23, నవంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...29

    పసి అక్క వాళ్ళింట్లో ఇరవై రోజులు ఉండి వేరే ఇల్లు చూసుకుని వెళిపోయాం. మా అమ్మ చిన్నప్పుడు చదువు కోసం ఉన్న వాళ్ళింటికే మేము మౌర్యతో వెళ్ళడం కాకతాళీయంగా జరిగింది. నాంచారయ్య బాబాయి, పాప అక్క వాళ్ళు మౌర్యని వాళ్ళింట్లో మెుదటి మనుమడిలానే ఆడించేవారు. మా ఎదురింటి శాండు మామ్మ, తాతయ్య ఇలా ఆ బజార్లో అందరికి మౌర్య బాగా ఇష్టుడైపోయాడు. మా వాళ్ళు అందరు ఏదో మెుహమాటానికి అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళేవారు. మా పెద్దాడపడుచు నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు, నా సామాన్లు అన్నీ వేసి పంపేసింది. కాని ఓ బాగ్ మాత్రం ఇప్పటికి ఇవ్వలేదు. అవేంటంటే ఇంజనీరింగ్ లో నా ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్, కొన్ని పుస్తకాలు, ఇంకేం ఉన్నాయెా నాకు గుర్తు లేదు. వాటి కోసం నేను ఆవిడ దగ్గరకు వెళతానని అనుకుందనుకుంటా. ఉద్యోగం కోసం అవి కావాలి కదా అప్పట్లో. దైవాధీనముగా సర్టిఫికేట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. అన్నీ పంపినావిడ అవి మాత్రం పంపలేదు ఇప్పటికి. నేను అడగనూ లేదు. బాగా మెుండిదాన్ని కదా. నాకు ఆత్మాభిమానం కాస్త ఎక్కువే. 
    మా జ్యోతి అన్నయ్య మాత్రం నా పెళ్ళి అయిన తర్వాత రావివారిపాలెం వచ్చి వెళ్ళాడు. తర్వాత మౌర్య పుట్టిన వెంటనే వదిన, అన్నయ్య ఇద్దరు రావివారిపాలెం వచ్చి చూసి వెళ్ళారు. నా మేనల్లుడు చిన్నవాడైనా నరశింహాపురం రాగానే మంజు అత్తని చూడాలని గోల గోల చేస్తే మా శేషారత్నం మామ్మ తీసుకువచ్చి మౌర్యని చూపించింది. వాడు 500 మౌర్యకి ఇచ్చాడు కూడా. 
       అన్నట్టు ఇక్కడో విషయం చెప్పడం మర్చిపోయా. మౌర్య పుట్టక మునుపే మా మరిది పెళ్ళి కుదిరింది. డెలివరీ డేట్ చెప్పాక వాళ్ళు పెళ్ళి తేది మార్చుకున్నారు. వాళ్ళ అక్కాబావలకు పెళ్ళికి చెప్పడానికి రావివారిపాలెం వచ్చి, మౌర్యని చూసి వెళ్ళాడు. అక్కని రమ్మని మాట వరుసకు కూడా చెప్పకపోయినా ఆ తమ్ముడంటే ఉన్న ఇష్టంతో పెళ్ళికి వెళ్ళింది. మేము నరశింహాపురం వచ్చేసాక మరిది, తోడికోడలు చుట్టాలందరి ఇళ్ళకు వెళుతూ మా ఇంటికి కూడా వచ్చి మౌర్యకు ఓ 500 ఇచ్చి వెళ్ళారు. 
       మా పెద్ద పెదనాన్న కొడుకు రాజా అన్నయ్య నా పెళ్ళైన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. నేను సెండాఫ్ అవనిగడ్డలో ఇచ్చాను. ఆ తర్వాత మా పెద్ద పెదనాన్న వాళ్ళందరు రావివారిపాలెం వచ్చి వెళ్ళారు. మేము ఈ ఇంటికి వచ్చాక రాజా అన్నయ్య సౌత్ ఆఫ్రికా నుండి వచ్చి, మౌర్యని చూడటానికి వెళుతున్నానని కోడూరులో అందరికి చెప్పాడట. ఎందుకనుకున్నారూ... ఈ మాట చెప్పింది 500 కి చిల్లర కోసమట. మౌర్యని చూడటానికి వచ్చి 200లో, 300లో ఇచ్చాడు. నాకు గుర్తు లేదు. తర్వాత వెంటనే అన్నయ్యకు కొడుకు పుడితే అమ్మ చూడటానికి పెద్దమ్మతో మాచర్ల వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి వచ్చింది. అప్పుడు మౌర్యకు మూడో నెల. శాండు మామ్మ మౌర్యకు నీళ్ళు పోయడానికి కాళ్ళ మీద వేసుకుంటే ఒకటే ఏడుపు. వాడికి నేనే స్నానం చేయించుకున్నాను అమ్మ వచ్చే వరకు. 
         పసి అక్క వాళ్ళ చిన్నోడు, సరు వాళ్ళ తరుణ్ యుకేజి చదువుతున్నారనుకుంటా అప్పుడు. సాయంత్రం పూట నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. మౌర్యకు 4వ నెల వచ్చాక ఓ రోజు మంచం మీద నుండి పడిపోయాడు. మంచం మధ్యలో వెల్లకిలా పడుకోబెట్టి, నేను అక్కడే బయట గడప దగ్గరకి వెళ్ళాను. ఆ వెంటనే వీడు బోర్లా పడటమూ, కిందకి పడిపోవడమూ జరిగింది. అసలు వాడెలా చివరికి వచ్చి పడ్డాడో ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు. మా అమ్మ అవతల ఎక్కడో ఉంది. వచ్చి ఇక నన్ను ఎన్ని తిట్లు తిట్టిందంటే చెప్పలేను. అప్పటి నుండి ఇప్పటికి పిల్లల కోసం అప్పుడప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది. 
       మా తాతయ్య మా ప్రియను (మేనమామ కూతురు) తీసుకువస్తూ ఉండేవాడు. మౌర్యకు దానికి సంవత్సరం నర్ర తేడా. వస్తే చాలు ఇక్కడే 
ఉంటా వెళ్ళననేది. దానికి స్నానం చేయించి వీడికి పెద్దవైన బట్టలు దానికి వేసేది అమ్మ. ఆ మాటా ఈ మాటా చెప్పి బలవంతంగా ఇంటికి పంపేవాళ్ళం మళ్లీ వద్దువుగాని అని చెప్పి. అమ్మ మౌర్య పుట్టక మునుపే మేము మద్రాస్ లో ప్రియ ఆపరేషన్ అయ్యాక మాంగాడుతల్లి గుడికి వెళ్ళినప్పుడు అబ్బాయి పుడితే శ్రీశైలంలో అన్నం పెడతానని మెుక్కుకుందట. మౌర్యకి 6వ నెల 6వ రోజు అన్నం శ్రీశైలంలో పెట్టాలని అనుకున్నాం. 

      అహానికి, ఆత్మాభిమానానికి మధ్యన జరిగే యుద్ధంలో గెలుపోటములు ఎవరిని వరించాయెా కథ పూర్తయితే కాని తెలియదు.. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.....


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner