24, ఏప్రిల్ 2025, గురువారం

ఆయుధంలాంటి మనిషి సమీక్ష


 మనిషి చేతిలో అక్షర ఆయుధముంటే..!!


    “ఆయుధంలాంటి మనిషి”..నిజమే మనిషి ఆయుధంగా మారితే ఎలా వుంటుంది? ఈ సమాజంలో అసమానతలు, అన్యాయాలు, అకృత్యాలు వంటి మరెన్నో దురాగతాలకు చరమగీతం పాడాలంటే “ లోసారి సుధాకర్” గారు అన్నట్టుగా మనిషి ఆయుధంగా మారక తప్పదు. ఇంతకు మునుపు “మైనపు బొమ్మలు”, “తడియారని స్వప్నం”, “ నా రహస్య మందిరంలో” కవితా సంపుటాలు వెలువరించారు. ఆ పుస్తకాలు పిల్లలకు పాఠ్యాంశాలుగా చేర్చబడి పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఆ కోవలోనే సాగుతూ సరికొత్తగా ఇప్పుడు “ఆయుధంలాంటి మనిషి” కవిత్వ సంపుటిని తెలుగు సాహితీ లోకానికి అందిస్తున్నారు. 

        అక్షరాన్ని ఆయుధంగా చేసి పదాల తూటాలతో ఈ సమాజంలోని లోపాలపై సూటిగా ఎక్కుపెట్టి తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ పుస్తకాన్ని ముద్రించినట్లు అనిపించింది. అమ్మ లేని లోటును “చిక్కనవుతున్న శూన్యం” కవితలో చెప్పినా మరికొన్ని చోట్ల కూడా కొన్ని శూన్యాలు, ఖాళీలు ఈ కవితా సంపుటిలో కనిపిస్తాయి. “ఒక ఖాళీ ప్రపంచం” కవితలో జీవితం మెుత్తాన్ని ఖాళీ చేస్తూ, ఇంటిని ఖాళీగా పూరించారు అద్భుతంగా. అంతే గొప్పగా “గది నాకొక ప్రపంచం” కవిత వుంది. ఎవరి పాట వారే పాడుకోవాలంటూ “గొంతు తెగిన పాట” కవితలో “కాసేపైనా జీవితం ఓ పాట కచేరీ అయితే ఎంత బావుండు” అంటూ తన ఆశను తెలియజేసారు. అమ్మతో ఆలిని పోల్చుతూ ఓ విషయంలో తప్ప తనకెప్పుడూ ఆలి “రెండో అమ్మ” అనడం ఎందరికి సాధ్యం? ప్రేమ గురించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. సుధాకర్ గారి భావాలలో “వసంత సమీరం” కవిత నుండి 

“ కళ్ళు తెరిచి కన్న

   ఒక స్వప్నం నువ్వు

   విషాదముగింపుకు

   తొలిసంతకం నేను”

విరహము, విషాదము, ప్రేమ, ఆరాధన ఇలా ఎన్నో భావాల సమాహారమే ఈ పై నాలుగు వాక్యాలు. “కవిత్వమంటే బతుకుప్రపంచం” అంటూ కవిని, కవిత్వాన్ని ఎంత గొప్ప స్థాయిలో వుంచారో ఈ పుస్తకంలో చాలా చోట్ల కనిపిస్తుంది. 

        దుఃఖాన్ని, చీకటి వెలుగులను, జ్ఞాపకాలను, ప్రకృతి సహజ సౌందర్యాన్ని, వియోగాన్ని, వేదనలను, సంవేదనలను, కోపాన్ని, అసహనాన్ని, దేశభక్తిని, చావుపుట్టుకల తాత్వికతను, ప్రశ్నలను, సమాధానాలను, సందేహాలను ఇలా ఒకటనేమిటి చాలా చాలా అక్షర ఆయుధాలను ఉపయోగించి “ఆయుధంలాంటి మనిషి” కాదు కాదు మనిషి మనసు ఆయుధంగా మారి అక్షరాలను ఆవహిస్తే ఎలా వుంటుందో అన్నది ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది. 

         కర్ణుడంటే అమితమైన ఇష్టం కనబడింది. రామాయణ, భారతాల ప్రభావం కూడా చాలా చోట్ల కనిపించినట్లు అనిపించింది. తన వృత్తిధర్మాన్ని పాటిస్తూ, ఆ పరిసరాలను కూడా తన కవిత్వంలో నింపారు. సామాజిక, రాజకీయ అంశాలపై అక్షరశరాలు సంధించారు. జీవితంలో అన్ని పార్శ్వాలను స్పృశించారు తన కవితల్లో. గొప్ప కవిత్వాన్ని అందించిన “ఆయుధంలాంటి మనిషి” “లోసారి సుధాకర్” గారికి హృదయపూర్వక అభినందనలు. 


అందుబాటులో వున్న వారందరూ ఈ పుస్తక ఆవిష్కరణ సభకు హాజరుకండి.

23, ఏప్రిల్ 2025, బుధవారం

ఈరోజు ఈనాడులో..

 ఈరోజు ఈనాడు వసుంధరలో నా గురించి చిన్న ఆర్టికల్.

ప్రచురించిన ఈనాడు యాజమాన్యానికి, ఛత్రపతి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.



20, ఏప్రిల్ 2025, ఆదివారం

త్రిపదం

 తొలిపొద్దు

మలిపొద్దు

మధ్యదే జీవితం..!!

19, ఏప్రిల్ 2025, శనివారం

వర్ణిక పుస్తకానికి ముందు మాటలు....!!

తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మరో ఆణిముత్యం వర్ణిక. ఈ లేఖా సాహిత్యం గురించి నాలుగు మాటలు రాయడం అంటే కొంచం కష్టమైన విషయమే. ఒక మనసులోని విభిన్న కోణాలను పరిచయం చేయడమే ఈ లేఖల ముఖ్య ఉద్దేశ్యం.. ఇప్పటి తరానికి తెలియని, మన తరం వరకు మాత్రమే తెలిసిన ఉత్తరాల అనుభూతులను, ఆ పరిమళాలను తరువాతి తరాలకు అందించడానికి చేసిన ప్రయత్నమే ఈ వర్ణిక. ఓ అమ్మ తనకు దూరంగా ఉన్న కొడుకుకి చెప్పిన తరిగిపోతున్న సాహిత్యపు విలువలు, ఓ ప్రేమికురాలి విరహ వేదన, ప్రేమికులు దూరంగా ఉన్నప్పుడు తమ ప్రేమ కోసం పరితపించే మనసులను, నిరీక్షణను, భార్యాభర్తల అనుబంధంలో దూరంగా ఉన్నప్పటి చిలిపి ఉహల కబుర్లు, వియోగంలో కూడా మధురానుభూతులను తలచుకుంటూ ఆ మధుర ఆస్వాదనను లేఖల్లో అందించడం, ఓ నేస్తానికి చెప్పిన పలు సామాజిక అంశాలు, జాతిని జాగృతం చేయాల్సిన విషయాలు, తరిగిపోతున్న భాషా సాహిత్యపు విలువలు, కవికి కవిత్వపు గాఢతను, సాహిత్యపు లోతులను తెలిపే లేఖలు... ఇలా ప్రతి సున్నితమైన ఆలోచనలను తన లేఖా సాహిత్యంలో అద్భుతమైన భావుకతతో మన ముందుకు తీసుకువచ్చారు.
ఒక లేఖలో ప్రేమ గురించి చెప్తూ " ప్రేమా ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తావట నిజమేనా..!!" అంటూ ప్రేమను ప్రేమగా ప్రశ్నిస్తారు. మరో లేఖలో మనసుతో మాట్లాడుతూ " ఎన్నో ఏళ్లుగా నేస్తాలమైనా మనం మనసు నలిగినా కలిగినా, మాది ఊసులను పంచుకుంటూనే ఉన్నాం కదా" అంటూ తన సహాధ్యాయికి కలిగిన కష్టాన్ని తన మనసుతోనే పంచుకుంటారు. వర్ణికా అంటూ మరో లేఖలో సహజంగా మనిషికుండాల్సిన కాసింత జాలి,దయ, ప్రేమ వంటి లక్షణాలను చెప్తూ, " మాది ముచ్చట్లకు వెలుగునిస్తూ..ఎరుకనై... ఏషనై, ఏర్పునై,ఎలా ఉహల ఎడద నెసపెడుతూ వరమై, పర్వమై ప్రతి అడుగునా అందమైన కంటికి ఇంపైన పచ్చదనమై పరవశమిస్తూ..తమినై, తపమునై..తరణినై.. తలపుల వాక్కునై...." ఇలా మనం మర్చిపోయిన అందమైన తెలుగు పదాలను ఒద్దికైన చిక్కని భావుకత్వంతో నిండి ఉంటుంది.
ఉత్తరం రాయడంలో అంతరార్ధాన్ని అర్ధవంతంగా ఎక్కడ ఏది ఎలా చెప్పాలో అలా చెప్పడం తెలుగు భాషా ప్రావీణ్యురాలు మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన  విద్య. స్వతహాగా తెలుగు భాషా సాహిత్య ప్రేమికురాలు కావడం వలన ఈమె లేఖలు చదువరులకు అసలు లేఖలు (ఉత్తరాలు) ఎలా ఉండాలి, ఏ ఏ విషయాలు ఎవరికి ఎలా చెప్పాలి, ఎంత వరకు చెప్పాలి అన్నది చక్కగా తెలుసు కనుక ఈ వర్ణిక లేఖా సాహిత్యం పుస్తకంలో మనకు అన్ని మన మనసులోని భావాలుగా అనిపిస్తాయనడంలో అతిశయోక్తి ఏమి లేదు. తెలుగు సాహిత్యంలో కవితలు, గజల్ ప్రక్రియ, పద్యం, లేఖలు, బాల సాహిత్యం ఇలా పలు సాహిత్య ప్రక్రియల్లో అందె వేసిన చేయి. మరుగున పడిపోతున్న పిరము, పద సుధావళి, హవణిక, శరది, కైరవీ రేయి, కౌముది రేయి వంటి ఎన్నో తెలుగు పదాలకు, పేర్లకు మళ్ళీ ఊపిరిని పునః ప్రతిష్ట చేస్తున్న మల్లీశ్వరి గారి తెలుగు భాషాభిమానానికి నేనూ అభిమానినే. సరళమైన భావాలను సున్నితంగా చెప్పడమే కాకుండా సమాజంలో లోపాలపై కూడా తన లేఖలలో సున్నితంగా విసుర్లు విసిరారు. వర్ణిక పేరులోనే ఓ చక్కని అందమైన అర్దానిస్తూ కవిగా వర్ణాలను తన అక్షర భావాలకు అద్ది మన ముందుకు వచ్చిన వర్ణిక అందరి మనసులలో చక్కని భావ పరిమళాలతో నిలిచిపోవాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశాన్నిచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మరెన్నో పుస్తకాలు మీ చేతిలో రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిస్తూ ... 
అభినందనలతో....  
మంజు యనమదల 

అక్షర కిరణాలు (నాలుగు మాటలు)..!!

                                  " మది వెలిగించిన జ్యోతులే ఈ అక్షర కిరణాలు "

                తెలుగు సాహిత్యంలో వచన కవిత్వానిదొక ప్రత్యేక స్థానం. ఈ ఆధునిక కాలంలో వచన కవిత్వం విరివిగా రాస్తున్నవాళ్ళు కోకొల్లలు, కాని విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్న వచన కవిత్వం అరుదనే చెప్పాలి. ఉషశ్రీ రాసిన " అక్షర కిరణాలు " కవిత్వ సంపుటిలోని కవితలను చదువుతుంటే నాకనిపించింది ఈ కవిత్వపు శైలి పలువురి ప్రశంసలు పొందుతుందని. ఓ కవికైనా, రచయితకైనా ఇంతకన్నా కావాల్సింది ఏమి ఉండదు. ఉషశ్రీ వయసు చిన్నదైనా మనసు విశాల భావాల పూపొద అని అక్షర కిరణాల్లోని ప్రతి కవితా, ఆ కవితా పరిమళాలు సుదూర తీరాలకు చేరతాయని నిస్సందేహంగా చెప్పగలను.
                 " రోజులెంతగా మారినా
                    మనుషులెంత ఆధునికులైనా
                    రూపు మారినా
                    ముగ్గులు
                    గత వైభవపు ఆనవాళ్ళుగా
                    కలకాలం మిగిలే ఉంటాయి...!! "
గత వైభవాన్ని తల్చుకోవడమే కాకుండా, ఆనాటి ఆనందాలను, ఆస్వాదనలను వాడుక పదాల్లో కాస్తంత ఆంగ్లాన్ని చేర్చి చక్కగా..ఓ పల్లెటూర్లో ఇంటి ముందు ముగ్గును అందంగా వేయడమనే అలవాటుని మొదటి నుండి చివరి వరకు ఆ దృశ్యాన్ని ఆలా మన కళ్ళ ముందు చూపడం సామాన్య విషయం కాదు.
            డబ్బు గురించి చెప్పినా, చందమామను తల్చుకున్నా, అమ్మను మరుజన్మకు కూడా అమ్మగానే కావాలని వరమడిగినా, వెలకట్టలేని నేస్తం పుస్తకమని చెప్పినా, పల్లె మనసు గుట్టు విప్పినా, మనిషి మార్చే రంగుల మాయను గుర్తుజేసుకున్నా, అనంతమైన ప్రేమకు దక్కిన తిరస్కారాన్ని తెలిపినా ఇలా ప్రతి భావాన్ని తనదైన సరికొత్త శైలి, ఎత్తుగడతో చక్కని అభివ్యక్తితో ఓ శిల్పి శిల్పాన్ని ఎంత శ్రద్ధగా చెక్కుతాడో, అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో మనసుపెట్టి రాసిన అక్షర కిరణాలివి.
             ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసికెళుతుంది, కాని అధికారం, ఆర్ధికబలం ముందు నిజాయితీకి దక్కేది శూన్యమే అని చెప్పడంలో తనదైన ముద్ర కనిపిస్తుంది. మగువను మహారాణిని చేస్తూ ఆమె పాత్రలను సజీవంగా మన ముందు నిలుపుతుంది. అమ్మను, నాన్నను, అనుబంధాలను, బడి, గుడి, చెట్టుచేమా, సంగీతం, సాహిత్యం, నవ్వులు, బిడ్డల మీద మమకారము, ఇలా ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితా విభిన్నమైనదే.
      "  నా జీవనమే మీ జీవితమని చెప్పినా చెవికెక్కని మనుషులగని
          తను కన్నీటి పాయగా మిగిలిపోయింది. "
అతివ కన్నీటి జీవితాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు.  
            మల్లెలను తల్చుకోవడం, వానను ఆస్వాదించడము, ఏం రాయాలన్న సందిగ్ధాన్ని, సమాజంలోని అసమానతలను, లోపాలను, మనుషులు కోల్పోతున్న సున్నితత్వాన్ని, మానవత్వాన్ని, నిరీక్షణలో వేదనను, ధిక్కారస్వరాన్ని, ఎన్నెన్నో పాఠాలను, ఏ దేవుడు చెప్పినా విశ్వశాంతి సందేశాన్నే అని, మృతువును, మౌనాన్ని వదలని తాత్వికతో, మెరుగైన సాంకేతిక విజ్ఞానాన్ని ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయాన్ని చక్కగా తనకు మక్కువైన ప్రాంతీయతను జోడించి, తెలుగు, ఆంగ్ల పదాల మేళవింపుతో, ఏ కవిత చదివినా ఆద్యంతమూ చదవనిదే సంపూర్తిగా అర్థంకాని మార్మికత, వస్తు విశిష్టత కవయిత్రి ఉషశ్రీ ప్రత్యేకత.
         నా రాతలకు విలువనిచ్చి నాలుగు మాటలు రాసే అవకాశాన్ని నాకిచ్చినందుకు ధన్యవాదాలు. అక్షర కిరణాలు  కవితా సంపుటిలో వైవిధ్య వస్తుశిల్పాలతో, ప్రతి కవితను మనసుపెట్టి రాసిన ఉషశ్రీకి హృదయపూర్వక అభినందనలు.

మంజు యనమదల
విజయవాడ
9490769585

హృదయ విపంచి కవితా సంపుటి...!!

 పద్మజ సబ్బినేని గారి "హృదయ విపంచి" కవితా సంపుటికి ముందుగా హృదయపూర్వక అభినందనలు.
         ఈ కవితా సంపుటిలో జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు కనిపించాయి. ఓ సున్నితమైన మనసుకు చేరిన స్పందనల భావాలకు అక్షర రూపమే "హృదయ విపంచి." ప్రేమ, ఆరాధన, నిరీక్షణ, బాల్యం, వెనకబాటుతనం, పల్లె జీవితాలు, జ్ఞాపకాలు, గాయాలు, గతాలు, గుండె చప్పుళ్ళు, కలలు, కన్నీళ్లు, కోపం, ఆవేశం, సమాజంలో స్త్రీ పట్ల వివక్ష పై తిరుగుబాటు, అన్యాయాన్ని ప్రశ్నించడం ఇలా అన్ని భావోద్వేగాలు సమపాళ్లలో కనిపిస్తాయి. 
    వరం అన్న కవితలో 
" ఏ జ్ఞాపకాలు నిన్ను కలతపెట్టాయో 
ఆ జ్ఞాపకాలను తీసెయ్యలేను కానీ,
నా కనుపాపలలో నిను దాచుకుని 
నీ మనసు కలత చెందకుండా 
చూసుకుంటా..
నీవు నమ్మగలిగితే జీవితకాలం 
నీ మనసుకి ఊరటనిచ్ఛే 
నీ పేదలంపై చిరునవ్వునవుతా 
మరి ఆ వరం నాకిస్తావా నేస్తం...!!" 
ఎన్నో ఆశలతో చెంత చేరితే తనకు లభించిన నిర్లక్ష్యపు బహుమానాన్ని స్వీకరించి కూడా ఇంత ఆర్తిగా అడిగిన వరం ఎంత అద్భుతంగా అనిపించిందో..!!
నిశ్శబ్దాన్ని శబ్దం చేయిస్తూ అక్షరబద్దం చేయడం, స్నేహాన్ని, సవ్వడిని, ప్రేమ తత్వాన్ని, ఆలంబనను, అనురాగాన్ని, ఆశలను, ఆశయాలను, అహాలను, అనుభవాలను ఇలా జీవితంలో ప్రతి చిన్న భావనను మనసుతో చూడటం, దానిని ఓ చక్కని అక్షర భావనగా అందించాలన్న తపన ప్రతి కవితలోనూ కనిపిస్తుంది.  ప్రతి ఒక్కరి స్పందించే మనసు మౌనం ఈ అక్షరాల్లో మనకు దర్శనమిస్తుందనడానికి ఎట్టి సందేహం లేదు. 
      హృద్యమైన భావాలను అక్షరీకరించిన పద్మజ సబ్బినేని గారు అభినందనీయులు. కాస్త పరిచయంలోనే నా రాతలకు విలువనిచ్చి ఈ కవితా సంపుటికి నాలుగు మాటలు రాయడానికి అవకాశమిచ్చిన పద్మజ సబ్బినేని గారికి మనఃపూర్వక ధన్యవాదాలతో... మరిన్ని కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో వెలువరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనల శుభాకాంక్షలు. 
మంజు యనమదల 

15, ఏప్రిల్ 2025, మంగళవారం

సర్దుకున్నారా కథలకు సమీక్ష




 ""#సర్దుకున్నారా?""

.........................


వాతావరణం బాగుంది. ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు. కానీ చలిగా కూడా లేదు. 


చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది. అందుకే నాకు తెల్లవారుజామునే మెలుకువ వచ్చినా, ఏడింటికి వరకు ఇంటి బయటకు రాను. చలి తగ్గగానే, మా అపార్ట్ మెంటు బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్కు వైపు నడక సాగించాను. 


చిన్నప్పుడు పార్కులో ఎక్కువ సేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు. ఇప్పుడేమో, 'ఎప్పుడూ ఇంట్లో కూర్చోకండి. పొద్దున్నపూట తప్పనిసరిగా నాలుగు కిలోమీటర్లు నడవండి. మధ్యాహ్నం, రాత్రి భోజనం తిన్న తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది' అని డాక్టర్లు చెప్పడంతో, ఉదయం, రాత్రి నడక అలవాటు చేసుకున్నాను. 


ఇందిరా పార్కులో కొన్ని రోజుల్లోనే మాకొక గ్రూపు తయారయింది. అందరం రిటైరైనవాళ్ళమే. వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాము. ఉదయం పూట ఇందిరా పార్కు మహా సంరంభంగా ఉంటుంది. ఏదో పెళ్ళికో,  పండగరోజున గుడికి వచ్చినట్టుగానో వేలాది మంది హడావుడిగా నడుస్తుంటారు. 


ఇందిరా పార్కు ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్టులా ఉంటుంది. పళ్ళూ, కూరగాయలూ, రకరకాల సూప్స్, బట్టలూ అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి. కానీ,  పదింటికల్లా నిర్మానుష్యమై పోతుంది. 


మా గ్రూపులో నాతో పాటు రెడ్డి, రాజారావు, పద్మనాభం, శేషగిరి, రామ్మూర్తి మెంబర్లు ఉన్నారు. ఒక్కోరోజు మా గ్రూపులో ఉన్న మితృలకు తెలిసిన మితృలు కూడా కలుస్తుంటారు. 


మేము చివరగా పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి, ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో, బెంచీ మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటాము. 


మా మాటల్లో ఎక్కువగా రాజకీయాలు, మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతుంటాయి. ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే, అందరి మనసులూ భారమౌతాయి. 


మా గ్రూపులో డెభ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నారు. ఆరోగ్యం గురించి మాట్లాడగానే, అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేము. ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది. 


ఒక్కొక్కరోజు నడక ముగిసిన తర్వాత విడిపోతుంటే, మా ఆరేడుగురిలో మరునాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని;  మరునాడు పేపర్లో 'నిర్యాణం' కాలంలో ఫోటో వస్తుందేమోనని లేదా ఏ వారం రోజులకో, 'దశదిన కర్మ' కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనసు పొరల్లో ప్రతీరోజూ ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది. 


మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం. తరువాత ఎవరి జీవితాల గురించి, ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా. 


ఇంతలో రమణ అనే మితృడు మా గ్రూపులోకి వచ్చి చేరాడు. ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజరుగా ఈ మధ్యనే రిటైరయ్యాడు.


రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి. రమణ మాటల పుట్ట. ఎన్నో విషయాల గురించి అనర్ఘళంగా మాట్లాడేవాడు. అప్పటివరకు పైపైన, పలుచగా ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది, గాఢంగా మారింది. 


అసలు ఆయన చెబితేనే గానీ ఆయన రిటైరయ్యాడని నమ్మలేం. స్లిమ్ గా, లేటెస్ట్ మాడల్ రీబాక్ షూ, కళ్ళకు గాగుల్స్, ఒంటి మీద నుండి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కులాసాగా ఉంటాడు. ప్రతీరోజూ తన ఇన్నోవా క్రిస్టా కారులో పార్కుకు వస్తాడు. 


రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకో హోటలుకు తీసికెళ్ళి కాఫీ, టిఫిన్లు ఇప్పించేవాడు. 


పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడతో 'అక్కయ్యా' అని వరస కలిపి క్లోజ్ అయిపోయాడు. మా కోడలితో ముచ్చట్లు పెట్టాడు. ఆరునెలల వయసున్న మా మనుమణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో ఐదువందల నోటు పెట్టాడు. 


'బయటకు వెళ్దాం పదమని' నన్ను బలవంత పెట్టాడు. కారు తిన్నగా క్రిస్టల్ బారు ముందు ఆపాడు. రమణని చూడగానే, గుమ్మంలో ఉన్న 'వాలె' పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకూ ఆప్యాయంగా విష్ చేయడం చూసి నేను విస్తుపోయాను. 


నేను మొహమాటపడుతుంటే, 


"ఫర్వాలేదు సార్! రెండు పెగ్గుల విస్కీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. హెచ్డీయల్ కొలెస్టరాల్ పెరుగుతుంది. గుండె గట్టి పడుతుంది!" అంటూ బుజ్జగించి మందు పోయించాడు. రెండు పెగ్గులు కాగానే ముగించాడు. అందరికీ భారీగా టిప్పులు ఇచ్చాడు.  


రమణ కారు దిగగానే, రోజూ 'వాలే' బాయ్, రమణ డ్రైవరుకు ఫోన్ చేస్తాడంట. అందుకే మందు తాగి బయటకు రాగానే, కారు దగ్గర నిలబడిన డ్రైవరుకు, రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు. నన్ను ఇంటి దగ్గర దించి, 'గుడ్ నైట్' అని చెప్పి వెళ్ళిపోయాడు. 


చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టనిపించింది. హాయిగా నిద్రపోయాను. కలలో రమణ ముఖమే కనిపించింది. 


మరునాడు, అందరం కలుసుకున్నాం. రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాము. రమణ మా వాకర్స్ గ్రూపులోని అందరి ఇళ్ళకు వెళ్ళాడు. నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఎవ్వరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పూయించేవాడు. 


అలా ఒక నెలరోజుల్లో రమణ మా అందరి ఇళ్ళకు వచ్చాడు. అందరిని పిలిచి వాళ్ళ ఫార్మ్ హౌజులో వన భోజనాలు ఏర్పాటు చేసాడు. 


డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేసాడు. మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా, అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాము. 


"ఏం ఫర్వాలేదు సార్! డబ్బుల విషయాలన్నీ గోవా నుండి వచ్చాక చూసుకుందాం!" అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళా రిజర్వ్ చేసాడు. డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది. పడుచు జంటల కోలాహలంతో, ఒక సీతాకోకచిలుకల వనంలా ఉంది. 


మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే, రమణే, 


"సార్! మనం ఉద్యోగం నుండి మాత్రమే రిటైరయ్యాము. జీవితాల నుండి కాదు. అందరూ 'శేషజీవితం' అంటూ మనకు వీడ్కోలు పలుకుతూ అంటారు. కానీ… నిజంగా మనది శేష జీవితం కాదు. బరువులు, బాధ్యతలు లేని చిన్న పిల్లవాడి లాంటి 'విశేషజీవితం' మనది. మనముందు ఇంకా చాలా జీవితం ఉంది. అందుకే, మరణించేవరకు జీవించాలి, 

హాయిగా గడపాలి !" అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు. 


దాంతో, అక్కడి యౌవ్వనపు వాతావరణం చూస్తుంటే మాక్కూడా హుషారు పుట్టుకొచ్చింది. మేము రిటైరయిన వృద్ధులమన్న విషయమే మరిచిపోయి, కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాము. 


నాలుగు రోజుల తర్వాత హైదరాబాదుకు తిరిగొచ్చాము. నాకైతే, ఈ గోవా ట్రిప్పు బాగా నచ్చింది. శరీరం, మనసూ రిజొవనేట్ అయి, పునరుజ్జీవనం పొందినట్టయింది. అంతకు ముందులాగా నిస్తత్తువగా, నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది. 


రెండు రోజుల విరామం తర్వాత, ఇందిరా పార్కుకు వెళ్ళాను. ఆ రోజు రమణ రాలేదు. బహుశా అలసట తీరలేదేమోననుకుని, ఫోన్ చేసాను. 


ఫోన్ లో వాళ్ళబ్బాయి చెప్పిన వార్త విని మ్రాన్పడిపోయాను. 


అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటలుకు పరుగు పరుగున వెళ్ళాము. 


"గోవా నుండి వచ్చిన రోజు తెల్లవారుఝామున తీవ్రమైన గుండె పోటు వచ్చిందనీ, వెంటనే హాస్పిటలుకు తీసుకు వస్తే రెండు స్టెంట్లు వేసారని, ఇప్పుడు బాగానే ఉన్నారని" వాళ్ళబ్బాయి చెప్పాడు. 


మేమందరమూ తీవ్ర దుఃఖంతో బయటకు నడిచాము. నేనైతే ప్రతీరోజు హాస్పిటలుకి వెళ్ళి రమణని కలిసేవాణ్ణి. కొంత కోలుకోగానే రమణలో మళ్ళీ అదే హూషారు కనిపించింది. 


రెండు నెలల తర్వాత రమణ ఇందిరా పార్కుకు, వాకింగుకు వచ్చాడు. నడక పూర్తయిన తర్వాత, పార్కు బయట టీ తాగుతూ, 


"సర్దేసుకున్నాను బాస్!" అన్నాడు నవ్వుతూ. మాకర్థం కాలేదు. మళ్ళీ ఏదైనా ట్రిప్పుకు కు ప్లాన్ చేస్తున్నాడేమోననుకుని, 


"ఈ సారి ట్రిప్ ఎక్కడికి?" అని అడిగాను నేను కుతూహలంగా. 


రమణ నవ్వుతూ, 


"బాస్! ఈ సారి ట్రిప్ అంటూ వేస్తే, అది పైకే! అందుకే అన్నీ సర్దేసుకున్నాను. అన్ని బాకీలు తీర్చేసుకున్నాను. ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధురస్మృతులన్నీ మూటకట్టి మనో మంజూషలో దాచుకుని, మిగిలినవన్నీ వొదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసాను. నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ;  తెలిసో తెలియకో, ఉద్యోగ ధర్మం మీరలేకో నా వల్ల నష్టం కలిగినవారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించినవారిని, నన్ను నమ్మించి మోసం చేసినవారిని కూడా కలిసి, వాళ్ళను కూడా క్షమించేసాను. ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 


అందుకే, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెబుదామనే వచ్చాను. గత కొద్ది నెలలు, మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు. థ్యాంక్యూ వన్స్ అగైన్! 


ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏ కోరికలు లేవు. ఏ అసంతృప్తి, నిరాశానిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను.


ఐయాం రెడీ ఫర్ హిస్ కాల్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి, జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులనన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను. ద్వేషాన్ని, కోపాన్ని అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాను. దీన్నే 'డెత్ క్లీనింగ్' (Death Cleaning) అంటారని, ఈ మధ్యనే ఒక వాట్సప్ మెసేజ్ లో చదివాను. నేను డెత్ క్లీనింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రాన నేను ఇవ్వాళ్ళో రేపో చనిపోతానని కాదు. కానీ, ఈ గుండె ఉంది చూసారూ... ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము." అంటూ వీడ్కోలు తీసుకున్నాడు. 


+++


అదే చివరిసారిగా రమణని చూడడం. 'గోవా' ట్రిప్పు ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు. మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలపడానికి ఋణశేషం మిగిలే ఉంది. 


ఇప్పుడు నేను ఇందిరా పార్కుకు ఎక్కువగా పోవడం లేదు. నేను కూడా 'డెత్ క్లీనింగ్' పనిలో ఉన్నాను. 


+++


దీపావళి పండగ రోజు గుడికి  వెళ్ళే హడావుడిలో ఉండి మా కోడలు, 


"అత్తయ్యా! అన్నీ సర్దుకున్నారా?" అని అడగడం వినిపించింది. 


ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీరె కొంగుతో కళ్ళొత్తుకోవడం, నేను దూరం నుండి చూస్తూనే ఉన్నాను. ఈ రోజంతా ఉదయం నుండీ తను అలాగే, దిగులుగా, ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది. దానికి కారణం కూడా నాకు తెలుసు. 


నేను ఫోన్ తీసి చూసాను. ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరం లేదు. నాకు తెలుసు, ఎందుకంటే...... 


+++


నేను ఎప్పటిలాగానే, ఇంకా కొంచెం ముందుగానే, మా ఆవిడకు ఇందిరా పార్కకు వాకింగుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను. నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగు తప్ప మరేం లేదు. బయటకు రాగానే, నేను బుక్ చేసిన  క్యాబ్ నంబరు సరి చూసుకొని కారులో ఎక్కాను.


ఇందిరా పార్కుకు అని నా భార్యకు చెప్పిన నేను పది గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ రెండులో దిగాను. క్యాబ్ బుక్ చేసి, అది వొచ్చేలోగా, రెస్ట్ రూములోకి వెళ్ళి ఫ్రెష్ అయి, బ్యాగులో నుంచి తీసిన టై కట్టుకుని, కోట్ వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను. 


నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది. దాదాపు పదేళ్ళ తర్వాత నేను నా కూతురును చూడడానికి వెళ్తున్నాను. ఈ రోజు సోమవారం. అల్లుడికి ఆఫీసు ఉంటుంది. అమ్మాయి మాత్రం 'వర్క్ ఫ్రం హోం' చేస్తుంది. దాని కూతురు, ఎనిమిదేళ్ళ మైత్రేయి ఖాన్, నాలుగేళ్ళ మనుమడు సలీం శాస్త్రి స్కూలుకు వెళ్ళి ఉంటారు. 


మా అమ్మాయి చందన మా అభీష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాము. తను వినలేదు. ఒకరోజు ఆఫీసుకు వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు. 


ఆ రోజు రాత్రి పదకొండింటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తనూ, సలీంఖానూ పెళ్ళి చేసుకున్నామని చెప్పింది. నా భార్య విభ్రాంతికి గురయింది. ముందు ఏడ్చింది. తర్వాత వాళ్ళను ఇంటికి రమ్మని చెప్పింది. నాన్న పిలిస్తే వస్తానంది. నా భార్య నా వైపు దీనంగా చూసింది. నేను పిలవలేదు. తను రాలేదు. పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు పిల్లలు పుట్టారనీ, అతగాడికి ఢిల్లీ సెక్రెటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. 


నేను గుండె రాయి చేసుకుని  బతుకుతున్నాను. కానీ, ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట, ఇద్దరు పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనపడ్డా గుండెలో కలుక్కుమంటుంది. ఆ రోజు నా చందనను మన్నించి, నేనెందుకు పిలవలేదానన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురిచేస్తుంది. 


ఇన్నాళ్ళూ ఈ బాధను, భారాన్నీ గరళ కంఠుడిలా దిగమింగుకుంటూ జీవిస్తున్నాను. నా భార్య, నా భుజం మీద వాలి తనివితీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది. మగవాడినైన నాకా అదృష్టం లేదు. 


అయితే, రమణ చివరిసారిగా కలిసి 'సర్దుకున్నాను బాస్!' అని చెప్పిన కొన్నాళ్ళకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది. నేను కూడా అన్నీ సర్దుకోవాల్సిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను. 


నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకర్థమయ్యింది. వెంటనే, అభిఙ్ఞవర్గాల ద్వారా, అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని, మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్, ఫోను నెంబర్లు, మిగిలిన వివరాలు సంపాదించాను. వాడే నాకు ఢిల్లీకి టిక్కెట్లు బుక్ చేసాడు. వాడు అక్కతో టచ్ లోనే ఉన్నట్టుంది. 


చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాభరాగానే ఉంది. ఒక వేళ అల్లుడు ఆఫీసుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడేమో, ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో లేక ఏదైనా ట్రిప్పుకు వెళ్ళి ఉంటారేమోనన్న సవాలక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ, ఏదైతే అదవుతుందని, మనసును నిబ్బర పరుచుకుని, ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను. 


ముప్పావు గంట తరువాత, నేను దిగాల్సిన సమయం ఆసన్నమయింది. అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు, పెద్ద క్వార్టర్ ముందర నిలబడ్డాను. గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను. అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది. 


తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక్క క్షణం గుర్తు పట్టక "కౌన్...?" అని అనబోయిందల్లా నన్ను తేరిపార చూసి, 


"నాన్నా...! నాన్నా..! మీరూ..!" అంటూ మాటలు రాక నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను పదేళ్ళ పాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ, దుఃఖిస్తూ నేను నిలబడ్డాను. 


ఏడుస్తున్న నన్ను చూసి, నా చందన, కంగారుగా, 


"నాన్నా! ఏమైంది నాన్నా!" అంటూ నన్ను కౌగలించుకుంది. నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో, నోటమాట రాక నిలబడిపోయాను. 


ఆ అలికిడికి, లోపలి నుంచి ఎవరో వచ్చారు. 


"మేరా బాబూజీ! కాఫీ బనావో!" అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది. 


ఒక్క క్షణం నిలబడి, నా కూతురిని చూసుకున్నాను. ఇరవయ్యేళ్ల వయస్సులో మమ్మల్ని వదిలిన చందన ఈ పదేళ్ళలో, సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది. కొంత పెద్దరికం వచ్చినట్టుగా, మరింత అందంగా తయారయింది. 

మన పిల్లలు మనకు ఎప్పుడూ అందంగానే, అపురూపంగానే కనిపిస్తారు కదా! 


"ఏంటి నాన్నా! అలా చూస్తున్నావ్?" అని అడిగితే, 


"పదేళ్ళయ్యింది కదమ్మా! తనివితీరా చూసుకుంటు... " అని అంటుండగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 


"ఏమయింది నాన్నా! అందరూ బాగున్నారా? అమ్మ బాగుందా?" అని ఆదుర్దాగా ప్రశ్నించింది. 


"చందూ! నన్ను క్షమిస్తావా తల్లీ!" అని అడిగాను. 


"అయ్యో! అదేంటి నాన్నా! నిన్ను నేను క్షమించడమేంటి? మీరే నన్ను క్షమించాలి!" అంటూ నా చేతులు పట్టుకుంది. 


పరస్పరం క్షమించేసుకున్నాము. తరువాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి. నేను వచ్చానని చందన చెప్పగానే, అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు. కారు డ్రైవరును పంపించి మనుమణ్ణి, మనుమరాలిని స్కూలు నుండి పిలిపించింది. వాళ్ళను చూసి నా కళ్ళు చెమర్చాయి. వాళ్ళ జీవితాల్లో పదేళ్ళ పాటు అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణనిపించింది. భోజనాలయ్యాక, అల్లుడు ఆఫీసుకు వెళ్తుంటే, 


"ఇంటికి రండి అల్లుడు గారూ!" అన్నాను. 


"ష్యూర్! మీరెప్పుడు పిలుస్తారా అని చందూ ఎదురు చూస్తుంది." అన్నాడు. 


సాయంత్రం హైదరాబాదు తిరుగు ప్రయాణం అయ్యాను. అమ్మాయి, మనుమడు, మనుమరాలు టాటా చెప్తుంటే, తృప్తిగా ఏర్ పోర్టులోకి నడిచాను. 


పదింటికి ఇంటికి చేరిన నన్ను చూసి, 


"ఎటు వెళ్ళారండీ! పొద్దటి నుంచి ఫోన్ కూడా కలవడం లేదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా!.... " అని నా భార్య చివాట్లు పెడుతుంటే, కమ్మగా అనిపించింది. 


+++


దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు. అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు. ఆ మహాలక్ష్మే, పదేళ్ళ తర్వాత మళ్ళీ ఈ రోజు మా ఇంట అడుగుపెట్టబోతుంది. శంషాబాద్ ఏరుపోర్టులో దిగగానే చందన ఫోన్ చేసింది. అందుకే, ఇప్పుడో మరో క్షణంలోనో.... 


ఇంతలో, "అమ్మా!" అని చందన పిలుపు వినబడగానే, నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది. 


+++


నేను కూడా అన్నీ సర్దేసుకున్నాను.


రచన: డాక్టర్ ప్రభాకర్ జైనీ


+++


#PS కథ మీకు నచ్చితే, మీ గ్రూపుల్లో షేర్ చేస్తే మరింత మందికి చేరే అవకాశం ఉంటుందని మనవి.


ఈ గొప్ప కథకి నాదైన చిరు విశ్లేషణ…!!


“సర్దుకున్నారా?” అంటున్న ప్రతి ఇంటి కథే ఈ కథ..!

           జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో మనకు అప్పటికి తెలియక పోయినా, వాటి ఫలితం కొన్నాళ్లకు తెలుస్తుంది. మన జీవితంలో తారసపడిన చేదు అనుభవాలు, నెమరువేసుకోవడానికి మిగిలిన  మధురానుభూతులు కొన్నైనా మన మనసులో తిష్ట వేసుకునే వుంటాయి. తప్పొప్పుల సమాహారమే మానవ జీవితం. తప్పును ఒప్పుకునే ధైర్యం చాలా కొద్దిమందికే వుంటుంది. ఆ ధైర్యం వున్న జీవితం ఎలా వుంటుందన్న నగ్నసత్యం ఈ “సర్దుకున్నారా?” కథలో మనకు కనిపిస్తుంది. 

           “సర్దుకున్నారా?” అన్న మాట ఒక్క పదమే కాని దానిలో ఎన్ని పార్శ్వాలు వున్నాయో డాక్టర్ ప్రభాకర్ జైనీగారు ఈ కథలో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. నిజానికి ఈ కథకు సమీక్ష రాయడం చాలా పెద్ద పనే. ఎందుకంటే కొన్ని కథలు కాని, సంఘటనలు కాని మనం చదివినప్పుడు, చూసినప్పుడు మనసు మౌనంగా ఆ అనుభూతిని ఆస్వాదిస్తుంది. ఆ ఆస్వాదనను అక్షరాల్లో అనువదించడానికి ఇష్టపడదు. అలాంటి భావోద్వేగమే ఈ “సర్దుకున్నారా?” కథ చదివినప్పుడు నాకు కలిగింది. 

           వి’శేషజీవితంలో సశేషాలను సర్దుకోవాలని ఈ కథలో రమణ పాత్రతో చెప్పించడంతో, మనసున్న కొందరైనా మారకపోతారా అన్న రచయిత ఆశ కనబడుతుంది. బరువు, బాధ్యతల నుండి బయటపడే వయసులో, మరణానికి చేరువౌతున్నామన్న భయమూ సహజమే. ఆ భయాన్ని వదిలి మన తప్పొప్పులు బేరీజు వేసుకుని, వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే నిజమైన సంతోషమని ఈ కథ తెలిపింది. 

        గడిచిన క్షణమైనా తిరిగిరాదని మనకు తెలిసినా, ఊపిరి వదిలే ఆ క్షణంలో మన వెంట ఏదీ రాదని తెలిసినా, మనిషి బ్రతికినంత కాలమూ దేనికోదానికి ఆరాటపడుతూనే వుంటాడు. ఈ ఆరాట ఆత్రాలలో అసలైన ఆనందానికి దూరమైపోతున్నాడు. మనిషన్న వాడు మనసులేని వాడైపోతున్న ఈరోజుల్లో ఈ సర్దుకున్నారా? కథ మనిషన్న ప్రతి ఒక్కరిని స్పృశించకుండా వుండదు. ఏ ఇంటి తలుపు తట్టినా ఈ కథలోని పాత్రలు కనబడకుండానూ వుండవు. ఇది నీ నా ఇంటి కథే కాదు. ప్రతి ఇంటి కథే ఇది. మనం బ్రతికే ఈ నాలుగు రోజులకు ఓ అర్థమూ పరమార్థమూ వుండాలంటే, మనం ఏం కోల్పోకూడదో ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది. 

    మానవతా విలువలకు, మనిషితనానికి చక్కని అక్షర రూపమిచ్చిన “సర్దుకున్నారా?” కథను విశ్వవ్యాప్తం చేసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ గారికి హృదయపూర్వక అభినందనలు.



11, ఏప్రిల్ 2025, శుక్రవారం

సాహిత్యానికి మంచిరోజులు వస్తాయా?


 నేస్తం,

          తన కోపమే తన శత్రువు అన్నది ఒకప్పటి మాట. మన కోపమే మన ఉన్నతికి పునాది అన్నది ఇప్పటి మాట. ఓటమి నుండి విజయానికి బాటలు ఎలా పడతాయో అలాగే కోపం నుండి వచ్చే పట్టుదల ఉన్నత శిఖరాలను అందుకోవడానికి దోహదపడుతుంది. లక్షణం, అవలక్షణం అనేవి మనం చూసే విధానంలో వుంటాయి. ఎదుటివారిలో లోపాలు మాత్రమే చూసే మన కంటికి మంచి లక్షణాలు కనబడక పోవడంలో వింతేమీ లేదు. మనం చేసే ప్రతి పనీ మనకు గర్వకారణం అయినప్పుడు ఇతరులు కూడా అలాగే అనుకోవడంలో తప్పేం లేదు కదా

            మనవి మాత్రమే నికార్సయిన బతుకులు అనుకోవడం సహజమే మరి. చెణుకులు, విరుపులు మనకు మాత్రమే చాతనౌనని, మిగతావారంతా ఎందుకూ కొరగానివారని అనుకోవడం మన అమాయకత్వం. పురస్కారాల కోసం వెంపర్లాటలు, ఎవరెవరో ఏదేదో చేస్తున్నారని వాపోవడం, మనం మాత్రం మన రాతలు గొప్పవి కనుక పురస్కారాలు మనల్ని సహజ సిద్ధంగా వరించాయని సంబరపడటం మంచిదే. అవును మరి మనం పరిస్థితులను మనకనుకూలంగా మలచుకోవడంలో సిద్ధహస్తులం కదా. ఎండకా గొడుగు పట్టడం మన అలవాటని నలుగురికి తెలిసిపోతోందిప్పుడు

              

             అక్షరాలను అర్థవంతమైన పదాలుగా, వాక్యాలుగా కూర్చడమనేది భగవదనుగ్రహం. మనకు వరముందని మన ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం చేస్తే ఆభగవదనుగ్రహమే, ఆగ్రహంగా మారి నామరూపాలు లేకుండా పోవడమన్నది చరిత్ర చెప్పిన సత్యం. మన కుసంస్కారాన్ని బయటేసుకోవడంలోనే మన బుద్ధి నలుగురికి తెలిసిపోతోంది. ఎర్రగుడ్డ కప్పుకున్నోళ్ళందరూ ఎర్రసైన్యమైపోరు. నిజమైన సిద్ధాంతమైనా, రాతలయినా ప్రజలు, సమాజం పురోగతిలో వుండాలని కోరుకుంటుంది కాని మన అవసరాలకు సిద్ధాంతాలను, మనకనుగుణంగా మార్చుకొమ్మని చెప్పదు. కులమతాల చిచ్చులను ప్రోత్సహించదు. పరాయి కులమతాలను అవహేళన చేయమని మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఒకవేళ మన ప్రవర్తన అలా వుందంటే మన సంస్కారం ఏపాటిదో నలుగురికి మనం చెప్పకనే చెబుతుంది

         ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా సర్వమానవ హితాన్నే కాంక్షించమని చెప్తుంది. విశ్వ వినాశనాన్ని బోధించదు. మనది లౌకికదేశం. అది మనకు గర్వకారణం కావాలి కాని కులమతాను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం సమంజసం కాదు. దిక్కుమాలిన సంత నేడు సాహిత్యానికి కూడా ఎగబాకి, విలువైన సాహితీ సంపదను నడిబజారులో అపహాస్యం చేస్తోంది. సాహిత్య విలువలను దిగజారుస్తున్నారు కొందరు పెద్దలు (కు)సంస్కారులకు వెన్నుదన్నుగా నిలుస్తూ.

              కొందరు సాహితీ పెద్దలు కులమతాలను ఎద్దేవ చేసే సాహిత్యాలను భుజాలపై మోయడం, వారిని అందలాలు ఎక్కించడం, వారికి మిగతా అనుయాయులు తప్పెట్లు మోగించడం చేస్తుంటే, మనం చూస్తూ వుండడం తప్ప ఏం చేయలేక పోతున్నాం. అదేమని అడిగితే మన మీద కూడ కులమతాల జల్లు కురిపించేస్తారు సదరు సమూహాలు. రాతల్లో గొప్పదనాన్ని చూడటం ఎప్పుడు మెుదలు పెడతారో అప్పుడే సాహిత్యానికి మంచిరోజులు వచ్చినట్టు. రాబోయే కాలంలోనయినా మంచిరోజులు వస్తాయని ఎదురుచూద్దాం..!


5, ఏప్రిల్ 2025, శనివారం

ధన్యవాదాలు..!!

 మీ ఆత్మీయ సత్కారానికి మనఃపూర్వక ధన్యవాదాలు సోదరా..!!


2, ఏప్రిల్ 2025, బుధవారం

సంతోషం..!!

 61 సమీక్షకులలో నేనూ ఒకరిగా వున్నందుకు చాలా సంతోషం. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ ప్రభాకర్ జైనీగారికి హృదయపూర్వక శుభాభినందనలు. సమీక్షకులందరికి అభినందనలు.


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner