25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మన కర్తవ్యం...!!

నేస్తం, 
   నాకు తెలియకడుగుతున్నా.. మంచేదో, చెడేదో అందరికి తెలియదంటావా? ఓ నాలుగు రోజులు మత్తుమందుల కేసులంటారు. ఎంక్వైరీలంటారు. తరువాత అందరు మరిచిపోతారు. ఎప్పటికో విచారించిన సెలబ్రిటీలందరు క్లీన్ చిట్లతో బయటికి వస్తారు. విద్యాశాఖలో మార్కుల అవకతవకలు జరుగుతాయి. పోటి పరీక్షల్లో సీట్లు ఎవరెవరికో వస్తాయి. సాక్ష్యాలను పోలీసులే మాయం చేసేస్తారు అధికారం అండదండలతో. కాలం నాడు మెుద్దు శీనుది ఆత్మహత్య అని TV9 మెుదట చెప్పినట్లుగా. ఆ క్లిపింగ్స్ చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది అది హత్యో, ఆత్మహత్యో. కులం, మతం పేరుతో నాయకులే రాజకీయాలు చేయడం చూస్తూనే ఉందాం. 
  అయినా తాగేవాడికి తెలియదా. తాగితే తనకు ఏం జరుగుతుందో. కాల్చేవాడికి తెలియదా. కాల్చితే పొగతో పాటు ఏం వస్తుందో. ఆరోగ్యానికి హానికరమంటూ కనబడని అక్షరాలు పాకెట్ ల మీద వేసి చేతులు దులుపుకోవడం, ఈ నగరానికి ఏమైంది? అమ్మ గాజులు అమ్ముకున్నామంటూ బోలెడు ఖర్చులు పెట్టి యాడ్ లు తీయడం. ప్రభత్వాలే మద్యం అమ్మేయడం ఎందుకివన్నీ? ఎవరిని మభ్యపెట్టడానికి? 
    మత్తుమందు కేసులంటూ ఎన్నిసార్లు టివిల్లో చూపలేదు? కనీసం ఏ ఒక్కరి మీదైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా చరిత్రలో. ఒకప్పుడు ఏదైనా నేరారోపణలు కాని, తప్పులు కాని జరిగితే సంబంధిత అధికారులు, మంత్రులు తమ నైతిక బాధ్యతగా రాజీనామాలు చేసేవారు. ఇప్పుడు ఎన్ని నేరారోపణలు ఆయా శాఖల మీద జరిగితే వారికి అంత పాపులారిటి అన్నమాట. అన్నీ చూస్తూ మనం కూడా మనకెందుకులే అని నోరు మెదపకుండా మన పని మనం చేసుకుంటూ మళ్ళీ ఈ నాయకులనే గెలిపించేద్దాం. ఇదేగా మన ప్రజాస్వామ్యం. మన లౌకిక రాజ్యం. 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner