చిన్నప్పుడు మనం అక్షరాలు దిద్దుకున్న బడిగుడికే ఇప్పుడు అతిథిగా..వెళ్లే అరుదైన అవకాశం..!!
31, జనవరి 2026, శనివారం
26, జనవరి 2026, సోమవారం
పద్మభూషణుడు “నోరి దత్తాత్రేయుడు”
పద్మభూషణుడు “నోరి దత్తాత్రేయుడు” గారికి హృదయపూర్వక అభినందనలు.
” కాన్సర్ వైద్యరంగంలో అగ్రగణ్యుడు మన తెలుగువాడు నోరి “
వైద్యో నారాయణో హరిః అన్న మన భారతీయ ఆర్యోక్తికి నిలవెత్తు నిదర్శనం డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు. మన ప్రాచీన వైద్యవిద్యకు ధన్వంతరి మూలపురుషుడైతే, మెుట్టమెుదటి శస్త్రచికిత్సను చేసిన వైద్యుడు శుశ్రుతుడు. ఆ శుశ్రుతనికి ఏమాత్రం తీసిపోని విధంగా కాన్సర్ గురించి ప్రపంచమంతా భయపడే తరుణంలో తనదైన వైద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ప్రాణదానం చేసిన దేవుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు.
దత్తాత్రేయ గారిది కృష్ణాజిల్లా లోని తోట్లవల్లూరు. పుట్టింది మంటాడలో. సత్యనారాయణ, కనకదుర్గమ్మ గార్ల ఆఖరి సంతానం. తండ్రి ఉపాధ్యాయుడు. దత్తాత్రేయ గారి వయసు నాలుగు సంత్సరాలప్పుడు తండ్రి కురుమద్దాలి శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమంలో ప్రవచనాలు చెప్తూ, ప్రమాదవశాత్తు మరణించారు. తనకున్న కొద్దిపాటి పొలాన్ని ఆశ్రమానికే ఇచ్చేసారు.ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బు కూడా ఆయన ఆశ్రమానికే ఇచ్చేవారు. ఆయన మరణానంతరం పిల్లల ఉన్నతి కోసం ఆ తల్లి పడని కష్టం లేదు. దత్తాత్రేయ గారి పరీక్ష ఫీజు కట్టడానికి తల్లి గాజులు అమ్మి ఫీజు డబ్బులు ఇచ్చారు.
దత్తాత్రేయ గారు ఉస్మానియాలో అంకాలజీలో పరిశోధనా విద్యార్థిగా ఉన్నప్పుడు, ఓ అంతర్జాతీయ సదస్సుకు అమెరికా నుండి వచ్చిన వైద్యబృందానికి సహాయకుడిగా నియమించారు. ఆ సమయంలో వీరిలోని కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసను కనిపెట్టి ఓ పెద్దాయన తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అమెరికా వచ్చినప్పుడు కలవమన్నారట. చదువు పూర్తయిన తర్వాత ఇండియా , అమెరికాలలో చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరిగా తనకు విజిట్ంగ్ కార్డ్ ఇచ్చినాయనను వెదుక్కుంటూ స్లోన్ కెటరింగ్ మెమోరియల్ కేన్సర్ సెంటర్ కి వెళితే, అక్కడ కూడా ఫెలోషిప్ ఎంపికలు అయిపోయాయని, ఎవరైనా రాకపోతే సీట్ ఇస్తామన్నారట. మంచి మనసుకు దైవం సహకరిస్తుందనడానికి నిదర్శనంగా వీరికి సీట్ లభించడమే కాకుండా, అంచెలంచెలుగా ఎదిగి తనకు విజిటింగ్ కార్డ్ ఇచ్చిన పెద్దాయన చైర్మన్ పదవినే చేపట్టారు.
ప్రపంచం గుర్తుంచుకునే శాస్త్రవేత్తగా కాన్సర్ వైద్యంలో రోగికి సురక్షితమైన రేడియేషన్ యంత్రాన్ని కనిపెట్టారు. ఈనాడు ప్రపంచమంతటా కాన్సర్ రేడియేషన్ లో ఈ పరికరాన్నే వాడుతున్నారు. కాన్సర్ కి కారణాలను కనుగొనడానికి, అరికట్టడానికి ఎన్నో పరిశోధనలు చేసి ఎందరికో ప్రాణదానం చేసారు. వీరి వైద్యసేవలు ప్రపంచమంతటా విస్తరించాయి. ఎందరో సినీ,రాజకీయ ప్రముఖులకు వీరు తన వైద్య సేవలను అందించారు. లెక్కకు మించిన ధనం సంపాదించడం తన చేతిలోని పనే అయినా, ప్రముఖులు ఇవ్వబోయిన ధనాన్ని సైతం సున్నితంగా తిరస్కరించారు. బసవతారకరామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్ పాలకవర్గంతో కలిసి పనిచేసారు. అన్నింటికన్నా ముఖ్యమైనది తనింతటివాడు కావడానికి కారణమైన స్లోన్ కెటరింగ్ మెమోరియల్ వ్యవస్థాపకుడికి చర్మ కాన్సర్ వస్తే, తన వైద్యంతో ఆయనను బ్రతికించి ఓ వైద్యునిగా గెలిచారు.
ఇన్నేళ్ళ కేన్సర్ పరిశోధనలకు, వైద్యసేవలకు దక్కాల్సిన అన్ని పురస్కారాలు ఆయనను వరించాయి. పేదరికం ఉన్నత ఆశయానికి అడ్డంకి కాదని డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి జీవితం నిరూపిస్తోంది. అత్యున్నత వ్యక్తిత్వం, సేవానిరతి మెండుగా గల వీరి జీవితం యువతకు స్పూర్తిదాయకం. వీరి ఆత్మకథ “ ఒదిగిన కాలం “ లో ఎన్నో విషయాలను పొందుపరిచారు. “ కదిలే కేన్సర్ ఆసుపత్రి “ని నిర్మించి వైద్యసేవలు అందించాలన్న సదాశయం, కేన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్న పుస్తకంలో అనేక విషయాలను తెలుగువాళ్ళతో పంచుకోవాలని పుస్తకం రాయడానికి పూనుకున్నారు. వీరి భార్యాకూతురు కూడా డాక్టర్లే. కొడుకు లాయర్.
వైద్య శాస్త్రవేత్తగా అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తూ అమ్మకు తన మెుదటి జీతంతో బంగారు గాజులు కొని తెచ్చారట. మన తెలుగువాడి ఘనతను యావత్ ప్రపంచమే కీర్తిస్తోంది ఈనాడు. ప్రపంచాన్ని నడిపే కనబడని శక్తిని దైవమని నమ్మే వ్యక్తి, నిలువెత్తు మానవతామూర్తి, శిరిడిసాయి భక్తుడు అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయ గారిని కృష్ణా డిస్ట్రిట్ లారి ఓనర్స్ ఫౌండేషన్ తరపున ఈ చిరు సత్కారం చేయడం శ్రీకృష్ణడికి అటుకులిచ్చిన కుచేలుడిలా భావిస్తూ నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఈ సదవకాశానికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
13, జనవరి 2026, మంగళవారం
ఓ మాట..!!
సినిమాని సినిమాలా చూడాలి. డబ్బుల కోసమో, మరోదాని కోసమో రివ్యూలు రాయడం “అతడు” అప్పటి నుండి చూస్తూనే వున్నాము. నిజాయితీగా రాసే రివ్యూలకు విలువ వుంటుంది. ఒక నటుడిలో అన్ని కోణాలను ఆవిష్కరించడం చాలా కష్టం. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించేది అభిమానుల నుండి ఆదరణ. “మన “డార్లింగ్” కి ఆ ఆదరణ మెండుగా వుంది. సరదాగా చూడాల్సిన సినిమా “రాజాసాబ్”.
12, జనవరి 2026, సోమవారం
జీవన మంజూష 01/26
నేస్తం,
సమస్యకు భయపడుతుంటే, అది మనల్ని ఎక్కువగా భయపెడుతుంది. ఒక్కసారి సమస్య నుండి పారిపోవాలన్న ఆలోచనను వదిలి, దానికి ఎదుర్కోవడానికి సిద్ధపడితే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కారణాలు లేని భయాలు మన జీవితాలను అతలాకుతలం చేస్తాయి. మన అసహనాన్ని ఇతరుల మీద చూపించడం కూడా ఓ పెద్ద మానసిక సమస్యే. సమస్య ముందుగా మనిషి బలహీనతపై దాడి చేస్తుంది. మానసిక స్థితి బలంగా వుంటే, సమస్య భయపెట్టదు. పరిష్కారం చూపెడుతుంది.
ఈరోజుల్లో ఎవరి జీవితాలు వారివి. ఎవరి సమస్యలు వారికున్నాయి. గడిచిన కాలాన్ని మనకు జ్ఞానం అందించిన గురువుగా భావిస్తే, తరువాతి జీవితాన్ని చాలావరకు సంతోషంగా గడపగలం. ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలు మనిషిని మానసిక బలవంతుడిగా చేస్తాయి. ఓటమి మనకు మనవారెవరో, పరాయివారెవరో కూడా చూపిస్తుంది. ఓటమి మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. గెలుపు మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కాలక్రమంలో మరొకరి గెలుపు మనల్ని ప్రపంచం మర్చిపోయేలా చేస్తుంది. మన గెలుపు ప్రపంచానికి గుర్తుండి పోవాలంటే ఆ గెలుపు అనితరసాధ్యం కావాలి.
నలుగురికి మంచి చేసే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు, దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా మనం మాత్రమే ఎదగాలనుకుంటే, పర్యవసానం తెలిసినా దానిని గుర్తించనట్లుగా నటించడం మన మానసిక బలహీనత. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కాని చెడు చేయకుండా వుండటమే మంచి చేసిన దానికన్నా గొప్ప విషయం. సామాజిక మాధ్యమాలు విరివిగా అందుబాటులో వున్న ఈనాడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికి తెలిసిపోతోంది. మన పక్కనే హృదయవిదారక సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా వాటికి మన స్పందన ఏమి వుండదు. కాని ప్రపంచంలో ఏ మూలనో జరిగిన సంఘటనకు మాత్రం అతిగా స్పందించేసి, మనం గొప్ప మానవతావాదులమని చాటుకుంటుంటాం.
రోడ్డు మీద మనిషి చావుబతుల్లో వుంటే మనకెందుకని పక్క నుండి వెళ్లిపోయే మనకు సూక్తిముక్తావళి చెప్పే నైతికత వుందంటారా! కనీసం ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించని మన మనస్తత్వానికి మనం ఏ మందు వేసుకోవాలో ముందు తెలుసుకోవాలి. ముందుగా మన ఇంటి, చుట్టుపక్కల సమస్యలకు స్పందించి, తరువాత ప్రపంచాన్ని గురించి ఆలోచిద్దాం. ఏమంటారు మరి?
మలుపు సమీక్ష
జీవితపు మదిలో మలుపుల సమ్మేళనమే ఈ “మలుపు”
ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు. అవి తీపిచేదుల కలయికలు. అనుభవాలను, అనుబంధాలను అందరు అక్షరీకరించలేరు. అనుభవాలకు అనుబంధాలను జత కూర్చి చక్కని కథలుగా మన ముందుకు “మలుపు” కథల సంపుటిని తీసుకువచ్చారు డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు. డాక్టర్ లక్ష్మీ రాఘవ గారి కథలు చదువుతుంటే చాలా వరకు అవి మనకు జరిగిన అనుభవాలో లేక మన చుట్టూ వున్న సమాజంలో మనకు ఎదురుపడిన సంఘటనలో అని అనిపించక మానదు. సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే తీరులో ఈ కథలన్నీ వున్నాయి.
జీవితంలో బాధల వెంట సంతోషాలు వుంటాయని తెలిపే కథ “మలుపు”.
“కాలం మారితే” కథ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా మనిషి ఆలోచనా విధానాన్ని తెలిపిన కథ.
టెక్నాలజీ పెరగడం మంచిదో కాదో అంటూ నిర్ణయాన్ని పాఠకులకు వదిలేసిన కథ “జాతకం”.
“అప్పగారి పాపోడు” పల్లెటూరి ఆత్మీయతను మనసుతో చూపించిన కథ.
ఓటమి నేర్పిన సత్యంతో గెలుపు ఎంత తృప్తినిస్తుందో చిన్నపిల్లలతో చెప్పించిన కథ “స్నేహం” చాలా బావుంది.
వస్తువులతో పాటుగా మనిషి శరీరానికి అప్పుడప్పుడు “రిపేరు” అవసరమే.
హృద్యమైన మనసు ఆర్తి, ఆర్తనాదము కలిస్తే “కంటి నీరు” కథ.
“అవసరానికి” ఎవరు మనవాళ్ళో తెలిపిన స్నేహితుల కథ.
“మనుమరాలి ప్రేమ” కథలో అమ్మమ్మ మనసును తెలిపారు.
ఇల్లాలి తెలివి ఇంటికి వెలుగు అని నిరూపించిన కథ “కమల”.
పదిమందికి వరంగా మారిన అంతర్లీన శక్తిని “శబ్దాల శాంతి” లో వినవచ్చు.
“రేపటి ప్రశ్న” కథ మనలోని చాలామంది కథే. ఈనాటి సమాజానికి అవసరమైన కథ.
జీవితంలో ఏది జరిగినా “కర్మానుసారమే” అన్న మాట నిజంగా నిజం.
గురువుల ప్రవర్తన పిల్లలతో ఎలా వుండాలనేది “తల్లి ఆవేదన” కథలో బాగా చెప్పారు.
“మారాల్సిన దృశ్యం” అనుబంధాల బాధ్యతలను సవివరంగా చెప్పిన కథ.
నిజాయితీకి దక్కిన విలువైన గౌరవాన్ని “నిజాయితీ నిడివి” కథలో చూడవచ్చు.
“ప్రాధాన్యత” కథ నిజంగా ప్రాధాన్యతే అమెరికా పిల్లలకు, ఇండియా తల్లిదండ్రులకు.
ఆత్మవిశ్వాసమే “ఆయుధం”గా మారి నలుగురిని ఆదర్శప్రాయమైన జీవితమే “ఆయుధం “ కథ.
ఇలానే మరి కొన్ని కథల సమాహారమే ఈ “మలుపు” కథా సంపుటి.
మానవత్వం అంటే ఏమిటో తెలియజెప్పిన కథ “నిబంధన”.
చివరిగా తమ యాభై ఏళ్ల అనుబంధాన్ని “జ్ఞాపకాల సంతకం”, “Journey of Life” అంటూ చిన్న కవితే అయినా మెుత్తం జీవిత సారాన్ని చెప్పేసారు.
డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు తన అనుభవాలను, మన అనుభవాలను ఏర్చికూర్చి ఈ సమాజానికి అవసరమైన విషయాలను, చాలా వరకు సమస్యలకు ముగింపులను కూడా సవ్యదిశగానే చూపించారు. ప్రతి సమస్యకు సాధ్యమైనంత వరకు మంచి పరిష్కారాలను సూచించారు. మనిషి మానసిక భావోద్వేగాలను ప్రతి కథలోనూ హృద్యంగా మలిచారు. 27 కథలతో వెలువడిన “మలుపు” కథా సంపుటి విలువైన పుస్తకం. అందరు తప్పక చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ లక్ష్మీ రాఘవ గారికి హృదయపూర్వక అభినందనలు.
9, జనవరి 2026, శుక్రవారం
పదిహేడు వసంతాలు
2009 జనవరిలో ఊపిరి పోసుకున్న నా బ్లాగు “కబుర్లు కాకరకాయలు” లో డిసెంబర్ 4 న మెుదటి రాత అంతర్జాలంలో పురుడు పోసుకుంది. గత పదహారు సంవత్సరాలుగా ఆ కబురు ఈ కబురు అంటూ దాదాపు 2489 పోస్టులు బ్లాగులో ప్రచురితమయ్యాయి. ప్రచురితం కానివి ఓ 50 పై చిలుకే వున్నాయి. ఇప్పటి వరకు ఓ 15 పుస్తకాలు ముద్రితమయ్యాయి.
మొత్తానికి పదిహేడు వసంతాల నా బ్లాగు “కబుర్లు కాకరకాయలు” కి వున్న లెక్కల జాబితా చూసి సంతోషమనిపించింది. అడపాదడపా ఎలా రాసినా ఆదరిస్తున్న అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు.





