19, ఏప్రిల్ 2025, శనివారం

వర్ణిక పుస్తకానికి ముందు మాటలు....!!

తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మరో ఆణిముత్యం వర్ణిక. ఈ లేఖా సాహిత్యం గురించి నాలుగు మాటలు రాయడం అంటే కొంచం కష్టమైన విషయమే. ఒక మనసులోని విభిన్న కోణాలను పరిచయం చేయడమే ఈ లేఖల ముఖ్య ఉద్దేశ్యం.. ఇప్పటి తరానికి తెలియని, మన తరం వరకు మాత్రమే తెలిసిన ఉత్తరాల అనుభూతులను, ఆ పరిమళాలను తరువాతి తరాలకు అందించడానికి చేసిన ప్రయత్నమే ఈ వర్ణిక. ఓ అమ్మ తనకు దూరంగా ఉన్న కొడుకుకి చెప్పిన తరిగిపోతున్న సాహిత్యపు విలువలు, ఓ ప్రేమికురాలి విరహ వేదన, ప్రేమికులు దూరంగా ఉన్నప్పుడు తమ ప్రేమ కోసం పరితపించే మనసులను, నిరీక్షణను, భార్యాభర్తల అనుబంధంలో దూరంగా ఉన్నప్పటి చిలిపి ఉహల కబుర్లు, వియోగంలో కూడా మధురానుభూతులను తలచుకుంటూ ఆ మధుర ఆస్వాదనను లేఖల్లో అందించడం, ఓ నేస్తానికి చెప్పిన పలు సామాజిక అంశాలు, జాతిని జాగృతం చేయాల్సిన విషయాలు, తరిగిపోతున్న భాషా సాహిత్యపు విలువలు, కవికి కవిత్వపు గాఢతను, సాహిత్యపు లోతులను తెలిపే లేఖలు... ఇలా ప్రతి సున్నితమైన ఆలోచనలను తన లేఖా సాహిత్యంలో అద్భుతమైన భావుకతతో మన ముందుకు తీసుకువచ్చారు.
ఒక లేఖలో ప్రేమ గురించి చెప్తూ " ప్రేమా ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తావట నిజమేనా..!!" అంటూ ప్రేమను ప్రేమగా ప్రశ్నిస్తారు. మరో లేఖలో మనసుతో మాట్లాడుతూ " ఎన్నో ఏళ్లుగా నేస్తాలమైనా మనం మనసు నలిగినా కలిగినా, మాది ఊసులను పంచుకుంటూనే ఉన్నాం కదా" అంటూ తన సహాధ్యాయికి కలిగిన కష్టాన్ని తన మనసుతోనే పంచుకుంటారు. వర్ణికా అంటూ మరో లేఖలో సహజంగా మనిషికుండాల్సిన కాసింత జాలి,దయ, ప్రేమ వంటి లక్షణాలను చెప్తూ, " మాది ముచ్చట్లకు వెలుగునిస్తూ..ఎరుకనై... ఏషనై, ఏర్పునై,ఎలా ఉహల ఎడద నెసపెడుతూ వరమై, పర్వమై ప్రతి అడుగునా అందమైన కంటికి ఇంపైన పచ్చదనమై పరవశమిస్తూ..తమినై, తపమునై..తరణినై.. తలపుల వాక్కునై...." ఇలా మనం మర్చిపోయిన అందమైన తెలుగు పదాలను ఒద్దికైన చిక్కని భావుకత్వంతో నిండి ఉంటుంది.
ఉత్తరం రాయడంలో అంతరార్ధాన్ని అర్ధవంతంగా ఎక్కడ ఏది ఎలా చెప్పాలో అలా చెప్పడం తెలుగు భాషా ప్రావీణ్యురాలు మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన  విద్య. స్వతహాగా తెలుగు భాషా సాహిత్య ప్రేమికురాలు కావడం వలన ఈమె లేఖలు చదువరులకు అసలు లేఖలు (ఉత్తరాలు) ఎలా ఉండాలి, ఏ ఏ విషయాలు ఎవరికి ఎలా చెప్పాలి, ఎంత వరకు చెప్పాలి అన్నది చక్కగా తెలుసు కనుక ఈ వర్ణిక లేఖా సాహిత్యం పుస్తకంలో మనకు అన్ని మన మనసులోని భావాలుగా అనిపిస్తాయనడంలో అతిశయోక్తి ఏమి లేదు. తెలుగు సాహిత్యంలో కవితలు, గజల్ ప్రక్రియ, పద్యం, లేఖలు, బాల సాహిత్యం ఇలా పలు సాహిత్య ప్రక్రియల్లో అందె వేసిన చేయి. మరుగున పడిపోతున్న పిరము, పద సుధావళి, హవణిక, శరది, కైరవీ రేయి, కౌముది రేయి వంటి ఎన్నో తెలుగు పదాలకు, పేర్లకు మళ్ళీ ఊపిరిని పునః ప్రతిష్ట చేస్తున్న మల్లీశ్వరి గారి తెలుగు భాషాభిమానానికి నేనూ అభిమానినే. సరళమైన భావాలను సున్నితంగా చెప్పడమే కాకుండా సమాజంలో లోపాలపై కూడా తన లేఖలలో సున్నితంగా విసుర్లు విసిరారు. వర్ణిక పేరులోనే ఓ చక్కని అందమైన అర్దానిస్తూ కవిగా వర్ణాలను తన అక్షర భావాలకు అద్ది మన ముందుకు వచ్చిన వర్ణిక అందరి మనసులలో చక్కని భావ పరిమళాలతో నిలిచిపోవాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశాన్నిచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మరెన్నో పుస్తకాలు మీ చేతిలో రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ ... 
అభినందనలతో....  
మంజు యనమదల 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner