23, జులై 2024, మంగళవారం

మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని పుస్తక సమీక్ష

          తప్పిపోయిన కాలాన్ని దాచినమిగుల్చుకున్న వాక్యాలు కొన్ని”..!!


      అలసిన వాక్యాలు కొన్ని తప్పిపోయి ఇలామిగుల్చుకున్న వాక్యాలు కొన్నిగా రూపరుక్మిణి కె కవితా సంపుటిగా రూపుదాల్చాయి. సవ్వడి చేయని శబ్దాలుగా తన భావాలను చాలా బలంగా కవితా సంపుటిలో వినిపించారు. రాజకీయాలను, రణ నినాదాలను అక్షరాలకు బాగా వొంటబట్టించారు. అద్దాన్ని- అబద్ధాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. తన రన్నింగ్ కామెంట్లు తో మసకబారుతున్న మానవత్వాన్ని చూపించారు. నిసర్గలోఎప్పుడో తప్పిపోయిన నీడ నీరెండ గాయంలా ఎదురైందంటూఅద్భుత భావాన్ని అందించారు. మనసు నీడ అక్షరాల్లో దాగుందని దానిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ.. మరెన్నో చక్కని కవితలను మిగుల్చుకున్న వాక్యాలు కొన్నికవితా సంపుటిలో అందించారు

      సమాజం పట్ల తన బాధ్యతను ప్రతి కవితలోనూ చూపించారు. మరిన్ని గొప్ప గొప్ప పుస్తకాలు వీరి నుండి రావాలని కోరుకుంటూ..చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన్నించమని కోరుకుంటూ..శుభాభినందనలు..!!



22, జులై 2024, సోమవారం

గాలివాటం పై సమీక్ష

 నా కొత్త పుస్తకం “గాలివాటం..ఈ అక్షర సహవాసం” గురించి రాము కోలా గారు రాసిన ఆత్మీయతాక్షరాలు ఎంత సంతోషాన్నిచ్చాయో…మనఃపూర్వక ధన్యవాదాలు రాముగారు.


రెక్కలు అనే ప్రక్రియ గురించి నాకు అంతగా తెలియదు.

కానీ అమ్మ గాలి వాటం చదువుతూ ఏదో వ్రాయాలంటే తపనతో వ్రాసిన ,నాలుగు వాక్యాలు ఎలా ఉన్నాయో..తెలియదు.


అవి మీ ముందు ఉంచుతున్నాను.


"మంజు యనమదల గారి  “గాలి వాటం"(పుస్తక సమీక్ష).


గాలివాటం కాదు “నేటి సామాజిక అంశాల పరిశీలనాత్మక గ్రంథం “అంటాను నేను.


కాలాన్నీ కనుమరుగు చేస్తూ,పాఠకులను తనతో ప్రయాణించేలా చేయగలిగేది  సాహిత్యం మాత్రమే.

తెలుగులో సాహిత్యంలో  వర్ధమాన కవులు తమ సత్తా చాటుకుంటున్న ప్రక్రియల్లో రెక్కలు ప్రక్రియ  ఒకటి.

రెక్కలు గురించి  " ప్రముఖ కవి, విమర్శకుడు డా అద్దేపల్లి రామమోహనరావు గారి" మాటల్లో.

ఆరు పాదాలతో సాగుతున్నా లఘు కవిత్వం.

పైనాలుగు పాదాలు ,ఒక జీవితానుభవాన్ని గూర్చి చెబితే, చివరి రెండు పాదాలు ఆ అనుభవం ద్వారా కవి చెప్పదలచిన తత్త్వం గూర్చి చెప్పెను. జీవితానుభవం నుంచి ఉపరితలానికి వెళ్ళి ఆలోచిస్తేనే తత్త్వం విశదమౌతుంది. రెక్కలతో, ఆకాశం పైకి ఎగిరితేనే చలనం ఉన్నతమౌతుంది’ అన్నారు. ‘‘స్పష్టమైన లక్ష్యం, లక్షణం రెక్కల్ని ప్రతిభావంతం చేస్తాయి అంటారు

.


కవిత్వం మానసిక సంఘర్షణ నుండీ జనిస్తుందంటారు  సాహిత్య విశ్లేషకులు.

సంఘర్షణకు అక్షర రూపం ఇవ్వాలంటే,

భాష పైన పట్టు కలిగి ఉండాలి.ముఖ్యంగా 

ఎన్నో పుస్తకాలను చదివిన పరిజ్ఞానం కావాలి.

సామాన్య పాఠకుడు సులువుగా అర్థం చేసుకునేలా ఉండాలి.


విమర్శలను సద్విమర్శలుగా స్వీకరిస్తూ.పాఠకులకు తన భావాన్ని నిర్భయంగా, నిష్పక్షపాతంగా వివరణ ఇవ్వగల నేర్పు కవి/కవయిత్రిలో తప్పకుండా ఉండాలి.


నేటి సామాజిక స్థితిగతుల పట్ల,నేటి ప్రభుత్వ విధివిధానాలు  పట్ల,నేటి స్వార్థ రాజకీయాల పట్ల,

స్థిరమైన అభిప్రాయాలు వెలిబుచ్చగల ధైర్యం ఉండాలి.

నమ్మిన సిద్ధాంతాన్ని నలుగురి ముందు ప్రెజెంటేషన్ చేయడంలో తెగువ చూపించాలి.


తన రచనల్తో అశేష  పాఠకుల దృష్టిని తన వైపు తిప్పుకున్న మంజు యనమదల గారు ,ఇప్పటికే అనేక పుస్తకాలను ముద్రణ రూపంలోనికి తీసుకు రావడం,అవి బహూళ ఆదరణను పొందడం మనందరికీ తెలిసిన విషయమే.


జీవితంలో ఎదురైన సమస్యలను ,నేటి సమాజంలోని ఆర్థిక వ్యవస్థలో దాగున్న లొసుగులను,మానవత్వం మరచిన మానవ సంబంధాలను,  "రెక్కలు అనే ప్రక్రియతో "పాఠకుల ముందుంచే ప్రయత్నంలో వెలువడిన పుస్తకం "గాలి వాటం".


ఇది గాలి వాటం కాదు .సాహిత్య ప్రభంజనం.

తనదైన శైలిలో..సమాజాన్ని నిగ్గదిస్తూ..

సంధించిన శాస్త్రాలు ఈ రెక్కలు ప్రక్రియలో నుండి  పురుడుపోసుకున్న  కవిత్వం.


"వేల కొలది/పేజీలు

వందల కొద్దీ/అభియోగాలు


తీర్పులకు

సమయమెక్కడా .. !!"

"చట్టం అందరికీ వర్తిస్తుంది" అనే మాట ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తుంది.

అభియోగాలతో ,అధికారంలో ఉన్న వ్యక్తిని 

చట్టం చుట్టంలా ఆదరిస్తుంటే,న్యాయం నిస్సహాయంగా చూస్తుంది.

న్యాయ దేవత కళ్ళు తెరిచేది ఎప్పటికో! అనేలా.

ఇది కవయిత్రి సంధించిన ప్రశ్న మాత్రమే కాదు, ప్రతి సామాన్యూడి ప్రశ్న.చట్టంలోని లొసుగులు కొందరినే ఎందుకు కాపాడుతున్నాయ్  అనేది ప్రశ్నార్థకమే .

సమాధానం చెప్పడానికి న్యాయవ్యవస్థ సిద్దంగా లేదేమో!!....


"ధనం మూలం ఇదం జగత్"అనే మాటకు వాస్తవం రూపం నేడు మనం చూస్తూనే ఉన్నాం.

అనుబంధాలు  ఆప్యాయతలు కనుమరుగై,ధనంతో కలుపుకున్న  బంధాలు 

నింగిలో ఇంద్రధనుస్సులా కనిపిస్తున్నాయ్.

ఎందుకంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో మనకు నిత్యం తారస పడుతునే ఉంటారు.


ప్రపంచాన్ని శాసిస్తున్న వాటిలో    ధనం ఒకటి అనేది వాస్తవం అందుకే పెద్ద వాళ్లు  భవిష్యత్తును  ముందుగానే ఊహించి "ధనం మూలం ఇదం జగత్" ఉన్నారేమో.


అదే మాటను తన రెక్కలు ప్రక్రియలో కవయిత్రి 

ఎలా మలచారో చూడండి.

" అమ్మనీ / మర్చిపోతున్నాం / అనుబంధాలకు / దూరమౌతున్నాం .


దగ్గరి చుట్టం / ధనమే .. !! ”అంటారు కవయిత్రి.

ఎవ్వరితోనూ పనిలేదు.నాకు ధనం ఉంటే చాలు అనుకునే మనిషి మనస్తత్వం.ఇది పతనం వైపు నడిపిస్తుందే కానీ,శాశ్వత బంధాలకు దూరం  చేస్తుందనేది  కవయిత్రి సూటిగా చెప్పిన మాట.


"ఏ ఆటైనా /ఆడించేది వాడే

ఫలితాన్ని /నిర్దేశించేది వాడే/

చతురుడు

పైవాడు .. !!. అనే రెక్కలు పరిశీలించినట్లైతే


నమ్మినా నమ్మక పోయినా! 

మనిషిని నడిపించే శక్తి కంటికి కనిపించకుండా 

వెన్నంటే ఉంటుంది అంటుంటారు.

ఆ శక్తినే ధైవస్వరూవం అని నామకరణం చేసుకున్నాం..

మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఉంటుంది.

ఇదే విషయాన్ని తాత్వికంగా చర్చిస్తే.


"అంతిమ వాస్తవికతను గ్రహించడం" లేదా "అస్తిత్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం".  ఇది హిందూ తత్వశాస్త్రంలో, ముఖ్యంగా అద్వైత వేదాంత సంప్రదాయంలో ఉపయోగించే పదం.

 

చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసి వచ్చినప్పుడే,అంతా పైవాడి లీల అంటూ వేదాంతం వల్లిస్తుంటాం.

కానీ మనం చేసినది తప్పు అని ఓప్పుకోలేము.

“ఆడించేసింది అంతా పైవాడే “అని నిట్టూర్చేది కూడా మనమే.


మనిషైనా /దైవమైనా /తప్పదు 

కర్మ ఫలితం/కాలానికి/కాదెవరూ అతీతం .. !!.


ఇది ఎక్కువగా పాలక వర్గానికి దగ్గరగా ఉంటుంది.

అధికారంలో ఉన్నంతవరకు తమకు తిరుగులేదని,తాము చేసినదే శాసనం అనుకునే మనస్తత్వంను గుర్తుచేస్తుంది.

మనిషిఎప్పుడూ “ కర్మిష్ఠి ”గానే ఉండాలి !

‘ అకర్మణ్యత్వం ’ అన్నది ఎప్పుడూ వుండకూడదు !.

మనం చేసే కర్మలు..భవిష్యత్తులో నలుగురు కీర్తించే లా ఉండాలే కాని,మనమే పాప ఫలం అనుభవించేలా ఉండకూడదనే నిగూఢమైన అర్థం ఈ కవితలో అంతరంగా దాగి ఉంది.


ఎప్పుడో చదివిన నాలుగు మాటలు ఈ సందర్భంగా మీతో పంచుకోవాలని ఇక్కడ ఉంచుతున్నాను.

కవిత్వం అనేది సందర్భాన్ని అవగాహన చేసుకుంటూ రాయాలి.  మెత్తగా, కొత్తగా రాయాలి.  చమత్కారంగా రాయాలి. 

ప్రజలు జీవన విధానాన్ని ప్రతిభించాలి.

మన చూట్టూ జరుగుతున్న సంఘటనలకు దర్పణంలా ఉండాలి.

సమాజాన్ని ప్రశ్నిస్తూ..

ప్రజలను ఆలోచింపచేయాలి.లేదా కనీసం 

కవి రాసిన భావాల పైన చిన్న చర్చ అయినా జరిపించాలి.అప్పుడే కవి/కవయిత్రి రాసిన కవిత్వానికి సార్థకత.


అర్హత/అనర్హత/అక్షరమే/తేడా

వ్యవస్థ/పు ( తి ) రోగతికి మూలం .. !!

పైన కనిపిస్తున్న రెక్కలు చదివిన తర్వాత 

నా భావం ఇలా పంచుకోవాలనిపించింది.


కవిత్వం అనేది భావోద్వేగాల సమ్మేళనం, ఆలోచనలు మరియు అనుభవాలనుండి జీవం నింపుకునే  సౌందర్యం . పదాల అమరికతో ప్రత్యేకమైన శైలితో పాఠకులను మెస్మరైజ్ చేయగలిగే పదాల కూర్పు.

ఇది గుర్తెరిగి రచనలు చేస్తున్న మంజు యనమదల గారు  అవినీతి, అధికార దుర్వినియోగాన్ని ,నాయకుల కుటిల రాజకీయ చతురతను అధ్యయనం చేస్తూ ,ఈ సంపుటిలో రెక్కలు గా మలిచారనేది నా అభిప్రాయం.

 

చివరగా నాకు బాగా నచ్చిన రెక్కలు ఇక్కడ ఉంచుతున్నాను 


అర్హత/అనర్హత

అక్షరమే/తేడా

వ్యవస్థ/పు ( తి ) రోగతికి మూలం .. !!

ఇది  ప్రజలు గుర్తెరిగి తమ నాయకులను ఎన్నుకున్నప్పడే సమగ్రాభివృద్ధి చూడగలం.

ప్రజల కర్తవ్యాన్ని ఇలా గుర్తుచేసే రచనలు మరెన్నో మంజు యనమదల గారి నుండి రావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నాను.

పాఠకులు ఇటువంటి రచనలను ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది.


అమూల్యమైన పుస్తకం కావలసిన వారు “92464 15150 “ నెంబర్ నందు  సంప్రదిచగలరు.

పోస్టల్ అడ్రస్ వాట్సప్ పంపండి–

రిజిస్టర్ పోస్టులో మీ ఇంటికి భద్రంగా అందుతాయి .


                                       పుత్రసమానుడు

                                    రాము కోలా.దెందుకూరు.

                                    ఖమ్మం.9849001201.

19, జులై 2024, శుక్రవారం

ఏం మిగిలింది..?

 శూన్యంలో 

ఏముంది?

చెప్పలేని

వెలితి తప్ప


మనసులో

ఏముంది?

కనబడని

అందం తప్ప


మౌనంలో

ఏముంది?

వినబడని

మాట తప్ప


భావంలో

ఏముంది?

రాయలేని

భాష తప్ప


అనుబంధంలో

ఏముంది?

ముసుగేసుకున్న

బంధం తప్ప


మనిషిలో

ఏముంది?

తత్వం లేని

తపన తప్ప


జీవితంలో

ఏం మిగిలింది?

కాలిన కాయపు

బూడిద తప్ప..!!




6, జులై 2024, శనివారం

నా కొత్త పుస్తకాలు


నావి 15 పుస్తకాలు ముద్రించిన  నవమల్లెతీగ కలిమిశ్రీ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు

జీవన మంజూష జులై24


 నేస్తం,

         ఇంటిపెద్ద సక్రమంగా లేకపోతే ఇల్లు సంతోషానికి నిలయంగా మనలేదు. పరిసరాలు, పరిస్థితులు, పెద్దల నడవడి పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు చిన్నప్పటి నుండి వారు పెరిగిన పరిసరాలకు ఎక్కువగా ప్రభావితులౌతారు. కొందరికేమో వీటన్నింటితో సంబంధం లేకుండా జీన్స్ బాగా డామినేట్ చేస్తాయి. మన పిల్లలు ఎలా ఎదగాలన్నది చాలా వరకు మన ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులయినా తమ పిల్లలు పద్దతిగానే పెరగాలని అనుకుంటారు. కాని విధిరాతను మార్చలేరు.

           కొందరు పిల్లలు కాస్త వయసు రాగానే తామేదో మహా గొప్పవారైనట్లు అనుకుంటూ, నలుగురిని తమ వెంటేసుకు తిరుగుతూ అదే ప్రపంచమన్న భ్రమలో బతుకుతుంటారు. అయినదానికి కానిదానికి ఇంటిని అరుపులు, కేకలతో దద్దరిల్లేటట్లు చేస్తూ ప్రతి చిన్న దానికి నానా యాగీ చేస్తుంటారు. వీరి అవసరాలకు, గొప్పలకు మాత్రం అమ్మాబాబు డబ్బులు కావాలి కాని మాటా మంచి ఏమి ఉండదు. వీరి నడవడి కూడా కాస్త అసహజంగానే ఉంటుంది. నిద్రకు, తిండికి సమయాసమయాలతో పని ఉండదు

           వయసు ప్రభావమనుకోవడానికి మనమూ వయసును దాటి వచ్చిన వారమే కదా. కాకపోతే మనము పెరిగిన వాతావరణం వేరు. ఇప్పటి పిల్లలు పెరుగుతున్న తీరు వేరు. ఆలోచనల్లోనే కాకుండా, ఇంట్లోవారితో ప్రవర్తించే తీరు కూడా చాలా తేడా ఉంటోంది. మన తరానికి పాఠశాలల్లో విద్యాబుద్ధులు గురువులు నేర్పించేవారు. వారు చెప్పిన మంచి చెడులను మనమూ అవగాహన చేసుకునేవారం. ఇప్పటి పిల్లలకు అంత సహనమూ లేదు, అదే కాకుండా కాస్త అహం కూడా తోడైంది. కాస్త ప్రశ్నించడాన్ని కూడా తట్టుకోలేక పోతున్నారు.

            బర్త్ డే పార్టీలంటూ లక్షలు తగలేయడమూ, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా తిరగడమే ఈనాటి కల్చర్ అని అనుకుంటున్నారు. ఇంట్లోవాళ్లతో మాట మాట్లాడే తీరిక ఉండదు కాని గంటలు, గంటలు ఫోన్లు మాట్లాడటాలు, చాటింగ్ లు వీటికి మాత్రం సరిపడినంత సమయముంటుంది. ఇంటికి ఎవరైనా అతిథులు, బంధువులు వచ్చినా కూడా పలకరింపు ఉండదు. వారు పలకరించినా ముక్తసరి సమాధానాలు, లేదా పరాయివారు ఉన్నారు అన్న స్పృహ కాని, చుట్టుపక్కవారు వింటారన్న ధ్యాస కాని లేకుండా ప్రతిదానికి అరుపులతో, కేకలతో ఇష్టం వచ్చినట్టు వాగడం చేస్తుంటారు. వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటేమన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇదో మంత్రంఅన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు

            పిల్లలయినా పెద్దల విలువ తెలియకుండా ప్రవర్తిస్తుంటే మనం చూస్తూ నవ్వుకుంటే, రేపటి రోజున మనకూ అదే అందుబాటులోనికి వస్తుందని మర్చిపోకూడదు. డబ్బులు, అధికారం, హోదా ఇవన్నీ మన జీవితంలో చివరి వరకు ఉండవు. బంధాలు, అనుబంధాలు మనం ఎంతకాదనుకున్నా మన వెంట పడుతూనే ఉంటాయి. పిల్లల తప్పులను సరిదిద్దే ప్రయత్నం మనం చేయలేకపోతే, ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner