31, అక్టోబర్ 2019, గురువారం

సంపాదకీయం..!!

నేస్తం,
          ఏదైనా రాయాలన్నా ఒకింత సంశయం మెుదలైందీ మధ్యన. భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా ఆంక్షలు, పరిధులు బాగా ఎక్కువైనట్టుగా అనిపించడమెా కారణం కావచ్చునేమెా. సోషల్ మీడియా రాజకీయ ట్రోలింగ్ మీడియాగా మారిపోవడమూ, ప్రతి ఒక్కరి రాతను మరొకరు ఎద్దేవా చేయడం పరిపాటైపోయింది. మన చేతికున్న ఐదు వేళ్ళే ఒకలా ఉండవు. అలాంటప్పుడు ఏ ఇద్దరి అభిప్రాయాలు కలవవు. స్నేహం వేరు, అభిప్రాయాలు విభేదించడం వేరు. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకోవడంలోనే వ్యక్తిత్వం బయట పడుతుంది. తప్పు అని ఎవరైనా అంటే వారిని ట్రోల్ చేయడం, దానికి ఈ మేథావుల సమర్థన. సామాజిక సమస్యలు తెలిసిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే స్వాగతించం, కాని సామాజిక ప్రయెాజనమైన రచనలే రచనలంటే ఎలా..? 
         ఇక రాతల కోతల విషయానికి వస్తే మనం మనకు నచ్చినట్టు రాయగలిగినప్పుడే ఆ రాతకు జీవం ఉంటుంది. అది సామాజిక సమస్య అయినా, మానసిక వేదన/సంతోషం అయినా రాసిన వారికి తమ రాత సంతృప్తినివ్వడం రచన ముఖ్య ఉద్దేశ్యం. స్వప్రయెాజనం లేని రాత సమాజ హితం కాదన్నది నా అభిప్రాయం. రచనా ప్రక్రియల గురించి ఒకరినొకరు విభేదించుకోవడం ఈనాడు సర్వసాధారణమై పోయింది. ప్రక్రియ ఏదైనా కానివ్వండి, దాని వలన నలుగురికి ప్రయెాజనం లేకున్నా రాసిన వారికి ఆత్మ తృప్తి కలిగితే ఆ రచనకు ప్రయెాజనం చేకూరినట్లే. ఇక భాష విషయానికొస్తే రాసే అందరూ పండితులు కాదు. ఒకప్పుడు తమ రాతను అచ్చులో చూసుకోవాలన్నా, నలుగురికి చేరాలన్నా ఎన్నో వ్యయప్రయాసలుండేవి. ఇప్పుడు మనకా ఇబ్బందులు లేవు. సాంకేతిక మనకిచ్చిన సౌలభ్యం క్షణాల్లో ప్రపంచమంతా చేరిపోతుంది ఏ రాతయినా. రాయడం కొందరికి జన్మతః వస్తే, మరి కొందరు ఇష్టంతో తమ భావ ప్రకటనకు రాయడం ఓ మార్గంగా ఎంచుకుని, ఆ అలవాటులో నిష్ణాతులవుతారు. పుడుతూనే ఎవరికి ఏదీ రాదన్నది గుర్తుచేసుకుంటే ఎదుటివారి రాతల్లో తప్పులు మాత్రమే వెదికే మన నైజం మారుతుందేమెా. నాకయితే స్వాతికిరణం సినిమా గుర్తు వస్తోంది ఈమధ్యన.
         మనకు నచ్చిన నలుగురిని పొగిడి, వారికి బిరుదులు,  పురస్కారాలిచ్చి, సన్మానాలు చేసి, శాలువాలు కప్పినంత మాత్రాన వారు గొప్ప రచయితలు, కవులు కాదు. మనం కడుపుబ్బరంతో నలుగురి రాతలను విమర్శించినంత మాత్రాన వారు రాయడం తెలియని అనామకులు కాదు. సాహితీ పెద్దలు, విజ్ఞులు ఈ చిన్న విషయం గుర్తుంచుకుని నిజాయితీ గల సద్విమర్శలు చేయాలని, అవి ఈ తరం రచయితలకు మార్గదర్శనం కావాలని నా ఆశ.
తమ రాతలు అచ్చులో చబసుకోవాలనుకునే వారు ఎన్నో ఇబ్బందులు పడి పుస్తకాలు వేసుకుంటున్నారు. కనీసం మనకు ఆ పుస్తకాల్లో ఒక్కటయినా కొని చదివే అలవాటు లేకపోగా, చదివిన వారు తమ అభిప్రాయం చెప్పినప్పుడో, రాసినప్పుడో కనీసం కృతజ్ఞత చెప్పడం కూడా తెలియని ఎందరో మహామహులు ఈరోజున్నారు. రాతల్లో నీతులు, చూడబోతే నేతిబీరకాయలో నెయ్యి చందం. మన రచనలపై ఎదుటివారి అభిప్రాయాల కోసం మనం ఎలా ఎదురుచూస్తామెా మన అభిప్రాయం కోసం వారు అలానే చూస్తారన్న ఆలోచనే రాదు. ఒక రచనను పొగిడితే మనకేమెాస్తుందని కాకుండా మన చిన్న స్పందన  ఎదుటి వారికి ఎంత ఆనందాన్నిస్తుందో తెలుసుకుంటే చాలు. ఏ సాహిత్యమైనా సమాజ హితం కోసమే. మన ఆలోచనలు సరళంగా ఉంటే చూసే ప్రతి రచనలోనూ ప్రయెాజనమే కనిపిస్తుంది.   

       

28, అక్టోబర్ 2019, సోమవారం

ఏక్ తారలు..!!

1.   ఆత్మీయతలు అందకుండా పోతున్నాయి_మనసు మాయమయ్యాక...!!

2.   అనువదించే మనసుకు తెలుసు_అక్షరాల ఆంతర్యమేమిటో...!!

3.  అద్దమంటి మనసది_చదవనక్కర్లేకుండా చూసిన వెంటనే అర్థమైపోతూ..!!

4.   పదాలన్నీ పారాడుతున్నాయి_నీ అక్షరాల ఆత్మీయతనెరిగి...!!

5.   అనుకోని అతిథులైనాయి అక్షరాలు_ముగింపునెరిగిన జీవితానికి..!!

6.   లక్షణమైన అక్షరాలవి_లెక్కలేనన్ని భావాల మేళవింపులో..!!

7.   అదను చూసి అక్షరం శరమౌతుంది_అహానికి తలవంచక..!!

8.    అహమూ అలంకారమయ్యింది_అణుకువగా భావాల్లో ఒదిగిన అక్షరాలకు..!!

9.   ఏకాంతం ఎటో వెళ్ళింది_ఎడద ఎడబాటు తట్టుకోలేదని...!!

10.  మౌనం మనసు పడిందట_ఊసుల విహారాన్ని చూసి..!!

11.    అంత భయమెందుకు_స్వప్నాన్ని నిజం చేద్దామని నేనొస్తే..!!

12.   కదలిపోలేకున్నాను_కనులతో నీవిలా కట్టిపడేస్తుంటే..!!

13.   మరపు మనకెలా సాధ్యం_పంచుకున్న అనుబంధం గతజన్మదైతే...!!

14.   ప్రాణం నిలిపే తలపులవి_సజీవ జ్ఞాపకాలై మిగిలి..!!

15.  దొరకను నీకు_నీ నీడలా వెన్నంటి ఉంటూనే...!!

16.   కల కథగా మారింది_నేర్పు తెలిసిన కథకుని చేతిలో...!!

17.   జీవితం కథయ్యింది_తను వదిలెళ్ళిన జ్ఞాపకాలతో..!!

18.   గమనం గాయాలను గెలవాలి_కన్నీటి గురుతులను పన్నీటిజల్లుగా మార్చుతూ..!!

19.    కమ్మని గాత్రం తోడయ్యింది_పాటగ మారిన కథకు...!!

20.   పంజరమే పానుపయ్యింది_చిలక పలుకుల చిలకమ్మకి...!!

21.   శాపమూ వరమే_చిలుక కొరికిన పండుకు..!!

22.   స్వరాలలా జత కూడాయి మరి_గమకాలు గమ్మత్తుగా చేరిన పాటకు..!!

23.   విడివడని జ్ఞాపకం తానైంది_కలలాంటి వాస్తవమై వెన్నాడుతూ...!!

24.   నిషాదమెరుగని విషాదమది_మదిని లాలించే మౌనంలో...!!

25.   పటిష్టమయిన పునాది మనది_చెలిమి చలువరింతల సందిట...!!

26.   అలుక చిన్నబుచ్చుకుంది_గారంలో నయగారం రంగరించినందుకనుకుంటా...!!

27.   కన్నీటి నవ్వులెన్నో_కనబడని కాలం మాటున..!!

28.  బానిసత్వం కాదది_అక్షరాలతో మమేకమైన బాంధవ్యమిది...!!

29.  కాలనాగు నైజమది_కాలం దాయలేని నిజాన్ని వెళ్ళగక్కుతూ..!!

30.   మనసుని అనువదించాయి అక్షరాలు_మమతకు మాటలతో పనిలేకుండా...!!

ఎడారిపూలు సమీక్ష ....!!

                సామాజిక సమస్యలపై బాధ్యతాయుత రచన " ఎడారిపూలు "..!!
           సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తిగా, కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూ ముందు తరాల మానవత్వాన్ని దాటిపోనీయక చక్కని పరిణితి గల కథలను అల్లాడి శ్రీనివాస్ తన " ఎడారిపూలు " కథా సంపుటిలో అందించారు. చక్కని సహజ ఇతివృత్తాలను ఎన్నుకుని మన కథేనేమో ఇది అన్నంతగా మనం చదువుతున్న కథలో మమేకమైపోయేటట్లుగా రాసిన తీరు అభినందనీయం.
         మొదటి కథను పాత జ్ఞాపకాలతో పుట్టిన ఊరుపై మమకారాన్ని చాటుకుంటూ తమ వాడుక భాషలో, యాసలో రాయడంలోనే పురిటిగడ్డపై ఉన్న ఇష్టం తెలుస్తోంది. ఇరవై ఏళ్ళ తరువాత మళ్ళీ పుట్టిన ఊరికి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ పలకరింపులతో జరిగిన పరామర్శల కబుర్లు చదువుతుంటే మనమూ గతంలోనికి వెళ్ళకుండా ఉండలేనని పరిస్థితిని కల్పించిన కథలాంటి వాస్తవమే అస్పె జారిన కస్పి. వానలు లేక, కల్తీ విత్తనాల మెాసానికి గురైన మధ్యతరగతి రైతు ఆర్థిక అవసరాలకు సతమతమౌతూ తనువు చాలించాలన్న నిర్ణయాన్ని పురిటిబిడ్డతో మార్చడం బాట ఎరిగిన పాట కథలో మనం చదవవచ్చు .ఆధునిక మార్పులకు అనుగుణంగా మనమూ మారుతూ, పరిస్థితులను మనకనుకూలంగా మలుచుకోవాలని మార్పు కథలో సూచించారు. మనిషిలోని మానవత్వానికి, కృతజ్ఞతకు చక్కని తార్కాణం అమావాస్యకు వెన్నెలొచ్చింది కథ. ఇది చదివినప్పుడు నాకు యండమూరి గారు చెప్పిన ఆయన జీవితకథ గుర్తుకు వచ్చింది.రైతుకూలి కాయకష్టాన్ని, వ్యాపారుల దళారితనాన్ని చెప్తూ, జీవిత వైరుధ్యాలను వివరిస్తూ చదువు ఆవశ్యకతను చెప్పిన కథ మబ్బులు తొలిగిన వేళ. ఎన్నో ఆర్థిక అవసరాల కోసం అనుబంధాలకు దూరమైన వలసల జీవితాల మనసుల వ్యథలను కళ్ళకు కట్టినట్టుగా చూపిన కథ ఎడారిపూలు. ఈనాటి ఎన్నో జీవితాలకు ప్రతిబింబమీ కత. చదువుతుంటే మనసు ఆర్ద్రమవక మానదు. 
కుటుంబ అవసరాల కోసం డబ్బు సంపాదించడానికి  దూరపు కొండలు నునుపని గల్ఫ్ దేశాలు పోవడానికి పడే కష్టాలను, అక్కడికి వెళ్ళిన తరువాత పరిస్థితులను, మానసిక వేదనలను ఎడారి మంటలు కథ చెబుతుంది.
       అన్నీ తానైన అమ్మను మరిచిన బిడ్డల అమానుషత్వాన్ని చెప్పిన కత అవ్వ. మానవత్వాన్ని గుర్తు చేసిన మనిషితనం నిండిన కథనం. సంపాదనలో పడి మనం ఏం కోల్పోతున్నామెా, పిల్లల మనసుల్లోని దిగులును హృద్యంగా చెప్పిన కత అలుక్కుపోని హరివిల్లు. బిడ్డకు తల్లిపాల ఆవశ్యకతను తెలుపుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగ నిర్వహణలో తన బిడ్డకు అందించలేని తల్లిపాలను అందించడానికి ఓ తల్లి తీసుకున్న నిర్ణయాన్ని చెప్పిన కథ అమృతధార. ప్రభుత్వ ఉపాధ్యాయుల అంకిత భావాన్ని, గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ బడులు బతికించుకోవడం ఎలా అన్న విషయాన్ని చక్కగా వివరించారు బడి కథలో. పొరుగింటి పుల్లకూర రుచి సామెతను గుర్తు చేసుకోకుండా ఉండలేము అంద(మైన)ని ఆకాశం కథ చదువుతుంటే. ఈర్ష్యాసూయలతో మనఃశాంతి కరువౌతుందన్న విషయాన్ని గుర్తు చేస్తుందీ కథ. కుటుంబంలో ఒకరు అనాలోచితంగా చేసిన పని ఆ కుటుంబాన్ని ఎంత క్షోభకు గురి చేసిందో తెలిపే కథ డేంజరస్ విండో. మలి వయసులో దూరమైన అనుబంధాలను తల్చుకుంటూ, ఒంటరితనం నుండి బయటపడటానికి చేసిన కొందరి ప్రయత్నాలే ఆత్మీయ సదనం కథ. బ్రూణ హత్యల ఉదంతమే చిట్టితల్లి కథ.
విధి ఆడే వింత నాటకంలో మనసు లేని 'మూడు'ముళ్ళు ఎలాంటివో, మనసున్న ప్రేమ గొప్పదనాన్ని చాటిన కథ 'మూడు'ముళ్ళు.
            అల్లాడి శ్రీనివాస్ రాసిన " ఎడారిపూలు " కథా సంపుటిలో ప్రతి కథా వస్తువు ఊహాజనితం కాదు. మనచుట్టూ జరుగుతున్న సంఘటనలే కథల్లో పాత్రలుగా మనకు కనిపిస్తాయి. తరిగిపోతున్న అనుబంధాలు, మానవతా విలువలు, సమాజంలో మన పాత్ర, కుటుంబ అవసరాల కోసం దూర దేశాలు పోవడం ఇలా ఎక్కువగా తాను చూసిన సంఘటనలకు కథారూపాన్నిచ్చి సుళువైన శైలిలో చక్కగా రాసారు. కాకపొతే చాలా కథలు తెలంగాణా భాష, యాసలో రాసి ప్రాంతీయత మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సున్నితమైన కథా వస్తువులను అవ్వ, తల్లిపాల ఆవశ్యకత, చదువు విలువ ఇలా ప్రతి చిన్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పారు. సమాజానికి అవసరమైన కథలను " ఎడారి పూలు " పుస్తకం ద్వారా అందించిన అల్లాడి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు.

22, అక్టోబర్ 2019, మంగళవారం

రెక్కలు...!!

1.  నినాదంలో
ఆవేశం
నివేదనలో
ఆక్రోశం

వ్యక్తీకరణ ఏదైనా
వినిపించేది వేదనే..!!

2.   నోటితో
మాటలు
నొసటితో
విరుపులు

అవగతం కాదు
అసలు నైజం..!!

3.    చేసేది
ప్రభుత్వోద్యోగం
జీతంగా తీసుకునేది
ప్రజల సొమ్ము

పని చేసేది
అధికారానికి...!!

4.   క్రమాక్రమ
శోధన
కూల్చివేతల
లక్ష్యం

ప్రజాధనం
దుర్వినియెాగం..!!

5.   కట్టడం
నేలమట్టం
సచివాలయం
పాలనా సౌలభ్యం

నిర్మాణమేదైనా
శాశ్వతం పునాది...!!

6.   గెలుపోటముల
ఆరాటం
మనిషి జీవితమెుక
కదనరంగం

మానసిక ప్రశాంతత
మరణం...!!

7.   అవసరానికి
కాళ్ళు
ఆదమరిచామా
జుట్టు

ఏమరుపాటు
కూడదు...!!

8.    అధికార
మదం
అస్తవ్యస్త
పాలన

జన జీవితాలు
అతలాకుతలం...!!

9.   గెలిచిన ప్రతివాడు
విజేత కాదు
ఓడిన ప్రతివాడు
పరాజితుడు కాదు

గెలుపోటముల లెక్కలు
సరిచూసేవాడు ఆ పైవాడు..!!

10.   అంగడి సరుకయ్యింది
అమ్మదనం
అష్టావక్రుల
చేతబడి

కాదేది అనర్హం
ధన పాశానికి..!!

11.   పరాయితనం చేసింది
పట్టాభిషేకం
అయినవారివ్వలేదు
ఓ ఆత్మీయాలింగనం

ఇంటి వైద్యానికి పనికిరాదు
పెరటిచెట్టు..!!

12.   చేతికి
పని
కలానికి
రాత

అందమైన
అలంకారం..!!

13.   వ్యాధి
బాధిస్తుంది
వ్యసనం
వదలదు

నష్టం
జీవితానికి...!!

14.   కూల్చివేతల్లో
ఉన్న తొందర
పథకాల
మార్పుల్లో వేగిరత

నిబద్ధత
అభివృద్ధిలో కనపడాలి...!!

15.   పురిటి నెప్పులు
భరిస్తుంది
మంచైనా చెడైనా
బిడ్డను సాకుతుంది

పాపాల భైరవి
ధరిత్రి...!!

16.   అడ్డుపడుతున్న
అహం పొరలు
ఒప్పుకోలేని
అనుభవ రాహిత్యము

నమ్మక తప్పని
వాస్తవ సందర్శనం...!!


17.    మనసుతనాన్ని

సంరక్షించాలనుకుంటూ

మనిషితనాన్ని

మరిచిపోతోంది


అక్షరాల

అసహనంలో...!!


18.    చెక్కిలిపై 

జారిన కన్నీళ్ళు 

మనోసంద్రపు

సుడిగుండాలు


దాచేసే సాక్ష్యమే

చిరునవ్వు...!!

19.    జనారణ్యంలో 

ఆధిపత్య పోరు

వనారణ్యంలో

జాతిపోరు


ప్రపంచం 

యుద్ధభూమి...!!

20.   అర్థమయ్యేలా అనువదించేవి

అక్షరాలు

అర్థం కాని అనువాదం 

మనసు


వాదానువాదాల సమతూకం

జీవితం..!!


21.   ఏలినాటి శని

ఏడేళ్ళు

ఎన్నికల శని

ఐదేళ్ళు


కర్మఫలం 

కాటికి పోయే వరకు...!!


22.   వరుసలో పేర్చిన

అక్షరాలు కొన్నే

అందించే భావాలు

అనంతం


వాణీ కటాక్షం

పూర్వజన్మ సుకృతం...!!

23.   గురుతు తెచ్చే

జ్ఞాపకాలకు

నిలువుటద్దం 

ఈ అక్షరాలు


పరమార్థమెరిగిన

రాతలివి..!!

24.   ఆకాశం 

చేతికి అందదు

సముద్రానికి 

ఆవలి తీరం తెలియదు


మనసు గుట్టు

విప్పలేము...!!


25.   కళలు

అందరివి

నైపుణ్యం 

కొందరిదే


ఫలమేదైనా

పూర్వజన్మ సుకృతం...!!

26.   గీతల్లో

ముగ్గులు

రాతల్లో

జీవితాలు


ఇదేనేమెా

విధి విలాసం...!!

27.  రెప్పల పొదిలో

అంబుల గుంపు

గుప్పెడు గుండెలో

జ్ఞాపకాల చప్పుళ్ళు


ముత్యాల సరాలే

మనసు రాగాలు..!! 

28.   మనసు

మాయమైంది

మనిషి

బతికేవుంది


జీవించడానికి జీవితానికి

తేడా ఇదేనేమెా...!!  

29.   తొలిసందె

మలిసందె

మధ్యన

నడిమింటిసంధ్య


జీవనసందెలన్నీ

సూర్యోదయాస్తమయాలే..!!


30.   మరిపించడం

తెలుసు

మురిపించడం

తెలియదు


ఇదే 

నేటి మన అధికారం..!!



  

16, అక్టోబర్ 2019, బుధవారం

జీవన 'మంజూ'ష (డిసెంబర్ )

నేస్తం,
        ఒంటరితనం అనుభవించని వారు ఈరోజుల్లో లేరనే చెప్పాలి. మనకంటూ అందరు ఉన్నా,  ఒంటరితనం ఏదో ఒక క్షణం మన మనసు తలుపు తట్టలేదని అబద్ధం చెప్పలేము. ఈ ఒంటరి రక్కసి ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. ఎందరి ప్రాణాలనో బలి కోరుతోంది. పేదా, మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు అనే తేడా దీనికి ఏమాత్రమూ లేదు. పిల్లల నుండి పెద్దల వరకు అందరు దీని బారిన పడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు, జీవితాలను బలి చేసుకుంటున్నారు.
         ఒంటరితనానికి కారణాలు వెతకడం మెుదలుబెడితే సవాలక్ష సాకులు చెప్తారు కొందరు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు, కోపతాపాలు సహజం. మన ఇంట్లో కరువైన దగ్గరతనాన్ని మరోచోట వెదుక్కోవాలన్న ఆలోచనలతో ఉచ్ఛం నీచం మరచి ప్రవర్తించడం నేడు సర్వసాధారణమైపోయింది. మన అనైతిక ప్రవర్తనతో మరో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వెనుకాడని మనస్తత్వాన్ని అలవరుచుకుంటున్నాం. ఇది ఎంతో హేయమైన చర్య అని అనిపించక పోవడం దురదృష్టం.
           మనిషి కనిపెట్టిన డబ్బు నేడు మనిషినే శాసిస్తోంది. దీనికి కారణం మనం అనుబంధాలకు విలువనివ్వకుండా, ప్రతి బంధాన్ని డబ్బుతో కొలవడం, మన స్వార్థం మనం చూసుకుంటూ " నా " అన్న అక్షరంతో బతికేయడం మెుదలుబెట్టాం. బంధం, బాధ్యత మరిచి హక్కులు, అవసరాలతో, అహంకారం అలంకారమని మన చుట్టూ ఓ చట్రం గీసేసుకుని బతికేయడం అలవాటు చేసుకుంటున్నాం. చావు, పుట్టుకలు ప్రతి ఇంటికి సహజమని మర్చిపోతూ, ఈరోజు గడిచిపోయింది చాలనుకుంటున్నాం. రేపన్నది ఒకటుందని, తాతకు పెట్టిన ముంత మన తల వైపునే ఉంటుందని మర్చిపోయి, ఎగిరెగిరిపడుతున్నాం.
        ప్రపంచమంతా మన అరిచేతిలోనే చూసుకునే వెసులుబాటు సాంకేతిక కల్పించినందుకు సంతోషించాలో లేక ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరికెవరు ఏమీ కానట్టు ఉంటున్నందుకు బాధ పడాలో తెలియని అయెామయంలో పాత కొత్త తరాలకు మధ్యన నలిగిపోతున్న నేటి తరం పరిస్థితి ఇది. రక్త సంబంధాలు లేవు, కుటుంబ అనుబంధాలు కానరాని నేటి దుస్థితి మన భారతీయ వ్యవస్థకు తీరని నష్టం. అవసరానికి డబ్బులు కావాలి కాని అవసరమే డబ్బుగా బతుకుతున్న నేటి మనిషి, తను ఏం కోల్పోతున్నాడో తెలుసుకునే రోజు త్వరలో వస్తే బావుండు.   

       

12, అక్టోబర్ 2019, శనివారం

జీవన 'మంజూ'ష (నవంబర్)..!!

నేస్తం,
         మనిషికి పరిణితి అనేది ఎప్పుడు వస్తుందో, దేని వలన వస్తుందో తెలియడం లేదు. వయసు పెరిగే కొలది బాధ్యతలు పెరిగి మానసిక పరిణితి వస్తుందనుకుంటే అది తప్పనిపిస్తోంది కొందరి ప్రవర్తన చూసి. పోని చదువు సంస్కారం, విలువలు నేర్పుతుందేమెాననుకుంటే అదీ పొరబాటని తెలిసిపోతోంది. కీర్తి కండూతి కోసం వెంపర్లాడటంలో తప్పులేదు కాని ఎదుటివారిని అణగదొక్కి మనం మాత్రమే పేరు సంపాయించుకోవాలన్న స్వార్థం మనల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుందని మర్చిపోతున్నాం. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందని అందరు అనుకుంటున్నారు, కాని మనిషి మనిషితనపు సహజత్వాన్ని మరచి ప్రవర్తించడం రానున్న తరాలకు మంచిది కాదని తెలుసుకోలేక పోతున్నారు. 
       ఒంటరితనం, డబ్బు, కీర్తికాంక్ష, అధికారహోదా ఇలా ఎన్నో కారణాలతో బంధాలకు దూరమైపోతూ, ఆ లోటు పూడ్చుకోవడానికి మరో దారిని వెదుక్కునే ప్రయత్నంలో కొందరు తమ చదువు, హోదా మరచిపోయి తప్పటడుగులు వేయడం అతి సహజ చర్యగా మారిపోయింది. దీని వలన ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యం అయిపోయాయి. ఒకప్పుడు ప్రపంచం చాలా పెద్దది. ఇప్పుడు సాంకేతికత పెరిగి ప్రపంచమంతా మన అతిచేతిలోనే ఉండటంతో మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా మన దేశంలోనే. ఒకే ఇంట్లో నలుగురు ఉంటున్నా ఎవరి దారి వారిదే. ఎవరి అభిప్రాయాలు వారివే. సర్దుకుపోవడం అన్న మాట తెలుగు భాషకు దూరమైపోతుందేమో కొన్ని రోజుల్లో అన్నట్టుగా అనుబంధాలు తయారవుతున్నాయి. మన దేశానికి తలమానికమైన కుటుంబ వ్యవస్థలు కూడా ఇకపై కానరావేమోనన్న భయం చోటు చేసుకుంటోంది. 
      సమస్య కొత్తగా ఏం పుట్టలేదు. మనిషి పుట్టుక ప్రారంభం నుండే సమస్య మొదలైంది. బతుకు పోరాటం సాగించడానికి ఆదిమానవుడు ఒక్కో అడుగే వేసుకుంటూ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయాలు కనుక్కోవడంలో తన మెదడుకు పదును పెడుతూ నిత్యావసరాలను సమకూర్చుకోవడంతో మొదలుబెట్టిన ప్రయత్నాలు పలు మార్పులకు లోనై తిండి, బట్ట, గూడు మొదలైన నిత్యావసరాలతోపాటు, సాంకేతికంగా అభివృద్ధి సాధించడంలో పరిణామక్రమాన్ని అనుసరించి పరిపక్వత సాధించిన నాగరికత ఈనాడు. కాని ఏదో వెలితి ప్రతి ఒక్కరిలో. ఎందుకీ అసమానత, అసహనం అని కనీసం ఓ క్షణం ఎవరైనా ఆలోచిస్తే తరిగిపోతున్న కుటుంబ విలువలు, అహంతోను, ఆస్తుల కోసము దూరం చేసుకుంటున్న అనుబంధాలని గుర్తించిన రోజున అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మళ్ళి చూడగలమేమో..!

9, అక్టోబర్ 2019, బుధవారం

మొగ్గలు సమీక్ష...!!

               ముచ్చటైన మూడు పాదాల మెరుపులు ఈ " మొగ్గలు "..!!
         తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలకు లోటు లేదు. లఘు కవిత్వం ఆదరణ పొందుతున్న ఈరోజుల్లో ఎన్నో లఘు కవితా ప్రక్రియలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ఏక్ తారలు, మణి మాలికలు, రెక్కలు, నానీలు, హైకూలు, రుబాయిలు ఇలా ఎన్నో కొత్త కొత్త ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో వెలువడుతున్నాయి. శతక పద్యాలు చాలా వరకు నాలుగు పాదాల్లో ఉంటాయి. వేమన, సుమతి శతకాల ప్రాచుర్యం ఎంత అనేది మనకు తెలుసు. అలానే ఈ  మొగ్గలు తెలుగు లఘు కవిత్వ సాహిత్య ప్రక్రియ కూడా ముచ్చటగా మూడు పాదాల్లో మనల్ని మురిపిస్తాయి.  మొదటి రెండు పాదాలు వస్తు, శిల్పాలకు ప్రాధాన్యతనిస్తే మూడవ పాదం చక్కని అభివ్యక్తితో మొదటి రెండు పాదాలకు ముక్తాయింపునిస్తుంది. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ చేతిలో పురుడు పోసుకున్న సరికొత్త లఘు కవితా ప్రక్రియ
" మొగ్గలు "
        డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన మొదటి మొగ్గ
   " కొన్ని అక్షరాలు చాలు
      కవిత్వాన్ని ఆవిష్కరించడానికి
      అక్షరం రసాత్మక కావ్యం "
వాక్యం రసాత్మకం కావ్యం నుండి అక్షరం రసాత్మక కావ్యాన్ని తొలి మొగ్గగా అందించి మొగ్గకు చక్కని అలంకరణ చేసారు.  మొదటి రెండు పాదాలకు ఓ చమక్కుతో మెరిపించడం ఈ మొగ్గల ప్రత్యేకత. అడుగులతో చివరి మజిలి చేరడాన్ని, కోరణం లోకానికి వెలుగునివ్వడాన్ని, కొన్ని మధుర జ్ఞాపకాల అనుభూతులు జీవితానికి, మానవత్వపు విలువలు మనిషికి ఆభరణమని, కొన్ని బంధాలు అనురాగ బంధాలు కావడాన్ని, మనిషి వ్యక్తిత్వపు లక్షణాలు, నవ్వుల ఉపయోగాన్ని, విజయం ఇచ్చే శక్తిని, మంచి పనులతో అందరి మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోతామని, పుట్టినప్పుడు తొలి కేరింత ఆనందాన్ని, పిల్లల అల్లరి సంతోషాలను, తప్పటడుగులు నేర్పే గుణపాఠాలను, పట్టుదలతో చదువు ఇచ్చే గౌరవాన్ని, మూడుముళ్ళ బంధం గొప్పదనాన్ని, బాధ్యతల బంధాలను, కుటుంబ సంబంధాలను, కష్టనష్టాలను ఇలా జీవితంలో ప్రతి అనుభూతిని అలతి పదాల్లో, సరళమైన భాషలో సున్నితంగా మూడు పాదాల మధుర వచనాల్లో ఆవిష్కరించడం అరుదైన విషయమే. ఈ చక్కని ప్రక్రియను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ అభినందనీయులు.
           " మట్టి చివరికి మనల్ని ఆహ్వానించనిదే
              మన జీవితం అప్పుడే ముగిసిపోదు
              జీవితం ఒక మహాప్రస్థానం "
మరణం గురించి ఎంత అద్భుతమైన మొగ్గ ఇది. కవితైనా, కథైనా పుంఖానుపుంఖాలుగా రాసినంత మాత్రాన గొప్పగా ఉండదు. చెప్పదల్చుకున్న విషయాన్ని అర్థవంతంగా, సూటిగా, స్పష్టంగా చదువరుల గుండెల్లోనికి దూసుకుపోయేటట్లుగా వచనమైనా, కవిత్వమైనా ఉంటే చాలు. పది కాలాలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎంత ఎక్కువ వాక్యాల్లో చెప్పామన్నది కాకుండా లోతైన భావాన్ని కూడా తక్కువ పదాల్లో ఎంత  భావయుక్తంగా చెప్పామన్నది ముఖ్యం.
      " ఆలోచనలు వెంటాడినప్పుడల్లా
         అక్షరాలు మొలకెత్తుతూనే ఉంటాయ్
         అక్షర సంగమం కవిత్వం "
కవిత పుట్టుక కష్టమైనా ఎంత సుళువుగా చెప్పేసారో తన ముచ్చటైన మొగ్గలో.
        స్నేహాన్ని, గమ్యాన్ని, గమనాన్ని, అనుభవాల జ్ఞాపకాలను, మనసు, మమతలను, నదీ, సాగర సంగమాలను, ప్రకృతి అందాలను, పక్షుల కిలకిలరావాలను, జీవితమంటే కష్టసుఖాలని, రైతుకు వాన ఎంత ముఖ్యమో, చినుకు అందాన్ని ముత్యమని, గేయం గాయపడిన అక్షరమని, విత్తు, చెట్టు ఉపయోగాలను, జాబిలి, వెన్నెల అందాలను, పరోపకారం ఆవశ్యకతను, స్వేచ్ఛ గురించి, చరిత్ర పాఠాలను, కవిత్వం చదువుతుంటే మనసు పొందే హాయిని, కవి తీరని దాహాన్ని, జీవమున్న అక్షరాలు సమాజ వికానికి దోహదపడతాయని, అక్షరాలను ప్రేమలో ముంచితే కాని పదాలు ప్రేమ కవిత్వాన్ని ఆవిష్కరించలేవని, కష్టాలను గెలిస్తే కాని సుఖాలు తెలియవని, సమాజాన్ని చదివితే కాని  లోకం తీరు తెలియదని, జీవితం ఓ తెరచిన పుస్తకమని, వేదన, బాధలు, కన్నీరు, ఆనందం, ఆహ్లాదం, జీవితపు అనుభవాలు, పసితనపు అమాయకత్వాలు, కలం విలువ, కాలం గొప్పదనం, రాజకీయపు రంగులు,
   " దుఃఖాన్ని ఎన్నిసార్లు ఒంపుకున్నా
     బాధలు ఎప్పటికి ఉంటాయి
     కన్నీటికి తడి ఎక్కువ "  ఇలా చెప్తూనే.. గుండె గాయపడితేనే కవిత్వమంటారు.
          అమ్మను, అమ్మ చేతి వంటను, ఆడపిల్లను, అంతరాలను, అసమానతలను, ప్రశంసలను, గుండె లోతుల్లో విషాదాలను, ఎన్నో ప్రశ్నల సమాధానాలను, కళలను, కల్లోలాను, ప్రేమను, ఆర్తిని ఇలా ప్రతి హృదయపు అనుభూతిని తన మొగ్గల్లో అక్షరాలకు అద్దుతూ, మన మనసులను వికసిమజేయడానికి, సమాజంలో మానవత్వపు పరిమళాలు వెదజల్లడానికి సాహిత్యపు సేద్యాన్ని కొత్తగా చేయదానికి ఈ మొగ్గలు కవితా ప్రక్రియ రూపొందించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు.

       

బాబోయ్ తెలుగు న్యూస్ ఛానల్స్...!!

మీకో దణ్ణం సామి....పర్యటనకు, వేడుకకు తేడా తెలుసుకుని ఛావండి. పెళ్ళి వేడుకకు వెళ్ళడం, రాజమండ్రి పర్యటనకు వెళ్ళడం ఒకటి కాదురా బాబూ... అధికారానికి కొమ్ము కాయండి తప్పులేదు... కనీసం కాస్త తెలుగు తెలుసుకుని ఏడవండి. ఇంతకు ముందు అంతే... మెాడి, చంద్రబాబు తిరుపతి వెంకన్న గర్భ గుడిలో కింద కూర్చున్నారు, పూజారులు లడ్డు అరిచేతిలో పెట్టారు. పవర్ కళ్యాణ్ రెస్ట్ రూమ్ కి వెళ్ళాడు... ఇవి కాదురా వార్తలంటే...న్యూస్ ఛానల్స్ చూడాలంటే భయమేసేటట్టు చేస్తున్నారుగా.. మరీ ఇంతలా దిగజారిపోవాలా... 
వీటికన్నా తెలుగు సీరియల్స్ ఛానల్సే నయం అనుకుంటా..

7, అక్టోబర్ 2019, సోమవారం

ద్విపదలు...!!

1.   కలమే రాయగలిగే కథనాలెన్నో
కాలంతో సాగే గుండెల్లో దాగిన కల్లోల సంద్రాలను...!!

2.  ఎడబాటే తెలుపుతుంది
ఎదలో దాగిన ఇష్టాన్ని  ఎరుగమంటూ...!!

3.   చూపు లేకున్ననేమి
మనోనేత్రంతో అనుక్షణం నీ దర్శనమే...!!

4.   మౌనంలో ఒలికాయి మాటలు
మనసాక్షరాలను చేరువకు రమ్మంటూ..!!

5.  అల'జడి అల్లంత దూరమే ఎప్పుడు
కన్నీటి కలత కల'వర పెడుతున్నా...!!

6.   అనుబంధపు ఆనవాలది
గతజన్మ బాంధవ్యాన్ని గురుతెరగమని గుర్తుచేస్తూ...!!

7.  అక్షరాలు తెలిపాయి
అద్దమంటి మనసదని..!!

8.  బంధాలకున్న అనుబంధమదేననుకుంటా
తెలియకుండానే మనసుకు చేరువగా వచ్చేస్తాయి...!!

9.    సంకోచ వ్యాకోచాలు అవసరమే
ఎద సవ్వడి తెలియాలంటే...!!

10.   తరిగిపోని అభిమానమిది
కరిగిపోని అనుబంధాలతో...!!

11.  విశ్వంతో పని ఏముంది
ఎద నిండుగా నువ్వుంటే..!!

13.   నక్షత్రాలెందుకు
నీ నవ్వుంటే చాలదూ..!!

14.   కొన్ని మౌనాలంతే
మనసుని మళ్ళిస్తాయి మాటలను వినమంటూ...!!

15.  నీ మనసు మకరందం
మాటల్లో ఒలికి పోతూ...!!

16.   చిరునామా తెలిపిన చెలిమి
గతపు జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ..!!

17.  అక్షరాలెన్ని సృష్టించాలో
నీ మౌనాన్ని మాటలుగా పేర్చడానికి...!!

18.   చెలియలి కట్టకు తప్పదు
సంద్రంతో స్నేహం చేయక..!!

19.   అలల ఆరాటమది
ఆగని పోరాటమై అందరికి ఆదర్శమై...!!

20.   రెప్పలిప్పాలని లేదు
కలలోనైనా కనిపిస్తావని..!!

21.   ఎన్ని పున్నముల పెట్టో
నీ నవ్వుల వెలుగులు...!!

22.   అక్షరాలకు అద్దకాలెందుకు
అందమైన భావాలుగా అవి అమరుతుంటే...!!

23.   శృతికి చిక్కిన సాహిత్యమిది
మదికి ఆహ్లాదమిచ్చే మౌనగీతమై...!!

24.  సజీవ చిత్రమే నీవు
స్వప్నం సాకారమైన వేళ...!!

25.   అలరించడం అక్షరాలకు అలవాటే
సాహిత్యపు సుమగంధాల చేరికతో...!!

26.   ఇష్టంగా ఉంది
నీ ఇష్టపదైనందుకేమెా...!!

27.   కాలమెంత తేలికైనదో
అందరి బరువుభారాలు తనపై పడుతున్నా...!!

28.  రంగుల కలే అది
కనుపాపల్లో అనుక్షణం కదలాడుతునే..!!

29.   మాటల విరుపులే
మౌనం వయ్యారాల్లో...!!

30.   అనువదించడం కష్టమే
అక్షరాలకు అలవి కాని మనసును...!!

2, అక్టోబర్ 2019, బుధవారం

ఏక్ తారలు..!!

1.   కన్నీరుని సైతం సిరాగా మార్చేస్తుంది_మనసు చేతిలోని కలమై...!!

2.   గుండె బడబానలంలా మండుతోంది_అనుబంధాల వెన్నుపోట్లకు...!!

3.   అనివార్యమైన అనుబంధమది_నాదైన ఏకాంతపు నేస్తంతో...!!

4.   కన్నీరే నేస్తమయ్యింది_కలికాలం అయినందుకేమెా...!!

5.   ఆగని పరుగు కాలానిదే_ఆనవాళ్ళను భవిష్యత్తుకు అందిస్తూ..!!

6.   స్వప్నంలో జీవితం కనిపించింది_నిశీథిని ఎదిరించే వెలుగుల్లో...!!

7.   ఆధిపత్యమెా జాడ్యం_అహమే అలంకారమనుకుంటూ....!!

8.   తిరస్కరణ మనసుకి చేరదు_చూపులక్కర్లేని ఆరాధన గుండెల్లో చేరితే...!!

9.  అమ్మ నేర్పిన అక్షరాలివి_ఆ ప్రేమంతా ఒలకబోయాలన్న తహతహ వాటికి..!!

10. మనసుదే అంతా_భావాలను హృదయపు సిరల్లో ముంచి రాయడంలో..!!

11.   ఆశ్రయమిచ్చే అక్షరముండగా చింతెందుకు_మది భారాన్ని భావాలకందించడమే...!!

12.   నవ్వులన్నీ నక్షత్రాలే_పసితనపు అమాయకత్వం చేరితే..!!

13.   మౌనానికి మనసయింది_నీ ఊహలతో ఊసులాడాలని...!!

14.   ఏకాంతం ఎదురుదాడి చేసింది_ఊహలు నిండిన మదిని గదమాయించేస్తూ...!!

15.   గమనించే సమయమివ్వనిదే కాలం_తనతోపాటు మనల్ని లాక్కెళుతూ...!!

16.   వెదకడం నీకలవాటేగా_ఎదుటనున్నా గురుతెరగక...!!

17.   తరలిపోనన్నాను_వెదికి నీవలసిపోతావని..!!

18.   వీడ్కోలెరుగని చెలిమి మనది_నీడలా వెన్నంటి ఉంటూ..!!

19.   అక్షరాలు సేదదీరుస్తున్నాయి_మనసు మౌనాన్ని పదాలకందిస్తూ...!!

20.  అవే అక్షరాలు_మనసు మర్మాలను పసిగట్టేస్తూ...!!

21.  వేదనాక్షరాలు కలిపాయి ఇలా_వేసారిన మనసుకు ఓదార్పునిస్తూ..!!

22.   ఊసరవెల్లి మనస్తత్వమది_కారకులెవరన్నది కనిపెట్టలేకున్నా...!!

23.   ఎంత ఆరాధన నింపాలో అక్షరాల్లో_నీ మనసుకు చేరవేయడానికి..!!

24.  నీ మదిలో కాస్త చోటు చాలదూ_అక్షరాలతో నే సేద దీరడానికి...!!

25.   కలలాంటి కథలోనే ఓదార్పు_వెతల సంకలనాల బతుకులకు..!!

26.   ఆలోచనల మార్పది_అక్షరాలవే అయినా..!!

27.    తలపులే శ్వాసగా మార్చేసిన క్షణాలవి_మరెటు మరలనీయని బంధమై...!!

28.   కడలే ఆదర్శమట_మదిలోని బడబానలాన్ని దాచేయడంలో...!!

29.   మౌనంతో సహవాసం చేస్తున్నా_నీ మాటలు ఆలకించాలని...!!

30.   అలసటే తెలియలేదు_మాటల మౌనం మధ్యన రాజ్యమేలుతుంటే..!!

ఒక మెలకువ సమీక్ష...!!

                                              " మనసున్న మనిషికి ప్రతిబింబం ఈ ఒక మెలకువ.."
             ప్రతి భావుకుడు తన పరిశీలనను నలుగురికి అందించే ప్రయత్నంలో సాహిత్యంలో ఏదోవొక మార్గాన్ని ఎంచుకుంటాడు. అలా కవిత్వాన్ని ఎంచుకుని లఘు ప్రక్రియల్లో, కవితలుగా తెలుగు సాహిత్యానికి అక్షర తూణీరాలను అందిస్తున్న ప్రముఖుల్లో పి శ్రీనివాస్ గౌడ్ ఒకరు.
         మనిషిలో మరుగున ఉన్న మరో మనిషిని వెలికితీసే యత్నమే ఈ " ఒక మెలకువ " . జీవితాన్ని ఎంతో కొంత మనం తెలుసుకుని ఎదుటివారికి తెలియజెప్పడం గురించి చక్కగా మొదటి కవిత ఎంతో కొంతలో చెప్తారు. మనసు కదిలిపోయినంత మాత్రాన ఎదుటి మనిషి కన్నీళ్లు  ఆగిపోతాయా? అని బతుకుదెరువు కోసం తోపుడుబండే జీవనాధారమైన వ్యక్తిని కర్కశంగా, పాశవికంగా శిక్షించడాన్ని నిరసిస్తారు ఒక నిప్పురవ్వ కార్చిచ్చు అయ్యే దృశ్యం కవితలో. చెప్పాలంటే చాలా ఉంది ఈ కవితలో చదువుతుంటే దృశ్యాలు అలా కళ్ళ ముందు కదలాడతాయి. కవి చాలా గొప్పగా ఆవిష్కరించారు వాస్తవ సంఘటనను. తర్కం గురించి నువ్వు - నేను ఒకటే కవితలో నాస్తిక, ఆస్తిక వాదాన్ని వినిపిస్తారు బహు లాఘవంగా. బడిలోని అమ్మ ఆయమ్మ గురించి రాసిన కవిత గురించి ఎంత  చెప్పినా తక్కువే. నే చదివిన మొదటి కవిత ఆయమ్మ గురించి, రాసిన మొదటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్.ఇంత వైవిధ్యమైన వస్తువును ఎంచుకున్నందుకు కవికి అభినందనలు. తుపాన్ ముందరి ప్రశాంతత గురించి చెప్పడానికి ఏమి ఉండదు, ఎంతోమందికి అనుభవపూర్వకమే. అది అక్షరాల్లో అద్భుతంగా చెప్పారు. ఆత్మ సౌందర్యాన్ని, మద్యం వలన నష్టాన్ని బాగా చెప్పారు. మగత కళ్ళతో పుస్తకాల్లో నిద్ర పేజీల్ని చింపడంలో చితికిన బాల్యాన్ని, ఆ పసి చేతులు చేస్తున్న కష్టాన్ని, వాడు పడుతున్న ఛీత్కరింపులను చాలా బాగా చెప్పారు అతనికి నిద్ర ఒక కల కవితలో. నది మనసుని అది ప్రవహించినంతమేరా చక్కగా చూపించారు మనకి కూడా. కులమత వర్గ వైషమ్యాలను చెప్తూ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తారు మన పిల్లలకు ఏ కానుకనిద్దామంటూవాడికి ముఖం లేదు కవితలో. కాసిన్ని అక్షరాల ఆసరాతో, ఒకే ఒక్క వీడలేని చూపుని, ప్రకృతిలో ప్రతి అణువులో నేనుంటానంటూ, అతని సమక్షంలో మరణం లేని జీవితాన్ని, మళ్లీ మళ్లీ అతనే గుర్తుకు రావడాన్ని, విస్తరిస్తున్న శిథిలాల మధ్య అస్తమిస్తున్న వాళ్ళని, వీడని జ్ఞాపకాలను దేదీప్యమానంగా, వాన చుక్కలు వాలడాన్ని ఇలా ప్రతి భావాన్ని చక్కగా అక్షర తూణీరాలుగా మలిచారు. ముంజ కవిత తాటికాయల్లో ఆ ముంజలు ఎలా ఉంటాయో, అబ్బా నిజంగా ఆ ముంజలు తిన్న పసితనాన్ని, ఆ మధురమైన రుచిని మళ్ళీ ఆస్వాదింపజేశారు తన కవితతో. బయటి ప్రయాణం గురించి మన అందరికి తెలిసిందే. లోపలి ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే ఈ కవిత తప్పక అందరు చదవాల్సిందే. రైతు మృత్యుకోత గురించి హృదయవిదారక వేదనను కోత కవిత చెప్తుంది. దృశ్యాలు.. కలలు.. ఆకాంక్షలు.. , పిల్లలు.. దేవుడు.. మరికొన్ని మాటలు.., మాటల్లేని మొండి గోడల మధ్య, వర్షం పడితే, చీకటి.. వెన్నెలా.., మనసు దుమ్మును దూలపమని ఒక మెలకువను, దూరమైనా అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ  ఏకాకి ప్రేలాపనను, తనను తాను తెలుసుకోవడాన్ని నువ్వొక లోయ-నీలమేఘమాయను కవితలుగా చక్కని వాస్తు శిల్పాలతో చెక్కారు. ఆమె.. ఇంకా అక్కడే ఉందా..? కవిత గురించి చెప్పడం చదివితే మీకు మనసు పొరల్లో ఎక్కడో ఓ జ్ఞాపకం మెదలడం ఖాయం. పల్లెకారుల కడగండ్లు, వారి జీవన విధానము కొట్టుబడి కవితలో కనిపిస్తుంది. ప్రకృతి ప్రణయ గీతాలు ఒక ఋతువు నుండి మరొక ఋతువుకి కవితలో వినవస్తాయి. తన అభిమానాన్ని చాటుకుంటూ మర్మయోగి గురించి, అక్షరాలా రెండక్షరాలు చేసే అద్భుతాన్ని, ఆబాలను సబలగా చేసి నలుగురికి ఆకలి తీర్చే అమ్మలా ఆ నలుగురు ఏం చేసారో చెప్తారు. వచ్చే రోజుల్లో, ఒక చావు- మరో అసహనం, ఆమె-నేను-కవిత్వం, దుఃఖం ఒక దూదిపింజ కవితలు చక్కని ప్రేమ, బాధలను చెప్పే కవితలు. మూడో తరం - మరిన్ని ప్రశ్నలు, మరణశయ్య మీద అమ్మకు, కారణ జన్ముడు, పసితనం ఓ వరం కవితలు కవి సున్నిత మనసుకు అడ్డం పడతాయి. వాక్యానికి వేయి ముఖాలు... అంటూ వాక్య పాదాల వద్ద కవితలో వాక్యం విలువను చక్కగా చెప్తారు. మిగిలే ఉంటుంది, జెన్ వచనాలు చక్కని అనువాద కవితలు.

     ఒక మెలకువ కవితా సంపుటిలో కవి పి శ్రీనివాస్ గౌడ్ చక్కని వైవిధ్యమైన వస్తువులతో, అద్భుతమైన భావాలను అందించడంతోపాటుగా, సమాజపు పోకడలను, మనుష్యులలో లోపిస్తున్న మానవతా విలువలను, ప్రకృతి అందాలను అక్కడక్కడా మెరిపిస్తూ, బాల్యాన్ని, కొన్ని జ్ఞాపకాలను, అమ్మను అందరికి గుర్తు చేయడంలో కృతకృత్యులయ్యారు. ఇంత చక్కని వచన కవిత్వాన్ని అందించిన శ్రీనివాస్ గారికి మనఃపూర్వక అభినందనలు. 

అక్షర స(వి)న్యాసం ఆవిష్కరణ..!!

వంకాయలపాటి చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా అక్షర స(వి)న్యాసం ఆవిష్కరణ ఒక కవి రెండు కవితలు సభలో ఆహ్లాదంగా జరిగింది. సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు..



Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner