31, డిసెంబర్ 2025, బుధవారం
తార - సితార
శుభాకాంక్షలు 2026
“కాలానికి తెలిసిన మనం, మనకు తెలియని కాలాన్ని ఆశగా ఆహ్వానిస్తూ సంతోషాలను అందించాలని కోరుకుంటాం. విలువ దేనికి ఇవ్వాలో తెలిసి మసలుకుంటే, మనసులో దిగులుకు చోటుండదు”.
నా ప్రియమైన శత్రువులకు, మిత్రులకు మరియు ఆత్మీయులకు అందరికి కొత్త ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
29, డిసెంబర్ 2025, సోమవారం
ీ యూనియన్ 27/12/2025
నేస్తాలు,
కాలం మనతో స్నేహం చేస్తూనే వుంటుంది. మంచిని, చెడుని కూడా మనకు పరిచయం చేస్తుంది. మనం ఎలా బతకాలో, ఎలా వుండకూడదో కూడా సోదాహరణంగా వివరిస్తుంది. తన మానాన తను కదిలిపోయే కాలంలో, మనకంటూ కొన్ని క్షణాలు ఎప్పటికీ మిగిలే వుంటాయి. అవి మనతోనే ఎప్పుడూ వుండాలన్న కోరిక ఎలాగూ తీరదు. అందుకే ఆ అపురూపమైన క్షణాలను గుప్పెట్లో(గుండె) దాచేయడానికి మనకు అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు దొరుకుతాయి. వాటిని అలానే అందిపుచ్చుకుని, గతాన్ని, వాస్తవాన్ని వర్తమానానికి బట్వాడా చేయడానికి, మరి కొన్నేళ్లు మన ఆయుష్షును పెంచుకోవడానికి మన నేస్తాలు కొందరు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నమే మన VEC89 ఆత్మీయ కలయిక.
సాయంకాలపు అందమైన స్వాగతాలను, ఆత్మీయ అనుబంధాల పలకరింపుల సమ్మేళనాన్ని, అల్లరి చతురోక్తులతో చక్కని హుషారైన పాటలతో, ఆటలతో, యాభైల్లో కూడా ఇరవైల్లా తమ తమ నాట్య విన్యాసాలను ప్రదర్శించి అందరిని ఆహ్లాదపరిచిన అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన శరత్, బసివిరెడ్డి, అరబింద్, నాగరాజు, శారద..ఇంకా మరికొందరు, పరోక్షంగా తమ సహకారాన్ని అందించిన రామన్, వెంకటస్వామి..ఇలా అందరికి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
మాకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చిన నీరజ,
శ్రీనివాస్ దంపతులకు, కాసేపు తమ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించిన టి జి విశ్వప్రసాద్, వందన దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నీలిమ, హెచ్ ఎం టి బాబాయికి ప్రత్యేక కృతజ్ఞతలు.
దూరాభారం అనుకోకుండా అభిమానంగా వచ్చిన ప్రతివొక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఓపికగా చాలా సమయాన్ని మన అందరి కోసం కేటాయించిన శ్రీకాకుళం ఎం ఎల్ ఏ “కూన రవికుమార్” గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.
2025 వెళ్లిపోతా కూడా ఎంత గొప్ప కానుకను మనకు అందించిందో చూసారా! అన్నట్టు చెప్పడం మర్చిపోయా మన చంద్రమోహన్ కూరపాటి గారు అందుబాటులో లేకున్నా “పంచెకట్టు” స్పెషల్ ని అందరం చాలా ఇష్టంగా ఆస్వాదించాం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
తలుపులు మూసి మరీ వినిపించినా పారిపోయిన కొందరు ప్రత్యేక అతిథుల కోసం నా కవిత మరోసారి…
మీ అందరి కోసం..
అల్లరి ఆకతాయితనంతో
ఏదో సాధించేయాలన్న
ఉత్సాహం అప్పుడు
అనుభవాల అనుబంధాలతో
జీవితపు లోతుపాతులను
చవి చూసిన స్థితప్రజ్ఞుత ఇప్పుడు
ఆడే ప్రతి ఆటలో
ఓటమి దరిజేరని
గెలుపు తమదే కావాలన్న
కాంక్షే అందరిది
కాని విజేతలు కొందరే
క్షణం తీరిక లేని ఈ ఉరుకుల పరుగుల్లో
విరామం కోరే మనసు ఆశ్రయించేది
కాలం గవాక్షపు వెనుక
ఆహ్లాదాన్ని పంచే అనుభూతులను కొన్నింటిని
ఆ జ్ఞాపకాల జడివానలోతడవడానికి
(వానలో తడవని చిన్నతనం ఎవరికి లేదు కదా
అలానే జ్ఞాపకాలు లేని మనిషి కూడా బహు అరుదే)
తడబడిన అడుగులకు ఆసరానిచ్చే
ఆత్మీయత కోసం వచ్చిన మీ అందరికి
మనఃపూర్వక కృతజ్ఞతలు.
నా తెలుగు అర్థం కాని వారి కోసం
సరదాగా మరో నాలుగు లైన్లు
టీ కొట్టెటీసినోళ్ళందరూ
పియంలు కాలేరు
ఎర్రబస్సు ఎక్కినోళ్ళందరు
ఎయిర్ బస్ ఎక్కలేరు
సంతకాలెట్టించేసుకున్నోళ్ళందరూ
సియంలైపోలేరు
ఇదేరా జీవితం అబ్బాయ్..
18, డిసెంబర్ 2025, గురువారం
జీవన మంజూష డిసెంబరు 25
నేస్తం,
“బతకడమంటే చావడానికి కారణాలు వెతుక్కోవడం కాదు” అన్న గొప్ప మాట వినడం కాకతాళీయంగా జరిగింది. మంచి విన్నప్పుడు కాని, చూసినప్పుడు కాని వెంటనే నలుగురితో పంచుకోవడం అందరు చేయలేరు. అదే ఎవరికైనా కష్టమో, నష్టమో కలిగినప్పుడు అందరికి అడగకుండానే చాటింపు వేస్తారు. ఇది మనిషిలోని సహజగుణం. ప్రతిదానిలో లోపాలు చూడటానికే తమ జన్మ అన్నట్టుగా కొందరు బతికేస్తుంటారు. అలాగే మరికొందరికి వారు చేసే అన్నింటిని సమర్థించుకోవడానికి కారణాలు భలేగా దొరికేస్తాయి.
వయసు పైబడుతున్నా కొందరికి మానసిక పరిపక్వత రాదు. రాలేదు అనుకోవడం కంటే అది వారి అహంకారం అనుకోవడం సబబేమో. ఎదుటివారి మాటల్లో, చేతల్లో దొర్లే చిన్న పొరబాట్లను కూడా అందరికి భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేయడం, వారి మానసిక జాడ్యాన్ని వారికి వారే బయటేసుకోవడం మనం చాలామందిలో చూస్తున్నాం. వారి తప్పులను ఒప్పులుగా సమర్థించుకునే ప్రయత్నంలో ఎదుటివారిని కించపరచే మాటలు, చేతలు ఎంత వరకు సమంజసం అన్నది వారి విజ్ఞతకు వదిలేయడమే.
అసహనం అందరికి వుంటుంది. సహనం మాత్రం కొందరికే వుంటుంది. దానిని చేతగానితనమని మనం సంబరపడితే, నలుగురిలో నవ్వులపాలయ్యేది మనమే అన్న విషయం కనీసం ఓసారయినా మనకు నెనుపుకు రావాలి. అసహనమేమి ఆభరణం కాదు. అది మనలోని అపరిపక్వతకు గుర్తు. మనం నటించినంత మాత్రాన ఇతరులు దానిని గుర్తించలేదని అనుకుంటే, అది మన భ్రమ. మనది నటన అని తెలిసినా వారు మనల్ని భరిస్తున్నారు అంటే, బంధాలను గౌరవిస్తున్నారని అర్థం. అది మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.
ఇప్పుడున్నది మనం కార్పొరేట్ వ్యవస్థలో అని అనుకుంటే అది పొరబాటే. మనమే కార్పొరేట్ వ్యక్తులుగా మారినప్పుడు వ్యవస్థ సహజంగా ఎలా వుంటుంది? “అన్న అడుగేస్తే మాస్” అన్నట్టు కొందరు అడుగు వేసినా, చేయి కదిపినా డబ్బే అంటుంటే వ్యవస్థ కార్పొరేట్ అవడంలో వింతేమీ లేదనిపిస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ లానే కార్పొరేట్ సంస్థలు ప్రతి పనిలోనూ కనబడుతున్నాయి. వ్యక్తే కార్పొరేట్ వ్యక్తిగా రూపాంతరం చెందడం మన మానవజాతి పురోభివృద్ధే! ఈ మార్పు ఎక్కడికి పోతుందో ఆ భగవంతుడికే తెలియాలి.
అమ్మ బొజ్జ లో వున్న పాపాయి ఒకప్పుడు హాయిగా వుండేది. ఇప్పుడు ఈ కార్పొరేట్ యుగంలో ప్రతి క్షణానికి విలువ డబ్బుతో కడుతున్నారు. తల్లికి బిడ్డకు మధ్యన కూడా డబ్బే అనుసంధానం అవుతోంది. ఓ పని పూర్తయ్యాక మెుత్తానికి తీసుకునే డబ్బులు, ఇప్పటి రోజుల్లో.. రాసినందుకు ఇంత, చెరిపినందుకు ఇంత, మరోదానికి ఇంత అంటూ ప్రతిదానికి డబ్బులు గుంజడం ఓ అలవాటుగా మారిపోయింది. మనం చేసిన సాయాన్ని మరిచి, వారి వారి పనులకు మాత్రం ఖరీదు కట్టడం నేటి మనిషి నైజమయ్యింది. ఈ ప్రారబ్ధం ఎటువైపుకు మానవజాతి మనుగడను తీసుకువెళుతుందో మరి?
16, డిసెంబర్ 2025, మంగళవారం
గాలివాటం ఆవిష్కరణ
నవంబరు 22, 23 తేదీల్లో జరిగిన నవమల్లెతీగ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 2025 లో నా రెక్కల పుస్తకం “గాలివాటం” ఆవిష్కరణ మా దివిసీమ గాంధీ “డాక్టర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్” గారి చేతుల మీదుగా జరిగింది.
కలిమిశ్రీ గారికి మిగతా పెద్దలు అందరికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
8, నవంబర్ 2025, శనివారం
జీవన మంజూష నవంబరు25
నేస్తం,
ఏ రోజు ఎలా వుంటుందో మనకు తెలియదు. అంతెందుకు క్షణాలను కూడా మనం లెక్క కట్టలేము. ఈ క్షణం ఇలా వుంది, మరుక్షణం ఎలా వుండబోతోందో తెలియని మన జీవితాలకు ప్రతిది ప్రశ్నార్థకమే! పరుగెత్తి పోతున్న కాలంలో కనుమరుగౌతున్న గతాలు, జ్ఞాపకాలు బోలెడు. గతమే లేని కొన్ని జీవితాలకు జ్ఞాపకాలు గురుతే లేవన్నది పచ్చి నిజం. ఇది డిజిటల్ యుగమని మనం కూడా డిజిటలైజ్ అయిపోతున్నామని సంబరపడదాం.
కొన్ని పరిస్థితులు మనిషిలో మార్పుకు దోహదపడతాయి అనుకోవడం సహజమే, కాని ఆ మార్పు కూడా నటనే అయిపోతోందిప్పుడు. అవసరాలకు అనువుగా మనిషి ఊసరవెల్లిలా మారడం చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది ఇప్పుడు. మనిషి మాటల్లో, చేతల్లో, నడవడిలో ఎక్కడ, ఎలా చూసినా సహజత్వం లోపించి కృత్రిమత్వమే సహజ లక్షణం అయిపోయింది. మనిషి మేధస్సు గగనాన్ని దాటేస్తోందని సంతోషపడాలేమో!
మనం చెప్పేదే అందరు వినాలి, మనకు చెప్పేంత స్థాయి మరొకరికి లేదు అని మనం అనుకోవడం మన అహంభావం. అందరు అన్ని విషయాల్లోనూ తెలివిగా వుండలేరు, అలాగని తెలివితక్కువ వారు కాదు. ప్రతివొక్కరిలో అంతర్లీనంగా ఏదోక ప్రతిభ దాగునే వుంటుంది. సమయాన్ని, పరిస్థితులను బట్టి అది వెలుగులోనికి వస్తుంది. పదవో, అధికారమో, పేరు, ప్రతిష్టలో ఇలా నలుగురికి తెలిసే సందర్భాలు వచ్చాయని మనమేదో మహా మేధావులమని మనమనుకుంటే సరిపోతుందా! కాలం కలిసొస్తే దరిద్రుడు కూడా కుబేరుడైపోడూ!
జీవితంలో మనం చెప్పాల్సినవి కొన్నుంటే, మనం వినాల్సినవి కూడా కొన్నుంటాయి. బతకడానికి, జీవించడానికి చాలా తేడా వుంటుంది. మనకేంటి మన దగ్గర చాలా డబ్బుంది. మనం చాలా రిచ్(గొప్ప)గా బతికేస్తున్నామని చాలామంది సంబరపడిపోతారు. వీళ్ళలో కొందరు ఎంగిలిచేత్తో కాకిని కూడా విదిలించరు. ఓ పూట తిండి గడవడానికి కష్టంగా వున్నవారు, తమకున్నదాంట్లోనే తమ చుట్టూ వున్న ప్రాణికోటికి కూడా ఆకలి తీరుస్తారు. మీరే ఆలోచించండి వీరిద్దరిలో ఎవరు బాగా బతుకుతున్నట్టు?
బంధం అనుబంధంగా మారడానికి, ఆత్మీయంగా అల్లుకుపోవడానికి మనమే కారణం. మన అవసరాలకు బంధాలను తారుమారు చేస్తూ, అనుబంధాలకు ఆత్మీయత తేనెలు పైపైన పూస్తూ ఎన్ని రోజులు మన నటనను కొనసాగించగలం చెప్పండి? అందరం ఓ రోజు అటూఇటూగా పోయేవాళ్ళమే కదా, కనీసం కాస్తయినా నిజాయితీగా మనతో మనమయినా వుండాలి కదా! దూరాన్ని దూరం చేయడం మానేసి, ఆ దూరాన్నే దగ్గరతనం అనుకుంటూ బతికేయడం మన సహజగుణమై పోయింది. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందన్న “న్యూటన్ మూడవ సూత్రాన్ని” మరిస్తే ఎలా! రెండిళ్ళ మధ్య దూరం ఒకటే కదా! సరైన దారి ఎంచుకోవడంలోనే విజ్ఞత, వివేకం బయటపడతాయి. మనిషిగా పుట్టినందుకు కాస్తయినా మానవత్వంతో బతుకుదాం..!
27, అక్టోబర్ 2025, సోమవారం
రెక్కలు
1. సారాయో
గంజాయో
ఎవడి యాపారం
వాడిది
ప్రపంచాన్ని
ఆక్రమించేయడమే..!!
2. వెలుతురు
చూడలేని వాస్తవాలు
చీకటి చుట్టాలై
బతికేస్తూ
ఆశల
విహంగాలు..!!
3. అహం
అదిలిస్తుంది
ఆప్యాయత
అక్కున చేర్చుకుంటుంది
ఏదైనా
బంధమే మరి..!!
4. మనం
గుర్తుంచుకోవడం
మనల్ని
గుర్తించడం
తేడా తెలుసుకుని
మసలుకోవాలి..!!
5. క్షణాలను
గుప్పిట బంధించలేము
సమయపాలన
అవసరమే
కాలమెప్పుడూ
మన చుట్టం కాదు..!!
6. చెప్పుకోవడానికే
అన్నీ
చేతికి
అందేవి కాదు
మానవ
సంబంధాలు..!!
7. మనమేమన్నా
నిజాయితీపరులమా!
మనం రాసిన రాతలో
మనమూ వున్నాం కదా!
మర్చిపోతే
ఎలా మాస్టారూ..!!
8. అన్నీ
అందుబాటులోనే
అందుకునే
అవకాశమే లేదు
తత్వం
బోధపడాలి..!!
9. ఆకాశానికి
పాతాళానికి మధ్యలో
ధరాతలంపై
మనుగడ
మనిషి
తలరాత..!!
10. మారడం
తెలియదు
మార్చే ప్రయత్నం
ఆగదు
అభిమతం
ఎవరిది వారిదే..!!
11. వినడంతోనే
బతుకంతా
అస్తిత్వాన్ని
కోల్పోయాక
సగటు
మనిషి..!!
24, అక్టోబర్ 2025, శుక్రవారం
కాల ప్రవాహంలో..!!
నేను నేనుగా
వున్నాను
గతంలో
నన్ను నేను
కోల్పోయాను
వాస్తవంలో
రెండు కాలాలను
మోసుకుంటూ
నేనెవరో వర్తమానంలో..!!
8, అక్టోబర్ 2025, బుధవారం
ముదిర సమీక్ష
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి సరికొత్త కవితా సంపుటి ముదిర గురించి నాలుగు మాటలు..!!
తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసి, తెలుగుభాష మీద మక్కువతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన, చేస్తున్న ప్రముఖ తెలుగుభాషా పరిశోధకురాలు, కథ, కవిత, నవల, లేఖా సాహిత్యం వంటి ఎన్నో తెలుగు సాహితీ ప్రక్రియలలో నిష్ణాతురాలు, తెలుగు గజల్ చరిత్రలో తనకంటూ సముచితమైన స్థానాన్నిసంపాదించుకుని, ఎన్నో పురస్కారాలు, పలు ప్రపంచరికార్డులను సొంతం చేసుకున్న ప్రముఖవ్యక్తి “రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి మరో కొత్త పుస్తకం “ముదిర” కు హృదయపూర్వక శుభాభినందనలు.
ఈ సృష్టికి మూలం స్త్రీ. అనాది నుండి ఈనాటి ఆధునిక యుగం వరకు స్త్రీ మనోభావాల గురించి ఎవరెన్ని చెప్పినా సమగ్రంగా స్త్రీమూర్తిని ఎవరూ ఆవిష్కరించలేదనే చెప్పాలి. ఆ ప్రయత్నంలోనే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు తనకున్న తెలుగుభాషా పటిమను ఉపయోగించి అచ్చంగా ముదిత మనోభావాలనే పలుకోణాల్లో ఆవిష్కరించే ప్రయత్నం “ముదిర” కవితా సంపుటిలో చేసారు.
ఈ “ముదిర” కవితా సంపుటిలో కొన్ని ఇలా నామాటల్లో మీ అందరి ముందుకు..
నాకంటూ ఎవరు లేకున్నా ప్రకృతి నాతో సహకరించినా, సహకరించకున్నా ప్రకృతిని నాలో ఇముడ్చుకుని స్నేహం కోసం, నాకంటూ ఓ చిరు గుర్తింపు కోసం “నేనిక్కడే ఉన్నా” అంటూ మగువ మనసు సున్నితత్వాన్ని అందంగా ఈ కవితలో చెప్పారు.
“మౌనం విలువ కాలం విలువ తెలిసేది ఒక్క ప్రేమికులకేనేమో..అనుభూతులను ప్రేమించే వారికేనేమో..అక్షరాలను, అనుభూతులను అందంగా మలచే కవికేనేమో..” అని చక్కని భావుకత్వాన్ని “నీవు నాతో ఉన్నప్పుడు జీవితం” ఓ రస ప్రవాహమౌతుంది అని చీకటి వెలుగుల జీవితాన్ని చిక్కని కవితగా చెప్పారు.
అక్షరాలను, పదాలను స్పర్శించే చూపులకు అక్షరాల, పదాల ఆత్మ అవగతమౌతుంది అని “ఐనా” కవితలో అతివ అంతరంగ కల్లోలాన్ని విప్పి చెప్పారు.
మరో కవిత “రాత్రి నిశ్శబ్దంలో” అనామికగా ఏకాంతమై ఏకాంతగా రాత్రి నిశ్శబ్దంలో వేలాడుతూ..మిగిలిన ఒంటరితనపు ఊసులను చెప్పారు.
“నేనో” కవిత నా గురించి ఎవరికి ఏం తెలుసు అన్న ప్రశ్నను సంధిస్తూ తనేంటో చెప్పడం చాలా బావుంది.
చీకటి, వెలుగు, ప్రకృతి, ప్రేమ, వేదన, సంవేదన, ఒంటరితనం, కోపం, శాంతం, ఓర్పు..ఇలా ఒకటనేమిటి సమస్త ప్రకృతిని తనలోని భావాలకు ఆపాదించి భాషాపరమైన వాడుకలో మరిచిన చాలా పదాలను తన కవితలో జొప్పించి, పదుగురిని మెప్పించగల నేర్పు, నైపుణ్యం రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి వెన్నతో పెట్టిన విద్య. తనదైన ప్రత్యేక శైలితో “ముదిర”ను ముగ్ధవంతంగా తీర్చిదిద్దారు. వారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు.
https://www.facebook.com/share/v/1PZ9LSumvs/?mibextid=wwXIfr







