నాకు గుర్తున్నంత వరకు ఈటివి “పాడుతా తీయగా” గత ఐదారు సిరీస్ ల నుండి సెమీ ఫైనల్ కి రాకుండా ఎలిమినేట్ అయ్యేవారికి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో నలుగురు ఎలిమినేట్ అవుతారు అంటూ మరో ఛాన్స్ ఇస్తూ..ఎలిమినేట్ అయ్యేవారికే సిరీస్ ఛాంపియన్ రావడం ఎవరైనా గమనించారా..!!
16, జులై 2026, గురువారం
13, జులై 2026, సోమవారం
రెక్కలు
1. దీర్ఘదృష్టి
బావుంది
హ్రస్వదృష్టే
అనడం లేదు
దూరానిదెప్పుడూ
దగ్గరతనమే..!!
2. కట్టె
కాలాలి
కట్టెలు
కావాలి
కాపీనం
కాయానికి..!!
3. తరుగు
బంగారానికే కాదు
బంధాలకు
పాకింది
విలువల
తూకమే..!!
7, జులై 2026, మంగళవారం
2, జులై 2026, గురువారం
ఓ మాట..!!
అది కాదురా అబ్బాయ్,
మనకి తెలిసిన వాళ్ళని మనముదాహరించినట్లే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వాళ్ళు ఉదాహారిస్తారు. దీనిలో ఆక్షేపణలెందుకు?
నీకు నచ్చిన వాళ్ళు బాగా గొప్పోరు కదా. మరలాగే వారికి నచ్చిన వారిని వారు గొప్పగా చెప్తారు. కులమతాల హేళనలు మన చెవులకు ఇంపుగా, చూడటానికి అందంగా అగుపడతాయి కదా! అందుకే మనకి వాటిలో అన్ని కళలు గొప్పగానే కనబడతాయి.
అందుకే మాటలకు, రాతలకు ముందు కాస్త ఆలోచన చెయ్యాలి. మంచి మాట తరాల తరాల నుండి కొత్త తరాలకు చేరవేయడం తప్పేం కాదు. మనిషున్నా లేకున్నా మాట వుండిపోతుంది అని మన పెద్దలు ఎప్పుడోనే చెప్పారు కదా! గుర్తు లేదా!
అయినా మానవీయం, అమానవీయం మనకెందుకు? మనం చేసిన పనులు మనం చెప్పుకుంటే బాగోదురా అబ్బాయ్!
29, జూన్ 2026, సోమవారం
రెక్క కి వీడియో వివరణ
https://youtu.be/PGS9F11kbWs?si=5BNqmHl9Bk0be3rU
నా చిన్ని రెక్కకు అద్భుతమైన వివరణనిచ్చిన మంత్రి ప్రగడ మార్కండేయులు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు..
ఆకాశంలో చుక్కలు
చూపడం సులువే
లెక్కలేయడమే
బహు కష్టం
నీటి మీది
రాతలు...!!
విశ్లేషణ:
“ఆకాశంలో చుక్కలు చూపడం సులువే – లెక్కలేయడమే బహు కష్టం; నీటి మీది రాతలు...!!”
ఈ చిన్న రెక్కలో కవయిత్రి జీవిత సత్యాన్ని అత్యంత క్లుప్తంగా, కానీ గంభీరమైన తాత్త్విక దృష్టితో ఆవిష్కరించారు. ఆకాశంలో చుక్కలను చూపించడం సులభమే గానీ, వాటిని లెక్కించడం అసాధ్యం. అలాగే జీవితంలో మాటలు చెప్పడం తేలికే, వాటిని ఆచరణలో నిరూపించడం అత్యంత కష్టం అనే భావాన్ని “నీటి మీది రాతలు” అనే ప్రతీక ద్వారా హృద్యంగా వ్యక్తీకరించారు.
జానపదంలో “చెప్పేవానికి చెవులు లేవు, చేసేవానికి చేతులు చాలవు” అనే నానుడి ఈ భావానికి దగ్గరగా ఉంటుంది. సమాజంలో గొప్ప గొప్ప వాగ్దానాలు చేసే వారు ఎందరో కనిపిస్తారు. కానీ ఆ మాటలను నిలబెట్టుకునే వారు మాత్రం అరుదు. నీటిపై రాసిన అక్షరాలు క్షణాల్లో చెరిగిపోయినట్లే, చిత్తశుద్ధి లేని మాటలు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి.
సంస్కృత సుభాషితంలో “క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే” అని చెప్పబడింది. అంటే, మహనీయులను గొప్పవారిగా నిలబెట్టేది మాటలు కాదు, వారి కార్యసిద్ధి. ఇదే సత్యాన్ని ఈ రెక్క లో తన ప్రతీకాత్మక శైలిలో ప్రతిధ్వనింపజేస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూపించే వేళ్ళు అనేకం ఉండవచ్చు, కానీ వాటి అంతరార్థాన్ని గ్రహించి లెక్కించే విజ్ఞానం కొద్దిమందికే ఉంటుంది.
సామాజికంగా చూస్తే, ప్రచారాల యుగంలో ప్రదర్శన ఎక్కువ, పరిపాలన తక్కువ; వాగ్దానాలు ఎక్కువ, బాధ్యత తక్కువ. అందుకే ఈ రెక్క ప్రతి పాఠకుడిని ఒక ప్రశ్న అడుగుతుంది— “నీవు చూపించే వ్యక్తివా? లేక చేసి చూపించే వ్యక్తివా?” అదే ఈ సూక్తి యొక్క సారాంశం. మాటలు నీటి మీద రాతల్లా చెరిగిపోవచ్చు, కానీ చేతలు శిలాఫలకాలపై చెక్కిన అక్షరాల్లా శాశ్వతంగా నిలిచిపోతాయి.
*****
