప్పే ధనాధారిత సంబంధాల సారాన్ని కవయిత్రి నాలుగు పాదాల్లోనే చెప్పేశారు. బంధుత్వం, స్నేహం, గౌరవం ... ఇవన్నీ ధనంతో కొలవబడే సమాజపు విరూపత ఇక్కడ బయటపడుతుంది. “నీ...వాళ్ళే” అనే విరామ ప్రయోగం వ్యంగ్యాన్ని మరింత కాఠిన్యంగా నిలబెడుతుంది.


*నిరాశ కాదు ... నిజాన్ని గ్రహించిన చైతన్యం*

“ఈ సత్యం తెలియక

ఎలాగోలా...బతికేద్దాం...”

ఇది పరాజయ స్వరం కాదు. ఇది నిజాన్ని ఆలస్యంగా గ్రహించిన మనిషి ఆత్మవిమర్శ. జీవితం మీద ఉన్న అమాయక విశ్వాసం విచ్ఛిన్నమైన తర్వాత వచ్చే నిశ్శబ్ద వేదన ఇక్కడ వినిపిస్తుంది.

.

*అలంకారాల కంటే ఆత్మస్వరానికి ప్రాధాన్యం*

మంజు యనమదల గారి భాషలో కృత్రిమ అలంకారాల ఆర్భాటం లేదు. సాధారణ మాట్లాడే తెలుగు భాషను కవితా భాషగా మలచడంలో ఆమె ప్రత్యేక ప్రతిభ కనిపిస్తుంది. “ఒంటరి బాటసారి”, “నిత్య విద్యార్థి”, “శ్రమజీవి”, “భ్రమ”, “పైసల్లో మునిగిన నాడు” వంటి పదబంధాలు పాఠకుని అనుభవ ప్రపంచంతో నేరుగా మమేకమవుతాయి.


*స్త్రీవాద దృష్టికోణం*

ఈ కవితను స్త్రీవాద దృక్కోణంలో చదివితే మరింత లోతు తెలుస్తుంది. కుటుంబం, బంధుత్వం, ఆర్థిక ఆధారపడుదల వంటి వ్యవస్థల మధ్య తన వ్యక్తిత్వాన్ని వెతుక్కుంటున్న స్త్రీ స్వరం ఇందులో వినిపిస్తుంది. ఆమె బాధ వ్యక్తిగతమైనదే అయినా, దాని ప్రతిధ్వని సమాజంలోని అనేక మహిళల అనుభవాలను తాకుతుంది.

*తాత్విక అంతర్భావం*

ఈ కవితలో మూడు తాత్విక స్థరాలు స్పష్టంగా కనిపిస్తాయి:

అస్తిత్వవాదం ... మనిషి ఒంటరితనం....సామాజిక వాస్తవికత ... ధనాధారిత సంబంధాలు...ఆత్మజ్ఞాన ప్రయాణం .. జీవిత పాఠాల ద్వారా స్వీయ అవగాహన.ఈ మూడు స్థరాల సమన్వయమే కవితను సాధారణ వేదనాత్మక రచన స్థాయి నుంచి గంభీర సాహిత్య స్థాయికి తీసుకెళ్తుంది.

మంజు యనమదల గారి “నా వాళ్ళెవరు..?” కవిత ఆధునిక తెలుగు కవిత్వంలో ఆత్మసాక్ష్య కవిత్వానికి ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలవగలదు. వ్యక్తిగత అనుభవాన్ని సామాజిక సత్యంగా విస్తరించగల సామర్థ్యం కవయిత్రి ప్రత్యేకత. ఈ కవిత చదివిన తర్వాత పాఠకులు  “నా వాళ్ళెవరు?” అనే ప్రశ్నను తనకుతానే వేసుకోకుండా ఉండలేరు.

ఈ కవితలో కవయిత్రి ఒంటరితనాన్ని తాత్వికంగా, పేదరికాన్ని సామాజికంగా, బంధాలను మానసికంగా, జీవితాన్ని ఆత్మాన్వేషణగా దర్శించిన ఈ కవిత మంజు యనమదల గారిని సున్నిత హృదయ కవయిత్రిగానే కాక, లోతైన జీవన తత్వాన్ని మోసుకొచ్చే ఆలోచనా కవయిత్రిగా నిలబెడుతుంది.

ఆమె పదాలు పూల రేకుల్లా మృదువుగా కనిపించినా, వాటి అంతరార్థం శిలాఫలకాలపై చెక్కిన సత్యంలా నిలిచి పోతుంది. ప్రతి కవితలో ఒక అనుభవం, ప్రతి పాదంలో ఒక ఆత్మస్పర్శ, ప్రతి విరామంలో ఒక మౌన వేదన దాగి ఉంటుంది.

ఆమె రచనల్లో భావుకత ఒక ప్రవాహమైతే, తాత్వికత దానికి దిశ చూపే తీరం. జీవితం గురించి ఆమె చేసే ప్రశ్నలు ఉపరితలాన్ని తాకవు. అవి అస్తిత్వపు లోతుల్లోకి దిగుతాయి. అందుకే ఆమె కవిత్వం చదివిన తర్వాత పాఠకుడు కొంతసేపు తన జీవితాన్ని తాను పరిశీలించకుండా ఉండలేడు.

మంజు యనమదల గారు కవయిత్రిగానే కాక సాహిత్య సమీక్షకురాలిగా కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఇతరుల కవిత్వాన్ని విశ్లేషించే సందర్భంలో ఆమె చూపే సాహిత్య దృష్టి, భావగర్భితమైన వ్యాఖ్యానం, రచయిత అంతరంగాన్ని అర్థం చేసుకునే సహృదయత విశేషమైనవి. ఆమె సమీక్షలు విమర్శ పేరుతో విరుచుకుపడవు. రచనలోని సౌందర్యాన్ని వెలికితీసే సహృదయ దర్శనంగా నిలుస్తాయి

ఆమె కలం ఇంకా ఎన్నో హృదయాల మౌనాన్ని పలకాలని, తెలుగు సాహిత్యానికి మరెన్నో అంతరంగ దీపాలను వెలిగించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ


జి. ఈశ్వరీభూషణం 

జాతీయ అధ్యక్షురాలు 

శ్రీ శ్రీ కళా వేదిక

@everyone

26, జులై 2026, ఆదివారం

పాట


 

21, జులై 2026, మంగళవారం

ధన్యవాదాలు

 నా గురించి మంత్రి ప్రగడ మార్కండేయులు గారు రాసిన పాటకు బిక్కి కృష్ణ గారి ఆత్మీయ స్పందనకు మనఃపూర్వక ధన్యవాదాలు..


మీ పాటలు చాలా బాగున్నాయి సార్.. ముఖ్యంగా యనమదలమంజుగారిపై రాసిన పాట.. పదాల పోహళింపు.. మీ అద్భుత గేయరచనా సంవిధానానికి... లోతైన మంజుగారి వ్యక్తిత్వ అభివ్యక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఆమె నాకు బాగా తెలుసు. మంచి కవయిత్రి. వ్యాసకర్త. స్నేహశీలి. కల్మషం ఎరుగని విదుషీమణి. కపటం తెలియని సృజనశీలి.నా కవితా సంపుటిపై ఆమె గతంలో ఒక గొప్ప విశ్లేషణా వ్యాసం కూడా రాసారు. ఆమె మనోధైర్యం, సున్నితత్వం, ముక్కుసూటిదనం, ప్రేమతత్వం, భాషా, కవిత్వ, విశ్లేషణా.. పటుత్వాలను.. అద్భుతమైన పదబంధాలతో.. మంచి సంగీత సాహిత్య కల్పనా చతుర వచనాలతో .. గేయాన్ని శిల్పీకరించారు. ఆమె జీవితం ధన్యం. ఇంతకన్నా గొప్పగా మంజుగారి గొప్పతనం, ఔన్నత్యం, రచనాదృక్పథం, భావుకత్వం, నిర్మలమైన వ్యక్తిత్వంపై... ఏ గొప్ప గేయ రచయితా... ఇంతలా కదిలించేలా రాయలేరు. ప్రోత్సాహం, ఉత్సాహం, సంతోషం అందించలేరు. మాకు చాలా ఆత్మీయులైన మంజుగారిపై గొప్ప పాట రాసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రతి అక్షరం,ప్రతిపదం, గేయపాదం.. మంజుగారి వ్యక్తిత్వపరిమళ విలసితం.ఆమె భావుకతా తటిల్లతల మెరుపుల విభ్రాజితం.. మధుర భావాలరసాప్లావితం. రసౌచిత్యం.. అభినందనలు.


18, జులై 2026, శనివారం

జీవన మంజూష 07/26

 నేస్తం,

          బంధమయినా దృఢంగా వుండాలంటే, రోజుల్లో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం కాదు. మనిషి తన జీవితంలో కోల్పోయింది, కోల్పోతున్నది నమ్మకాన్నే. అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెడుతున్న రోజులు కదా! అందుకే తనాన్నయినా అమ్మడానికి సిద్ధంగా వున్నారు ఈనాటి మనుష్యులు. అలాగే అమ్మేవారుంటే కొనేవారికేం కొదవ అన్నట్టుంది మన సమాజం కూడా. సమాజమేముంది ప్రపంచమే అలా మారిపోయింది. మనిషి ఆలోచనలు వింత పోకడలు పోతుంటే దానికి తగినట్లుగానే మనిషి మేధావితనమూ సహకరిస్తోంది. కాని మనిషిగా మనమేం కోల్పోతున్నామో మనకే తెలియనంతగా ఆధునికీకరణ మాయలో పడిపోయాం

           మనం సంతోషాన్ని పంచుకోవడానికి మన తాహత్తుకు తగ్గ వారిని అతిథులుగా ఆహ్వానించడం మన సంస్కారంగా చూపించుకుంటున్నాము. అయినవారు, ఆత్మీయులు మనకు, మన హోదాకు తగ్గవారే అవుతున్నారు సమయంలో. అదే మనకు ఆపదో, కష్టమో వచ్చినప్పుడు తాహత్తు గుర్తురాదు. ఎందుకంటే సంస్కారులు ముఖం చాటేస్తారు కనుక. సమయంలో మనకు మనలో మరుగున పడిపోయిన ఎక్కడెక్కడి చుట్టరికాలు, రక్త సంబంధాలు భలే గుర్తొస్తాయంటే నమ్మండి. దూరాన్ని మనమే పెంచి పోషించి ఇలాంటి అవసర సమయాల్లో దగ్గరతనం దగ్గరగా రావాలని కోరుకోవడం సమంజసం కాదు కదా. మనం ఇచ్చిందే మనకి తిరిగి వస్తుంది. విషయం అందరం గుర్తు పెట్టుకోవాలి.

            మనలో చాలామందిలో ఈర్ష్య, అసూయలు ఎంత బలంగా నాటుపోయాయో చూస్తుంటే నిజంగా మనం మానవ సంబంధాల గురించి గొప్పగా చెప్పుకునే సమాజంలోనే బ్రతుకుతున్నామా అని ఒకింత అయోమయంలో వున్నట్టుగా అనిపిస్తోంది. మన గొప్పలు చెప్పుకోవడానికి ఇతరులను హీనం చేసి చూపనక్కర్లేదు కదా! అది మనకు మంచి చేస్తుంది అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి వుండదు. ఏదోక గొప్పదనం అందరిలో వుంటుంది. గుర్తించే గొప్ప మనసు మాత్రం కొందరికే వుంటుంది. కొందరిలో మనమున్నామా లేదా అన్నది మన మనసుకు తెలియాలి.

              కీర్తిశేషులయ్యాక కీర్తించడం మనకు పరిపాటి అయిపోయింది. మాట అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే. “పోయినోళ్ళందరు మంచోళ్ళూ కాదు, అలా అని బతికున్నోళ్ళందరూ పాపులు కాదు”. మనిషి చనిపోయాక కాని మనకు మనిషి గొప్పదనం తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి చేసిన విలువైన పనులకు వ్యక్తి సేవలను గుర్తించి వారు జీవించి వున్నప్పుడే వారికి తగిన గుర్తింపు ఇస్తే, అది మనం వారికి ఇచ్చే గౌరవం అవుతుంది. ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే తర్వాత ఇతరుల సంస్కారం గురించి మాటలు, రాతలు వంటివి చేయవచ్చు

             

               నూరు పుస్తకాలనవ మల్లెతీగతో నా అనుబంధం కూడా దాదాపుగానూరు పుస్తకాల నవ మల్లెతీగ పదిహేను పుస్తకాల నా అక్షర ప్రయాణంవెరసి లెక్కకు మూడు శీర్షికలకు తక్కువగా. నూరుజీవన మంజూషలతో నా పయనం నవ మల్లెతీగతో కొనసాగుతోంది. నెల నెలా నవ మల్లెతీగ నిత్య నూతనంగా రూపుదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ, అవసరమైతే పుస్తకం కోసందొంగనికూడా అవుతానన్నకలిమిశ్రీగారి సాహితీ తపస్సుకు విఘ్నాలు కలగకుండానవ మల్లెతీగసాహితీ మిత్రుల చేతుల్లో కలకాలం కళకళలాడాలని కోరుకుంటూ..నూరవ పత్రికకు హృదయపూర్వక శుభాకాంక్షలు.



              

            


             

             


16, జులై 2026, గురువారం

ఓ చిన్నమాట..!!

        నాకు గుర్తున్నంత వరకు ఈటివి “పాడుతా తీయగా” గత ఐదారు సిరీస్ ల నుండి సెమీ ఫైనల్ కి రాకుండా ఎలిమినేట్ అయ్యేవారికి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నలుగురు ఎలిమినేట్ అవుతారు అంటూ మరో ఛాన్స్ ఇస్తూ..ఎలిమినేట్ అయ్యేవారికే సిరీస్ ఛాంపియన్ రావడం ఎవరైనా గమనించారా..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner