నేను రాసిన “ అక్షరాలతో అనుబంధాలు..యనమదల ముత్యాల సరాలు “ పుస్తకాన్ని మా పెదనాన్న, పెద్దమ్మ డాక్టర్ యనమదల రాధాకృష్ణ, బసవేశ్వరి గార్లు వారి ఇంట్లో మా అమ్మమ్మ కాసరనేని సీతారావమ్మ, మా అమ్మ యనమదల సామ్రాజ్యం, మావారు యార్లగడ్డ రాఘవేంద్రరావు గార్ల సమక్షంలో ఆత్మీయంగా ఆవిష్కరించారు. వారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
16, సెప్టెంబర్ 2023, శనివారం
12, సెప్టెంబర్ 2023, మంగళవారం
13వ పుస్తకం…!!
“ అక్షరాలతో అనుబంధాలు…యనమదల ముత్యాల సరాలు “
మారుతున్న కాలంతోపాటు మసిబారిపోతున్న అనుబంధాల మధ్యన రక్త సంబంధాలను ఉత్తుత్తి సంబంధాలుగా మార్చేస్తున్న ధనానుబంధాలకు నమస్కారం. నా ఈ పుస్తకంలో పేర్లు లేని వారు కొందరు ఏమనుకోవద్దు. నేను ఒకే ఒక పేరు మాత్రం రాసి కూడా వద్దని తొలగించేసాను. మిగతా లేని పేర్లు నాకు తెలియనివి మాత్రమే రాయలేదు. వీలైనంత వరకు సేకరించాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే. ఈరోజే ముద్రణకు వెళ్లిన నా పదమూడవ పుస్తకం మా యనమదల వారి వంశ వృక్షం. దాదాపుగా ఎనిమిది తరాల వరకు సేకరణ జరిగింది.
మల్లెతీగ పబ్లిషర్స్ కలిమిశ్రీ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు
10, సెప్టెంబర్ 2023, ఆదివారం
స్మృతిపథంలో…సమీక్ష..!!
“ మానవ సమాజంలో మనిషి తత్వం..”
కృషితో నాస్తి ధుర్భిక్షం అన్న మాటకు నిదర్శనం డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు. చదువుకున్న చదువుకు కొలువు రాకపోయినా నిరాశ చెందలేదా.ఎవరిని నిందించనూ లేదు. అవకాశాలను వెదుకుతున్న వారికి విజయం తథ్యమని నిరూపించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సకళ కళ్లలో నిష్ణాతులు అయిన డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు చిత్ర లేఖనం, తండ్రిగారి వారసత్వ సంపదైన నాటక రంగం, రచనా రంగాల్లో చక్కని ప్రతిభ కలిగినవారు. గ్రంథాలయ విద్యలో రాణించినా, ఎన్నో పరిశోధనలు చేసి రచించిన గ్రంథాలు వారికి ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.
పురిటిగడ్డ మీద మమకారం లేనివాడు బహు అరుదు. పుట్టిన నేల మీద ప్రేమను వదలలేక తన చుట్టూ జరిగిన సంఘటనలను కథలుగా మలిచి “ స్మృతిపథంలో..” అనే కథా సంపుటిని అందించారు. ఈ కథలన్నీ అతి సాధారణ శైలిలో సామాన్య చదువరులకు సాయం చక్కగా అర్థమయ్యే రీతిలో రచింపబడ్డాయి. ప్రతి కథా మన చుట్టూ కనబడే సంఘటనలకు రూపమే.
మరి స్మృతిపథంలో..ఏముందో క్లుప్తంగా నా మాటల్లో..
ఫలితమాశించని స్వచ్ఛమైన భక్తికి, ప్రేమకు దక్కిన గౌరవం భక్త శబరిలో మనం చదవవచ్చు. భగవంతునికి భక్తితో అర్పించే తృణమైనా, ఫలమైనా ఆ దేవదేవునికి అత్యంత ప్రీతికరమని ఆనాటి శబరి కాకుండా, ఈనాటి శబరి కూడా నిరూపించింది. మనిషితనాన్ని, మానవత్వాన్ని చుట్టుపక్కలవారు నిరూపించుకున్నారు ఈ కథలో.
చంద్రమోహన్ తిరిగిరాలేదు కథ ఎన్నో వాస్తవ సంఘటనలకు మూలం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో చంద్రమోహన్ లు ఇలా కనబడుతూనే ఉన్నారు. మనసు బాధగా అనిపించింది ఈ కథ చదువుతుంటే.
అల్లుడు దిద్దిన కాపురంలో సగటు మగవాడికి వాడి దారిలోనే బుద్ధి చెప్పిన వైనం చాలా బావుంది. బోలెడు కుటుంబాల్లో జరిగే విషయమే అయినా చక్కని పరిష్కారాన్ని రచయిత చూపారు ఈ కథలో.
పంచిన ప్రేమ కథలో ఆత్మీయతకు, అనుబంధానికి బంధుత్వమేమి అవసరం లేదని, ఇద్దరి మధ్యన అభిమానమే విడదీయరాని బంధంగా మారుతుందని తెలిపిన కథ. మమకారం ఎంత తీయగా ఉంటుందో, అంత తీయగానూ చెప్పారు రచయిత.
మాస్టారు తప్పు చేసారా? నిజమే ఇది మనకూ వచ్చే సందేహమే. ఈ సందేహం రాకపోతే ఈ కథకు అర్థం పరమార్థం ఉండదు. కొన్ని జీవితాలు ఎందుకలా అయిపోతాయన్న దానికి ఎవరి దగ్గరా సమాధానముండదు. సందేహాలు మాత్రమే పుట్టుకొస్తాయి.
గెలుపు -ఓటమి చాలా జీవితాల్లోని కథే ఇది. తమ స్వార్థానికి ప్రేమను ఎరగా వేసి తాము అందలాలెక్కాలనుకునే వారి కథ. నమ్మిన ప్రేమకు దక్కిన కానుక ఆత్మహత్య. విద్యార్థి జీవితంలోనే కాదు, మరెన్నో చోట్ల ఈ స్వార్థపు ప్రేమల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్న ఎందరో మనకు గుర్తుకు రాక మానరు.
కలను నమ్మి కలలో కనిపించిన దైవానికి తన యావదాస్తిని దానం చేయడం గొప్ప విషయమే. రామార్పణం కథలోని విషయమిది.
ఇష్టమైన వ్యాపకం కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడమంటే ఇదే కాబోలు. సినిమా మీద ఇష్టంతో కష్టపడిన పెద్దాయన కథ సినిమా పిచ్చోడు.
చదువు నేర్పిన గురువుకు శిష్యుడికి వచ్చిన అధికారంతో ఇచ్చిన గురుదక్షిణ గురించి చాలా బాగా చెప్పారు.
పూలమ్మిన చోటనే..కథలోని పాత్రలు నిత్యం మనకు తారస పడుతూనే ఉన్నాయి ఇప్పటికి. అపాత్రదానం చేయడం వలన కష్టనష్టాలను తెలిపే కథ ఇది. ఈ కథలోని నారాయణరావులు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా. అలానే పొందిన సాయం మరిచిన వారు కూడా.
చెప్పుడు మాటలు చేసే చేటు, మించిన కూడా చెడు దృష్టితో చూటే చుట్టుపక్కల అమ్మలక్కలు ఉన్నంత వరకు ఈ సమాజంలో చాలామంది కథలు పునుగుల సుందరం కథలే.
డబ్బుకు ఎంత వరకు విలువ ఇవ్వాలి అని ఈ కథ మనకు చక్కగా తెలుపుతుంది.
డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు “ స్మృతి పథంలో..” రాసిన ప్రతి కథా మనకూ తెలిసిన కథలే. ఆనాటి సమాజంలో తన చుట్టూ జరిగిన ప్రతి చిన్న విషయాన్ని చిన్నతనం నుండి గుర్తుంచుకుని కథలుగా రాయడం అభినందించదగ్గ విషయం. ప్రతి కథా వాస్తవ కథనమే. ప్రపంచాన్ని చుట్టినా, తాను పెరిగిన ఊరిని, ఆ మనుష్యులను మరువక తన అక్షరాల్లో వారిని మనందరికి చూపించి , అందరి మనసులను ఆలోచింపజేసారు. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం “ స్మృతి పథంలో..” . ఇప్పటి సమాజానికి అవసరమైన చక్కని విషయాలను కథలుగా అందించిన డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు.
ఏమైంది..?
బాబుగారు,
ఏమైంది ఇన్నాళ్ళ మీ రాజకీయ అనుభవం? తమ్మక్కాయిలు ఉన్నారని తెలిసినప్పుడు కాస్తయినా జాగ్రత్తగా ఉండాలి కదా! పునాదులు వేసినప్పుడు మరొకడెవడూ దానిని పెకలించడానికి లేకుండా చేయాలి. అధికారం ఏం చేయగలదో తెలిసి కూడా మీరింత నిర్లక్ష్యంగా ఉండబట్టే కదా రాష్ట్రానికి, తద్వారా మీకు, మాకు ఇన్ని సమస్యలు. ఒకప్పుడు మాది ఆంధ్రరాష్ట్రమని గర్వంగా చెప్పకున్న మేము ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామో మీకే కాదు అందరికి తెలిసిన విషయమే. రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోవడానికి మీరూ కారణమే..కాదంటారా!
భవిష్యత్ తరాలు బావుండాలన్న ముందుచూపు మంచిదే. అదే సమయంలో ప్రస్తుత స్థితిగతులు, మన చుట్టూ ఉన్న వలయాలపై కూడా ఓ కన్ను వేసి ఉంచాలి కదా. ఎన్నికలకు ముందు నుండి మేము మెుత్తుకుంటూనే ఉన్నాము. మీ నిర్లక్ష్యానికి మూల్యం ఇప్పటి అంధప్రదేశ్. ప్రతి క్షణం అవమానాలు ఎదుర్కొంటున్న మీ మద్దత్తుదారులు. సమస్య వచ్చినప్పుడు ఆలోచించడం కాదు, అసలు సమస్య పుట్టకుండా చేయగల సత్తా మీకుందని నమ్మిన జనాలు, చాలా బాధ పడుతున్నారిప్పుడు. అధికారం కోసం ఏ దారులలోనైనా వెళ్ళగల ప్రత్యర్థులు ఉన్నారని మీకు తెలియదా!
మీరు చేసే మంచి ఎవరికి అవసరం లేదిప్పుడు. ఈ క్షణం మాకు గడిచిందా లేదా అన్న ఆలోచన మాత్రమే మాది. మేం సామాన్యులం. ఈ రోజు అమెరికా అవకాశాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయంటే కారణమెవరని మేం ఆలోచించం. ఎవరు రహదారులు వేసారన్నది అప్రస్తుతం మాకు. భవిష్యత్ తరాలు ఎలా పోతే మాకెందుకు? మేం ఇప్పుడు ఎలా ఉండాలన్నదే మాకు ముఖ్యం. ఎందుకంటే మూడు ముక్కలాటలు, మద్యం సిండికేట్లు…ఇలాంటివి మాకుంటే చాలు. ఇచ్చే వాటి లెక్కలే చూస్తాం కాని తీసుకునే వాటి లెక్కలు మాకెందుకు?
మేమింతే ఉంటాం. మమ్మల్ని బట్టి మీరుండాలి కాని మిమ్మల్ని బట్టి మేముండం. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడి సంగతి, పైవాడి సంగతి, పక్కవారి సంగతి మీకు తెలుసు. తెలిసి ఈ పరిస్థితి వచ్చిందంటే తప్పెక్కడో ఆలోచించండి. మాకు మంచి రోజులు రాకపోయినా పర్లేదు. చూపించే వేళ్ళ సంగతి చూడండి ముందు.