20, జూన్ 2020, శనివారం

భూతల స్వర్గమేనా...15

పార్ట్... 15

  మామూలుగానే ఆరోజు కూడా అనోన్యని స్కూల్ లో దించి, అభిని రడీ చేసి స్కూల్ కి తీసుకువెళ్ళాను, స్కూల్ లేదన్నారు. తిరిగి వచ్చేసాము. ఇంటికి రాగానే ఫోన్ మెాగింది. ఎవరా అని ఫోన్ తీసాను. ఏమే ముసలి బతికేవున్నావా అని శోభ గొంతు. నాకేమవుతుందే అని, ఏమైంది అని అడిగా. నీకు తెలియదా, టివి చూడలేదా అంది. లేదు పిల్లల పనిలో ఉన్నాగా అన్నాను. పెంటాగన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బాంబ్ వేశారు. మెుత్తం కూలిపోయాయి. ఎంతమంది చనిపోయారో మరి. పిట్స్ బర్గ్ లో కూడా బాంబ్ వేశారు. గుడి మీద వేయాలని ప్లాన్ చేసినట్లున్నారు. కాకపోతే అది పిట్స్ బర్గ్ అవుట్స్కర్ట్స్ లో పేలింది. పిట్స్ బర్గ్ అనగానే నువ్వు గుర్తు వచ్చావు. ఎలా ఉన్నావో ఏమెా అని వెంటనే నీకు ఫోన్ చేసాను, అని కాసేపు మాట్లాడింది. ఇక వరసనే ఫోన్లు, డాక్టర్ గారికి, నాకు. యు ఎస్ కాపిటల్ ని కూడా టార్గెట్ చేసారు. అది ఫెయిల్ అయ్యింది. భారతదేశంలో చిన్నప్పుడు 1977 లో ఉప్పెనకు, 1988 లో రంగా యాజిటేషన్ కు, 2001 లో అమెరికాలో సెప్టెంబర్ 11 కి సాక్షిగా మిగిలాను నేను కూడా. చాలా దారుణం అది. ఏమైందో తెలియకుండానే పోయిన ప్రాణాలెన్నో. బిల్డింగ్ కూలడం చూస్తూ పై ఫ్లోర్ నుండి ప్రాణ భయంతో కిందకి పరుగులు తీస్తూ బోలెడుమంది. ప్రకృతి విపత్తులు కొన్నైతే, మూర్ఖుల దుష్టచర్యలకు పరాకాష్ఠ ఇలాంటి అనైతిక చర్యలు. ఇది జరిగిన తర్వాత కూడా చాలా రోజులు ఆంత్రడాక్స్ అని, పోస్ట్ లో కూడా వస్తుంది ఆ పౌడర్, దానిని అంటుకోవద్దని జాగ్రత్తలు. 
           అప్పటికే సాఫ్ట్ వేర్ జాబ్ ల మార్కెట్ బాగోలేదు. అందుకే నేను ఈ బేబి సిట్టింగ్ జాబ్ లో చేరాను. సెప్టెంబర్ 11 తర్వాత ఇక అసలు సాఫ్ట్ వేర్ జాబన్న మాటే లేదు. నేను పిట్స్ బర్గ్ రాకముందు చికాగో గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడే ఓరోజు మధ్యాహ్నం  లైబ్రరీకి వెళ్ళి మెయిల్స్ చెక్ చేసుకుంటే మా సుధ అన్నయ్య నీ కొడుకు ఎడ్వెంచర్ చేసాడు. విజయవాడ తీసుకువచ్చారు అని పెట్టాడు. అది పెట్టి కూడా 2,3 రోజులయ్యింది నేను చూసేటప్పటికి. నా కొడుకు పేరు మౌర్య. రెండేళ్ళు అప్పటికి వాడికి. చాలా అల్లరివాడు. వెంటనే టైమ్ కూడా చూసుకోకుండా ఇంటికి ఫోన్ చేసాను. మామయ్య ఫోన్ తీసాడు. ఏమైంది మౌర్యకి, ఎందుకు విజయవాడ తీసుకెళ్ళారు అంటే..ఏం లేదు 4 మెట్ల మీద నుండి పడ్డాడు. ఏం కాలేదులే బానే ఉన్నాడని చెప్పాడు. నేను అంతే కాబోలు జరిగింది అనుకున్నా. మా ఫ్రెండ్స్ కి, అన్నయ్యకు, గోవర్థన్ కి కూడా అదే మాట చెప్పాను. నీళ్ళలోనికి వెళ్ళనీయవద్దని చెప్పు, జ్వరం వస్తే అశ్రద్ధ చేయవద్దని చెప్పమని అన్నయ్య చెప్పాడు. నేను కార్సన్ సిటీ లో ఉన్నప్పుడు సతీష్ ఇండియా వెళుతూ ఏం కావాలంటే మా అబ్బాయిని చూసిరా అని చెప్పాను. ఎవరు ఇండియా వెళుతున్నా ఇదే చెప్పేదాన్ని. అన్నయ్యా వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు చూసి వచ్చారు. 
              ఈ అంతర్జాలం అందుబాటులోనికి రాక మునుపు కలం స్నేహం అని ఉండేది. ఇంటర్నెట్ వచ్చాక కాస్త నెట్టింటి స్నేహాలు మెుదలయ్యాయి. ఓరోజు మెయిల్ చెక్ చేసుకుంటే నాకు మెసేజ్ ఉంది. నేను ఏదో తెలుగు వెబ్ సైట్ లో నా మెయిల్ ఐడి ఇచ్చాను. అది చూసి మెయిల్ చేసాడట. పేరు వెంకట రమణ అని ఉంది. రిప్లై ఇచ్చాను. ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాను. అలా ఇవ్వకూడదని అప్పట్లో తెలియదు. కాని ఇప్పటిలా అప్పుడు మిస్ బిహేవ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ. వెంకట రమణ కాలిఫోర్నియాలో జాబ్ చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా నాకు ఓ మంచి ఫ్రెండ్ ఇలా దొరికాడు. 

మళ్ళీ కలుద్దాం...

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner