నువ్వు నేను గోదారి..!!
ఈ “గోదారేంటో” కాని కొందరు మనుష్యులనూ వదలదు. అలా కాకుండా కొన్ని మనసులను పదే పదే స్పృశిస్తూనే వుంటుంది. “అమ్మ, ఆవకాయ” ఎప్పటికీ బోర్ కొట్టనట్టే ఈ “గోదారి” అంతే స్వచ్ఛంగా, హాయిగా సాగిపోతూ వుంటుంది. కొందరికి కొన్ని కొన్ని ఇష్టాలుంటాయ్, ప్రేమలుంటాయ్, అనుభూతులుంటాయ్, అనుభవాలుంటాయ్..ఇలా కొన్ని కొన్ని తమ మనసులోనే దాగుండి, అప్పుడప్పుడు దొంగల్లా తొంగి చూస్తుంటాయి. ఈ భావాలను అక్షరాల్లో అందంగా ఒద్దికగా పొదగడం తెలిసిన కొద్దిమందిలో “ మాడిశెట్టి శ్రీనివాస్” గారు ఒకరు. మెుదటి కవితా సంపుటి “గుండెల్లో గోదారి” లో తన భావుకత్వాన్ని మనకి పరిచయం చేసి ఇప్పుడు “నువ్వు నేను గోదారి” తో మరిన్ని భావాలను గోదారితో పంచుకుంటూ, మనలనూ ఆ భావాల అలల’జడిలో తేలియాడమంటున్నారు.
“అమ్మంటే అమ్మే” అమ్మకు మరో ప్రత్యామ్నాయం లేదు అన్న విషయాన్ని, అమ్మ దూరమైన బాధను అక్షరాలతో పంచుకున్నారు.
“బతుకుపోరులో చివరివరకు
తను ఓడిపోతూనే
నిన్ను గెలిపిస్తాడు” నాన్న అని అమ్మానాన్నలపై తన ప్రేమను కొసమెరుపుగా చివరిలో చెప్పడం బావుంది.
అక్షరాల గురించి ఎవరెన్ని రకాలుగా చెప్పినా తన అక్షరాల అమరత్వం గురించి చెప్పడానికి కూడా గోదారిని ఎంచుకున్నారు. విరహాన్ని, వేదనను, ప్రేమను ప్రతి కవితలోనూ హృద్యంగా, భావస్పోరకంగా చెప్పడం చాలా నచ్చింది. భావ కవిత్వం రాయడం అంత సులువేమి కాదు. అందులోనూ 163 పేజీల్లో, ప్రతి పేజీలోనూ భావుకత నింపడం అన్నది అత్యంత కష్టతరమైన పని. దానిని అలవోకగా చేసేసారు “మాడిశెట్టి శ్రీనివాస్” తన “ నువ్వు నేను గోదారి” భావ కవితా సంపుటిలో.
తాను కవిని కాదని ఓ భావుకుడిని మాత్రమేనని చెప్పడం ఆయన సున్నితత్వానికి, ఖచ్చితత్వానికి నిదర్శనం. చక్కని, చిక్కని భావాలతో అందమైన, మనసులను తాకే కవితలను “నువ్వు నేను గోదారి” కవితా సంపుటిలో ప్రేమగా అందించారు. మచ్చుకు కొన్ని భావాలను ఇలా..
“ దేవుడెంత శాడిస్టో కదూ..
మనుషుల్ని విడదీస్తూ
మనసుల్ని కలపడంలో..”
“ఒకరికొకరమై
రెండు దేహాల్లోని
ఒకే ప్రాణమై..”
“బ్రతికుంటే జంటగా..
మరణిస్తే చితిమంటగా..”
“మనసు మూగదై రోదిస్తూ
మనిషి జ్ఞాపకమై బాధిస్తూ..”
“ఎప్పుడొస్తావని కాదు
అసలొస్తావో రావోనని..”
“బ్రతుకంతా నిన్నే చూస్తూ
బ్రతకలేక కన్నుమూస్తూ..”
“నా జీవితంలో నువ్వు..
ఉప్పెనై వచ్చిన అలవు కాదని
ఉసూరనిపించిన కలవని..”
“అమ్మేమో గంభీర గోదారి
తనేమో గలగలా గోదారి..”
“వానొస్తే మనిషి తడి
నువ్వొస్తే మనసు తడి..”
ఇలాంటి అద్భుతమైన భావాలు ఎన్నో ఈ “నువ్వు నేను గోదారి” కవితా సంపుటి నిండా వున్నాయి. భావుకతను ఇష్టపడని మనుష్యులు వుండరన్నది నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే తిలక్ భావుకతను ఆస్వాదించని భావుకులు ఎవరు వుండరన్నదంత నిజం. యండమూరి వీరేంద్రనాథ్ గారి “వెన్నెల్లో ఆడపిల్ల”ని గోదారి అందాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం తప్పక నచ్చుతుంది. చాలా అందంగా వేదనను, విరహాన్ని, నిరీక్షణను, ప్రేమను గోదారితో పంచుకున్న “మాడిశెట్టి శ్రీనివాస్” గారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ పుస్తకం కావాల్సిన వారు 9849494097 కి కాల్ చేయండి.
0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి